తిరుపతి బీజేపీ అభ్యర్థికి వైసీపీ లంచం!

posted on: Mar 22, 2021 8:27AM

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చినా.. రాజకీయ రచ్చమాత్రం ఆగడం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలతో గెలిచిందని విపక్షాలు ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఇప్పటివరకు టీడీపీ నేతలు వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తుండగా.. తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో  తమ పార్టీ అభ్యర్థికి రూ. 30 లక్షల ఆశ చూపి ప్రలోభ పెట్టే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తిరుపతి కార్పొరేషన్ 26వ డివిజన్‌లో ఇది జరిగిందని చెప్పారు సోము వీర్రాజు. 26వ వార్డులో  6 వేల మంది ఓట్లు ఉంటే 5 వేల మందికి రూ. 500 చొప్పున వైసీపీ పంపిణీ చేసిందని ఆరోపించారు. ఇక్కడ వైసీపీకి వచ్చిన 1500 ఓట్లలో 300 దొంగ ఓట్లేనని అన్నారు. పైసా కూడా పంచని తమకు 300 ఓట్లు వచ్చాయన్నారు. పథకాలను నిలిపివేస్తామని ప్రజలను భయపెట్టి ఎన్నికల్లో విజయం సాధించిందని వీర్రాజు ఆరోపించారు.

వాలంటీర్ల వ్యవస్థ కోసం నెలకు రూ. 310 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని వీర్రాజు మండిపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, కాబట్టి తిరుపతి ఉప ఎన్నిక పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల బృందాన్ని నియమించాలని కేంద్రాన్ని కోరారు. తాము కనుక అధికారంలోకి వస్తే ప్రభుత్వ పథకాలను పేదలకు అందించేందుకు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 2 వేల మంది కార్యకర్తలను నియమిస్తామని సోము వీర్రాజు హామీ ఇచ్చారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...