టీడీపీకి షాకిచ్చిన మైనారిటీ నేత

 

చిత్తూరు జిల్లాలో పీలేరు నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జీ, మైనార్టీ నేత ఇక్బాల్‌ మహమ్మద్‌ టీడీపీకి రాజీనామా చేసి షాకిచ్చారు. ఆయనతో పాటు మరో 20మంది నేతలు కూడా టీడీపీకి రాజీనామా చేశారు. అయన గత ఎన్నికల్లో పీలేరు అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయారు. చంద్రబాబు ఒత్తిడితోనే కిరణ్‌కుమార్‌ రెడ్డి కుటుంబం మీద పోటీచేశానని ఆరోపిస్తున్నారు. ఎన్నికల తరువాత అన్నివిధాల ఆదుకొంటామని సీఎం రమేష్‌ హామీ ఇచ్చారని,టీడీపీ అధికారంలోకి వచ్చాక క్యాబినేట్‌ పదవిని ఇస్తానని చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు.. కానీ ఇప్పటివరకు న్యాయం జరగలేదని అన్నారు. అంతేకాకుండా నల్లారి కిషోర్‌కుమార్‌ రెడ్డిని టీడీపీలో చేర్చుకునేటప్పుడు తనకు నామినేటెడ్‌ పదవిని ఇస్తానని చెప్పిన చంద్రబాబు తరువాత పట్టించుకోలేదన్నారు. పైగా కిషోర్‌ కుమార్‌ రెడ్డికి ఇన్‌చార్జీ బాధ్యతలను ఇవ్వడమే కాకుండా.. కార్పోరేషన్‌ పదవిని కూడా ఇచ్చారన్నారు. సీఎంను కలిసి అనేక సార్లు తాను పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పానన్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాతే చంద్రబాబుకు ముస్లింల పట్ల ప్రేమ కనపడుతోందని విమర్శించారు. పాతిక సంవత్సరాలు టీడీపీకి సేవ చేసి ఎంతో నష్టపోయామని ఇక్బాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.