కాంట్రాక్టు , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన జగన్...1.5 లక్షల ఉద్యోగుల తొలగింపు!

 

కొంతకాలంగా ఏదో ఒక కారణంతో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్న ఏపీ ప్రభుత్వం ఈ సారి భారీ ఎత్తున దానిపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. వారి నెత్తి పై ఉద్వాసన కత్తి వేలాడుతుందని అది ఎప్పుడైనా వారి కొలువులను కత్తిరించే ముప్పు పొంచి ఉన్నట్లు చెబుతున్నారు. ఆర్థికశాఖ అనుమతి లేదనే ఒకే ఒక్క కారణం చెప్పి దాదాపు లక్షన్నర మందిని తొలగించే ప్రయత్నాలు ఆ శాఖ స్థాయిలోనే ముమ్మరంగా సాగుతున్నట్లు తెలిసింది. ఆర్థిక శాఖ, సాధారణ పరిపాలన శాఖ.. రోజుకో మెమో సర్క్యులర్ తో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బందిని హడలెత్తిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా వారి ఉద్యోగాలకే చెక్ పెట్టారు. ఆయా విభాగాల పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాలకు ఆర్థికశాఖ అనుమతి ఉందా లేదా అనే వివరాలు పంపాలని అన్ని శాఖల హెచ్వోడీలకు, జిల్లా కలెక్టర్ లకు, సచివాలయ అధికారులకు ఆర్థిక శాఖ లేఖ రాసింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా 1వ తేదీకి జీతాలు ఇవ్వాలంటే వారు ఏ తరహా సిబ్బందో వివరాలివ్వాలని అందుకు సీఎఫ్ఎంఎస్ లాగిన్ ఐడీ వినియోగించుకోవాలని ఈ శాఖ మెమో ద్వారా సూచించింది. 

ఆర్ధిక శాఖ 15 కాలమ్స్ తో వివరాలను పంపాలంటూ ఒక నమూనాను అన్ని శాఖలకు పంపింది. ఈ నమూనాలో మంజూరైన పోస్టుల సంఖ్య, మంజూరైన పోస్టుల్లో పని చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య, ప్రభుత్వ ఆదేశాలతో మంజూరైన పోస్టుల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సంఖ్య, నియామకం చేపట్టిన విధానం వేతనాలు మంజూరు కాని పోస్టుల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది సంఖ్యతో పాటు వారికి రావాల్సిన జీతాల పెండింగ్ బిల్లులు తదితర వివరాలు కలిగిన 15 కాలమ్స్ పూర్తి చేసి పంపాలని సూచించారు. వివరాలన్నీ వచ్చిన తర్వాత ఎవరిని కొనసాగించాలనే నిర్ణయం తీసుకుంటామని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. 

నిజానికి ఇటీవల కాలంలో ఏదో ఒక కారణం వెతికి తొలగించేయడం పరిపాటిగా మారింది. ఈ ఏడాది మార్చి 31 కి ముందు ఉద్యోగాల్లో చేరి 40,000 ల పై బడి వేతనాలు పొందుతున్న సిబ్బందిని ఇప్పటికే తొలగించారు. పేపర్ నోటిఫికేషన్ ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా ఏక పక్షంగా తీశారు. పలు శాఖలకు సంబంధించిన కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఈ ఏడాది మార్చి నుంచి జీతాలు ఇవ్వడం లేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆర్థికశాఖ అనుమతి పొందకుండా నియామకమైన కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కేటాయింపులు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. వారిలో ఆర్థికశాఖ అనుమతి బడ్జెట్ కేటాయింపులతో నియమించిన వారు 40,000 లకు మించి ఉండరు. ఈ నెల 14 న సచివాలయంలో జరిగిన వివిధ శాఖల నోడల్ అధికారుల సమావేశంలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల అంశం చర్చకు వచ్చింది. బడ్జెట్ లేకపోవటం, సిబ్బంది కాంట్రాక్ట్ ను రెన్యువల్ కాకపోవడం, ఆ ఉద్యోగుల నియామకాలకు ఆర్థికశాఖ అనుమతి లేకపోవడమే దీనికి కారణమని తేల్చారు.