గోదావరి తీరంలో బాపు-రమణ విగ్రహాలు
posted on Sep 1, 2014 12:10PM
బాపు, ముళ్లపూడి రమణల విగ్రహాలను గోదావరి తీరంలో ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కార్టూనిస్టుగా, చిత్రకారుడిగా, చిత్ర దర్శకుడిగా చెరగని ముద్రవేసిన బాపు స్మృతికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారం ఘనంగా నివాళులు అర్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సభలో బాపు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బాపు మృతి తెలుగు సినిమాకు తీరని లోటు అని చంద్రబాబు అన్నారు. తెలుగు అమ్మాయి అంటే ఇలా ఉండాలి అని చూపించిన ఘనత బాపుదని అన్నారు. పలువురు శాసనసభ్యులు బాపు గొప్పతనం గురించి శాసనసభలో మాట్లాడి, ఆయనకు నివాళులు అర్పించారు. బాపు రమణల విగ్రహాలను గోదావరి తీరంలో పక్కపక్కనే ఏర్పాటు చేయడంతోపాటు, వారిద్దరి పేరిట ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప కళాక్షేత్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నామని చంద్రబాబు ప్రకటించారు.