ఢిల్లీలో మాదే అధికారం.. కేసీఆర్ ను వదలం! బండి సంజయ్ వార్నింగ్.. 

posted on: Jan 5, 2022 7:55PM

సీఎం కేసీఆర్ జైలుకు పోతే ఎవరూ కాపాడలేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలతో కరీంనగర్ జైలు నుంచి సంజయ్ విడుదల అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జైలు మాకు కొత్త కాదన్నారు. ఎన్నిసార్లు అయినా పంపండని ఆయన సవాల్ విసిరారు. బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి కార్యకర్తలను కొట్టారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గు లేదా? బీజేపీ ఆఫీస్ బద్దలుకొడతారా అని ఆయన నిలదీశారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడతాం అనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. ధర్మయుద్ధం మొదలైందన్నారు. 

కేసీఆర్ నీ గొయ్యి నీవే తవ్వుకుంటున్నావ్ అని బండి సంజయ్  అన్నారు. తెలంగాణను దోచుకుంటున్న కేసీఆర్ ను వదిలే ప్రసక్తే లేదని... వేల కోట్లు దోచుకుని అవినీతి కుబేరుడిగా మారాడని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంటే... కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని అన్నారు. జీవో 317ను ప్రభుత్వం వెంటనే సవరించాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఉద్యోగుల మధ్య గొడవలు పెట్టే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు.  ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అండగా బీజేపీ ఉందని సంజయ్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల కోసమే తాను జైలుకు వెళ్లానని... అవసరమైతే మళ్లీ జైలుకు వెళ్లేందుకు సిద్ధమని అన్నారు.

హైకోర్టు ఆదేశాల మేరకు తాజాగా బండి సంజయ్ జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి భగవత్ కుభాతో పాటు బీజేపీ శ్రేణులు భారీగా జైలు వద్దకు చేరుకున్నారు. బండి సంజయ్‌కు స్వాగతం పలికారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...