బాలినేనికి దెబ్బేనా? రాజకీయ భవిష్యత్ దిబ్బేనా?
posted on: May 10, 2022 10:31AM
ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇక రాజకీయ భవిష్యత్తు లేదని క్లియర్ కట్గా అర్థమైపోయిందా? అందుకే తమను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇక వాలంటీర్ల మీదే ఉందని ఆయన పుట్టుకున్న అనేశారా? అంటే ఒంగోలు నగర ప్రజల నుంచి మాత్రం అవుననే సమాధానం వస్తోంది. సీఎం జగన్ బంధువు కావడం వల్లే మళ్లీ మంత్రి పదవి తనకు రాలేదంటూ.. బాలినేని స్వయంగా మీడియాలో పేర్కొనడం చూస్తే.. ఓ సారి వెనక్కి వెళ్లాల్సిందేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు మాజీ మంత్రి బాలినేని వ్యాఖ్యలను సైతం వారు విశ్లేషణాత్మకంగా విశ్లేషిస్తున్నారు.
వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏర్పడిన కేబినెట్లో బాలినేనికీ కీలక శాఖనే అప్పగించారు. అయితే బాలినేని శ్రీనివాస్రెడ్డి ప్రధాన అనుచరుల్లో ఒకరైనా సుబ్బారావు గుప్తా.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఫ్యాన్ పార్టీలో చోటు చేసుకొంటున్న పరిణామాలు.. వాటి వల్ల భవిష్యత్తులో ఫ్యాన్ పార్టీ కార్యకర్తలుగా తమకు ఎదురుకానున్న సమస్యలపై... మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకల వేదికగా పూసగుచ్చినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో సుబ్బారావు గుప్తా వ్యాఖ్యలు అటు మీడియాలోను.... ఇటు సోషల్ మీడియాలోనూ తెగ హల్చల్ చేశాయి.
ఈ నేపథ్యంలో జగన్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై సుబ్బారావు గుప్తా చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం వాస్తవమంటూ నెటిజన్లు సైతం సోషల్ మీడియా సాక్షిగా కామెంట్స్ పెట్టారు.
అయితే ఉన్నమాటంటే ఉలుకెక్కువన్నట్లు సుబ్బారావు గుప్తా వ్యాఖ్యలపై ఫ్యాన్ పార్టీ అధిష్టానం ఏమో కానీ.. నాటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అండ్ కో మాత్రం నిప్పులు చెరిగింది. ఆ క్రమంలో సుబ్బారావు గుప్తా కోసం బాలినేని వాసన్న అండ్ కో గాలింపు చర్యలు చేపట్టింది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన సుబ్బారావు గుప్తా.. ప్రాణభయంతో గుంటూరులోని ఓ లాడ్జిలో తలదాచుకున్నారు.
బాలినేని వాసన్న అనుచరులు అప్పటికే గుప్తా ఫ్యామిలీని భయభ్రాంతులకు గురి చేసి.. అతడి ఆచూకీ తెలుసుకుని.. గుంటూరు లాడ్జిలో గుప్తాను పట్టుకుని.. అతడిపై మంత్రి బాలినేని వాసన్న రైట్ హ్యాండ్ సుభానీ తీవ్రంగా దాడి చేసి.. మరీ నాటి మంత్రి బాలినేనికి సారీ చెప్పించారు. ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీయడం.. ఆది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం క్షణాల్లో జరిగిపోయింది. సదరు వీడియో చూసిన ప్రజలు.. మంత్రి బాలినేనితోపాటు ఆయన అనుచరులపై మండిపడ్డారు. ఇక సుబ్బారావు గుప్తాకు చెందిన సామాజిక వర్గం అయితే బాలినేనిపై మీడియా సాక్షిగా ఓ రేంజ్లో ఫైర్ అయిపోయింది.
దీంతో విషయం అర్థమైన బాలినేని రంగంలోకి దిగి.. సుబ్బారావు గుప్తాను తన నివాసానికి పిలిపించుకోని.. అతడితో కేక్ కట్ చేయించి.. అతడికి బాలినేనే స్వయంగా కేక్ సైతం తినిపించారు. ఈ సీన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది.
మరోవైపు గుప్తాపై దాడి చేసిన బాలినేని ప్రధాన అనుచరుడు సుభానీపై కేసు నమోదు చేయాలంటూ వివిధ సంఘాల నుంచి డిమాండ్ రావడంతో.. చేసేది లేక.. సుభానీపై పోలీసులు సింపుల్ కేసులు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు. .. ఆ తర్వాత అతడు స్టేషన్ బెయిల్పై విడుదలైయ్యారు. అయితే సుభానీపై కేసు నమోదు.. అతడు బెయిల్పై విడుదల కావడం వెనుక మంత్రి బాలినేని హస్తం ఉందంటూ సోషల్ మీడియాలో టాక్ అయితే తెగ వైరల్ అయింది. దీంతో సదరు మంత్రి గారు నాడు ఓ విధంగా ఉక్కరిబిక్కిరి అయ్యారు.
మరోవైపు.. బాలినేని శ్రీనివాసరెడ్డికి సీఎం జగన్ తల్లి వైయస్ విజయమ్మ సమీప బంధువన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అతడికి.. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలలకు మధ్య దూరం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో వారిద్దరు పక్క రాష్ట్రం తెలంగాణకు వెళ్లిపోయి.. అక్కడ ఉంటున్నారు. అయతే వైయస్ షర్మిల పార్టీ పెట్టి.. పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే బాలినేని మాత్రం వైయస్ విజయమ్మ, షర్మిలతో బంధుత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆ క్రమంలో పాదయాత్ర చేస్తున్న వైయస్ షర్మిలను బాలినేని కలిసి.. మద్దతు ప్రకటించారు. కానీ మంత్రి బాలినేని ఇలా చేయడం సీఎం వైయస్ జగన్తోపాటు ఆయన భార్య వైయస్ భారతీకి అంతగా నచ్చలేదనే టాక్ అయితే నేటికి తాడేపల్లి ప్యాలెస్లో అండర్ కరెంట్గా సాగుతోంది.
అలాగే వైయస్ జగన్ పాత కేబినెట్లో మంత్రిగా కొనసాగిన ఆదిమూలపు సురేశ్ మళ్లీ మంత్రిగా కొనసాగుతోన్నారు. కానీ బాలినేనిని మాత్రం సీఎం జగన్ పక్కన పెట్టేశారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న బాలినేని తీవ్ర అసంతృప్తికి గురై.. సీఎం జగన్ వద్ద పెద్ద పంచాయితీనే పెట్టారట. కానీ ఈ అంశాన్ని వైయస్ జగన్ లైట్ తీసుకోవడంతో.. బాలినేని అలకబూని హైదరాబాద్ వెళ్లి పోయారు. ఆ తర్వాత బాలినేని.. వైయఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిలతో మంతనాలు నిర్వహించారని... ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్కు వచ్చి పార్టీ పెట్టాలంటూ షర్మిలకు బాలినేని సూచించడంతోపాటు మహానేత వైయస్ఆర్కి అసలు సిసలు వారసురాలివి నీవేనంటూ ఆమెను సూచించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని తెలుసుకున్న సీఎం జగన్ ఆగమేఘాల మీద తన సలహాదారుడు సజ్జలను రంగంలోకి దింపి.. బాలినేనిని తాడేపల్లి ప్యాలెస్కు తీసుకు రావాలంటూ ఆదేశించారట. ఆ క్రమంలో బాలినేని నివాసానికి సజ్జల పలుమార్లు వెళ్లి... ఆయన్ని కూల్ చేసి.. జగన్తో భేటీ చేయించారు. ఆ తర్వాత జరిగినదంతా అందరికీ తెలిసిందే.
అయితే సుబ్బారావు గుప్తా ఎపిసోడ్లో బాలినేని పట్ల రాష్ట్ర ప్రజల్లో ఓ విధమైన వ్యతిరేకత వ్యక్తమైతే... మరో వైపు పక్కా రాష్ట్రం వెళ్లి.. రాజకీయ పార్టీ పెట్టిన షర్మిల, ఆమె తల్లీ వైయస్ విజయమ్మతో బాలినేని బంధుత్వం కొనసాగించడం పట్ల ఫ్యాన్ పార్టీలోని కొంత మంది అగ్రనేతలకు అంతగా రుచించడం లేదట. ఆ క్రమంలో వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ వస్తుందో లేదో తెలియదు... ఓ వేళ వచ్చినా ఆ ఎన్నికల్లో గెలుస్తామో లేదో తెలియదు.
ఈ నేపథ్యంలో వాలంటీర్లే గెలిపించాలంటూ బాలినేని కొత్త పల్లవి అందుకోన్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏదీ ఏమైనా సుబ్బారావు గుప్తా వ్యవహారంలో అయితేనేమీ.. షర్మిల విషయంలో అయితేనేమీ నాడు బాలినేని మంత్రిగా వేసింది ముమ్మాటికి తప్పటడుగులేనంటూ రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.


.webp)



