అవనిగడ్డ ఆంజనేయ ఆలయం ధ్వంసం
posted on Apr 21, 2015 12:15PM
కృష్ణాజిల్లా దివిసీమలోని అవనిగడ్డలో అత్యంత పురాతన ఆంజనేయ స్వామి ఆలయం, విగ్రహం సమూలంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఈ దేవాలయాన్ని విశేషంగా సందర్శిస్తూ వుంటారు. ఈ ఆలయం అవనిగడ్డ వంతెన సెంటర్ వద్ద ప్రధాన కాల్వ గట్టు మీద వుంది. అయితే, మంగళవారం ఉదయం ఈ ఆలయం అకస్మాత్తుగా కాలవలోకి కూలిపోయింది. ఈ విషయం తెలుసుకుని స్థానిక ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. గత కొద్ది రోజులుగా ఓ కాంట్రాక్టర్ డెల్టా ఆధునీకరణ పనులు చేయిస్తున్నాడు. కాల్వ గట్టు మీద ఆంజనేయ దేవాలయం ఉన్న విషయాన్ని పట్టించుకోకుండా దేవాలయం పక్కనే భారీ కందకం తవ్వించాడు. మంగళవారం నాడు కాల్వలోకి నీళ్ళు విడుదల చేశాడు. దాంతో ఆ నీటి ఒరవడికి గట్టు మొత్తం కోసుకునిపోయి దేవాలయం ఒక్కసారిగా కుప్పకూలింది. దేవాలయం మొత్తం ధ్వంసం కావడంతోపాటు దేవాలయంలో వున్న ఆంజనేయ స్వామివారం విగ్రహం కూడా దెబ్బతింది. ఇలా జరగడం అమంగళకరమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన జరగడానికి కారకుడైన కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళన నిర్వహించారు. అధికారుల తీరును నిరసిస్తూ ప్రజలు రాస్తారోకోకు దిగడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రజల ఆందోళనతో దారికి వచ్చిన కాంట్రాక్టర్ కూలిపోయిన దేవాలయాన్ని పునరుద్ధరిస్తానని హామీ ఇవ్వడంతో స్థానిక ప్రజలు శాంతించారు. అనంతరం, ఘటనలో దెబ్బతిన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పులిగడ్డ వద్ద నిమజ్జనం చేశారు.