4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఏప్రిల్ లో ఎన్నికలు
posted on: Feb 18, 2026 8:56AM
.webp)
దేశంలో ఎన్నికలకు నగారా మోగనుంది. దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ అసెంబ్లీలకూ, అలాగే పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీకి ఏప్రాల్ లో ఎన్నికలు జరగున్నాయనీ, ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను మార్చిలో విడుదల చేయనున్నామని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి.
ఏప్రిల్ నెలలో వివిధ తేదీల్లో ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల గడువు మే, జూన్ నెలల్లో ముగియనుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు పర్యటనలు ప్రారంభించింది. పశ్చిమ బెంగాల్లో గత అసెంబ్లీ ఎన్నికలను 8 దశల్లో నిర్వహించారు. అసోంలో రెండు దశల్లో, తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరిల్లో ఒకే దశలో నిర్వహించారు. కాగా ఇప్పటికే పుదుచ్ఛేరిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ తర్వాత ఫిబ్రవరి 14న తుది జాబితాను ప్రకటించారు. తమిళనాడులో మంగళవారం( ఫిబ్రవరి 17)న ఎన్నికల తుది జాబితాను ప్రకటించారు. ఇక కేరళలో ఈ నెల 21న ప్రకటించనున్నారు. పశ్చిమ బెంగాల్లో ఈ నెల 28న ప్రచురించనున్నారు.







