మోదీ 3 గుడులు తిరిగే రకమైతే.. కేసీఆర్‌ 6 గుడులు తిరిగే రకం

posted on: Jul 7, 2019 1:07PM

 

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పార్టీ బలోపేతం దిశగా బీజేపీ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించి అధికారంలోకి వస్తామని కొందరు బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ కు మిత్రుడైన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని వ్యాఖ్యానించారు.

హిందుత్వ కార్డుతో ఆ పార్టీ తెలంగాణలో ఎదగాలన్న కలలు ఫలించవని, 2024లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ఆ పార్టీ నేతల కల కలగానే మిగులుతుందని ఓవైసీ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ కంటే సీఎం కేసీఆర్‌ కరడుగట్టిన హిందుత్వ వాది అన్నారు. మోదీ మూడు గుడులు తిరిగే రకమైతే, కేసీఆర్‌ ఆరు గుడులు తిరిగే రకమన్నారు. అందువల్ల బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని స్పష్టం చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే సత్తాలేని బీజేపీ.. తెలంగాణలో బలపడేందుకు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఓవైసీ ధ్వజమెత్తారు.

తెలంగాణలో కేసీఆర్ పాలన ఉన్నంతకాలం బీజేపీ ఇక్కడ బలపడడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలు విద్వేశాలు రెచ్చగొట్టే బీజేపీ రాజకీయాలను ఆదరించరని.. సంఘ్ పరివార్ ను తరిమికొడతారని ఓవైసీ వ్యాఖ్యానించారు. ఐదేళ్లుగా తెలంగాణలో హిందూ, ముస్లిం, బీసీ, గిరిజనులు, ఎస్సీల కోసం కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు దేశంలో ఎవ్వరూ చేయలేదని కొనియాడారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కే అండగా ఉంటారని ఓవైసీ స్పష్టం చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...