మూడు రాజధానుల పై సుప్రీం కోర్టుకు జగన్ సర్కార్..!
posted on Aug 7, 2020 6:06PM
హైకోర్టులోనూ, సుప్రీం కోర్టులోనూ ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న ఎపి ప్రభుత్వం తాజాగా మరో సారి సుప్రీం కోర్టు తలుపు తట్టనున్నట్లుగా తెలుస్తోంది. మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర పడగానే, దాని పై అమరావతి రైతులు హై కోర్టులో సవాల్ చేశారు. దీంతో ఈ బిల్లుల ఆమోదం పై స్టేటస్ కో విధిస్తు విశాఖపట్నంకు ప్రభుత్వ కార్యాలయాలు తరలించకుండా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది.
తాజాగా దీనిపై మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ… అమరావతి రైతుల ఉద్యమం పూర్తిగా రాజకీయ ప్రేరేపిత ఉద్యమమని, అవసరం అయితే హైకోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్లే విషయం కూడా ఆలోచిస్తాం అంటూ కామెంట్ చేశారు. అంతే కాకుండా చంద్రబాబు తానొక్కడినే బాగుపడాలనే పెద్ద స్వార్ధపరుడని, అందుకే రాజధాని అమరావతిలోని ఉండాలని కోరుకుంటున్నారని అయన తీవ్ర విమ్మర్శలు చేసారు. ఐతే మంత్రి తాజా వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు స్టేటస్ కో పై సుప్రీంకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా పలువురు అనుమానిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సహా పలు కేసుల్లో సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ కు గట్టి ఎదురు దెబ్బలు తగలగా... మళ్ళీ మూడు రాజధానుల బిల్లుపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్నది ఆసక్తికరంగా తయారయింది.