పిఎం, సిఎం సహాయ నిధులకు గవర్నర్ బిశ్వ భూషణ్ చేయూత

ప్రధాని సంరక్షణకు నిధికి నెల జీతం, సిఎం సహాయ నిధికి రూ.లక్ష

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కరోనా విపత్తు నేపధ్యంలో తనదైన శైలిలో స్పందించారు. రాష్ట్ర ప్రధమ పౌరుని హోదాలో కరోనా వ్యాప్తి నిరోధం కోసం తన వంతు ప్రయత్నాన్ని చేస్తూ మఖ్యమంత్రి  మొదలు అయా శాఖల ఉన్నతాధికారులతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. తనకున్న సుదీర్ఘ ప్రజా జీవితం ఆలంబనగా అధికార గణంకు సూచనలు, సలహాలు ఇస్తూ వస్తున్నారు. రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాల కులపతి హోదాలో విద్యార్ధులను సైతం ఆ దిశగా కార్యోన్ముఖులను చేయాలని ఉపకులపతులను ఆదేశించారు. రాష్ట్ర రాజ్యాంగ అధినేతగా అన్ని చేస్తూనే, వ్యక్తిగతంగా కూడా తన పెద్ద మనస్సును చాటుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్ష రూపాయలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి సైతం స్వయంగా వివరించిన బిశ్వభూషణ్ రాష్ట్ర ఆరోగ్య స్ధితి గతులను మెరుగు పరిచేందుకు తన వంతుగా చిరు విరాళంను అందిస్తున్నానన్నారు.