ఏపీలో గణేష్ మండపాల నుంచి ప్రభుత్వ వసూళ్లు

posted on: Aug 29, 2022 11:12AM

ఏపీ ప్రభుత్వం గణేష్ మండపాల నిర్వాహకుల నుంచి వసూళ్లు ఆరంభించింది.  కరెంట్ చార్జీలు, సౌండ్ బాక్స్లు, మండపాల సైజుల వారీగా భారీగా వడ్డించింది. అనుమతులు కావాలంటే సొమ్ములు చెల్లించకతప్పదని ఖరాకండీగా చెప్పేసింది. అన్నీ చేసినా కూడా చివరికి రాజకీయ ప్రత్యర్థులు అంటే తెలుగుదేశం వారి మండపాలకు అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వసూళ్లు కేవలం హిందూ పండుగలకే ఎందుకు అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. బీజేపీ అయితే ఒక అడుగు ముందుకు వేసి ఇది హిందూ పండుగలపై ఏపీ సర్కార్ చేస్తున్న దాడిగా ప్రకటించి.. ఎలాంటి రుసుమూ చేసుకోకుండానే మండపాలు ఏర్పటు చేసుకోవాలని పిలుపు ఇచ్చింది.  వివాదం పెద్దది అవుతుండటం, ఎక్కడికక్కడ జనం తిరగబడుతుండటంతో ఏపీ సర్కార్ ప్లేట్ ఫిరాయించింది.  గణేష్ మండపాల నుంచి ప్రత్యేకంగా ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదని, అదంతా దుష్ప్రచారమేనని ఒక ప్రకటన చేసి చేతులు దులుపుకుంది.

అయితే ఇదంతా దుష్ప్రచారమే అయితే, పండుగ రెండు  రోజుల ముందు వరకూ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని మండపాల నిర్వాహకులు నిలదీస్తున్నారు. ఇప్పట వరకూ చేసిన వసూళ్ల సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు.  నిజానికి ఏపీలో గణేష్ మండపాలు పెట్టుకోవడానికి నానా ఇబ్బందులు పడ్డామనీ, సర్కార్ హుకుం మేరకు అడిగినంతా చెల్లించామనీ, తీరా ఇప్పుడు పండుగ రెండు రోజులలో ఉందనగా రుసుములేమీ అవసరం లేదంటూ ప్రకటన చేసి చేతులు దులుపుకోవడమేమిటని జనం నిలదీస్తున్నారు.

కోనసీమ జిల్లాలో ఈ సారి పండుగ సందడే కనిపించడం లేదనీ, ఇందుకు ప్రభుత్వ తీరే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండపానికి రోజుకు మండపం సైజును బట్టి కనీసం వేయి రూపాయలు చెల్లించాల్సిందేనని అధికారులు ఖరాకండీగా చెప్పారని స్థానికులు అంటున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...