ఉద్యోగ సంఘాలకు జగన్ ఝలక్! ఎంత ఇస్తే అంత తీసుకోవాల్సిందేనా? 

posted on: Jan 6, 2022 4:24PM

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు నిరాశ తప్పదా? ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ విషయంలో వాళ్లకు జగన్ సర్కార్ షాక్ ఇవ్వనుందా ? అంటే ఉద్యోగ వర్గాలు, ప్రభుత్వ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. పీఆర్సీపై ఇప్పటికే సీఎస్ కమిటీతో పలు దఫాలుగా చర్చించింది ఉద్యోగ సంఘాల జేఏసీ. పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ సహా 71 డిమాండ్లపై ఉద్యోగ సంఘాలు పోరాడుతున్నాయి. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి దగ్గర పలు సార్లు చర్చలు జరిగాయి. అయినా ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో ఉద్యోగ సంఘాలు నేరుగా సీఎంతోనే మాట్లాడతామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయ్యాయి. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని 13 ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలోనూ ఉద్యోగ సంఘాలకు ఎలాంటి ఊరట లభించలేదని తెలుస్తోంది.  చర్చలు సానుకూలంగా జరిగాయని, మూడు రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని ప్రభుత్వం ప్రకటన ఇచ్చినా... సమావేశంలో జరిగిన దాన్ని బట్టి ఉద్యోగులకు షాక్ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉద్యోగ సంఘలకు భరోసా ఇచ్చేలా జగన్ రెడ్డి మాట్లాడలేదని అంటున్నారు. 

ఉద్యోగ సంఘాలు ప్రాక్టికల్‌గా ఆలోచించాలని సమావేశంలో  ఏపీ సీఎం జగన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.  ఉద్యోగ సంఘాలు చెప్పిన అన్ని అంశాలను నోట్‌ చేసుకున్నట్లు చెప్పారు. అన్ని సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మోయలేని విధంగా భారం ఉండకూడదని.. ఉద్యోగ సంఘాలు సానుకూల దృక్పథంతో ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎంత మంచి చేయగలిగితే అంత చేస్తానని.. మంచి చేయాలనే తపనతోనే ఉన్నట్లు సీఎం వివరించారు. రెండు మూడు రోజుల్లో పీఆర్‌సీపై ప్రకటన చేస్తామని సీఎం జగన్‌ వెల్లడించారు.  

71 డిమాండ్లతో ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసు ఇచ్చాయి. వీటిలో ప్రధానంగా పీఆర్సీ, సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసులు పర్మినెంట్‌ చేయడం తదితర డిమాండ్లు ఉన్నాయి. వీటిని సత్వరమే పరిష్కరించాలని ఆయా సంఘాల నేతలు సీఎంను కోరారు. ఉద్యోగులు 55 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవల సీఎస్‌ కమిటీ 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీన్ని ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. తమకు 55 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తేనే ఆమోదయోగ్యంగా ఉంటుందని పునరుద్ఘాటించాయి. కరోనా పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 14.29 శాతానికి అంగీకరించాలని ప్రభుత్వ వర్గాలు చెప్పినప్పటికీ ఉద్యోగులు వెనక్కితగ్గలేదు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాలు సీఎం జగన్‌తో చర్చలు జరిపాయి.  

సీఎం జగన్‌తో భేటీ అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ 11వ వేతన సవరణ సంఘం నివేదికపై చర్చలు జరిగాయని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఆర్థిక శాఖ కార్యదర్శి వివరించారని తెలిపారు. గత ఆర్థిక సంఘం ఇచ్చిన ఫిట్‌మెంట్‌లపై వివరించామని,  ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని దృష్టితో పెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరామని వెల్లడించారు పింఛన్‌దారులకు ఉన్న రాయితీని తగ్గించే ప్రతిపాదనలు అంగీకరించవద్దని చెప్పామని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని క్రమబద్ధీకరించి, వారి జీతభత్యాలను పెంచాలని కోరామన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెరగాల్సి ఉందన్నారు. ఉద్యోగ వ్యవస్థ మొత్తానికీ ఒకే జీవో ఇవ్వాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశామని ఉద్యోగ సంఘాల నేతలు వివరించారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...