ఈరోజు కేంద్రమంత్రులతో సమావేశం కానున్న చంద్రబాబు
posted on Jul 10, 2015 7:11AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు డిల్లీలో కేంద్రమంత్రులు రాజ్ నాద్ సింగ్, ఉమా భారతి, పీయూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్ లతో సమావేశమవుతారు. మొదట ఉదయం 9.30గంటలకు విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమయ్యి రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలకి బొగ్గు సరఫరా, జపాన్ సంస్థలు రాష్ట్రంలో స్థాపించబోయే విద్యుత్ ఉత్పత్తి సంస్థలకి అనుమతులు మొదలయిన అంశాల గురించి చర్చిస్తారని సమాచారం. తరువాత అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తో సమావేశమయినప్పుడు రాష్ట్రంలో కొత్తగా పెట్టబోయే సంస్థలకు పర్యావరణ శాఖ అనుమతుల గురించి చర్చించుతారు. తరువాత కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఉమా భారతితో సమావేశమయినప్పుడు తెలంగాణాతో ఏర్పడుతున్న జలవివాదాల గురించి చర్చిస్తారు. చివరిగా ఈ రోజు సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాద్ సింగ్ ని కలిసి ఫోన్ ట్యాపింగ్, సెక్షన్: 8 అమలు మొదలయిన అంశాల గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.