కియా మోటార్స్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

 

ఆటో మొబైల్ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక అడుగు వేసింది. ‘ఫ్యూచర్ మొబిలిటీ పార్టనర్‌షిప్’పై కియా మోటార్స్‌తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కియామోటార్స్ ఛార్జింగ్ స్టేషన్‌ను, ఎలక్ట్రిక్ కార్లను ఈరోజు సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అదేవిధంగా కియా కారులో సభాస్థలి వరకు ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కియా మోటార్ కంపెనీ రాకతో అనంతపురం జిల్లా రూపురేఖలు మారిపోతాయని అన్నారు. ఎలక్ట్రికల్ కారులో తొలిసారి ప్రయాణించానని, సౌకర్యవంతంగా ఉందని తెలిపారు. కియా తొలి కారు జనవరిలో బయటకు వస్తుందని ఆశిస్తున్నానన్నారు. ఇక్కడ తయారైన కార్లలో 90 శాతం దేశీయ అవసరాలకు సరిపోతాయని, 10 శాతం ఎగుమతులకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వివిధ పరిశ్రమల రాకతో ఏపీ ఆటోమొబైల్ హబ్‌గా మారిందన్నారు.
 
రాబోయే కాలంలో యూనిట్‌ సౌర విద్యుత్ రూపాయిన్నరకే లభ్యంకానుందని, ఆ దిశగా ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. త్వరలో 7,300 ఎలక్ట్రిక్ వాహనాలను వ్యర్ధ సేకరణలో వినియోగిస్తామన్నారు. పర్యావరణ హితమైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఇది కొత్త యుగం వైపు ప్రయాణానికి తొలి అడుగుగా చంద్రబాబు పేర్కొన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కియా ఏపీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉపయోగపడుతోందన్నారు. ఏపీకి పెట్టుబడులు పెద్దఎత్తున వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. 

సచివాలయంలో ఎలక్ట్రిక్ కార్లను సీఎం ప్రారంభించగా నిరో హైబ్రిడ్‌, నిరో ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌, నిరో ఎలక్ట్రికల్‌ కార్లను ప్రభుత్వానికి కియా మోటార్స్ బహుమతిగా అందజేసింది. ఈ కార్లకు ఒక్కసారి ఛార్జింగ్‌ చేసుకుంటే 455 కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చు. కారు తాళాలు కియా మోటార్స్ సీఈవో చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా ‘ఫ్యూచర్ మొబిలిటీ పార్టనర్‌షిప్’పై కియా మోటార్స్‌తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.