జగన్ సర్కార్.. సలహాదారుల నియామకాల్లో తగ్గేదేలే!

posted on: May 27, 2023 10:56AM

నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఏపీ సర్కార్ తీరు ఉంది.  సలహాదారుల నియామకంపై  కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా, ఆ నియామకాల చట్టబద్ధతను తేలుస్తామని చెబుతున్నా ఏపీ సర్కార్ పట్టించుకోవడం లేదు. బేఖాతరు చేస్తోంది. ఖజానాపై భారం పడుతోందని తెలిసా.. ఇష్టారీతిన సలహాదారుల నియామకం చేపడుతోంది. జగన్ సర్కార్ తాజాగా  మరో సలహాదారుడ్ని నియమించింది. మైనార్టీశాఖ సలహాదారుగా బాగ్దాదిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటూ ఆ పదవిలో కొనసాగగుతారు. గత వారం కూడా మైనారిటీ సంక్షేమశాఖలో క్రైస్తవ వ్యవహారాలకు సలహాదారుడ్ని సర్కార్ నియమించింది.  వారం వ్యవధిలో ఒకే శాఖకు ఇద్దరు సలహాదారుల్ని నియమించడం గమనార్హం. గతంలో హైకోర్టు సలహాదారుల నియమాంకపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్తవారి నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. 

 మైనార్టీ సంక్షేమ శాఖకు కొ ముఫ్తీ సయ్యద్‌ మొహమ్మద్‌ అలీ బాగ్దాదిని సలహాదారుగా నియమించింది ప్రభుత్వం.. ఈయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ శాఖలో రెగ్యులర్‌ అధికారులను నియమించని ప్రభుత్వం.. నలుగురు సలహాదారులను నియమించిందనే విమర్శలు ఉన్నాయి.  అంతేకాదు ఈ నెల 18న కూడా మైనారిటీ సంక్షేమశాఖ పరిధిలోని క్రైస్తవ వ్యవహారాలకు సంబంధించి మద్దు బాలస్వామిని సలహాదారుగా నియమించింది ప్రభుత్వం. వారం కూడా కాకుండనే మరో సలహాదారుడ్ని ప్రభుత్వం నియమించింది. వీరిద్దరే కాకుండా ఇంతకు ముందు నుంచే జియావుద్దీన్‌, హబీవుల్లాలు సలహాదారులుగా కొనసాగుతున్నారు. ఈ నియామకంతో మైనార్టీ వ్యవహారాలకు సలహాదారుల సంఖ్య నాలుగుకు చేరింది.

 మైనారిటీ సంక్షేమశాఖకు సలహాదారులుగా కొనసాగుతున్నవారికి  మంచి జీతభత్యాలు ఉన్నాయి. జియావుద్దీన్‌, హబీవుల్లాలకు కేబినెట్‌ హోదాతో పాటుగా నెలకు రూ.3.50 లక్షలు.. ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. క్రైస్తవ వ్యవహారాల సలహాదారుగా నియమించిన బాలస్వామి.. ఇప్పుడు నియమించిన మహమ్మద్‌ అలీ బాగ్దాదీలకు జీతభత్యాలకు సంబంధించి ఉత్తర్వులు ఇంకా రాలేదు. సలహాదారుల నియామకానికి సంబంధించి గతంలో హైకోర్టు ప్రభుత్వం తీరును తప్పుబట్టింది.. కొన్ని సీరియస్ కామెంట్స్ చేసింది. అయినా కూడా  మరో ఇద్దరిని సలహాదారులుగా  నియమించడం ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కొండవీటి చాంతాడులా ఉన్న ఏపీ సర్కార్ సలహాదారుల జాబితా కొండవీటి జాంతాడంత ఉంటుంది.  నియమితులైన సలహాదారులకు.. కేబినెట్ హోదా ఇవ్వడం.. భారీగా జీతభత్యాలు.. సకల సౌకర్యాలు అందించడం.. అసలే అప్పుల ఆంధ్రగా మారిపోయిన రాష్ట్రానికి తలకు మించి భారం అవుతోందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.   

google-ad-img
    Related Sigment News
    • Loading...