Latest News
అధికార దాహంతో నేకేజ్రీవాల్ పతనం.. అన్నాహజారే స్పందన
posted on: Feb 8, 2025 11:21AM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిపై సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే స్పందించారు. ఈ ఎన్నికలలో ఆప్ ఓటమికి ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అధికార దాహమే కారణమని అన్నాహజారే అన్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొని రాజకీయాలలోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ అదే అవినీతిలో కూరుకుపోవడం వల్లే ప్రజా తిరస్కారానికి గురయ్యారని పేర్కొన్నారు.
అన్నా హజారే నేతృత్వంలో 2011లో పెద్ద ఎత్తున జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమం దేశాన్ని కదిలించింది. అన్నా హజారే ఉద్యమానికి మద్దతుగా దేశ వ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున కదిలారు. సరిగ్గా ఆ ఉద్యమంతోనే అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు దగ్గరయ్యారు. అన్నా హజారే శిష్యుడిగా గుర్తింపు పొందారు. ఆ తరువాత ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేసి రాజకీయాలలోకి ప్రవేశించారు. పార్టీని విజయపథంలో నడిపి ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకున్నారు.
అటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆ తరువాత లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అవినీతి ఆరోపణలపై జైలుకు కూడా వెళ్ల వచ్చారు. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో జనం ఆయన పార్టీని ఓడించారు. ఏ అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఉద్యమంతో స్ఫూర్తి పొంది రాజకీయాలలోకి వచ్చారో.. అదే అవినీతి ఆరోపణలలో ఇరుక్కుని ప్రజా తిరస్కారానికి గురయ్యారని అన్నాహజారే అన్నారు.


.webp)



