మరో ఎలక్ట్రిక్ బైక్ భస్మీపటలం.. ఈ సారి నడుపుతుండగానే
Published on: Sun May 1, 2022 8:36AM
ఎలక్ట్రిక్ బైకు పేరు వింటేనే.. యముడి మహిషపు లోహ ఘంటికల శబ్ధం వినిపించినట్లు భయపడిపోతున్నారు జనం, ఇంధన ఆదా, భవిష్యత్ వాహనాలు ఊదరగొట్టి మరీ వాటి పట్ల ఆసక్తి కలిగేలా చేసిన ప్రకటనలు, వాటి తయారీకి ప్రభుత్వాలు ఇచ్చిన ప్రోత్సాహకాలు జనం ప్రాణాలు తీయడానికా అని విమర్శిస్తున్నారు.
తమిళనాడులోని హోసూరులో ఓ ఎలక్ట్రిక్ వాహనం దగ్ధమైంది. ఓ 29ఏళ్ల వ్యక్తి బైక్ నడుపుతుండగా.. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ యువకుడు ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాడు. బైక్ మాత్రం పూర్తిగా దగ్ధమైంది. ఎలక్ట్రిక్ బైక్ లంటే జనాల్లో బెదురు పుట్టడానికి ఇలాంటి సంఘటనలే కారణం. ఇప్పటికే ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనుక్కున్న వారు.. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇంట్లో చార్జర్ పెట్టినప్పుడు పేలిపోవడం, బైక్ పార్కింగ్ చేసి ఉన్నప్పుడు తగలడిపోవడం విన్నాం. ఈ సారి ఏకంగా నడుపుతున్న బైకే దగ్ధం కావడంతో ఎలక్ట్రిక్ వాహనాలు ఎంత మాత్రం సేఫ్ కాదన్న నిర్ధారణకు జనం వచ్చేశారు.


