ఓటుకు నోటు కేసు.. స్టీఫెన్‌సన్‌‌‌ కే కేసీఆర్ ఓటు

 

స్టీఫెన్‌సన్‌‌‌ను మరోసారి అదృష్టం వరించింది. నామినేటెడ్ సభ్యుడిగా స్టీఫెన్‌సన్‌ను నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. స్టీఫెన్‌సన్‌ తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన వ్యక్తి. ఓటుకు నోటు కేసులో ఈయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆయనకు రేవంత్‌రెడ్డి లంచం ఇవ్వజూపి ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో స్టీఫెన్‌సన్‌ తన వద్దకు బేరసారాలకు వచ్చిన వ్యక్తుల సమాచారాన్ని సీఎం కేసీఆర్‌కు అందించి, వారిని పట్టుకునేందుకు అనువుగా వ్యవహరించారు. నిజాయతీగా వ్యవహరించినందున కేసీఆర్ మళ్లీ ఆయనకే అవకాశం ఇచ్చారు.

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సోమవారం తెలంగాణ తొలి మంత్రివర్గ సమావేశం జరగింది. తెలంగాణ అసెంబ్లీలో ఆంగ్లో ఇండియన్‌ శాసన సభ్యుడిగా స్టీఫెన్‌సన్‌ను నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్‌ సమావేశంలో తీర్మానం చేసింది. నియామకానికి సంబంధించిన ప్రతిని గవర్నర్‌ నరసింహన్‌కు పంపింది. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్‌ అలీ పాల్గొన్నారు. ఎమ్మెల్యేలతో పాటే నామినేటెడ్‌ సభ్యుడి ప్రమాణ స్వీకారం జరపాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. తెలంగాణ అసెంబ్లీ వాస్తవ బలం 120. ఇందులో 119 మంది ఎన్నికల ద్వారా వస్తారు. మిగిలిన స్థానంలో ఆంగ్లో ఇండియన్‌ సభ్యుడిని నియమిస్తారు. గత ప్రభుత్వంలో స్టీఫెన్‌సన్‌ ఆంగ్లో ఇండియన్‌ సభ్యుడిగా ఉన్నారు. ఈసారి కూడా నామినేటెడ్ సభ్యుడిగా స్టీఫెన్‌సన్‌ను నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని మంత్రివర్గం అభినందించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌, ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశంసించింది. ఎన్నికైన సభ్యులకు రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనల ప్రతులను తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో పుస్తకాలు, బుక్‌లెట్ల రూపంలో ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. సభ్యులకు అందించే ప్రతులను సీఎం కేసీఆర్‌కు అసెంబ్లీ కార్యదర్శి చూపించారు.