ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు హైకోర్టు నోటీసులు

ఏపీ, తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై హైకోర్టు సీరియస్ అయ్యింది, బలవన్మరణాలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకోకుండా ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో అన్నదాల ఆత్మహత్యలపై జన చైతన్య వేదిక వేసిన పిల్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ మేరకు ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. బాధిత రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వడమే పరిష్కారం కాదన్న హైకోర్టు.... సరైన పరిష్కారం కోసం ఎందుకు అన్వేషించడం లేదని ఇరు ప్రభుత్వాలను ప్రశ్నించింది. చనిపోయాక పరిహారం ఇస్తే ఏం లాభం, బతికున్నప్పుడే రైతును కాపాడుకోవాలంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కి వాయిదా వేసిన ధర్మాసనం... రైతుల ఆత్మహత్యల నివారణకు ఏం చర్యలు తీసుకున్నారో నివేదికలు ఇవ్వాలంటూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. రైతు ఆత్మహత్యలపై ఇరు రాష్ట్రల్లో రాజకీయ దుమారం రేగుతున్న సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు కీలకంగా మారాయి