ఔను నేనే చంపేశాను.. సుబ్రహ్మణ్యం హత్యపై ఎమ్మెల్సీ అనంత బాబు

posted on: May 23, 2022 4:13PM

ఔను సుబ్రహ్మణ్యం ను నేనే హత్య చేశాను అని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించారు. ఈ విషయాన్ని పోలీసులే స్వయంగా వెల్లడించారు. ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాలని ఓ పక్క మృతుడు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, విపక్షాలూ ఆందోళన చేస్తుంటే.. పోలీసులు ఎమ్మెల్సీ అరెస్టును చూపకపోయినప్పటికీ, ఆయన తమ అదుపులోనే ఉన్నారనీ, విచారణ జరుపుతున్నామనీ లీకులు ఇస్తున్నారు. అలాగే తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను తానే హత్య చేసినట్లు ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించినట్లు కూడా కాకినాడ పోలీసులు వెల్లడించారు. ఈ హత్యలో మరెవరికీ ప్రమేయం లేదనీ, తాను ఒక్కడినే హత్య చేశాననీ కూడా అనంతబాబు తమ ఎదుట అంగీకరించారని పోలీసులు మీడియాకు చెప్పారు.

వ్యక్తిగత విషయాలలో మితిమీరి జోక్యం చేసుకున్నందునే సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్లు అనంతబాబు తమ విచారణలో అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. 
అయితే మొదటి నుంచీ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మొదటి నుంచీ పోలీసుల తీరు అనుమానాస్పదంగానే ఉంది. ఎలాగైనా ఈ కేసు నుంచి అనంత బాబును బయటపడేయాలన్నట్లుగా పోలీసుల తీరు బాగుంది. సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని తన కారులోనే హతుడి నివాసం వద్దకు తీసుకువచ్చినా, ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. కేవలం అనుమానాస్పద మృతి కిందే కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబం, విపక్షాలూ పట్టుబట్టినా, నిలదీసినా పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకూ తాము ఎవరిపైనా కేసులు నమోదు చేయమని భీష్మించారు. చివరకు పోస్టుమార్టంలో సుబ్రహ్మణ్యంది హత్యే నని తేలడంతో అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చారు. పరారీలో ఉన్న అనంత బాబు కోసం గాలిస్తున్నామన్నారు. 

 అయితే సుబ్రహ్మణ్యం హత్య ఘటన అనంతరం కూడా ఎమ్మెల్సీ అనంతబాబు  బహిరంగంగా తిరిగారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అధికారికంగా అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చిన తర్వాతనే  ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన నేరుగా వెళ్లి సజ్జల రామకృష్ణారెడ్డితో సమావేశమయ్యారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఇదే ఆరోపణ చేశారు. సజ్జలతో మంతనాల తరువాతే అనంత బాబు నేరుగా పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోయినట్లు అనుమానస్తున్నారు.  

అరెస్టు చూపితే వెంటనే అనంత బాబును జైలుకు పంపాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే పోలీసులు ఆయన అరెస్టును చూపడం లేదని పరిశీలకులు అంటున్నారు. సాయంత్రం కోర్టు సమయం అయిపోయే వరకూ ఆయన అరెస్టు చూపకుండా ఉంటూ, ఆయన బెయిల్ ప్రయత్నాలకు పోలీసు అధికారులు ఇతోధికంగా సహకరిస్తున్నారన్న అనుమానాలూ వినవస్తున్నాయి.   
మొత్తం మీద అనంతబాబు వ్యవహారం రాజకీయంగా వైఎస్ఆర్‌సీపీ అరాచకాలపై ఏపీ వ్యాప్తంగా చర్చ జరిగేలా చేసింది.

పోలీసుల విశ్వసనీయతపైనా ప్రజల్లో ఇప్పటి వరకూ ఉన్న అనుమానాలు, కేవలం అనుమానాలు కావనీ, అవి వాస్తవాలనీ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కాకినాడ పోలీసుల తీరు తేల్చేసింది.   వైసీపీ నేతలయితే హత్యలు చేసినా ఎవరూ పట్టించుకోరన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎమ్మెల్సీ అయినా సరే ఉపేక్షించదు అన్న బిల్డప్ ఇవ్వడం కోసమే,  ఎమ్మెల్సీని అరెస్ట్ చేసినట్లు చూపించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. లేకుంటే  ఇప్పటి వరకూ ఆయనను ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లుగా చెబుతూ  వస్తున్న పోలీసులు ఇప్పుడు హాత్తుగా అనంత బాబును పోలీస్ కార్యాలయంలోనే విచారిస్తున్నామంటూ బయట పెట్టరు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...