సిరియాపై బాంబులు సిరియా సంక్షేమం కోసమేనట
posted on Sep 1, 2013 9:55PM
నిత్యం ఏదో ఒక దేశంతో యుద్ధం చేయకపోతే అమెరికాకు ఊపిరాడనట్లుటుంది. టీవీ సీరియల్స్ లాగ ఒకటి ముగియకముందే మరొకటి మొదలుపెడుతూ తను తయారు చేసుకొన్న అత్యాధునిక ఆయుధాలను పరీక్షించుకొనేందుకు దేశాలను, అందుకు అవసరమయిన కారణాలను వెతుకొంటుంది అమెరికా. ఇరాక్ రసాయన ఆయుధాలు తయారు చేస్తోందని సాకు చూపి, ఆదేశాన్ని సర్వనాశనం చేసిన తరువాత అమెరికా దృష్టి ఆఫ్ఘానిస్తాన్ పై పడింది. ఇరాక్ తరువాత అక్కడ కూడా బహు చక్కగా శాంతి స్థాపన చేసేసి చేతులు దులుపుకొన్న అమెరికా దృష్టి ఇప్పుడు సిరియాపై పడింది.
ఆదేశంలో ప్రజాస్వామ్యం కోరుతూ జరుగుతున్న ఉద్యమాలను అణచివేసేందుకు అక్కడి బషార్-అల్-అస్సాద్ ప్రభుత్వం రసాయన ఆయుధాలు ప్రయోగించడంతో 426 మంది పసిపిల్లలతో సహా మొత్తం 1429 మంది ప్రజలు చనిపోయారు. దానితో ప్రజలు తమ ఉద్యమాలను మరింత తీవ్రతరం చేసారు. అమెరికా యుద్ధం మొదలుపెట్టడానికి ఈ మాత్రం సాకు చాలు గనుక అమెరికా అధ్యక్షడు బారక్ ఒబామా సిరియాపై పరిమిత దాడి చేయడానికి సిద్దంకమ్మని ఆదేశాలు జారీ చేయడంతో, అత్యాధునిక ఆయుధాలను మోసుకొని అమెరికా నావికా దళం సిరియా తీరం చట్టూ మోహరించింది.
ప్రపంచ దేశాలు అమెరికా ఆలోచనను ఎంతగా ఖండిస్తున్నపటికీ అమెరికా యుద్దానికే తయారవుతోంది. బుష్ ప్రభుత్వం అమెరికా దేశ ప్రజల మీద అనవసరమయిన యుద్దాలు చాలా రుద్దారని, తను యుద్దాలను వ్యతిరేఖిస్తున్నానని చెప్పి ఎన్నికలలో గెలిచిన బరాక్ ఒబామా కూడా ఇప్పుడు యుద్ధం చేయకుండా ఉండలేకపోతున్నాడు.
ఆయన కను సైగ చేయగానే అమెరికా నావికా దళం 1429 మంది ప్రజలను చంపినందుకు శిక్షగా సిరియా మీద సరికొత్త రకాల బాంబుల వర్షం కురిపించి, కొన్ని వందలో వేలమందిని చంపి అక్కడ కూడా శాంతి నెలకొల్పుతుంది.
ఇంతవరకు సిరియా ప్రజలు కేవలం తమ ప్రభుత్వాన్నే ద్వేషిస్తున్నారు. కానీ, వారిప్పుడు అమెరికాను అంతకంటే ఎక్కువగా ద్వేషించడం మొదలుపెట్టారు. తాము అమితంగా ద్వేషిస్తున్నబషార్-అల్-అస్సాద్ ప్రభుత్వంపై అమెరికా చేయబోతున్నదాడిని తమ దేశంపై దాడిగా భావించడం సహజమే. అయితే వారి అభిమతంతో, అభిప్రాయాలతో అమెరికాకు పనిలేదు. అమెరికాకు కావలసిన సాకు దొరికింది ఇక యుద్ధం మొదలుపెట్టక తప్పదు.
కానీ అడుసు తొక్క నేల? కాలు కడుగ నేల? అని సామెత చెప్పినట్లు సిరియాపై యుద్దానికి కాలుదువ్వడంతో తన దేశంలో నివసిస్తున్నసిరియా ప్రజలను చూసి అమెరికా అప్పుడే ఉలికులికి పడుతోంది. అందుకే అమెరికా తన దేశంలో ఉన్న సిరియా దేశస్థులపై అప్పుడే నిఘా మొదలుపెట్టింది.
ఇక నేడోరేపో ఆకాశం నుండి కురిసే బాంబుల వర్షంలో ప్రాణాలు అర్పించేందుకు సిరియా ప్రజలు సిద్దంగా ఉండక తప్పదు. అమెరికా చేపడుతున్న ప్రపంచ శాంతి కోసం దాని కన్నుపడిన ఏ దేశానికయినా ఆమాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదు, ఆ మాత్రం త్యాగాలు చేయక తప్పదు. మొన్నఇరాక్, నిన్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేడు సిరియా, రేపు మరెవరి వంతో?