తిరుమలలో లాగే అమరాతి వేంకటేశ్వర స్వామి ఆలయం
Published on: Wed Jan 1, 2025 11:45AM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోని వెంకటపాలెం వద్ద టీటీడీ నిర్మించిన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జె.శ్యామల రావు మంగళవారం (డిసెంబర్ 31) సందర్శించారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన రోజువారి రోజువారి జరుగుతున్న కైంకర్యాలను, దాతల సహకారంతో ఇప్పటికే జరుగుతున్న అన్నదాన కార్యక్రమ వివరాలను, ఇతర కార్యక్రమాలను ఈవోకు అధికారులు తెలియజేశారు. తిరుమలలో జరుగుతున్న విధంగానే అమరావతి ఆలయంలోనూ శ్రీవారి రోజువారీ సేవలు జరగాలని ఆయన ఈ సందర్భంగా ఆలయ అధికారులను ఆదేశించారు.
టిటిడి సిబ్బందికి అవసరమైన క్వార్టర్స్ , అన్నదానానికి అవసరమైన భవనాలు, భక్తులు వేచి ఉండేందుకు హాల్, స్వామివారి వాహనాల కోసం వాహన మండపం, ఆహ్లాదకరంగా గార్డెనింగ్ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఈవో శ్యామలరావు ఈ సందర్భంగా ఆదేశించారు.
ఆలయానికి సంబంధించి రూపొందించిన ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. ఆలయ నిర్మాణానికి ముందు తయారు చేసిన ప్లాన్ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని టిటిడి ఇంజనీరింగ్ అధికారులను ఈవో ఆదేశించారు.
వైకుంఠ ఏకాదశి రద్దీ నేపథ్యంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అంతకుముందు ఆలయానికి ఈవో చేరుకోగానే సాంప్రదాయ బద్ధంగా ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి వేదశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, డిప్యూటీ ఇఇ నాగభూషణం, సూపరెంటెంట్ మల్లికార్జున, టెంపుల్ ఇస్పెక్టర్ రామకృష్ణ, అసిస్టెంట్ ఇంజనీర్ జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.


