TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

క్వాంటం పరిశోధనలకు కేంద్రం అమరావతి.. చంద్రబాబు

Published on: Mon Jun 30, 2025 11:55AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీపై ఈ రోజు విజయవాడలో నిర్వ‌హించ‌నున్న‌ నేషనల్ క్వాంటం వర్క్‌షాప్ లో పాల్గొనేందుకు అంతర్జాతీయ ఐటీ సంస్థలు,  బహుళజాతి కంపెనీల ప్రతినిధులు  రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి తన ఉండవల్లి నివాసంలో  ఆదివారం  విందు ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా ఆయన విందులో పాల్గొన్న   ప్రతినిధులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఆ సమావేశంలో క్వాంటమ్ వ్యాలి లక్ష్యాలను వివరించారు. అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు ద్వారా అమరావతిని క్వాంటం పరిశోధనకు కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.  దేశంలోనే  ఈ స్థాయిలో క్వాంటం టెక్నాలజీకి అంకితమైన పార్కు ఇదు మొదటిదని చెప్పారు.  ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి ప్రముఖ సంస్థల సహకారంతో క్వాంటం వ్యాలీని అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.  

కాగా చంద్రబాబు ఇచ్చిన విందుకు టీసీఎస్ ప్రెసిడెంట్ అండ్ గ్లోబల్ హెడ్  వి. రాజన్న, మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ రాజీవ్ కుమార్, ఏటీ అండ్ టీ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ సిద్ధు, వార్నర్ బ్రదర్స్ ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ హెడ్ మనీష్ వర్మ, భారత్ బయోటెక్ వ్యవస్థాపకురాలు సుచిత్రా కె. ఎల్లా, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌, నేషనల్ క్వాంటం మిషన్ డైరెక్టర్ జె.బి.వి. రెడ్డి, రెడ్డీ ల్యాబ్స్ ఫణి మిత్ర, అస్ట్రా జెన్గా ఎండీ ప్రవీణ్ రావు, ఐబీఎం ఇండియా వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్, కేంద్ర శాస్త్రసాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శి అభయ్ కరాండికర్, కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కుమార్ సూద్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.