TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శంకుస్థాపన ఓకే... మరి సీడ్ కేపిటల్ సంగతేంటి?

Published on: Sat Oct 24, 2015 1:54PM

 

నవ్యాంధ్రప్రదేశ్లో ఒక చారిత్రక ఘట్టం ముగిసింది... అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించి శెభాష్ అనిపించుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందు అసలుసిసలైన లక్ష్యం నిలిచింది. అతి తక్కువ టైమ్ లో అమరావతి శంకుస్థాపనను ఎవరూ ఊహించనంత అద్భుతంగా ఆర్గనైజ్ చేయగలిగిన చంద్రబాబు... సీడ్ కేపిటల్ నిర్మాణం సవాలు విసురుతోంది. అంతేకాదు 2019 ఎన్నికల్లోపు అంటే 2018 డిసెంబర్ నాటికి సీడ్ కేపిటల్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది.

2018 డిసెంబర్లోపు అమరావతిలో సీడ్ కేపిటల్ ఫస్ట్ ఫేజ్ ను పూర్తి చేయాలని గడువు పెట్టుకున్న చంద్రబాబునాయుడు... అనుకున్న టైమ్ లోగా టార్గెట్ ను రీచ్ అవుతారో లేదోననే సందేహాలు కలుగుతున్నాయి, ఇంకా మూడేళ్లు మాత్రమే చంద్రబాబుకు సమయం ఉంది, ఈలోపే సీడ్ కేపిటల్ నిర్మాణం జరిగిపోవాలి, మరి ఇంత తక్కువ టైమ్ లో నిర్మాణాలను పూర్తి చేయడం సాధ్యమేనా అంటున్నారు. అయితే ఇప్పటికే సింగపూర్ ప్రభుత్వం... అమరావతి మాస్టర్ ప్లాన్ అందించడంతో సీడ్ కేపిటల్ పనులు అతిత్వరలోనే ప్రారంభంకానున్నాయని, కానీ ఆర్ధిక కష్టాలతో కొట్టుమిట్టాడుతోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ఏవిధంగా అంతర్జాతీయస్థాయి నగరాన్ని నిర్మిస్తుందనేది మాత్రం చంద్రబాబు సత్తాపై ఆధారపడి ఉందని అంటున్నారు.

డబ్బుంటే కొండ మీద కోతినైనా కిందికి తీసుకురావొచ్చంటుంటారు, మరి తీవ్ర నిధుల కొరతతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకున్న గడువులోగా సీడ్ కేపిటల్ ను పూర్తి చేయగలుగుతుందా? ఏ విధానంలో సింగపూర్, జపాన్ ప్రభుత్వాలకు పనులు అప్పగించబోతున్నారు? ఈ కంపెనీలు గడువులోపు నిర్మాణాలను పూర్తి చేయగలుగుతాయా అనే సవాళ్లు మాత్రం ఏపీ ప్రభుత్వం ముందున్నాయి. మరి వీటన్నింటినీ అధిగమించి గడువులోగా సీడ్ కేపిటల్ ను నిర్మించి చంద్రబాబు మరోసారి తన సత్తా చాటుకుంటారో లేదో చూడాలి.