విమాన ప్ర‌మాదంలో మాజీ సీఎం రూపానీ మృతి..నిర్దారించిన అధికారులు

posted on: Jun 12, 2025 8:14PM

 

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి చెందినట్లు  ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ ధృవీకరించారు. ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం AI171, అహ్మదాబాద్ నుంచి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. ప్రమాద సమయంలో రూపానీ విమానంలోని బిజినెస్ క్లాస్ సీటు 2డిలో కూర్చున్నట్లు తెలుస్తోంది. రూపానీ ఆగస్టు 2016 నుంచి సెప్టెంబర్ 2021 వరకు గుజరాత్ 16వ ముఖ్యమంత్రిగా విశేష సేవలందించారు. తన ప్రశాంత స్వభావం, దృఢమైన పరిపాలనా శైలితో పేరుపొందిన ఆయన, రాష్ట్ర పారిశ్రామిక వృద్ధి, కోవిడ్ అనంతర పరిస్థితుల నుంచి కోలుకుంటున్న కీలక సమయంలో గుజరాత్‌ను సమర్థవంతంగా నడిపించారు. 

ఆయన పాలనలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సంక్షేమ పథకాల అమలుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. విజయ్ రూపానీ సతీమణి అంజలి రూపానీ సామాజిక కార్యకర్త. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నారు. మృదుస్వభావిగా, క్రమశిక్షణ కలిగిన జీవనశైలితో, బలమైన ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తిగా రూపానీకి పేరుంది. ఆయన తరచూ గుజరాత్‌లోని వివిధ దేవాలయాలను సందర్శిస్తూ, మత, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆయన ఆకస్మిక మరణం గుజరాత్ రాజకీయాల్లో, బీజేపీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...