'విభజన' వ్యతిరేక మహోద్యమ లక్ష్యం !

 

ABK Prasad separate telangan issue, ABK Prasad Kcr, separate telangan issue Kcr, ABK Prasad telangana, kcr ABK Prasad

 

- డా. ఎబికె ప్రసాద్

[సీనియర్ సంపాదకులు]

 

 

"విడివడితే గుఱ్ఱం గాడిదతో సమానమవుతుంద''ని తెలుగువాడు ఏనాడో అల్లుకున్న సామెతను, ఏకభాషా సంస్కృతుల బలమైన పునాదులు ప్రాతిపదికగా భాషాప్రయుక్త రాష్ట్రాన్ని ఏర్పరచుకున్న తెలుగువాళ్ళు 57 సంవత్సరాల తరువాత "విడిపోయి కలుసుందామనుకునే'' పరస్పర విరుద్ధమైన సూత్రీకరణపై ఆధారపడి పరస్పర ద్వేషాలు పెంచుకోవడం విచారకరం, ఖండనార్హం. 'విభజన' వితండవాదానికి ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపదికలేదో, రాజకీయ నిరుద్యోగులు పదవీకాంక్షతో ప్రారంభించిన ఉద్యమానికి కూడా సమర్థనీయమైన శాస్త్రీయ వివేచన లేదు. అందుకే "మాకు లెక్కలు వద్దు, మాది ఆత్మగౌరవ నినాదంపై ఆధారపడిన ఉద్యమం'' అని ఒక భాగంలోని తెలుగువాడే అందులోనూ సీమాంధ్రుడైన 'బొబ్బిలిదొర' "ఉద్యమం'' పేరిట ప్రారంభించిన తగాదా చిలికిచిలికి గాలివానై, "విభజించి-పాలించ''మన్న బ్రిటిష్ వలసపాలనావశేషమైన ''తురుపు''ముక్క నుంచి ఉత్తేజితురాలైన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గం తెలుగుజాతినీ, సమైక్య రాష్ట్రాన్నీ "ఎన్నికల వ్యూహం''లో ఒక పావుగా చేసి విభజించడానికి నిర్ణయించిన తరుణంలో - కోస్తాంధ్ర, తెలంగాణా రాయలసీమ ప్రాంతాల ప్రజలమధ్య చిచ్చుపెట్టింది.

 

దేశంలోని ప్రతిరాష్ట్రంలోనూ పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగంగా ప్రాంతాలమధ్య ఆర్థిక, సామాజిక అసమానతలు ఏదో ఒక మూల తలెత్తడం సహజం. పెట్టుబడి వ్యవస్థాపాలకులు ఈ పరిస్థితిని పరిష్కరించలేని దశలోనే, ప్రజల మధ్య విభేదాలు సృష్టించడంద్వారా పదికాలాలపాటు అధికారస్థానాలకు అంటకాగి ప్రజావ్యతిరేక సంస్కృతికి అలవాటు పడతుంటారు; చివరికి ప్రజలపేరిట రూపొందించామని, ప్రజల సంక్షేమం కోసమే రూపొందించామని ప్రగల్భించే 'పథకాల'ను ప్రజారంజకంగా అమలుచేయడంలో విఫలమవుతూ ఉండటం వల్లనే 'వేర్పాటు' ఉద్యమాలకు కూడా పాలకపక్షాలే కారణమవుతూంటాయి. ఈ క్రమంలో లోపం ఎక్కడుందో దానిని కనిపెట్టి దాన్ని సకాలంలో సరిచేసే రాచబాటలు వదిలి, అందుకు తేలికైన పరిష్కారంగా ప్రజలమధ్యనే పాలకపక్షాలు తంపులు పెడతాయి. ఫలితంగా, ఈ పరిణామాలకు బాధ్యులయిన పాలకపక్షాలను తెంపరితనంతో అధికారం నుంచి ఊడబెరికే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించకుండా ప్రజలు 'విభజన'వలలో చిక్కకుండా తమ 'వోటు'హక్కును సద్వినియోగం చేసుకోవాలి. కాని ఆ ప్రజల హక్కునూ 'అవినీతి'కి ఆలవాలమైన అధికారపక్షాలు భ్రష్టుపట్టిస్తూ వచ్చాయి; నాయకులనే కాదు, అభ్యర్థులను సహితం ఎన్నికల సంతలో 'క్రయ-విక్రయ' సరుకులుగా మార్చుతున్నాయి.


 

నేడు తెలుగుజాతిని చీల్చాలన్న కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ స్థాయిలో చేసిన తప్పుడు నిర్ణయం. ఆ నిర్ణయానికి లోబడిపోయిన ఒక ప్రాంతపు విద్వేషవాదులయిన రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నవారు "సీమాంధ్రుల దోపిడీ వల్లనే తెలంగాణా నష్టపోయింద''న్న అబద్ధపు ప్రచారం ద్వారా జాతి విచ్చిత్తికి పాల్పడ్డారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ద్వారానే వారివారి భాషా సంస్కృతులను పెంపొందించుకుంటూనే దేశసమైక్యతకు శ్రీరామరక్ష కాగలరన్న పలు తీర్మానాలకు రూపకర్త అయిన కాంగ్రెస్ నాయకత్వం ఈనాతితరం 66సంవత్సరాల స్వాతంత్ర్యానంతరం సమైక్యరాష్ట్రాల విచ్చిత్తికి, భాషా రాష్ట్రాల పునాదులను స్వార్థబుద్ధితో, ఎన్నికల వ్యూహంలో భాగం చేసుకుంది. ఇది కాంగ్రెస్ లో కుక్కమూతి పిందెలుగా 1970లలో పుట్టుకొచ్చిన ఈనాటితరం! ఇందువల్లనే "విడిపోతేనే వికాసం'' అనీ, "విడిపోయి కలిసిఉందామ''న్న జాతి వ్యతిరేక నినాదాలకు అంకురార్పణ జరిగింది. కనుకనే తెలుగుజాతిలో భాగమైన తెలంగాణా ప్రాంతపు కృత్రిమ విభజనకు వ్యతిరేకంగా ఇతర రెండు ప్రాంతాలలోని [కోస్తా, రాయలసీమలు] ప్రజాబాహుళ్యం, ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక, విద్యా, సాంస్కృతిక విభాగాలకు చెందిన అధికార, అనధికార శక్తులన్నీ తెలుగుజాతి సమైక్యతా స్ఫూర్తితో ఉద్యమించాల్సి వచ్చింది.

 

ఒకేజాతిగా ఉన్న భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ [విశాలాంధ్ర]ను విభజించరాదన్నరాష్ట్ర విశాల ప్రయోజనాలను కోరుకుంటున్న ఉద్యమకారులు దేశభక్తి, జాతిభక్తికన్నా విభజనను ప్రచారం చేస్తున్న కొలదిమంది రాజేకీయ నిరుద్యోగుల పాక్షిక 'ఉద్యమం' శ్రేష్ఠమైనదిగా ఎన్నికలలో కాంగ్రెస్ విజయావకాశాలు పెంచుకొనేతప్పుడు వ్యూహంలో 'ఉత్తమం'గా భావించుకుంది. ప్రపచంలో ఎక్కడైనా సరే [ఇండియాసహా] విడిపోయేహక్కు లేదా 'స్వయంనిర్ణయ హక్కు' ఆ జాతి మొత్తానికి ఉంటుంది గాని, ఏక జాతిలో అంతర్భాగమైన ఒక భాగానికి ఉండదుగాక, ఉండదు.


 

అందుకే "సోవియట్ సోషలిస్టు సమాఖ్య'' "విడిపోయే హక్కు''ను జాతులకు ఖరారు చేస్తూ రాజ్యాంగ చట్టంలో హామీపడినప్పటికే ఏళ్ళపాటు ఏ ప్రత్యేక జాతీ సోవియెట్ పతనానికి దేశీయ పాలనా వ్యవస్థలోని స్వార్థపర శక్తులు సామ్రాజ్యవాద శక్తులతో 'లాలూచీపడి' దారితీసేంతవరకూ రిపబ్లిక్ నుంచి విడిపోలేదు! సోవియెట్ పతనం తరువాత, రష్యాగా పూర్వనామంతోనే పెట్టుబడి వ్యవస్థ పునరుద్దరణకు దారులు తీసిన తరువాత పాత సమాఖ్య నుంచి విడిపోయిన ప్రత్యేక రిపబ్లికలన్నీ అమెరికా సామ్రాజ్యవాద పాలనా వ్యవస్థ కుట్రలకు బలి అవుతూన్నాయని తెలుగువారు మరచిపోరాదు! సోవియెట్ సోషలిస్టు రిపబ్లిక్ నుంచి విడిపోయిన ఉక్రెయిన్, అజర్ బైజాన్, కిర్గిజిస్థాన్ వగైరా కొన్ని రిపబ్లిక్ లలో అమెరికా సైనిక నివాసాలకు, అమెరికా క్షిపణులు కొన్నిటికి స్థావరాలుగా మారడమూ, ఇప్పుడు ఆ బెడద నుంచి బయటపడడానికి, పాత రిపబ్లిక్ లలోని ప్రభుత్వాలను స్థానిక ఎన్నికల్లో జోక్యానికి పాల్పడిన అమెరికా కుట్రలనుంచి తప్పించుకోడానికి నానాతంటాలు పడవలసి వచ్చిందని తెలుగుజాతిలోని వేర్పాటువాదులూ, స్వార్థపరులూ మరవరాదు, మరవరాదు!


 

1962 నాటికే చైనాకు వ్యతిరేకంగా అమెరికా శత్రు విమానాలకు భారతదేశాన్ని ఇంధనం నింపుకునే స్థావరంగా నాటి ప్రధానమంత్రి పండిట్ నెహ్రూ రహస్యంగా అనుమతించడాన్ని అమెరికా గూఢచారి సంస్థ కొత్తగా వెల్లడించి సంచలనం సృష్టించింది. రహస్యంగా ఈ పనికి నాటి కాంగ్రెస్ ప్రభత్వం పూనుకోడాన్ని మరవరాదు! ఇరుగుపోరుగుతో సమస్యలు తలెత్తడం కొన్ని సందర్భాల్లో సహజం కావొచ్చు. కాని వాటిని శాంతియుతంగా పరిష్కరించుకునే తీరువేరు! అలాంటి సమస్యలు పాలకవ్యవస్థల మూలంగా తలెత్తేవిగాని ప్రజాబాహుళ్యం మాత్రం అందుకు కారణం కాదు. అందుకే ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతాల మధ్య పాలకపక్షాల వల్లనే ఉత్పన్నమవుతూ వచ్చేవేగాని, సామాన్య ప్రజాకోటికి ఎలాంటి సంబంధమూ ఉండదు. ఈ వాస్తవాన్ని 1953కు ముందు తెలంగాణా ప్రజాబాహుళ్యంలో పెక్కు అట్టడుగు వర్గాలు [ఎస్.సి., ఎస్టీ, బడుగుబలహీన వర్గాలు] నిజాం నిరంకుశ పాలకులు, ఆ పాలనా శక్తికి చేదోడు వాదోడైన దొరలు, జాగిర్దారీ, దేశ్ ముఖ్, పటేల్, పట్వారీల దాష్టికాలకూ, చిత్రహింసలకూ గురవుతూ వచ్చారు; 'నీబాన్చను దొరా' అన్న సంస్కృతికి వీళ్ళంతా కష్టజీవులందరినీ గురిచేశారు.




ఆనాటి పరిస్థితుల్ని తారుమారు చేసిన ఏకైక మహోద్యమం, రైతాంగ, కార్మిక, మధ్యతరగతి వర్గాల గ్రామీణ ప్రజలు పాల్గొన్న తెలంగాణా రైతాంగ సాయుధపోరాటం మాత్రమేనని, ఆ పోరాటమే తెలుగుజాతిని భాషాప్రయుక్త రాష్ట్రంగా, ఒక్క తాటిపైకి తెచ్చి 'విశాలాంధ్ర' అవతరణకు సుసాధ్యం చేసిందని కలలో కూడా తెలుగువాడు మరవకూడదు. హైదరాబాద్ సంస్థాన విమోచన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం సమీకరించిన సైన్యనిరహాల వల్ల జరిగిన పని - అంతకుముందు సాయుధ పోరాటం ధాటికి తట్టుకోలేక వివిధ నగరాలకెక్కిన దొరలు, జాగిర్దార్లు తిరిగి తెలంగాణా గ్రామసీమలకు మళ్ళి, అంతకుముందు సాయుధ పోరాట ఫలితంగా బడుగు బలహీనవర్గాలు అనుభవిస్తున్న పదిలక్షల ఎకరాలను పోలీసుల అండతో తిరిగి స్వాధీనం చేసుకున్న వైనాన్ని మరిచిన స్వార్థపర వర్గాలే, తిరిగి తెలంగాణా ప్రజలపైన తమ అధికారాన్ని స్థాపించుకోడానికి ఆ వర్గాలే ప్రజల పేరిట ప్రజావ్యతిరేక 'వేర్పాటు' ఉద్యమాన్ని ప్రారంభించారు!

 

ఉభయ ప్రాంతాలలోనూ ప్రజల అనేక త్యాగాల ఫలితం - ఆంధ్రప్రదేశ్ అవతరణ. 1953కు ముందు "హైదరాబాద్ స్టేట్'' [తెలంగాణా రాష్ట్రం అంటూ ప్రత్యేకంగా ఎన్నడూ లేదు. హైదరాబాద్ స్టేట్ లో మన తెలంగాణా ప్రాంతం ఒక భాగం మాత్రమే] కనుకనే తెలంగాణా వైతాళికులలో ఒకరైన పండిత సురవరం ప్రతాపరెడ్డి, చివరికి "హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్'' పుట్టుపూర్వాలను ప్రస్తావిస్తూ 1946లో తెలంగాణాలోని "ఆంధ్రమహాసభ'' 13వ సభ ముగిసిన తర్వాత ఏర్పడిన "హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్''లో ఉన్న సభ్యులు తెలంగాణా వారితో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు చెందిన సభ్యులూ ఉన్నార''ని  తెలపాల్సివచ్చింది. కాగా, తెలంగాణలో "ఆంధ్రప్రాంతీయ సంఘం'' ప్రత్యేకించి "ఆంధ్రప్రాంతీయ సంఘం''గా మాత్రమే వ్యవహరించబడుతూ వచ్చిందని చెప్పారు!




నాడు తెలుగువారికి తెలుగు స్కూళ్ళను పెట్టనివ్వక, తెలుగుబాషను "తెలంగీ-భేడంగీ'' అని తెలుగువారిని నిజాములు అవమాన పరిచారు. ఇందుకు మినహాయింపు, తెలుగు సాహితీపరులను, వారి రచనలను గౌరవించినవారు ఒక్క కుతుబ్ షాహీలు మాత్రమే, వారిలోనూ ఒక్క కులీ కుతుబ్ షాయే చివరిదాకా మన్ననలు పొందిన వాడు! ఈ పరిస్థితుల్ని వర్ణిస్తూ సురవరంవారు "బహు దీర్ఘకాలం నుండి మనం (తెలంగాణా ఆంధ్రులు) ఇతర రాష్ట్రీయ సోదరులకన్న వెనుకబడుటకు కారణము లేవో, అట్టి లోపములను రూపుమాపుకుని అగ్రస్థానం వహించడానికి కావలసిన సామాగ్రి గురించి విచారించాలి ... మనలో ఐకమత్యం లేదు. మనము జాతి, మత భేదములచే శాఖోపశాఖలుగా విభజింపబడి ఉన్నాం. లక్షకొలది bold సోదరులను మనము మనుష్యవర్గంలో లెక్కపెట్టక వారిని అంటరానివారిగా భావించి పశువులకన్నను, వృక్షములకన్నను, తుదకు ప్రాణంలేని (జడ) పదార్థములకన్నను హీనముగా భావించు చున్నాము'' bold end అని 1930 మార్చిలోనే నిజాం రాష్ట్ర ప్రథమాంధ్ర మహాసభకు అధ్యక్షత వహించుతూ స్పష్టం చేశారు!

 

1953కు ముందు, అంటే 1948లో హైదరాబాద్ సంస్థానం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాగిన రైతాంగసాయుధ పోరాటం వల్ల ప్రధానంగా విమోచన పొంది ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రం ఏర్పడేదాకా, స్వాతంత్ర్య సమరయోధుడు బూర్గుల రామకృష్ణారావు "హైదరాబాద్ స్టేట్'' ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాడు చెల్లాచెదురై ఉన్న తెలుగువారందరితో సమైక్యాంధ్ర రాష్ట్ర అవతరణకు హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ, ఆంధ్రరాష్ట్ర అసెంబ్లీ అనుకూలంగా తీర్మానాలు దోహదం చేశాయి. అత్యధిక సంఖ్యాకుల ఆమోదంతోనే హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ [120 మందిలో వందమందికి పైగా] ''విశాలాంధ్ర''కు అనుకూలత వ్యక్తం చేసింది! అదిగో, ఈ పూర్వరంగంలోనే, తెలంగాణా "ఆంధ్రమహాసభ''లోని మితవాదవర్గానికి నాయకులుగా ఉన్న కె.వి.రంగారెడ్డి, డాక్టర్ చెన్నారెడ్డి మైనారిటీ వర్గం ఆరోజునుంచి మొన్నమొన్నటిదాకా [ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో పదవులు అనుభవిస్తూనే]లోపాయిగారీగా తెలుగుజాతి ఐక్యతకు తూట్లు పొడుస్తూనే వచ్చారు!


 

వీరూ, కొత్తతరంలోని రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న 'దొర'లు, తిరిగి పాత జాగిర్దారీ, పటేల్, పట్వారీ వర్గాలు మాత్రమే "ప్రత్యేక తెలంగాణా'' రాష్ట్ర ఏర్పాటు ద్వారా మరొకసారి తెలంగాణా ప్రాంతంలోని బడుగు, బలహీన, బహుజన వర్గాలపై పెత్తనం చెలాయించడానికి ఉవ్విళ్ళూరుతున్నారు; అందుకోసమే తోటి తెలుగుప్రజలపైన అబద్ధాలాతో, బూతులతో స్వార్థపూరిత ఉద్యమాన్ని నిర్మించి, భ్రమలతో ప్రాంతీయ యువతను ఆత్మహత్యల వైపు నెట్టారు, నెడుతున్నారు. బెదిరింపులద్వారా తోటి తెలుగుప్రజలను ఉద్యోగులనూ భయభ్రాంతులకు గురిచేస్తూ వచ్చారు. అటు వైపున విడిపోకూడదనే వారూ కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తెలుగుజాతి విడిపోకూడదన్న వారిని శత్రువులుగా భావించి, ఉద్రిక్త వాతావరణాన్ని విభజనవాదులు సృష్టించారు; ఈ పరిణామం బెడిసిపోయి మరింత విషమ పరిణామాలకు దారితీయక ముందే సమైక్యతా ఉద్యమం బలంగా ముందుకు సాగుతూండడంతో అననుకూల పరిస్థితుల్లో "శాంతి'' మంత్రాన్ని ఉచ్చరించడంతో పాటు "హెచ్చరికల''కూ దిగుతున్నారు; ఇంతకుముందు తోటి ఆంధ్రులందరినీ మూకుమ్మడిగా "సీమాంధ్రులు తెలంగాణా నుంచి వెళ్ళిపోకపొతే చేతులు విరగ్గొడతాం, కాళ్ళు నరుకుతాం'' అనీ, "పులిమీద మనం ప్రయాణిస్తున్నాం దానిమీదనుంచి దిగినా, దిగకపోయినా సీమాంధ్రులు మనల్ని బతకనివ్వరు'' అన్న 'దొర' కెసిఆర్ అందించిన ఉన్మాదపూరిత నినాదాన్ని దారి తప్పిన కొందరు 'ప్రగతి'వాదులు కూడా అందిపుచ్చుకున్నారు!




కాగా, వారి తాజా 'నినాదం' ఇప్పుడు "మాకు సీమాంధ్ర పెట్టుబడిదారులు మాత్రమే శత్రువులుగాని, సీమాంధ్రప్రజలు మాత్రంకాద''ని బాణీ మార్చారు! ఆలస్యంగానైనా ఈ గుర్తింపు మంచిదే, నిస్పృహ నుంచి స్పృహలోకి వచ్చే ప్రయత్నం మెచ్చదగిందే. కాని "ప్రత్యేక తెలంగాణా''కు పచ్చజెండా వూపినట్టు కన్పించిన కాంగ్రెస్ అధిష్ఠానం అందుకు చేసిన 'తీర్మానం' మాత్రం కేవలం ఆ పార్టీ ఆవరణకే పరిమితమైంది! రెండు ప్రాంతాలలోనూ అభాసుపాలైన కాంగ్రెస్ హైదరాబాద్ కేంద్రంగా ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో రెండు ప్రాంతాల ప్రభుత్వాలను 'నిర్వహించడం'ద్వారా 2014 నాటి ఎన్నికలలోకి దూకి సరైన విజయావకాశాలను పెంచుకోవాలని "గుంట కాడ నక్క''లా వ్యవహరిస్తోంది! ఈలోగా వెలువడుతున్న "సర్వేలు'' మాత్రం "తెలంగాణా రాష్ట్రం'' ఏర్పడినా ఏర్పడకపోయినా కాంగ్రెస్ ఉభయ ప్రాంతాల్లోనూ ఉసురు నిల్పుకోలేదని జోస్యం పలకడం ఒక విశేషం! కనుకనే పనికిమాలిన "కమిటీల''తో, కెసిఆర్ తో మంతనాల ద్వారా కాలక్షేపం చేస్తోంది కాంగ్రెస్! ఈ రెండు శక్తులలో ఎవరు ఎవరిని ముంచబోతున్నారో ఇక ఎన్నికల "వెండితెర పైన'' చూసేలోపే రాష్ట్రాన్ని విభజించే ప్రక్రియ కాస్తా కాంగ్రెస్ చేతులు దాటిపోయి, సమైక్యాంధ్రే నిలబడగల అవకాశాలు పెరుగుతున్నాయి! చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకున్న పరిణామ దశలోకి కాంగ్రెస్ ప్రయాణిస్తోంది!