అమీర్ అసహనం రచ్చ..శివసేన చీఫ్ ను కొడితే 2లక్షలు

అమీర్ ఖాన్ అసహనం పై చేసిన వ్యాఖ్యలకు దేశ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అందరూ విమర్శిస్తున్న నేపథ్యంలో.. ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే శివసేన కూడా స్పందించి అమీర్ ఖాన్ ను విమర్శించింది. అయితే అందరూ నోటితో విమర్శిస్తుంటే.. శివసేన మాత్రం దానికి భిన్నంగా అమీర్ ఖాన్ ను చెంపదెబ్బ కొడితే  లక్షరూపాయలు ఇస్తామని.. అతనిని దేశ భక్తుడిగా కీర్తిస్తామని ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు శివసేన ఇచ్చిన ఆఫర్ కు రివర్స్ లో తమిళనాడుకు చెందిన తవ్ హీద్ జమాత్ సంస్థ ఇంకో ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే.. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ను చెంపదెబ్బ కొట్టినోళ్లకు రూ.2లక్షలు ఇస్తామని ఆ సంస్థ సహాయ కార్యదర్శి తవ్ బీక్ ప్రకటించారు. శివసేన చేస్తున్న ప్రకటనలకు తాము బెదిరిపోమని.. ధైర్యంగా ఎదుర్కొంటామని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికి అమీర్ ఖాన్ ఏ పరిస్థితిలో ఉండి ఆ వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ దీనిని అడ్డంపెట్టుకొని కొంతమంది ఇంకా రాద్దాంతం చేస్తున్నారనడానికి ఈ ఘటనలే నిదర్శనం.