Latest News
మహేష్ వివరణ: ‘ఆగడు’ టీజర్ని ఆపుతారా?
posted on: Jun 5, 2014 2:15PM
.jpg)
మహేష్బాబు కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆగడు’ సినిమా టీజర్ ఈమధ్య విడుదలైంది. విడుదలైన మొదటి నిమిషం నుంచే ఈ ట్రైలర్ సంచలనం సృష్టించింది. ఈ టీజర్లో మహేష్బాబు చెప్పిన డైలాగ్స్ పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి వున్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్కి కౌంటర్గా ‘ఆగడు’లో మహేష్ చెప్పిన డైలాగ్స్ వున్నాయి. 'ప్రతివోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపారిజన్స్..ఎలపనం వచ్చేస్తుంది' అంటూ 'ఆగడు'లో ప్రిన్స్ మహేష్ బాబు చెప్పిన డైలాగులపై పవర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాపై ఘాటుగా స్సందించారు. తమ హీరోపై సెటైర్లు వేస్తారా అంటూ నిష్టూరమాడారు. ఈ వివాదం, విమర్శలు బాగా పెరిగిపోతూ వుండటంతో మహేష్ బాబు వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఈ డైలాగులు చెప్పలేదని స్పష్టం చేశారు. అసలు ఎవరినీ ఉద్దేశించి ఈ డైలాగులు రాయలేదని చెప్పారు. పాత్ర స్వభావానికి అనుగుణంగా డైలాగులున్నాయని వివరించారు. అయితే మహేష్ వివరణ మీద కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి డైలాగ్స్ చెప్పలేదని అనడంతో సరిపోదని, ‘ఆగడు’ టీజర్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






