తిరుపతిలో సైకో వీరంగం.. ఒకరి మృతి

తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. అలిపిరి సమీపంలోని కపిలతీర్ధం రోడ్డులో ఒక సైకో వీరంగం కలకలం సృష్టించింది. చేతిలో కత్తి, కర్రతో ఆ సైకో  దారిన వచ్చీపోయేవారిపై ఇష్టారీతిగా దాడులకు పాల్పడింది.  సైకో దాడిలో కనీసం ముగ్గురు గాయపడ్డారు. ఒకరు మరణించారు. మృతుడిని శేఖర్ గా గుర్తించారు. ఇక కపిలతీర్థం పార్కింగ్ స్థలంలో పని చేసే సుబ్రహ్మణ్యం, అదే ప్రాంతంలో నివసించే కల్పనలకు కల్పన గాయపడ్డారు. గాయపడని వారిని రుయా ఆస్పత్రికి తరలించారు.   సైకో వీరంగంతో దాదాపు గంట సేపు ఆ ప్రాంతంలోని వారంతా భయాందోళనలతో వణికిపోయారు. చివరకు అతి కష్టం మీద స్థానికులు, పోలీసులు, మునిసిపల్ సిబ్బంది సైకోను వల వేసి పట్టుకున్నారు. అనంతరం ఆ సైకోనుదాదాపు గంటసేపు స్థానికులు, పోలీసులు, మున్సిపాలిటీ సిబ్బంది ప్రయాసలు పడి నిందితున్ని వలవేసి పట్టుకున్నారు. అనంతరం  ఆస్పత్రికి తరలించారు
తిరుపతిలో సైకో వీరంగం.. ఒకరి మృతి Publish Date: Jul 7, 2025 3:51PM

బ్రిక్స్ కూటమికి ట్రంప్ హెచ్చరిక.. దీటుగా స్పందించిన చైనా

డోనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాలు విధిస్తామంటూ హెచ్చరిక జారీ చేశారు. ఈ సారి ఆయన బిక్స్ దేశాలకు ఈ హెచ్చరిక చేశారు. అమెరికా విధానాలను వ్యతిరేకించే, లేదా అమెరికా వ్యతిరేక విధానాలు అవలంబించే  దేశాలపై పది శాతనం సుంకాలు పెంచుతాని ట్రంప్ హెచ్చరించారు. బ్రెజిల్‌లో బ్రిక్స్ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న సమయంలో ట్రంప్ ఈ హెచ్చరిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.  స్పెసిఫిక్ గా బ్రిక్స్ పేరు ఎత్తకుండానే ఆయన ఆ కూటమిని ఉద్దేశించే సుంకాల పెంపు వ్యాఖ్యలు చేశారు.  ఈ సదస్సులో భారత ప్రధాని మోడీ సహా సభ్య దేశాధినేతలందరూ అమెరికా సుంకాల విధానాన్ని ప్రస్తావించి విమర్శలు చేసిన నేపథ్యంలో ట్రంప్ ఎదురుదాడి అన్నట్లుగా అదనంగాపదిశాతం సుంకాల హెచ్చరిక జారీ చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇలా ఉండగా ట్రంప్ తాజా హెచ్చరికపై చైనా దీటుగా స్పందించింది.   తాము ఘర్షణను కోరుకోవడం లేదని పునరుద్ఘాటిస్తూను టాక్స్ వార్ లో ఎవరూ గెలవరని పరోక్షంగా ట్రంప్ ను హెచ్చరించింది.  గతంలో అమెరికా-చైనాల మధ్య తీవ్రమైన వాణిజ్య యుద్ధం నడిచినప్పటికీ, ఆ తర్వాత కుదిరిన ఒప్పందంతో అది తాత్కాలికంగా సద్దుమణిగిన సంగతి విదితమే.   బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో ప్రారంభమైన బ్రిక్స్ కూటమిలో  ఇప్పుడు  ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈలు కూడా సభ్య దేశాలుగా చేరాయి.
బ్రిక్స్ కూటమికి ట్రంప్ హెచ్చరిక.. దీటుగా స్పందించిన చైనా Publish Date: Jul 7, 2025 3:22PM

తోతాపురి మామిడి రైతుకు చంద్రబాబు అండ! రైతుల ఆనందం!

మామిడిరైతుల విషయంలో రాజకీయం చేద్దామనుకున్న వైసీసీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహర్ రెడ్డికి చంద్రబాబు చెక్ పెట్టారు. ప్రభుత్వ పరంగా మామిడి రైతుల సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమలోని మూడు జిల్లాలలో మామిడిరైతులు తోతాపురి రకం మామిడి పండించారు. ఈ రకం మామిడికి డిమాండ్ లేకపోవడంతో పంట అమ్ముడుపోయే పరిస్థితి లేక తీవ్రగా నష్టాలు మూటగట్టుకునే పరిస్థితి ఏర్పడింది.  ఈ నేపథ్యంలోనే ఈ నెల 9న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ బంగారుపాల్యం పర్యటనకు రానున్నారు. ఆయన యాత్ర ముఖ్య ఉద్దేశం మామిడియార్డ్ ను సందర్శించి, రైతులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం కోసం జగన్ బంగారుపాల్యం యాత్ర తలపోశారు. ఇందుకు  ఇప్పటికే పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చిత్తూరు మామిడి రైతులను అందుకోవడానికి పలు చర్యలు తీసుకున్నారు. అవి సత్ఫలితాలను ఇస్తున్నాయి కూడా. ఇప్పటికే చంద్రబాబు చొరవతో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తోతాపురి మామిడి రైతులకు మద్దతుగా ట్రేడర్లు నిలిచారు. అలాగే ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ముందుకు వచ్చాయి. దీంతో ఇప్పటికే ఆయా జిల్లాల్లో 3 లక్షల 8 వేల 261 మెట్రిక్ టన్నల తోతాపురి మామిడి కొనుగోలు జరిగింది.  సీఎం చంద్రబాబు  ఆదేశాల మేరకు ప్రాసెసింగ్ యూనిట్లు, పల్ప్ పరిశ్రమలు మామిడిని కొనుగోలు చేస్తున్నాయి.  అలాగే ర్యాంపులు, మండీల ద్వారా మరో 81 వేల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి ఇతర రాష్ట్రాలకు విక్రయించారు. ఇప్పటి వరకూ  మొత్తం 50,922 మంది రైతుల నుంచి  మామిడి కొనుగోళ్లు జరిగినట్టు అధికారులు ధృవీకరించారు. మూడు జిల్లా కలెక్టరేట్లలోనూ కమాండ్ కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు చేసి   రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఇటీవలే కుప్పంలో మామిడి రైతులు, పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులుతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి దిశా నిర్దేశం చేశారు. ఇక రైతులకు కేజీకి నాలుగు రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం ఇస్తోంది. ఇక ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రేడర్లు కేజీకి రూ.8 చెల్లించి మామిడి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంటే మొత్తంగా రైతులకు కేజీ మామిడికి రూ.12 ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.  ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో బంగారుపాల్యం పర్యటన ద్వారా జగన్ ఏ సాధిద్దా మనుకుం టున్నారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. 
తోతాపురి మామిడి రైతుకు చంద్రబాబు అండ! రైతుల ఆనందం! Publish Date: Jul 7, 2025 2:44PM

ఏజీపై తెలుగుదేశం లీగల్ సెల్ ఫిర్యాదు.. చంద్రబాబు, లోకేష్ కు ఇంటర్నల్ నోట్!

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం లీగల్ సెల్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్, సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు లక్ష్యంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంతి లోకేష్ కు అంతర్గత నోట్ రూపంలో పంపిన ఫిర్యాదు సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టన ఈ ఏడాది కాలంలో  ఏపీ హైకోర్టు, ట్రైబ్యునళ్లలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టోంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, స్టాండింగ్ కౌన్నిల్ నియామకాలు, పని తీరుపై పార్టీ లీగల్ సెల్ పలు అంశాలపై ఇంటర్నల్ నోట్ పంపింది. ప్రస్తుతం అధిఅధికార టీడీపీ లీగల్ సెల్ న్యాయ అధికారుల పనితీరు మరియు పనితీరుపై పంపిన 76 పేజీల అంతర్గతనోట్ లో పలు ఫిర్యాదులు చేసింది.  వాటిలో మాజీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డిపై  మైనింగ్ కేసులో ప్రభుత్వం తరపున వాదించడానికి  జూనియర్ న్యాయవాదిని నియమించి  ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి సీబీఐ కోర్టు విధించిన జైలు శిక్షను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేయడమే కాకుండా బెయిలు మంజూరు చేయడానికి దోహదం చేసిందని ఆరోపించింది.  అదే విధంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించిన కేసులో నిందితుల తరఫున పోసాని వెంకటేశ్వర్లు హాజరయ్యారనీ, ఆయన ప్రభుత్వ వాదనను పూర్వపక్షం చేస్తూ తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదని వాదించారీ టీడీపీ లీగల్ సెల్ ఆ ఇంటర్నల్ నోట్ లో పేర్కొంది.   ఇక పోతే గత జగన్ ప్రభుత్వ హయాంలో నియమితులైన ఏడుగురు అసిస్టెంట్ ప్రభుత్వ న్యాయవాదులు, అలాగే 23 మంది స్టాండింగ్ కౌన్సిల్లే ఇంకా అలాగే కొనాసగుతున్నారని పేర్కొంది.  అదే విధంగా రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి కొలువుదీరి ఏడాది కాలం పూర్తియిన తరువాత కూడా పది మంది ప్రభుత్వ న్యాయవాదు, 60 స్టాండింగ్ కౌన్సెల్ పోస్టులు ఇప్పటికీ భర్తీ కాకుండా ఖాళీగానే ఉన్నాయని పేర్కొంది.   అలాగే జగన్ హయాంలో తెలుగుదేశం తరఫున వాదించిన పలువురు న్యాయవాదులు సముచిత పదవుల కోసం ఎదురు చూస్తున్నా, ఖాళీల భర్తీ విషయంలో ఏజీ చొరవ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.   మొత్తం మీద ప్రభుత్వానికి ఏజీ లక్ష్యంగా తెలుగుదేశం లీగల్ సెల్ ఇంటర్నల్ నోట్ పంపడం సంచలనం సృష్టించింది. దీనిపై ప్రభుత్వం తీసుకునే చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
ఏజీపై తెలుగుదేశం లీగల్ సెల్ ఫిర్యాదు.. చంద్రబాబు, లోకేష్ కు ఇంటర్నల్ నోట్! Publish Date: Jul 7, 2025 2:24PM

టెస్టుల్లో శుభ్.. ఆరంభం!

ఎట్ట‌కేల‌కు భార‌త్ యువ‌సేన ఇంగ్లండ్ గ‌డ్డ మీద అదీ విజయమన్నదే ఎరుగని ఎడ్జ్ బాస్టెన్ వేదికలో టెస్టు గెలుపు బావుటా ఎగుర‌వేయ‌గ‌లిగింది. కార‌ణం.. ఒక‌టి శుభ్ మ‌న్ గిల్ బ్యాటింగ్, రెండు సిరాజ్- ఆకాష్ దీప్ జోడీ అద్భుత బౌలింగ్. మూడు ఫీల్డింగ్. ఈ మూడింటి ద్వారా గిల్ త‌న టెస్టు కెప్టెన్సీలో రికార్డు విజ‌యాన్ని న‌మోదు చేశాడు.  ఎడ్జ్ బాస్ట‌న్ అనే ఈ గ్రౌండ్ లో ఏ ఆసియా జ‌ట్టు కూడా ఇంత వ‌ర‌కూ గెల‌వ‌లేదు. 2022లోనూ ఇక్క‌డ టీమిండియా ఓట‌మి పాలైంది. ఒక ప‌క్క రివేంజ్ తీర్చుకుంటూ మ‌రొక ప‌క్క రిక‌ర్డు విజ‌యాన్ని క్రియేట్ చేసింది గిల్ నాయ‌క‌త్వంలోని భార‌త జ‌ట్టు. ఇక్క‌గ గ‌మ‌నించాల్సిన రెండు ముఖ్య‌మైన అంశాలేంటంటే.. ఒక‌టి రోహిత్, విరాట్ లాంటి హేమా హేమీ బ్యాట‌ర్లు లేక పోవ‌డం. రెండు బూమ్రా కూడా రెండో టెస్టుకు రెస్టు తీసుకోవ‌డం. మ‌రో ప‌క్క చూస్తే ఆదిలోనే హంస‌పాదులాగా.. తొలి టెస్టు ఓట‌మి మూట‌గ‌ట్టుకోవ‌డం. దీంతో గిల్ ఒక రోహిత్ మ‌రో  కోహ్లీని త‌న‌లో ఇముడ్చుకుని.. అమాంతం జ‌ట్టు బ్యాటింగ్ భార‌మంతా మోశాడు.. ఏకంగా ఒక ఇన్నింగ్స్ లో డ‌బుల్, మ‌రో ఇన్నింగ్స్ లో 150 ప్ల‌స్ ప‌రుగులు చేసి.. ప్రత్యర్థి ఇంగ్లాండ్ జ‌ట్టుకు 600 ప్ల‌స్ ప‌రుగుల ల‌క్ష్యం నిర్దేశించాడు. అంతేనా పలు రికార్డుల‌ను త‌న పేర లిఖించుకున్నాడు. గ్రాహం గూచ్ త‌ర్వాత ఒకే టెస్టులో అత్య‌ధిక ప‌రుగుల రికార్డును తిర‌గ‌రాశాడు. గ‌తంలో గ‌వాస్క‌ర్ చేసిన డ‌బుల్, సింగిల్ సెంచ‌రీ ఫీట్ కూడా రిపీట్  చేశాడు. ఇక మ‌రో ముఖ్య‌మైన విష‌యం సిరాజ్ తొలి ఇన్నింగ్స్ లో ఆరు, రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ సాధించ‌గా.. ఆకాష్ దీప్ తొలి ఇన్నింగ్స్ లో నాలుగు, రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్ల‌తో టెన్ వికెట్ హాల్ లో చేరాడు. ఈ ఇద్ద‌రు సీమ‌ర్లు ఏకంగా 17 వికెట్లు కొల్ల‌గొట్టారు.  ఈ కార‌ణాల చేత భార‌త్ త‌న రెండో టెస్టులో అపూర్వ విజ‌యం సాధించింది.  ఇప్పటి వరకూ విదేశాల్లో విజయం సాధించిన టీమ్ ఇండియా జట్లలో ఎడ్జ్ బాస్టన్ లో సాధించిన విజయమే పరుగుల పరంగా అతి భారీది. 
టెస్టుల్లో శుభ్.. ఆరంభం! Publish Date: Jul 7, 2025 12:54PM

అధ్య‌క్షుడు కాలేని మస్క్ పార్టీ పెట్టి ప్ర‌యోజ‌న‌మేంటి?

మ‌స్క్ పెట్టిన  పార్టీపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా  చ‌ర్చ న‌డుస్తోంది. ఎందుకంటే అమెరికాలో ఒక‌రు అధ్య‌క్షులు కావాలంటే..  అందుకు ఫ‌స్ట్ వారు  జ‌న్మ‌తహ అమెరికా పౌరులై ఉండాలి.  35 ఏళ్ల‌ పైబ‌డి వ‌య‌సుగ‌ల వారై ఉండాలి.  ఆపై 14 ఏళ్ల పాటు అమెరికాలోనే నివాసం ఉండి తీరాలి. వీటిలో ఏవీ మ‌స్క్ కి   లేవు. ఆయ‌న ద‌క్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో పుట్టారు. ఇది సౌతాఫ్రికా కార్య‌నిర్వాహ‌క రాజ‌ధాని. గ‌తంలో జ‌గ‌న్ త‌న  పాల‌న‌లో మూడు రాజ‌ధానుల పాల‌సీ తెచ్చిందే ఇక్క‌డి నుంచి కాపీ కొట్టే అన్నసంగతి తెలిసిందే. అది పక్కన పెడితే.. మస్క్ కి ఎక్కడా  అమెరిక‌న్ మూలాలు కూడా లేవు.   మూలాలు ఉంటే, అయినా వంశ‌పారంప‌ర్య వార‌స‌త్వ‌మైనా వ‌చ్చేది. అయితే అమెరికాలో పుట్ట‌కుండా అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వుల‌ను అలంక‌రించిన వారు లేరా? ఆ డీటైల్స్ ఏంటి? అని చూస్తే..  జాన్ మెక్ కెయిన్. ఇక్కడ ఆయన్ను సేఫ్ చేసిన ఎలిమెంట్ ఏంటంటే.. ఆయన స్వతహాగా అమెరికాలో పుట్టిన వారు కారు.  జాన్ మెక్‌కెయిన్ పనామా కెనాల్ జోన్‌ లో జన్మించారు.  1936 ఆగస్టు 29 న పనామా కెనాల్ జోన్‌లోని కోకో సోలో నావల్ ఎయిర్ స్టేషన్‌లో జన్మించారు, ఆయన తండ్రి నావికా అధికారి కావడంతో ఆయన ఆ ప్రాంతంలో జన్మించారు. ఆ సమయంలో అంటే 1903 నుంచి 1979 వరకూ పనామా కెనాల్ జోన్ యునైటెడ్ స్టేట్స్ ఆధీనంలో ఉండేది. తర్వాత ఈ ప్రాంతం అమెరికా నుంచి వేరు పడింది. అయితే ఆయన పుట్టిన సమయంలో అక్కడ అమెరికా పాలన ఉండటంతో.. ఆయన్ను అమెరికన్ గానే పరిగణించింది అమెరికా రాజ్యాంగం. దీంతో ఆయన 2008లో రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయగలిగారు.  అయితే కెనడాలో జన్మించిన ఏకైక అధ్యక్షుడిగా చెస్టర్ ఆర్థర్ గురించి చెబుతారు. అయితే ఈ విషయంలోనూ అవును, కాదూ అంటూ కొన్ని వివాదాలున్నాయి. దీంతో పాటు బ్రిటిష్ అమెరికా బార్న్ అధ్యక్షులు కొందరున్నారు. వారే వాషింగ్టన్, ఆడమ్స్, జెఫెర్సన్, మాడిసన్, మన్రో, క్విన్సీ ఆడమ్స్, జాక్సన్, విలియం హారిసన్‌. వీరు అమెరికాలో కాకుండా బ్రిటిష్ అమెరికాలో జన్మించారు. కానీ ఇదేమంత తప్పు కాదని అంటారు. ఎందుకంటే ఆ సమయంలో అమెరికాలోని ఎన్నో ప్రాంతాలు బ్రిటన్ అధీనంలో ఉండేవి. అమెరికాలో జన్మించిన తొలి అధ్యక్షుడెవరని చూస్తే..  మార్టిన్ వాన్ బ్యూరెన్. ఈయన 1782లో న్యూయార్క్‌లోని కిండర్‌హూక్‌లో జన్మించారు. యునైటెడ్ స్టేట్స్ స్వాతంత్యం పొందిన తర్వాత జన్మించిన తొట్ట తొలి అధ్యక్షుడు. ఈయన్ను ద ఫస్ట్ రియల్ అమెరికన్ ప్రెసిడెంట్ గా పరిగణిస్తారు.    వీట‌న్నిటిని బ‌ట్టీ చూస్తే ఎలాన్ మ‌స్క్ కి అంత తేలిగ్గా అమెరికా అధ్య‌క్షుడ‌య్యే అవ‌కాశం లేదు. మ‌రి ఇంత చేస్తే ఆ ఫ‌లితాన్ని ఎవ‌రు కొల్ల‌గొడ‌తారు? ఆ మాట‌కొస్తే ద అమెరికా పార్టీలో చేరేవారెవ‌రు? అన్న‌దొక చ‌ర్చ కాగా.. బిగ్ బ్యూటిఫుల్ బిల్ ని వ్య‌తిరేకించే వారు ఈయ‌న పార్టీలో చేరే ఛాన్సులైతే క‌నిపిస్తున్నాయి. అయితే ఆయ‌న ద‌గ్గ‌రున్న సంప‌ద ఎంత? దాన్ని పార్టీ నిర్మాణానికి ఎలా వాడుకోగ‌ల‌ర‌ని చూస్తే..  ఫోర్బ్స్ గ‌ణాంకాల ప్రకారం మ‌స్క్ ద‌గ్గ‌ర 40 వేల 520 కోట్ల డాల‌ర్ల సంప‌ద ఉంది. కొన్ని లెక్క‌ల ప్ర‌కారం ఆయ‌న 400 బిలియ‌న్ డాల‌ర్ల నిక‌ర నిల్వ‌ల‌కు య‌జ‌మాని. ఆయ‌న‌కు టెస్లా, స్పేసెక్స్ ద్వారా ఇంత సంపాద‌న స‌మ‌కూరింది. ఇందులోనూ టెస్లా ద్వారా 75 శాతం సంప‌ద జ‌మ‌కూడింది. ప్ర‌స్తుతం ట్రంప్ ప్ర‌వేశ పెట్టిన బిగ్ బ్యూటీఫుల్ బిల్   ఆయ‌న టెస్లా అమ్మ‌కాల‌ను దారుణంగా దెబ్బ తీస్తుంది. బేసిగ్గా టెస్లాల‌ను ట్రంప్ స‌ర్కార్ ఎందుకు వ‌ద్దంటుందంటే.. అదంతా ఎలక్ట్రిక్ వాహ‌నాల వ్య‌వ‌హారం. ఈవీలు ఎప్పుడైతే విరివిగా రోడ్డెక్కుతాయో.. అప్పుడు పెట్రోల్ డిమాండ్ త‌గ్గుతుంది. పెట్రోలుకు సంబంధించి భారీ ఎత్తున డాల‌ర్ల నిల్వ అమెరిక‌న్ ట్రెజ‌రీల్లో దాగి ఉంటుంది. పెట్రోల్ డిమాండ్ ఎప్పుడు ప‌డిపోతుందో ఈ డాల‌ర్ల నిల్వ‌లు కూడా అమాంతం క‌రిగిపోతాయి. కాబ‌ట్టి మ‌స్క్ టెస్లా ఈవీల‌ను వ‌ద్దంటారు ట్రంప్. ఇక్క‌డే ఈ ఇద్ద‌రికీ చెడింద‌ని చెబుతారు. దీంతో ట్రంప్ బిగ్ బిల్ పై సంత‌కం పెట్టిన వెంట‌నే పార్టీ అనౌన్స్ చేశారు మ‌స్క్. అయితే త‌న‌కున్న సంప‌ద‌లోని మొత్తం  పార్టీ కోసం ఖ‌ర్చు చేయ‌డానికి వీల్లేదు. కేవ‌లం నాలుగున్న‌ర  ల‌క్ష‌ల డాల‌ర్లను మాత్ర‌మే వాడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. మిగిలిన విరాళాల‌ను సూప‌ర్ పీఏసీల ద్వారా సేక‌రించాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఆయ‌న ఇక్క‌డి చ‌ట్టాల‌ను అనుస‌రించి   సేక‌రించాలి.  2026లో జ‌రిగే మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో హౌస్, సెనెట్ సీట్ల‌కు మ‌స్క్ త‌న‌ పార్టీ అభ్య‌ర్ధుల‌ను నిల‌బెట్టే అవ‌కాశాలు లేక పోలేదని అంటున్నారు.  అయితే మ‌స్క్ పార్టీ ద్వారా ఏం సాధించ‌నున్నారు? అని చూస్తే కొంద‌రు చెప్పే మాట ఏంటంటే ఒక‌ప్పుడు ట్రంప్ గెలుపున‌కు ఏకంగా ఆయ‌న ట్విట్ట‌ర్ ని కొనుగోలు చేశారు. త‌ద్వారా ట్రంప్ గెలుపు మార్గాన్ని సుగ‌మం చేశారు. అలాంటి మ‌స్క్.. ఇప్పుడు త‌న గ‌ళం తాను వినించుకోడానికి ఒక వేదిక కోసం చూస్తున్నారు. దాన్నే త‌యారు చేస్తున్నారు. దాని పేరే ది అమెరికా పార్టీ. ఇది ఒకే పాముకు రెండు త‌ల‌లాంటి డెమొక్రాట్, రిప‌బ్లిక‌న్ల‌కు ప్ర‌త్యామ్న‌యంగా తన పార్టీ ఉంటుందని ఆయ‌న చెబుతున్నారు. మ‌రి  చూడాలి.. అధ్య‌క్షుడ‌య్యే అవ‌కాశ‌మే లేని మ‌స్క్ ఈ పార్టీ ద్వారా అమెరికా రాజ‌కీయాల‌ను ఎలా ప్రభావితం చేస్తారో?   అయితే కార్లు, రాకెట్ల‌లో ఏ విధ‌మైన విప్ల‌వాత్మ‌క మార్పు తెచ్చారో.. మ‌స్క్ గానీ రాజ‌కీయాల్లోకి వ‌స్తే.. ఇప్ప‌టికే రెండుగా చీలిన అమెరికా స‌మాజాన్ని ఎలా మ‌లుపు తిప్పుతారో చూడాలంటారు కొంద‌రు ఆశావాదులు.  బేసిగ్గా తాను అమెరికాకు కార్లు, రాకెట్లు త‌యారు చేయ‌డానికి వ‌చ్చాన‌నీ.. తాను ఆఫ్రిక‌న్ కాబ‌ట్టి ఇక్క‌డ అధ్య‌క్షుడు కాలేన‌ని ఆయ‌న గ‌తంలోనే అన్నారు. ట్రంప్ పాల‌న‌లో తాను కూడా ప‌ని చేసి ఆయ‌న‌కు స‌హ‌క‌రిస్తాన‌ని అన్నారు. కానీ బిగ్ బ్యూటిఫుల్ బిల్ కార‌ణంగా ఇద్ద‌రికీ చెప్ప‌న‌ల‌వి కానంత గొడ‌వ‌లు చెల‌రేగ‌డంతో.. ఇదిగో ఇలా  కొత్త పార్టీ పెట్టేశారు. త‌ర్వాత  ఏంట‌న్న‌దాని కోసం వెయిట్ అండ్ సీ.
అధ్య‌క్షుడు కాలేని మస్క్ పార్టీ పెట్టి ప్ర‌యోజ‌న‌మేంటి? Publish Date: Jul 7, 2025 12:36PM

అధిష్టానం ఆశలన్నీ తెలంగాణ పైనే!

తెలంగాణలో మరో రెండున్నర మూడు నెలల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన పార్టీలు  సిద్దమవుతున్నాయి. ముఖ్యంగా, తెలంగాణను రోల్ మోడల్ గా చూపించి జాతీయ స్థాయిలో పునర్జీవనం పొందేందుకు ప్రయత్నిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ..  స్థానిక సంస్థల ఎన్నికలను, జాతీయ ధృక్కోణంతో చూస్తోంది. అందుకే.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్వయంగా రంగంలోకి దిగారు. సామాజిక న్యాయ సదస్సు పేరిట జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.   ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని టార్గెట్  చేస్తూ ఘాటైన  విమర్శలు చేశారు.  అలాగే..  పార్టీలో అసమ్మతి మొదలు పదవుల భర్తీ వరకు అనేక విషయాలను సమీక్షించి రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేశారు.ఈ మొత్తం కసరత్తును చూస్తే..  స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం ఎంత ప్రాధాన్యత ఇస్తోందో అర్థమవుతుందని పరిశీలకులు అంటున్నారు. అలాగే, ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తోందో కూడా వేరే చెప్పనవసరం లేదంటున్నారు. ఆ విషయం కూడా కేసీ వేణుగోపాల్  స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణను రోల్  మోడల్ గా భావిస్తోందని స్పష్టంగానే చెప్పారు. నిజానికి ఇప్పుడు వేణుగోపాల్ చెప్పడం కాదు..  ఎప్పుడోనే  పార్టీ కీలక నాయకుడు రాహుల్ గాంధీ కులగణన విషయంగా  తెలంగాణ మోడల్   ది బెస్ట్  అని ప్రకటించారు.  అంతే కాకుండా..  జాతీయ స్థాయిలో జనగణనతో పాటుగా చేపట్టే కులగణనకు తెలంగాణ మోడల్ ఫాలో కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే..  తాజాగా సామాజిక న్యాయ సదస్సు వేదిక నుంచి చేసిన ప్రసంగంలో పార్టీ అధ్యక్షుడు ఖర్గే.. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా కులగణన చేయించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని కితాబు నిచ్చారు. అంతే కాదు.. జనాభా దామాషా  ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు దక్కే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందనీ,  ఈ పోరాటంలో రాష్ట్ర ప్రజలు కూడా తమకు మద్దతు ఇవ్వాలని పిలుపు నిచ్చారు.  సో...కాంగ్రెస్ అధిష్టానం కులగణనకు ఎంత ప్రాధాన్యత ఇస్తోందో..  తెలంగాణ స్థానిక ఎన్నికలకూ  అంతే ప్రాధన్యత ఇస్తోందని, అంత సీరియస్ గా తీసుకుంటోందని అంటున్నారు. అందుకే.. కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన విధంగా 42 శాతం బీసీ రిజర్వేషన్  అమలు చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని భావిస్తోందని అంటున్నారు. అయితే, నిర్ణయం కేంద్రం కోర్టులో ఉన్నదున.. ప్రస్తుత పరిస్థితిలో అది సాధ్యం కాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు అంటున్నారు.అయినా.. అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం   కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం  కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేసేందుకు గల ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించేందుకు  న్యాయనిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.  అయితే.. ఒక్క బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్ వాగ్దానంతోనే కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తుందా? లేక అమలు కాని  హామీలు, గ్యారెంటీలు, రైతులు, నిరుద్యోగ యువకులు, మహిళలు ఇలా విభిన్న వర్గాల ప్రజల్లో క్షణ క్షణం పెరుగుతున్న అసంతృప్తి, పార్టీలో పెరుగుతున్న అసమ్మతి వంటి ప్రతికూల అంశాలు కూడా స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయా అనేది చూడవలసి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం హోప్స్ అన్నీ తెలంగాణ పైనే పెట్టుకుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.
అధిష్టానం ఆశలన్నీ తెలంగాణ  పైనే! Publish Date: Jul 7, 2025 10:52AM

వంద మందికి పైగా వైసీపీ నేతలపై కేసులు.. కారణమేంటో తెలుసా?

అధికారంలో ఉండగా ఇష్టారీతిగా చెలరేగిపోయినా చెల్లినట్లు, అధికారం కోల్పోయిన తరువాత కూడా చెలరేగిపోతామంటే కుదరదన్న విషయం ఇప్పుడు వైసీపీ నాయకులు, క్యాడర్ కు ఇప్పుడు బాగా తెలిసివస్తోంది. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి లెక్క చేసే పనే లేదంటూ ఇంత కాలం చెలరేగిపోయిన వైసీపీ నాయకులు, క్యాడర్ ఇప్పుడు ఉలిక్కిపడుతున్నారు. ఏక కాలంలో వంద మందికి పైగా వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. నోటీసులు కూడా అందాయి. దీంతో ఏం చేయాలో తెలియకు వైసీపీ ఉక్కిరిబిక్కిరైపోతోంది. ఇంతకీ అసలు ఒకే సారి ఇంత మందిపై కేసులు, నోటీసుల వెనుక కారణమేంటంటే.. జగన్ ఇటీవల చేసిన రెంటపాళ్ల యాత్ర. జగన్ రెండపాళ్ల పర్యటన విషయంలో పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్ ర్యాలీలో పాల్గొనే వారి సంఖ్యపైనా, జగన్ ర్యాలీలో ఉండాల్సిన కార్ల సంఖ్యపైనా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే వైసీపీ ఆ ఆంక్షలు, ఆదేశాలను తుంగలో తొక్కి ఇష్టారీతిగా వేల మందితో, వందల కార్లతో ర్యాలీ నిర్వహించింది. ఆ సందర్భంగా జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పడి సంగయ్య అనే వైసీపీ కార్యకర్త మరణించాడు. దీనిపై పోలీసులు వైసీపీ నియోజకవర్గాల ఇన్ చార్జ్ లకు, పలువురు కీలక నేతలకు నోటీసలుు పంపి, వారిపై కేసులు నమోదు చేశారు. జగన్ వాహనం కింద పడి సింగయ్య మరణించిన కేసు నడుస్తోంది. ఈ కేసులో జగన్ ఏ2గా ఉన్నారు. ఇప్పుడు దానికి అదనంగా పోలీసుల అనుమతి లేకున్నా ర్యాలీ నిర్వహించడం, డీజే ఉపయోగించడం, అలాగే ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడం, పోలీసు విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలతో మాజీ మంత్రులు విడదల రజనీ, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, దేవినేని అవినాష్, నంబూరు శంకరరావు, బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శ్రవన్ సహా మొత్తం 113 మందిపై కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు.  ఈ పరిణామంతో వైసీపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పైకి బింకంగా కోర్టులో తేల్చుకుంటామంటూ చెబుతున్నా.. క్యాడర్ లో మాత్రం తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని పార్టీ వర్గాలు వర్రీ అవుతున్నాయి. ఇక పార్టీ కార్యక్రమాలకు కార్యకర్తల హాజరు అంతంత మాత్రంగానే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 
వంద మందికి పైగా వైసీపీ నేతలపై కేసులు.. కారణమేంటో తెలుసా? Publish Date: Jul 7, 2025 10:36AM

మెడికల్ స్కాం కింగ్ పిన్ సజ్జల సన్నిహితుడు?

దేశంలో ఏ మూల ఏ స్కాం జరిగినా అందులో వైసీపీ నేతలు కచ్చితంగా ఉంటారు. గంజాయి స్మగ్లింగ్, డ్రగ్స్ అక్రమ రవాణా ఇలా ఏ నేరం జరిగినా.. అందులో వైసీపీ నేతల ప్రమేయం ఉందని దర్యాప్తు సంస్థలు తేలుస్తున్నాయి. అంతేనా కబ్జాలు, దౌర్జన్యాలు, హత్యల కేసులలో కూడా వైసీపీ నేతలపై కేసులు నమోదౌతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో వైసీపీలో ఉండేందుకు నేరాలు చేయడం ఒక అర్హత అని నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. అది పక్కన పెడితే తాజాగా తాజాగా మెడికల్ కాలేజీల్లో తనిఖీలు చేసే వారికి లంచాలు ఆఫర్ చేసి క్లీన్ సర్టిఫికెట్లు ఇప్పించే బృందం ఇటీవల సీబీఐకి పట్టుబడింది. ఆ నేర బృందంలోనూ ఓ వైసీపీ నేత పాత్ర కీలకంగా ఉంది. అంతే కాదు.. సదరు వ్యక్తి వైసీపీలో దాదాపు నంబర్ 2గా వెలిగిపోతున్న ఆ పార్టీ సీనియర్, కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డికి సన్నిహితుడనీ చెబుతున్నారు.  దేశవ్యాప్తంగా పలు మెడికల్ కాలేజీల ఇన్ స్పెక్షన్లలో ముడుపుల దందా చ చేసిన కేసులో సీబీఐ 34 మందిపై కేసు నమోదు చేసింది.  ఈ కేసులో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు, జాతీయ మెడికల్ కమిషన్ తనిఖీ బృందం డాక్టర్లు, పలు ప్రైవేటు మెడికల్ కాలేజీల ప్రతినిథులు ఉన్నారు.  ఈ కేసులో ముడుపులకు మధ్యవర్తిగా వ్యవహరించినది వైసీపీ నేత డాక్టర్ బత్తల హరిప్రసాద్ అని సీబీఐ పేర్కొంది. కదిరి సమీపంలోని ఆయన నివాసంలో ఇటీవల సీబీఐ సోదాలు కూడా నిర్వహించింది.   ఇంతకీ ఆయన మధ్యవర్తిత్వం ఏమిటయ్యా అంటే.. మెడికల్‌ కాలేజీల్లో వసతులు లేకపోయినా, తగినంతమంది బోధనా సిబ్బంది లేకపోయినా.. నేషనల్ మెడికల్ కౌన్సిల్ తనిఖీ బృందాలకు ముడుపులు ముట్టచెప్పి క్లీన్ సర్టిఫికెట్, అనుమతులు ఇప్పించడం.  చెన్నైలో స్థిరపడిన ఈయన  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని మెడికల్‌ కాలేజీల తనిఖీలకు వచ్చిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రతినిథులకు ఆయా కాలేజీలకు మధ్యవర్తిత్వం నెరపి ముడుపుల దందా సాగించారు. దీంతో వందల కోట్ల రూపాయల ఆస్తులనూ పోగేశారు. ఈ బత్తల హరిప్రసాద్ వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. గత ఎన్నికలలో కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు టికెట్ కోసం విశ్వ ప్రయత్నం చేశారు.  అయితే టికెట్ దక్కలేదనుకోండి అది వేరు సంగతి. ఇప్పుడా బత్తల హరిప్రసాద్  మెడికల్ కాలేజీల ముడుపుల యవ్వారంలో సీబీఐ నజర్ లో ఉన్నారు. 
 మెడికల్ స్కాం కింగ్ పిన్ సజ్జల సన్నిహితుడు? Publish Date: Jul 7, 2025 10:03AM

పెరిగే ఆడపిల్లలకు ఈ 5 విషయాలు తప్పక నేర్పించాలి.. వారి జీవితాన్నే మార్చేస్తాయివి..!

  పిల్లలు పెరిగేకొద్దీ వారి అవసరాలు, ఆలోచనలు,  అవగాహన కూడా మారుతూ ఉంటాయి. దీనికి తగినట్టు  తల్లిదండ్రులు కూడా తమ పెంపకం విధానాన్ని తదనుగుణంగా మార్చుకోవాలి. ఎందుకంటే ప్రతి వయస్సులోనూ తమ పిల్లలకు సరైన విషయాలను నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత. ఇది ఈరోజు మాత్రమే కాకుండా భవిష్యత్తులో కూడా పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలు  టీనేజ్‌లోకి ప్రవేశించినప్పుడు వారికి కొన్ని ముఖ్యమైన విషయాలను నేర్పించడం చాలా ముఖ్యం. ఇవి వారి జీవితాంతం వారికి ఉపయోగపడే విషయాలు. కాబట్టి పెరుగుతున్న ఆడపిల్లలు ఉంటే  తప్పనిసరిగా తల్లిదండ్రులు 5 విషయాలను నేర్పించాలని అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే.. నో చెప్పడం.. తల్లిదండ్రులు 12 నుండి 15 సంవత్సరాల వయస్సు ఆడపిల్లలకు  ఏదైనా తమకు నచ్చని,  తమకు నష్టం కలిగించే  విషయానికి మొహమాటం లేకుండా 'కాదు' అని చెప్పడం నేర్పించాలని పిల్లల పెంపకం నిపుణులు అంటున్నారు.  ఎందుకంటే ప్రతి పరిస్థితిలోనూ 'అవును' అని చెప్పాల్సిన అవసరం లేదు. అది పిల్లలకు ఒక్కోసారి చాలా నష్టం కలిగించే అవకాశం ఉండవచ్చు.  కాబట్టి తల్లిదండ్రులు దీన్ని గుర్తుంచుకోవాలి. సెల్ఫ్ సపోర్ట్.. ఆడపిల్లలు తమను తాము ఎలా సమర్థించుకోవాలో కూడా వారికి నేర్పించాలి.  ఏ విషయంలో అయినా వారు తమ అభిప్రాయాలను ముందుకు తీసుకురావాలి.  ఏదైనా తప్పు జరిగితే  తప్పుకు వ్యతిరేకంగా తమ స్వరాన్ని పెంచాలి. అలాగే ఎప్పుడైనా తాము చెయ్యని తప్పుకు వారిని దోషులను చేయాలని అనుకున్నప్పుడు తమ తప్పు లేదని చెప్పడంలో వారు తమ స్వరాన్ని వినిపించడాన్ని,  తప్పొప్పులను వివరించే సామర్థ్యాన్ని కూడా వారికి నేర్పించాలి.  అది అమ్మాయిలను ధైర్యంగా ఉంచుతుంది. నమ్మకం.. ఎదుటివారు నమ్మకం ఉంచితేనే తాము సరైన వారు అనుకునే వారు చాలామంది ఉంటారు.  ఇందులో ముఖ్యంగా ఆడపిల్లలకు ఎక్కువగా ఉంటారు.  ఏ పని చేసినా ఆడపిల్లలను సులువుగా నిందించే వారు ఉంటారు.   ఎవరూ తమను నమ్మకపోయినా, వారు ఎప్పుడూ తమపై తాము నమ్మకాన్ని కోల్పోకూడదని కూతుళ్లకు చెప్పాలి . ఆత్మవిశ్వాసమే ఆడపిల్లలకు  నిజమైన బలం, అదే వారి సూపర్ పవర్. ఆడపిల్లలకు ఎదురయ్యే ప్రతి కష్టాన్ని అధిగమించడంలో వారి ఆత్మవిశ్వాసం ఎంతగానో సహాయపడుతుంది. సెల్ఫ్ ప్రొటెక్షన్..  ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు ఇవ్వాల్సిన   మొదటి ప్రాధాన్యత భద్రత.  ప్రతి ఆడపిల్ల ఇతరులతో సంబంధం లేకుండా మొదటగా తనను తాను రక్షించుకోవడం ఎలాగో నేర్చుకోవాలి.  ప్రతికూల పరిస్థితుల్లో తనను తాను ఎలా సురక్షితంగా ఉంచుకోవచ్చో నేర్పించాలి.  నేటి సమాజానికి ఇది ఎంతో అవసరం. సెల్ఫ్ లవ్.. ఆడపిల్లలకు సెల్ఫ్ లవ్ గురించి నేర్పించాలి.  ఒక దశ తర్వాత ఆడపిల్లలు తమ శరీరాన్ని కూడా పట్టించుకోకుండా కుటుంబ ఒత్తిడులలో,  కుటుంబ బాధ్యతలలో మునిగిపోతారు.  అలాంటి వారికి జీవితంలో తొందరగా విరక్తి వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే తన గురించి తాను కూడా ఆలోచించుకోవాలి.  తనను తాను ప్రేమించుకోవాలి.  తన డ్రెస్సింగ్ స్టైల్,  తన ఆరోగ్యం, తను తీసుకునే ఆహారం, తన ఇష్టాలు, అభిరుచులు.. ఇట్లా అన్ని విషయాలలో ఆడపిల్లలు అవగాహన కలిగి ఉండాలి.  ఇవన్నీ ఆడపిల్లను ఒక శక్తిగా మారుస్తాయి.                               *రూపశ్రీ.
పెరిగే ఆడపిల్లలకు ఈ 5 విషయాలు తప్పక నేర్పించాలి.. వారి జీవితాన్నే మార్చేస్తాయివి..! Publish Date: Jul 7, 2025 9:30AM

వర్షాకాలంలో ఈ 5 కూరగాయలు కొనకపోవడమే మంచిది..!

  సీజన్ ను బట్టి ఆహారపు అలవాట్లు మార్చుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా సీజన్ తో పాటు కొన్ని రకాల కూరగాయలను కొత్తగా జత చేసుకోవడం లేదా కొన్ని తినకుండా వదిలిపెట్టడం వంటివి చేస్తారు.  అదే విధంగా వర్షాకాలంలో  5 రకాల కూరగాయలు తినడం మంచిది కాదని, సాధ్యమైతే వీటిని ఈ వర్షాకాలంలో పూర్తీగా వదిలిపెట్టడం మంచిదని అంటున్నారు వైద్యులు,  ఆహార నిపుణులు. ఇంతకీ వర్షాకాలంలో వదిలిపెట్టాల్సిన కూరగాయలు ఏమిటి? వాటిని ఎందుకు వదిలిపెట్టాలి? తెలుసుకుంటే.. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. చాలామంది క్యాబేజీ తినడం తగ్గిస్తారు. దాని నుండి వచ్చే పురుగులు చాలా ప్రమాదకరమైనవిగా భావిస్తారు. కానీ క్యాబేజీ మాత్రమే కాకుండా పురుగులు ఉన్న కూరగాయలు చాలా ఉన్నాయి.  అవి శుభ్రం చేసిన తర్వాత కూడా అందులో పురుగులు  పూర్తిగా బయటకు రావు.  అందుకే వర్షాకాలంలో  కొన్ని కూరగాయలు అస్సలు తినకూడదని అంటారు. ఆకుకూరలు.. పాలకూర, మెంతికూ,  ఆవాల చెట్టు ఆకులు  .. ఇలా చాలా రకాల ఆకుకూరలు వర్షాకాలంలో తినకపోవడమే మంచిది.   వాటిని ఎంత బాగా కడిగినా కొన్ని కంటికి కనిపించనంత సన్నని పురుగులు, సూక్ష్మజీవులు అలాగే ఉంటాయి. క్యాబేజీ,  క్యాలిఫ్లవర్.. క్యాబేజీ,  కాలీఫ్లవర్ లలో పొరలు, పువ్వులు ఉంటాయి.  ఈ పొరల మధ్య తేమ, బ్యాక్టీరియా,  ఫంగస్ సులభంగా పెరుగుతాయి. వీటిని తినకపోవడమే మంచిది.  ఒకవేళ వీటిని తినాలని అనుకుంటే గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి ఆ నీటిలో వీటిని బాగా కడగాలి. పుట్టగొడుగు.. వర్షాకాలంలో సూర్యకాంతి తక్కువగా ఉంటుంది.  ఈ కారణంగా చాలామంది విటమిన్-డి కోసం అయినా పుట్టగొడుగులను తినాలని అనుకుంటారు. పైగా వర్షాల కారణంగా పుట్టగొడుగులు కూడా బాగా పండుతాయి.  కానీ పుట్టగొడుగులు ఎంత ఆరోగ్యమూ.. వీటిని  సరిగ్గా శుభ్రం చేయకపోతే లేదా కొద్దిగా కలుషితమైనా చాలా చెడ్డ చేస్తుంది. పుట్టగొడుగులు  ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని పెంచుతాయి. బంగాళదుంపలు.. ఆహార నిపుణుల ప్రకారం వర్షాకాలంలో బంగాళాదుంపలు తినకపోవడం మంచిది.  ఎందుకంటే బంగాళదుంపలు  త్వరగా మొలకెత్తుతాయి. కాబట్టి బంగాళాదుంపలను ఇలా తినకూడదు. అయితే, సరిగ్గా నిల్వ చేస్తే బంగాళాదుంపలు త్వరగా మొలకెత్తవు . వీటిని అయితే తినవచ్చు. జాగ్రత్త.. వర్షాకాలంలో కూరగాయలు అయినా ఆకుకూరలు అయినా చాలా తాజాగా ఉండాలి.  తాజాగా ఉన్నా సరే.. వీటిని వేడి నీటిలో ఉప్పు వేసి బాగా శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే వండుకోవాలి. లేకపోతే వీటిలో ఆరోగ్యానికి హాని కలిగించే పురుగులు, రసాయనాలు, సూక్ష్మక్రిములు ఉంటాయి.                                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
వర్షాకాలంలో ఈ 5 కూరగాయలు కొనకపోవడమే మంచిది..! Publish Date: Jul 7, 2025 9:30AM

కేరళలో నిఫావైరస్ డేంజర్ బెల్స్.. క్వారంటైన్ లు, మాస్కులు మస్ట్!

కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతోంది. వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలలో కరోనా నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్వారంటైన్ జోన్లు, మాస్కులు అనివార్యం అయ్యాయి. నిఫా వైరస్ విజృంభణతో కేరళ గజగజలాడుతోంది. మలప్పురం జిల్లా  చెట్టియారంగడిలో నిపా వైరస్ కారణంగా  18 ఏళ్ల బాలిక మరణించింది.   నిపా కాంటాక్ట్ అనుమానితుల జాబితాలో 345 మంది ఉన్నారని కేరళ ఆరోగ్య శాఖ ప్రకటించింది. మలప్పురం పాలక్కాడ్  కోజికోడ్ లలో హై అలర్ట్ ప్రకటించారు.   పాలక్కాడ్ అయితే నిఫా వైరస్ వ్యాప్తి డేంజర్ బెల్స్ మోగిస్తోంది.  నిపా వైరస్ సోకిన వ్యక్తి కాంటాక్ట్ అయిన 58 మందిని గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. వ్యాధి సోకిన వ్యక్తి ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో వార్డులను జిల్లా కలెక్టర్ కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.  ఈ ప్రాంతాల్లో కఠినమైన ఆంక్షలు విధించారు. బహిరంగ సభలను నిషేధించారు.   మెడికల్ స్టోర్స్ మినహ, దుకాణాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల  వరకూ మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యా సంస్తలకు సెలవు ప్రకటించారు. కంటైన్ మెంట్ జోన్ లలోకి బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధించారు.  
కేరళలో నిఫావైరస్ డేంజర్ బెల్స్.. క్వారంటైన్ లు, మాస్కులు మస్ట్!  Publish Date: Jul 7, 2025 6:12AM

ఎడ్జ్ బాస్టన్ లో ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన గిల్ సేన

ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమ్ ఇండియా అద్భుత విజయాన్ని సాధించింది. స్కిప్పర్ శుభమన్ గిల్ ముందుండి జట్టును విజయం దిశగా నడిపించారు. ఈ విజయంతో సిరీస్ ను భారత్ 1-1తో సమం చేసింది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో  భార‌త్ బ్యాటింగ్, బౌలింగ్ లో ఇంగ్లాండ్ ను ఔట్ ప్లే చేసి 336 పరుగుల ఆధిక్యతతో అద్భుత విజయాన్ని చేజిక్కించుకుంది. తొలుత టీమ్ ఇండియా బ్యాటర్లు.. ఆ తరువాత బౌలర్లు అద్బుత ప్రదర్శన చేశారు. శుభమన్ గిల్ టీమ్ ఇండియా టెస్టు జట్ట పగ్గాలు చేపట్టిన తరువాత ఇదే తోలి విజయం. అలాగే ఎడ్జ్ బాస్టన్ లో టీమ్ ఇండియా విజయాన్ని అందుకోవడం కూడా ఇదే తొలిసారి.   కెప్టెన్ గిల్ అద్భుత బ్యాటింగ్ కారణంగా రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ కు టీమ్ ఇండియా భారీ లక్ష్యన్ని నిర్దేశించింది. ఆకాశ్ దీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆరుగురు ఇంగ్లాండ్ బ్యాటర్లను ఔట్ చేయడంతో   608 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్  కేవలం 271 పరుగులకే ఆలౌటై భారీ తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది.   తొలి ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా 587 పరుగుల భరీ స్కోరు సాధించింది. స్కిప్పర్ శుభమన్ గిల్ డబుల్ సెంచరీతో రాణించారు. ఇక యశస్వి జైస్వాల్ 87 పరుగులు, రవీంద్ర జడేజా 89 పరుగులు చేశారు. ఇక ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 407 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ 158, జేమ్ స్మిత్ 184 నాటౌట్ సెంచరీలతో  మెరిశారు. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 6 వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లోనూ స్కిప్పర్ శుభమన్ గిల్ 161 పరుగులతో భారీ సెంచరీ చేశాడు. అతడికి రిషభ్ పంత్ 65, జడేజా 69 సహకారం అందించారు. దీంతో భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఏ దశలోనూ లక్ష్య సాధనకు ప్రయత్నించలేదు. డ్రా కోసం బజ్ బాల్ రిథమ్ లోకి వెళ్లకుండా ఢిఫెన్స్ ఆడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు 271 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 336 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.  ఎడ్జ్ బాస్టన్ లో టీమ్ ఇండియా గొప్ప విజయం సాధించిందంటూ  టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ కింగ్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమ్ ఇండియా గెలుపుపై సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో స్పందిచిన కోహ్లీ..   శుభ్‌మన్ గిల్ అద్భుత బ్యాటింగ్, కెప్టెన్సీ స్కిల్స్ పై పొగడ్తల వర్షం కురిపించాడు. ఎడ్జ్ బాస్టన్ లోని ఫ్లాట్ పిచ్ పై సిరాజ్, ఆకాశ్ దీప్ లు చేసిన బౌలింగ్ ప్రదర్శన గొప్పగా ఉందని పేర్కొన్నారు.  మరో మాజీ కెప్టెన్ గంగూలీ కూడా శుభమన్ గిల్ సేన విజయంపై స్పందించాడు.  శుభ్‌మన్ గిల్ అండ్‌ టీమ్‌ బ్యాట్‌తో, బాల్‌తో అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఆకాష్ దీప్, సిరాజ్ అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.బుమ్రా లేని లోటు కనబడనీయలేదని పేర్కొన్నాడు. అలాగే గిల్ బాధ్యతతో చాలా అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. 
ఎడ్జ్ బాస్టన్ లో ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన గిల్ సేన Publish Date: Jul 7, 2025 6:03AM

ఆ రెండు రోజులూ శ్రీవారి బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల లో ఈ నెల 15, 16 తేదీలలో శ్రీవారి బ్రేక్ దర్శనాలు ఉండవు. ఆ రెండు రోజులూ శ్రీవారి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది.  జులై 16న శ్రీవారి ఇలయంలో ఆణివారం ఆస్థానం నిర్వహించనున్నట్లు పేర్కొన్న టీటీడీ.. అంతకు ముందు రోజు అంటే జులై 15న కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ కారణంగా ఆ రెండు రోజులూ శ్రీవారి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. అదే విధంగా జులై 14న కూడా ప్రొటోకాల్ వినా.. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలను స్వీకరించబోమని స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల పర్యటనను ప్లాన్ చేసుకోవాలని కోరింది.   
ఆ రెండు రోజులూ శ్రీవారి బ్రేక్ దర్శనాలు రద్దు Publish Date: Jul 7, 2025 5:27AM

ప్లంజ్ పూల్ వల్ల శ్రీశైలం జలాశయానికి నో ప్రాబ్లం.. కన్నయ్యనాయుడు

రిటైర్డ్ ఇంజినీర్, ప్రాజెక్టుల గేట్లు నిపుణుడు నాగినేని కన్నయ్య నాయుడు శ్రీశైలం జలాశయాన్ని  పరిశీలించారు.    జలాశయం అధికారులతో కలిసి జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్ల పరిస్థితిని పరిశీలించిన కన్నయ్యనాయుడు   శ్రీశైలం జలాశయం 10వ నంబర్ గేట్ల ద్వారా వచ్చే  నీటి లీకేజీ వల్ల ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.  10 వ గేటు నుంచి నీటి లీకేజీ 10 శాతం కంటే తక్కువగానే ఉందన్నారు.  శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేయాలని అధికారులకు సూచించారు.  2010 తర్వాత గేట్లను పెయింటింగ్ వేయలేదని, అలానే జలాశయం ప్రారంభమై 40 సంవత్సరాలు అవుంతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం మెయింటెనెన్స్ బాగుందని, ఇదే విధంగా మెయిన్ టెయిన్ చేస్తే..   మరో రెండు దశాబ్దాల వరకూ శ్రీశైలం జలాశయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు.  వీలైతే  ఐదేళ్లలో శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్ల స్థానంలో కొత్తవి అమర్చాలని చెప్పారు.  శ్రీశైలం జలాశయం గేట్ల నిర్వహణకు తగినంత నిధులు ప్రభుత్వం కేటాయిస్తే బాగుంటుందని కన్నయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. మరీ ముఖ్యంగా జలాశయం ముందు భాగంలో ఏర్పడిన ప్లంజ్ పూల్ వల్ల శ్రీశైలం జలాశయానికి ప్రమాదం లేదన్నారు. జలాశయం నుండి సుమారు 60 మీటర్ల దూరంలో ప్లంజ్ పూల్  ఉందని దాని వలన జలాశయానికి ఇబ్బంది లేదని గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు.
ప్లంజ్ పూల్ వల్ల శ్రీశైలం జలాశయానికి నో ప్రాబ్లం.. కన్నయ్యనాయుడు Publish Date: Jul 7, 2025 5:10AM

పొన్నూరు ఘటనపై వైసీపీ కావాలనే రాజకీయం చేస్తుంది : ధూళిపాళ్ల

  పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ నాయకులు కావాలనే రాజకీయం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌ నాగమల్లేశ్వరరావుపై దాడి జరిగిన రోజు వైసీపీ నేతలు  కాపు కాశారని ఆరోపించారు. గతంలో టీడీపీ నేత బండ్లమూడి బాబురావు, అశోక్‌పై దాడి చేసేందుకు వైసీపీ వర్గీయులు కుట్రపన్నారని ఆరోపించారు.  గుంటూరు జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో ధూళిపాళ్ల నరేంద్ర మీడియాతో మాట్లాడారు. కూటమిమ ప్రభుత్వంపైన బురద జల్లేందుకు, తమను అప్రతిష్ట  పాలు చేసేందుకు వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాగమల్లేశ్వరరావుపై దాడి జరిగిన రోజు వైసీపీ నేతలు ప్లాన్ చేశారని  ధూళిపాళ్ల  ఆరోపించారు 
పొన్నూరు ఘటనపై వైసీపీ కావాలనే రాజకీయం చేస్తుంది : ధూళిపాళ్ల Publish Date: Jul 6, 2025 6:18PM

ఏపీలో వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ

  ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. క్యూఆర్ కోడ్‌‌తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో కోటిన్నర అగ్రిలో పంపిణీ చేయనుంది. నేతల ఫోటోలు లేకుండా, ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్దిదారు ఫోటో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 1.46 కోట్ల పాత కార్డులతో పాటు కొత్తగా 2 లక్షల రేషన్ కార్డుదారులకు వచ్చే నెలలో వీటిని జారీ చేయనుంది..బ్యాంకు ఏటీఎం కార్డు తరహాలో క్యూఆర్‌ కోడ్‌తో ఈ స్మార్ట్‌ రేషన్‌ కార్డును రూపొందిస్తున్నారు. ఈ కార్డుల జారీకి పౌరసరఫరాల శాఖ ఇప్పటికే కసరత్తును పూర్తి చేసింది.  స్మార్ట్‌ రేషన్‌ కార్డుపై ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కార్డుదారు (కుటుంబ పెద్ద) ఫోటో ఉంటాయి. ఆ రేషన్‌ కార్డు నంబరు, రేషన్‌షాపు నంబరు తదితర వివరాలుంటాయి. కార్డు వెనుకవైపు లబ్ధిదారు కుటుంబ సభ్యుల వివరాలుంటాయి. ఈ స్మార్ట్‌ రేషన్‌ కార్డును రేషన్‌ డీలర్ల వద్ద ఉండే ఈ-పోస్‌ యంత్రాల సహాయంతో స్కాన్‌ చేస్తే ఆ ఫ్యామిలీ సంబంధించిన వివరాలతోపాటు రేషన్‌ సరుకుల వినియోగానికి సంబంధించిన పూర్తి సమాచారం ప్రత్యక్షమవుతుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించే ఈ కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డుల ముద్రణ కోసం ఏపీటీఎస్‌ ద్వారా టెండరు ప్రక్రియ పూర్తి చేశారు. ప్రస్తుతం ముద్రణ దశలో ఉన్న కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డులను వచ్చే నెలలో పంపిణీ చేసేందుకు పౌరసరఫరాలశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు
ఏపీలో వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు  పంపిణీ Publish Date: Jul 6, 2025 5:36PM

ఉగ్ర బంధాలపై గురి...రాయచోటి ఘటనపై లోతుగా విచారణ

  అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో కలకలం రేపిన ఉగ్ర భంధాలపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.  రాయచోటిలో దొరి కిన ఉగ్రవాదులతో సన్నిహితంగా మె లిగిన వాళ్లకు సహకరించిన వాళ్లను పోలీసులు గత రెండు మూడు రోజులుగా రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విచారణ మొత్తం కేంద్ర స్థాయిలోని.  అత్యున్నత దర్యాప్తు సంస్థలు, నిఘవర్గాల కనుసన్నుల్లో జరుగుతున్నట్టు  తెలుస్తోంది.ఈ విచారణలో రాష్ట్రస్థాయిలోని దర్యాప్తు నిఘ వర్గాల సైతం పాల్గొంటున్నట్టు సమాచారం.  అత్యంత చాకచక్యంగా ఉగ్రవాదులను తమిళనాడు ఐబి, అన్నమయ్య పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రవాదుల నుంచి బాంబులు,పెద్ద ఎత్తున బాంబు తయారీ పదార్థాలను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఉగ్రవాదుల భార్యలను సైతం అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు.  అంతటితో ఆగకుండా... మూడు దశాబ్దాలకు పైగా. రాయచోటిలో మకాం వేసిన ఉగ్రవాదుల గత చరిత్ర మొత్తం తవ్వే పనిలో పోలీసులు పడ్డారు. రాయచోటీలో ఉగ్రవాదులకు ఆవాసం కల్పించింది ఎవరు. వాళ్లతో అతిస న్నితంగా మెలిగింది ఎవరు. ఉగ్రవాదులు ఇద్దరికీ. ఈ ప్రాంతంలో పెళ్లి చేసింది ఎవరు. అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పట్టణంలోని పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారంలో సాగుతోంది. ప్రస్తుతం పోలీసు విచారిస్తున్న వారిలో  కొందరు. గతంలో రాయచోటిలో జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనలు కీలకంగా వ్యవహరించినట్లు ప్రచారంలో ఉంది. అదుపులోకి తీసుకున్న వారిని. వేర్వేరు ప్రదేశాలలో  ఉంచి పోలీసులు విచారిస్తున్నారని సమాచారం. వారి భంధాలపై   పోలీసులు అబూబకర్, మహమ్మద్ అలీ అనే ఉగ్రవాదులను  అదుపులోకి తీసుకున్నప్పటికీ ప్రస్తుతం విచారణ మొత్తం అతని బంధాల చుట్టే తిరుగుతున్నట్టు తెలుస్తోంది. అబూబకర్ అరెస్టు తర్వాత అతని ఇంట్లో పోలీసులు జరిపిన సో దాలలో  భారీ సంఖ్యలో బాంబు తయారీ పదార్థాలు దొరికడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్ చదివిన. అబూబకర్ బాంబులు తయారీలో నిష్ణాతుడు.. 1995లో తన నేర చరిత్రను మొదలుపెట్టిన అబుబకర్ దక్షిణాది రాష్ట్రాలలో పలుచోట్ల బాంబు పేలుళ్ల నేరాలు పాల్పడ్డాడు.  అక్కడ కొన్ని కేసులలో  పోలీసులు చిక్కినప్పటికీ బెయిల్ మీద బయటకు వచ్చి రాయచోటి చేరిపోయాడు. ఇక్కడే స్థిరపడ్డాడు. గత 30 సంవత్సరాల లో రాయచోటిలో మూడు ప్రాంతాలలో అతను నివాసం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఇంటి ఓనర్లను,అతనికి ఇల్లు ఇప్పించిన వాళ్లను విచారిస్తున్నట్టు ప్రచారంలో ఉంది.2021లో  అతనికి పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేసిన వా రిని విచారిస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా మొహమ్మద్ అలీ కి ఇక్కడ ఇల్లు ఇప్పించిన వాళ్లను,పెళ్లి చేసిన వాళ్లను కూడా పోలీసులు వి చారిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం టౌన్ లో ఎక్కడ చూసినా ఈ విషయాలపైనే చర్చ నడుస్తోంది. *రాయచోటి కే పరిమితమా! రాయచోటిలో పట్టుబడ్డ ఉగ్రవాదులు అబూబకర్ ,మహమ్మద్ అలీ రాయచోటికే పరిమితం అయ్యారా?ఇక్కడ నుంచే  కార్యకలాపాలు నిర్వహించారా! లేక ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాల్లోని  మరే ప్రాంతాల్లో అయినా వీరికి సంబంధాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 30 ఏళ్లుగా రాయచోటి కేంద్రంగా వీరు రహస్యంగా ఉన్నారంటే వీరి కార్యకలాపాలకు ఎవరైనా సహకారం అందించి ఉంటారేమో అన్ని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఉమ్మడి కడప జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాలో కూడా ఏమైనా పరిచయాలు ఉన్నాయా,  ఎవరైనా సహకారం అందిచారా  అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర దర్యాప్తు బృందాలు ,జిల్లా పోలీసు బృందాలు లోతుగా విచారిస్తుండడంతో తీగ లాగితే డొంక కదిలినట్టు ఎలాంటి  సమాచారం బయటికి వస్తుందో నన్ను ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఉగ్ర బంధాలపై గురి...రాయచోటి ఘటనపై లోతుగా విచారణ Publish Date: Jul 6, 2025 5:00PM

అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి

  తెలంగాణలో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాది కొత్తగూడెంలో పాల్వంచ, లక్ష్మీదేవి పల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతొ కలిసి  అందజేశారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం, చింతపెంటిగూడెంలో హై లెవల్ బ్రిడ్జ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. తొలి ఏకాది శుభ దినాన ఆడబిడ్డలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలు అందజేయం చాలా సంతోషంగా ఉందని  మంత్రి పొంగులేటి అన్నారు.  ఈ విడతలో ఇండ్లు రాలేదని ఏ ఆడబిడ్డ నిరుత్సాహ పడవద్దు.రాబోయే రోజుల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాము. ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇండ్లు  ఇస్తున్నాము. ఈ నియోజకవర్గంలో మరో 1500 అదనంగా ఇండ్లకు జాబితా తయారు చేయాల్సిందిగా కలెక్టర్‌ను ఆదేశించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగా మా ప్రభుత్వం మాయ మాటలు చెప్పదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుద్రంపూరం చెందిన శివ అనే యువకుడు తనకు ఇండ్ల పట్టాలు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని టవర్ ఎక్కాడు. ఆనాడు మేము అధికారంలో లేము. అయినా మేము అధికారంలోకి రాగానే ఇండ్ల పట్టా ఇస్తామని ఆరోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ మాట మేరకే ఇప్పుడు ఇండ్ల పట్టా ఇచ్చామని మంత్రి తెలిపారు.  ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇండ్లు.. ఇందిరమ్మ ఇండ్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం అని అన్నారు. గత బీఆర్ఎస్ పాలకులు వారి  సౌలభ్యం, ప్రయోజనాల కోసం పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి పొంగులేటి అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం మాత్రం ప్రజా శ్రేయస్సు కోసమే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. గోదావరి నీటిని ఆంధ్రకు తరలించేందుకు శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్ పాలకులే. ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారు.  ఇప్పుడు అనేక అంశాలపై అవాకులు, చెవాకులు పేలుతున్నారు. అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అధికారంలో ఉండి వాళ్లు చేయలేనిది మేము చేసి చూపిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు.
అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి  పొంగులేటి Publish Date: Jul 6, 2025 4:33PM

తొలి ఏకాదశి.. ఇంద్రకీలాద్రిపై భక్తుల కిటకిట

  తొలి ఏకాదశి సందర్బంగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. నేడు ఆషాడ సారెను సమర్పిస్తే మరింత శుభం కలుగుతుందనే నమ్మకంతో వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చాయి. దీంతో లిఫ్ట్‌దారి, ఘాట్‌ రోడ్డు వైపు భక్తులు కిక్కిరిసిపోయారు. భక్తులు త్వరితగతిన దర్శనాలు పూర్తిచేసుకుని కొండపై నుంచి దిగువకు పంపేందుకు ఈవోశీనానాయక్‌ తో పాటు ఏఈవోలు, ఆలయ సిబ్బంది చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ద్వారా రద్దీని ఈవో పరిశీలిస్తున్నారు. రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాలకు అనుమతిపై నియంత్రణ విధించారు.  తొలి ఏకాదశి  పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భక్తి పారవశ్యంతో పులకించిపోయాయి. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధ వైష్ణవాలయాలు అన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పవిత్రమైన ఈ రోజున శ్రీమహావిష్ణువును దర్శించుకోవడం, ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ నమ్మకంతోనే వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. ఆలయ ప్రాంగణాలు “గోవిందా.. గోవిందా..” నామస్మరణతో మార్మోగిపోయాయి.
తొలి ఏకాదశి.. ఇంద్రకీలాద్రిపై భక్తుల కిటకిట Publish Date: Jul 6, 2025 3:42PM

నెల్లూరులో వైభవంగా ప్రారంభమైన రొట్టెల పండుగ

  నెల్లూరులోని ప్రసిద్ద బారాషషీద్ దుర్గ వద్ద రొట్టెల పండుగ ఇవాళ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ పండుగ ఐదు రోజుల పాటు జరిగే పాటు జరగనున్నది. తమ కోరికలు నెరవేరాలని ఆశిస్తూ భక్తులు స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకునే ఈ విశిష్టమైన ఉత్సవంలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో దర్గా ప్రాంగణం, స్వర్ణాల చెరువు పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి.  తమ అనుకున్న కోరికలు తీరాలని ఆశిస్తూ, గతంలో కోరిక తీరిన వారి నుంచి రొట్టెను స్వీకరించడం, తమ కోరిక తీరితే ఇతరులకు రొట్టెను ఇవ్వడం ఈ పండుగలోని ప్రధాన ఆచారం. దీని కోసం భక్తులు స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు ఆచరించి, భక్తిశ్రద్ధలతో రొట్టెలను మార్చుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రాంగణంలో ప్రత్యేక టెంట్లు, తాగునీటి సౌకర్యం, ఉచిత భోజన వసతి కల్పించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఉన్నతాధికారులు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, పండుగ ప్రశాంతంగా జరిగేలా పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రాకతో దర్గా పరిసర ప్రాంతాల్లో పూర్తి పండుగ వాతావరణం నెలకొంది.  
నెల్లూరులో వైభవంగా ప్రారంభమైన రొట్టెల పండుగ Publish Date: Jul 6, 2025 3:16PM

పేలుడు పదార్థాల కేసులో కాంగ్రెస్ నేత గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్

  పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్  పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డిలోని కేపీఆర్ కాలనీలో పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులో నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిజామాబాద్ జైలుకు తరలించిన పోలీసులు. ఈ కేసులో గతంలో అరెస్టయిన ముగ్గురు నిందితులు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు.  తాము సేకరించిన పేలుడు పదార్థాలను చంద్రశేఖర్‌రెడ్డి వద్ద నుంచే తెచ్చినట్లు నిందితులు పోలీసులకు తెలియజేశారు. ఈ సమాచారం ఆధారంగా, పోలీసులు జూలై 3న రాత్రి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని, నిజామాబాద్ జైలుకు తరలించారు. ఈ కేసులో చంద్రశేఖర్‌రెడ్డి సోదరుడు సూర్య కూడా నిందితుడిగా ఉన్నాడని, ప్రస్తుతం పరారీలో ఉన్న సూర్య కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.   
పేలుడు పదార్థాల కేసులో కాంగ్రెస్ నేత గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ Publish Date: Jul 6, 2025 1:01PM

వీళ్లిద్ద‌రి బ‌తుకు రెంటికి చెడ్డ రేవ‌డైందా?

  ఉన్న పార్టీలో ఉన్న‌ట్టు ఉండి ఉంటే వీళ్ల ప‌రిస్థితి ఎంతో మెరుగ్గా ఉండేదేమో. కానీ అత్యాశ కొంప ముంచేసింది. పెట్టిన చేతినే క‌ర‌వ‌డంతో పాము, మొస‌లినే మించి పోయారీ ఇద్ద‌రూ. కార‌ణం ఈ భూ ప్ర‌పంచంలో పెట్టిన చేతినే క‌రిచే బుద్ధి కేవ‌లం పాము, మొస‌లికి మాత్ర‌మే ఉంటుంద‌ట‌. ఆ పార్టీలో ఉండి ఏమైనా పేరు సాధించారా అంటే అదీ లేదు. కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ వ‌ల్లే మేం ఓడాం అంటూ కాసు మ‌హేష్ రెడ్డి వీళ్ల‌పై చూపించిన కోపం తాపం అంతా ఇంతా  కాదు. వంశీ చేసిన కామెంట్లు మాకు చేటు తెచ్చాయ‌ని వాళ్లు కూడా వీళ్ల‌ను చూస్తే అస‌హ్యం వెళ్ల‌గ‌క్కుతున్నారు జోగి ర‌మేష్ వంటి వైసీపీ లీడ‌ర్లు కూడా. ఇక వీళ్ల ప‌రిస్థితి చూస్తే.. సూర్య చంద్రుల‌కే గ్ర‌హ‌ణం ప‌ట్టించిన రాహుకేతుల‌కే గ్ర‌హ‌ణం ప‌డితే ఎలా ఉంటుందో అలా త‌యార‌య్యారు. ఒక‌డు ఇప్ప‌టికే తాను చేసిన ద్రోహాల‌న్నీ ఆ మొహం మీద విల‌య తాండ‌వం చేస్తుంటే.. ప్ర‌త్య‌ర్ధుల‌కే జాలి క‌లిగేలా త‌యార‌య్యాడు.మ‌రొక‌డు గుడివాడ ఓట‌రు జ‌నాలు కొట్టిన దెబ్బ‌కు దిమ్మ తిరిగి గుండాప‌రేష‌న్ చేయించుకోవ‌డం మాత్ర‌మే కాకుండా.. అత్యంత ద‌యనీయంగా.. క‌ట్లు క‌ట్టుకుని తిరుగుతున్నాడు. అదే ఉన్న‌పార్టీలో ఉండి.. ప‌ద్ద‌తిగా బిహేవ్ చేసి ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌న్న కోణంలో సోష‌ల్ మీడియా కామెంట్లు హోరు మంటున్నాయ్ ఈ జంట ద్రోహుల మీద‌.
వీళ్లిద్ద‌రి బ‌తుకు రెంటికి చెడ్డ రేవ‌డైందా? Publish Date: Jul 6, 2025 12:49PM

అతి సర్వత్రా జగనేత్!

  క్యాప్షన్ కొత్తగా ఉందన్న మాటే కానీ మేటర్ మాత్రం చాలా చాలా పాతదే. పెద్దగా కంగారు పడకండి. కారణం ఏంటంటారా? అప్పుడే అభ్యర్ధుల ప్రకటన చేస్తున్నారట అతి- ఉత్సాహి జగన్. ఇప్పటికే వంద మంది పేర్లు వంద సీట్లకు ఖరారు చేసేశారట.. శ్రీమాన్ శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహనుల వారు.మొన్నటి ఎన్నికల్లో చివరి నిమిషం వరకూ అభ్యర్ధుల జీవితాలను అగమ్య గోచర పరిస్థితిలోకి నెట్టిన జగనన్న తాజాగా.. ముందస్తు ఎన్నికల్లాగా- ముందస్తు అభ్యర్ధుల ఖరారు ప్రకటనలు చేస్తున్నారట. ఇప్పటికి ఓకే అయిన వాటిలో మచ్చుకు కొన్ని పేర్లు.. ఎవరివీ, ఏంటని చూస్తే వాటిలో తొలిపేరు సర్వేపల్లి నుంచి- కాకాణి గోవర్ధన రెడ్డిదేనట. ఇక వరుసగా చూస్తే.. నరసన్న పేట- ధర్మాన కృష్ణదాస్, గననవరం- నుంచి వల్లభనేని వంశి, మచిలీపట్నం- నుంచి పేర్ని నాని, గుడివాడ- నుంచి కొడాలి నాని, దెందలూరు- నుంచి అబ్బయ్య చౌదరి, తాడికొండ- నుంచి  నందిగం సురేష్, మాచర్ల- నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చిలకలూరి పేట- నుంచి విడదల రజనీ, తాడిపత్రి- నుంచి పెద్దారెడ్డి, రాఫ్తాడు- నుంచి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ధర్మవరం- నుంచి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పాతపట్నం- నుంచి రెడ్డి శాంతి.. ఇలా ఒక లిస్ట్ అప్పుడే లీక్ చేశారట. అంటే గతంలోలా పార్టీకి డిమాండ్ లేక పోవడం.. దానికి తోడు కేడర్ కూడా తీవ్ర నిరాశా నిస్పృహలకు లోను కావడంతో ఒక బూస్టింగా ఉంటుంది లెమ్మని జగన్ సార్ ఈ తరహాలో ముందుకెళ్తున్నట్టు తాజా కబర్. ఒక సమయంలో ఎమ్మెల్యేలను కలవడానికే అపాయింట్లు ఇవ్వని.. ఒక వేళ ఇచ్చినా వారిని నిలబెట్టే మాట్లాడే కల్చర్ గల జగనన్న.. ఇటీవల నేనూ మారాను బాస్! అని తెలియ చెప్పడంలో భాగంగా ఈ అడ్వాన్స్డ్ అనౌన్స్ మెంట్స్ ఒక పాలసీగా తీసుకున్నట్టు సమాచార్. రేపటికి రెడ్డెవరో- రాజెవరో అన్నది పాత నాటు సామెత. కానీ ఆ రేపటి ని కూడా ఇప్పటి నుంచే మార్చేసి.. తనకు తాను ఎప్పటిలాగానే అధినాయకుడిలా కాకుండా 'అతి'నాయకుడిలా వ్యవహరిస్తున్నారట జగన్. దానికి తోడు ఇప్పటికే ఈ అతి మీద పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వైసీపీ నేత రవిచంద్రారెడ్డి మాటలను బట్టీ చెబితే.. ఈ వైనాట్ 175 వంటి టూ మచ్ స్లోగన్స్ ఎవరి ఐడియాలో తెలియవు కానీ, ఇవన్నీ పార్టీని నిలువునా ముంచాయని అంటారాయన. దీంతో సామాన్యంగా వ్యవహరించాల్సిన జగన్ అత్యుత్సాహం కొద్దీ ఇలాంటి పనులు చేయడం వల్ల పార్టీ మైలేజ్ మరింత డ్యామేజ్ గా మారుతున్నట్టు సమాచారం.  మరి చూడాలి. జగన్ సార్ ఇదే ఫ్లో మెయిన్ టైన్ చేసి. ఆ పదకొండు కూడా పోగొట్టుకుంటారా అన్నది తేలాల్సి ఉందంటున్నాయి.. పార్టీ శ్రేణులు. మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే.. ఎన్నికలు వచ్చినట్లు నాలుగు ఏళ్ల ముందే ఊహించడం, తామే గెలుస్తామ‌ని క‌ల‌లు క‌న‌డం.. ఆ ఊహ‌ల్లో తేలియాడ‌టం.. అలా బతికేయడాన్ని ఏమనుకోవాలి? మానసిక సమస్యా.. లేక వేరే వ్యూహమా? నేతల్ని, కార్యకర్తలను తనతో నిలుపుకోవడం లో భాగమా? అన్న‌ది కూడా ఒక చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే జ‌గ‌న్  చేసిన ప్ర‌తి ఓవ‌రాక్ష‌న్ బెడిసికొట్ట‌డంతో.. ఇలాంటి విష‌యాల‌ను పార్టీలో కొంద‌రు బాహ‌టంగానే వ్య‌తిరేకిస్తున్నార‌ట‌.
అతి సర్వత్రా జగనేత్! Publish Date: Jul 6, 2025 12:26PM

తెలంగాణ ఎవరి జాగీర్?

  హైద‌రాబాద్ న‌డి బొడ్డున 1982 మార్చి 29న పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. టీఆర్ఎస్ అయినా పుట్టిన పుష్క‌ర  కాలానికిగానీ అధికారంలోకి రాలేదు. అదే టీడీపీ ఏకంగా 9 నెల‌ల్లోనే అధికారం చేప‌ట్టి ప్ర‌పంచ రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే మ‌రెవ‌రికీ సాధ్యం కాని ఒక చ‌రిత్ర‌ను సృష్టించింది. హైద‌రాబాద్ ప్ర‌తిష్ట‌ను ఆనాడే ఆకాశానికి అంటేలా చేసింది. అంతేనా ఇదే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టీడీపీలో చేర‌క ముందు ఎలా ఉండే వారో కూడా ఎవ్వ‌రికీ ఊహ‌కంద‌ని విష‌యం. గురువు ద‌గ్గ‌ర రాజ‌కీయం నేర్చుకుని ఆయ‌న మీదే పోటీ చేసిన ఘ‌నుడైన కేసీఆర్ ని కూడా ద‌గ్గ‌రకు చేర్చి.. ఆద‌రించింది టీడీపీ. ఆయ‌న‌కు అప్ప‌ట్లో ర‌వాణా మంత్రిత్వం ఇచ్చింది కూడా టీడీపీనే. త‌ర్వాత త‌న సాటి కుల‌స్తుడికి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డంతో.. అది చూసి ఓర్వ‌లేక కొత్త పార్టీ పెట్టారు కేసీఆర్.నిజంగా వైయ‌స్ అన్న‌ట్టు ఆనాడు బాబు మంత్రి ప‌ద‌వి  ఇచ్చి ఉండి ఉంటే కేసీఆర్ గానీ ఆయ‌న బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ ఉండేదా? అస‌లీ సోయ‌లోనే లేక పోయావారు ఆయ‌న, ఆయ‌న పార్టీ స‌భ్యులు. ఒక‌సారి మంత్రిత్వం ఇస్తే దాన్ని స‌రిగా నిర్వ‌హించ‌లేద‌ని గుర్తించిన చంద్ర‌బాబు.. కేసీఆర్ ని ప‌క్క‌న పెట్ట‌డంతో పుట్టిన ముస‌లం.. తెలంగాణ వాదం.  ఆనాటి నుంచి ఆయ‌న అది  ప‌నిగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ని విభిజించ‌డ‌మే ధ్యేయంగా.. యువ‌త‌ను రెచ్చ‌గొట్టి.. వారి ఆశల మేడ‌లపై త‌న పార్టీ పునాదును నిర్మించుకున్నారు టిడిపి వర్గాలు. అదే బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్.అప్ప‌టికి ఎటు నుంచి ఎటు చూసినా అడ‌వుల‌ను త‌ల‌పించిన హైటెక్ సిటీ ప‌రిస‌ర ప్రాంతాన్ని ఇవాళ ఐటీ కారిడార్ గా మ‌ల‌చింది టీడీపి.. మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గ‌జ‌ కంపెనీలు రావ‌డానికి కార‌కుడైంది.. నాటి  టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు. అప్ప‌ట్లో పెద్ద పెద్ద ప్ర‌ధానుల‌కు సైతం దొర‌క‌ని బిల్ గేట్స్ అపాయింట్ మెంట్ ని దొర‌క‌బుచ్చుకుని నిమిషాల్లో ముగించాల‌ని వారు చెబితే, దాన్ని సుమారు గంట‌కు పొడిగించుకుని.. ఆపై యూఎస్ వెళ్లి అక్క‌డి మైక్రోసాఫ్ట్ యాజ‌మాన్యాన్ని హైద‌రాబాద్ లో ఒక క్యాంప‌స్ ఏర్పాటు  చేయాల్సిందిగా వేడుకుని, ఎట్ట‌కేల‌కు ఇక్క‌డికి ర‌ప్పించి.. ఒక ఐటీ బూమ్ క్రియేట్ చేసింది చంద్ర‌బాబు. ఆయ‌న  వెన‌కున్న టీడీపీ. ఆ త‌ర్వాత అనూహ్యంగా ఈ ప్రాంతం మ‌రో సింగ‌పూర్ లా క‌నిపించ‌డంతో.. క‌న్నుకుట్టి.. ఇదంతా త‌మ‌దేనంటూ తెలంగాణ  ప్ర‌జానీకాన్ని  రెచ్చ‌గొట్టి.. రాష్ట్రం రెండుగా చీలిపోయేలా చేసింది ఎవరు అని ప్రశ్నిస్తున్నారు టిడిపి వారు. ఆయ‌న పార్టీ. ఆ త‌ర్వాత కూడా రాష్ట్ర విభ‌జ‌న‌లో ద‌క్కాల్సిన ప‌దేళ్ల రాజ‌ధాని హోదాను ఏపీకి ద‌క్క‌కుండా త‌న  టెలిఫోన్ టాపింగ్ ద్వారా చేసిన ఘ‌న‌త వ‌హించింది కేసీఆర్ కాదా అంటున్నారు.త‌న స్వార్ధం కోసం జ‌గ‌న్న రెడ్డితో కుమ్మ‌క్క‌య్యి.. ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ప్రాంతాలు రెండింటినీ మోసం చేసిన ఘ‌న‌త కూడా కేసీఆర్ దే. అంతేనా.. కాళేశ్వ‌రం వంటి అన‌వ‌స‌ర ఖ‌ర్చు దండ‌గ ప్రాజెక్టుల ద్వారా కోట్లు కుమ్మ‌రించుకున్నార‌ని ఆరోపించిన రాజ‌లింగం లాంటి వారిని లేకుండా చేసింది మీరు కాదా? అన్న‌ది స‌గ‌టు తెలంగాణ వాదులు సంధిస్తోన్న ప్ర‌శ్న‌. ఒక‌రిద్ద‌రు కాదు కేసీఆర్ లాంటి ఎంద‌రో తెలంగాణ  వారిని రాజ‌కీయ ధురంద‌రులుగా తీర్చి దిద్దింది టీడీపీ. కేసీఆర్ నుంచి మొద‌లు పెడితే తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఉన్న ఏ పొలిటీషియ‌న్ అయినా స‌రే టీడీపీ త‌ల్లి పాలు తాగిన వారు కాదా? అదంతా మ‌ర‌చిపోయి.. ఇప్పుడిలా మాట్లాడ్డం.. త‌ల్లిపాలు తాగి ఆ రొమ్ము గుద్ద‌డంతో స‌మానం కాకుండా పోతుందా? అని  నిల‌దీస్తున్నారు స‌గ‌టు తెలంగాణ ప్ర‌జ‌లు. ఎస్ ఇది టీడీపీ జాగీరే. అప్పుడ‌ప్పుడూ ఓట‌ములు ఎదురు కావ‌చ్చుగాక‌.. కానీ కాల‌గ‌మ‌నంలో ఓట‌మి కూడా ఒక మ‌జిలీయే. ప్ర‌స్తుతం టీడీపీ జూబ్లిహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తిరిగి  పోటీకి నిలిస్తే మాత్రం త‌ప్పేంటి? ఎందుకంత  ఉలుకు. త‌ల్లిలాంటి పార్టీ అంటే ఎందుకంత చిన్న‌చూపు? అని నిల‌దీస్తోంది స‌గ‌టు తెలంగాణ ప్రజానీకం. ఆద‌రించ‌డానికి మేం సిద్ధం.. మీకెందుకా సంశ‌యం.. అయినా ఇంకెక్క‌డుందా తెలంగాణ వాదం.. మీ పార్టీలో తెలంగాణ అన్న ప‌దం తీసెయ్య‌డంతోనే అది తెలిసిపోవ‌డం లేదా అని తెలంగాణ  ప్ర‌జ‌లే మీ  పార్టీపై తిర‌గ‌బ‌డుతున్న వేళ‌.. ఇంకా ఎందుకా? మేక‌బోతు గాంభీర్యాలు అంటున్నారు తెలంగాణ తెలుగుదేశం అభిమానులు.
తెలంగాణ ఎవరి జాగీర్? Publish Date: Jul 6, 2025 12:12PM

సిగాచీ ప్రమాదంలో 41కి చేరిన మృతుల సంఖ్య

  సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా జితేందర్ అనే వ్యక్తి ఆస్పుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. దీంతో  మృతుల సంఖ్య 41కి చేరింది.  మరో 11 మంది ఆచూకి లభించలేదు. మరికొందరు ఆసుపత్రిలో చికత్స పొందుతుండగా పలువురి పరిస్ధితి ఆందోళనకరంగా ఉంది.పేలుడు ధాటికి కుప్పకూలిన భవన శిథిలాలను తొలగించే పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. తమ వారి జాడ తెలియకపోవడంతో కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.  
 సిగాచీ ప్రమాదంలో 41కి చేరిన మృతుల సంఖ్య Publish Date: Jul 6, 2025 11:54AM

కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన ఎలాన్ మస్క్

  ప్రపంచ అపర కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అమెరికా పార్టీ పేరుతో నూతన పార్టీ ప్రకటించారు. అగ్రరాజ్యంలో ప్రజాస్వామ్యం లేదని ప్రజలకు స్వేచ్చ ఇచ్చేందుకే పార్టీ ఏర్పాటు చేశానని ఎలాన్ మస్క్ తెలిపారు.  మీరు కొత్త రాజకీయ పార్టీని కోరుకుంటున్నారు. అది మీకు లభిస్తుంది. ఈ రోజు మీకు మీ స్వేచ్చను తిరిగి ఇవ్వడానికి అమెరికా ఏర్పడింది అంటు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అవినీతితో మన దేశాన్ని దివాళా తీయించే విషయంలో మనం ప్రజాస్వామ్యంలో కాకుండా ఒకే పార్టీ వ్యవస్థలో జీవిస్తున్నాం. ఈరోజు మీ స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి అమెరికా పార్టీ ఏర్పడింది అంటూ ఆయన ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. దీంతో అమెరికాలో ప్రస్తుతం ఉన్న రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలతో పాటు మూడో పార్టీ వచ్చి చేరింది. తమ పార్టీ 2026లో జరిగే మధ్యంతర ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని తెలిపారు. రెండు నుంచి మూడు సెనేట్ స్థానాలు, 8 నుంచి 10 ప్రతినిధుల సభ స్థానాల్లో పోటీ చేసి, కీలక చట్టాలపై నిర్ణయాత్మక శక్తిగా మారడమే తమ లక్ష్యమని వివరించారు. అయితే, మస్క్ పార్టీ ప్రకటన చేసినప్పటికీ, ఇప్పటివరకు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద పార్టీని అధికారికంగా నమోదు చేయలేదు. అమెరికాలో కొత్త పార్టీని స్థాపించడం అంత ఇజీ కాదు. ప్రతి రాష్ట్రంలోనూ కఠినమైన నిబంధనలు, లక్షలాది సంతకాల సేకరణ వంటి సవాళ్లు ఉంటాయి. మస్క్ వద్ద అపారమైన సంపద ఉన్నప్పటికీ, 'డువర్జర్ సూత్రం' ప్రకారం రెండు పార్టీల వ్యవస్థ బలంగా ఉన్న దేశంలో మూడో పార్టీ ఓట్లను చీల్చడానికే పరిమితమవుతుందని, గెలుపువడం కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు.  
కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన ఎలాన్ మస్క్ Publish Date: Jul 6, 2025 11:34AM

భారత్ డిక్లేర్ .. ఇంగ్లాండ్‌ ముందు భారీ లక్ష్యం

  ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్  427/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్‌ ముందు 608 పరుగుల భారీ లక్ష్యం  ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో గిల్‌ (161) చెలరేగిపోయాడు. పంత్‌ (65), జడేజా (69*), కేఎల్‌ రాహుల్‌ (55) అర్ధశతకాలు బాదేశారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో జోష్‌, బషీర్‌ చెరో 2, రూట్‌, బ్రైడన్‌ తలో వికెట్‌ తీశారు.  అంతకుముందు, తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా  587 పరుగుల భారీ స్కోరు చేయగా, ఇంగ్లండ్ 407 రన్స్ ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు 180 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. ప్రస్తుతం మ్యాచ్‌లో ఇంకా ఐదు సెషన్ల ఆట మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో, భారత బౌలర్లు రాణిస్తే ఈ టెస్టులో భారత్ గెలిచే ఛాన్స్ ఉంది.
భారత్ డిక్లేర్ .. ఇంగ్లాండ్‌ ముందు భారీ లక్ష్యం Publish Date: Jul 5, 2025 9:58PM

క్యాన్సర్‌తో బాధపడుతున్న కార్యకర్తకు చంద్రబాబు ఫోన్‌లో పరామర్శ

  క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోన్న పార్టీ కార్యకర్త అభిమతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్చారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆకుల కృష్ణతో చంద్రబాబు వీడియో కాల్ చేసి మాట్లాడారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, మోరంపూడి జంక్షన్‌కు చెందిన ఆకుల కృష్ణ మొదటి నుంచీ టీడీపీ అభిమాని. చంద్రబాబు అంటే అమిత ఇష్టం. అయితే ఆయన ఇటీవల క్యాన్సర్ వ్యాధికి గురై బాధపడుతున్నారు. తన ఆరోగ్య క్షీణిస్తుండడంతో చంద్రబాబుతో ఒక్కసారైనా మాట్లాడాలని ఆయన కోరుకున్నారు.  ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు  స్వయంగా ఆకుల కృష్ణకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని.. అన్ని విధాలా తాను అండగా ఉంటానని కృష్ణకు, ఆయన కుటుంబానికి ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అత్యంత విషమంగా ఆరోగ్య పరిస్థితి ఉన్న కారణంగా సరిగా మాట్లాడలేని స్థితిలో ఉన్న కృష్ణ... స్వయంగా చంద్రబాబు ఫోన్ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. తనకు ఇప్పుడు ఎంతో సంతృప్తిగా ఉందని అన్నారు.   
క్యాన్సర్‌తో బాధపడుతున్న కార్యకర్తకు చంద్రబాబు ఫోన్‌లో పరామర్శ Publish Date: Jul 5, 2025 9:34PM