Top Stories

ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.7గా నమోదైంది. తనింబర్ దీవుల ప్రాంతంలో భూకంపం వచ్చినట్టు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే.. సునామీ వచ్చే అవకాశం లేదని ఆ దేశ జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. ఈ భూకంపకేంద్రం భూమికి  98 కిలో మీటర్లు అంటే  60.89 మైళ్ళు  లోతులో ఉందని తెలిపింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ భూకంపం 6.7 తీవ్రతతో, 10 కి.మీ (6.21 మైళ్ళు) లోతులో నమోదైందని నివేదించింది. తూర్పు ఇండోనేషియాలోని అనేక చిన్న పట్టణాల్లో ప్రకంపనలు సంభవించాయని ఏజెన్సీ పేర్కొంది. అయితే, ఈ భూకంపంలో నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు రాలేదని డిసాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది. ఇండోనేషియా.. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలవబడే ప్రాంతంలో ఉంది. ఇది అత్యంత భూకంపాలు సంభవించడానికి అవకాశం ఉన్న మండలం. ఇక్కడ భూమి.. క్రస్ట్‌లోని వివిధ ప్లేట్లు కలుస్తాయి. కాబట్టి, ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో భూకంపాలు సంభవించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇండోనేషియాలో భారీ భూకంపం Publish Date: Jul 14, 2025 2:58PM

రఫేల్ అంపైరింగ్‌లో ఇండియా గెలవడం కష్టమే అంటున్న అశ్విన్

ఇండియా, ఇంగ్లాండ్ మూడో టెస్టు రసవత్తరంగా మారింది. ఇండియా విజయం సాధించాలంటే చివరి రోజు ఆటలో 135 పరుగులు చేస్తు చాలు. చేతిలో ఇంకా ఆరు వికెట్లు ఉన్నాయి. అద్భుత ఫామ్ లో ఉన్న రాహుల్ క్రీజ్ లో ఉన్నాడు. ఫామ్ కొనసాగిస్తున్న రిషభ్ పంత్, సిరీస్ లో ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలతో చెలరేగిన జడేజా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. పరిస్థితులలో టీమ్ ఇండియా విజయం నల్లేరు మీద బండినడే అని ఎవరైనా భావిస్తారు. అయితే టీమ్ ఇండియా మాజీ ఆటగాడు, స్టార్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ మాత్రం ఇండియా విజయం సాధించడం అంత వీజీకాదు.. చాలా చాలా కష్టం అంటున్నాడు. అందుకు ఇంగ్లాండ్ బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్, కచ్చితత్వంతో కూడుకున్న బౌలింగ్ ఇవేవీ కారణం కాదంటున్నారు. ఇంతకీ టీమ్ ఇండియాకు విజయం ఎందుకు కష్టమంటే.. ఈ మ్యాచ్ లో అంపైరింగ్ చేస్తున్న  పౌల్ రఫేద్ వ్యవహరిస్తున్న తీరు కారణమంటున్నాడు. నిజమే మూడో టెస్టులో రఫేల్ అంపైరింగ్, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. రఫేల్ ఉద్దేశపూర్వకంగా ఇంగ్లాండ్‌కు సహకరిస్తున్నారని టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలే అందుకు ప్రత్యక్ష నిదర్శనగా నిలుస్తున్నాయి. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటికే చెరో టెస్ట్ మ్యాచ్ గెలిచి సమానంగా ఉన్న టీమ్ ఇండియా, ఇంగ్లండ జట్లు మూడో టెస్ట్ మ్యాచ్‌ను చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి . దీంతో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతోంది. ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో తీవ్ర భావోద్వేగాలకు గురవుతున్నారు. కాగా.. తాజా మ్యాచ్‌లో అంపైర్ పౌల్ రఫెల్  వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా ఉంది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అవుట్ విషయంలో రఫెల్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. సిరాజ్ బౌలింగ్‌లో బంతి నేరుగా వెళ్లి స్టోక్స్ ప్యాడ్స్‌ను తాకింది. అప్పీల్ చేయగా రఫెల్ నాటౌట్ అని ప్రకటించాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లు డీఆర్‌ఎస్ తీసుకున్నారు. అయితే రివ్యూలో అంపైర్స్ కాల్ ప్రకారం నాటౌట్ అని ప్రకటించారు. ఈ విషయంపై మాజీ ఆటగాడు ఆశ్విన్ స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అంపైర్ రఫెల్‌పై ఆరోపణలు చేశాడు. రఫెల్ అంపైరింగ్ చేస్తున్న మ్యాచ్‌లో గెలవడం టీమిండియాకు కాస్త కష్టమేనని వ్యాఖ్యానించాడు. 'పౌల్ రఫెల్‌తో నాకున్న అనుభవం ప్రకారం ఎప్పుడూ అతడితో వాదిస్తూ ఉండాలి. టీమిండియా బౌలింగ్ చేస్తున్నప్పుడు అతడికి ఏదైనా నాటౌట్‌లాగానే కనిపిస్తుంది. అదే టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం ఏదైనా అవుట్‌లా అనిపిస్తుంది. ఇతర జట్లతో కూడా రఫెల్ ఇలాగే వ్యవహరిస్తున్నాడో, లేదో తెలియదు. ఈ విషయంపై ఐసీసీ ఒకసారి దృష్టి సారించాలి. పౌల్ రఫెల్ మైదానంలో ఉంటే ఇండియా గెలవదు అని మా నాన్న అంటుంటారు' అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో వ్యాఖ్యానించాడు.
రఫేల్ అంపైరింగ్‌లో ఇండియా గెలవడం కష్టమే అంటున్న అశ్విన్ Publish Date: Jul 14, 2025 2:46PM

వైసీపీ నేతల పుష్ఫ డైలాగ్‌లు.. జగన్ మెహర్బానీ కోసమేగా?

రప్పా.. రప్పా.. డైలాగ్‌పై పేటెంట్ తీసుకున్నట్లు దాన్నే స్లోగన్‌గా మార్చేసుకుంటున్నారు వైసీపీ నేతలు ... జగన్ సైతం ఆ డైలాగ్‌‌ వాడకాన్ని సమర్ధించడంతో ఆయనతో వీరతాళ్లు వేయించుకోవడానికి ఎవరికి వారు ఆ పుష్ఫ డైలాగ్ తెగ రిపీట్ చేస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కొడుకు వరకు ఆ డైలాగ్ వాడుతూ కార్యకర్తలను రెచ్చ గొడుతూ.. పోలీసులకు వార్నింగులిస్తున్నారు. కృష్ణాజిల్లాలో బాబు ష్యూరిటీ మోసం కార్యక్రమాల్లో పాల్గొంటున్న మాజీ మంత్రి పేర్ని నాని రప్పా.. రప్పా..డైలాగ్ పై చేసిన కామెంట్స్‌ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. లోకేష్‌ రెడ్ బుక్ అంటున్నాడు.. మీరు కూడా రప్పా.. రప్పా అంటున్నారు.. ఏదైనా పని చేయాలంటే రప్పా రప్పా అనడం కాదు.. చీకట్లో కన్నుకొడితే పని అయిపోవాలని పేర్నినాని వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మూడు నాలుగు రోజులుగా పేర్ని నాని ఎక్కడకు వెళ్లినా అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైసీపీ కార్యకర్తల విస్తృత  సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటాసాని రామిరెడ్డి కొడుకు ఓబుల్ రెడ్డి కూడా  సినిమా స్టైల్లో డైలాగులు వల్లె వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు సృష్టిస్తున్నారని..  కూటమి నాయకులకు వత్తాసు పలుకుతున్న అధికారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని భారీ వార్నింగ్ ఇచ్చారు.  వైసిపి 2.0 అంటే జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే టిడిపి నాయకుల  తుకులు ఎలా ఉంటాయో చూస్తాం.. అంటూ అనుచిత బాషలో చెలరేగిపోయారు ఓబుల్‌రెడ్డి. మరోవైపు  విద్యాశాఖ మాజీమంత్రి ఆదిమూలపు సురేష్‌కు సైతం రప్పా..రప్పా.. పూనకం రావడం విశేషం. ప్రకాశం జిల్లా కొండేపి వైసీపీ ఇంచార్జ్ ఆదిమూలపు సురేష్ పార్టీ  సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలని రెచ్చగొడుతూ  చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పటివరకు ఒక లెక్క ఇకనుండి కొండేపి నియోజకవర్గంలో మరో లెక్క అంటూ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడి కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మాజీమంత్రి పినిపే విశ్వరూప్ కూడా అదే మంత్రం ఎత్తుకున్నారు.. ఆ ఫ్లోలో రూరల్ సిఐ ప్రశాంత్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ధ్వజమెత్తిన ఆయన.. రాబోయేది  వైసీపీ ప్రభుత్వమని సిఐని విఆర్ లో  పెట్టిస్తానని.. జైల్లో పెట్టించి, ఊచలు లెక్కిపెట్టిస్తానని హెచ్చరించారు . ఒకవైపు కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కార్యక్రమాలు నిర్వహస్తోంది. సంవత్సర కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎంతవరకు అమలు జరిగాయో తెలుసుకొని, అర్హత కలిగి ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల లబ్ది పొందలేని వారికి సంక్షేమ పథకాలను అందజేసేందుకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే,  మంత్రులు వాడవాడకు,ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలు తో పాటు స్థానిక సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే పనిలో పడ్డారు. గెలిచిన తరువాత ఏసీ గదులకు, సొంత కార్యాలయాలకు ... దూరపు నగరాలకు పరిమితం అయిన నేతలు ప్రజల్లోకి వెళ్లటం మొదలు పెట్టారు. దీంతో ప్రజల్లో కూటమి నేతలకు మంచి ఆదరణ లభిస్తోందంటున్నారు. అది గమనించిన వైసీపీ అధిష్టానం టీడీపీ మ్యానిఫెస్టోలో పెట్టిన సూపర్ సిక్స్ పథకాల లో కొన్ని పథకాలను అమలు చెయ్యలేదని దానిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించింది. దీంతో విద్రోహ దినం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా ఆశించిన ఫలితం రాలేదు.  ఆ క్రమంలో వైసీపీ అధిష్టానం వెంటనే .. బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ .. పేరుతో కార్యక్రమానికి పిలుపునిచ్చి నేతలను ప్రజల్లోకి వెళ్లాలని తీర్మానించింది. దీంతో ప్రజల్లోకి వెళ్లేందుకు వారు ఏ మార్గం దొరక్క  కార్యకర్తలను రెచ్చగొడుతున్నారంట.  వైసీపీ అధ్యక్షుడి కార్యక్రమాల్లో కూడా అదే ఉద్దేశ్యంతో కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ప్లెక్సీలు కూడా ఏర్పాటు చేయిస్తుండటం, వాటిని జగన్ సమర్ధిస్తుండటం అందులో భాగమే అంటున్నారు. జగన్ ఎక్కడకు వెళ్లినా అక్కడ భారీ జనసమీకరణతో పాటు ఏదో ఒక గొడవ సృష్టిస్తూ చర్చల్లో నిలవడడమే పనిగా పెట్టుకున్నారు.  పేర్ని నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఉమ్మడి క‌ృష్ణా జిల్లాలో ఇప్పటికే నాలుగైదు కేసులు నమోదయ్యాయి. పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన కాటసాని ఓబుల్ రెడ్డిపై బనగానపల్లె స్టేషన్లో కేసు నమోదు అయింది. కూటమి నేతలు, పోలీసులను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తానంటున్న పినిపే విశ్వరూప్ వంటి వారిపై కూడా కేసు పెట్టడానికి కూటమి శ్రేణులు సిద్దమవుతున్నాయి. మొత్తమ్మీద ఈ రప్పా.. రప్పా.. రాజకీయం ఏ మలుపులు తిరుగుతుందో
వైసీపీ నేతల పుష్ఫ డైలాగ్‌లు.. జగన్ మెహర్బానీ కోసమేగా? Publish Date: Jul 14, 2025 2:40PM

వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి క్యాబినెట్ బెర్త్?

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ఇటీవల అదే నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు నల్లపరెడ్డి ప్రశన్నకుమార్ రెడ్డి చేసిన దారుణ వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఈ విషయంలో కేసు కూడా నమోదైంది. అయితే ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ లేవు. అయితే.. రాజకీయాలతో సంబంధం లేకుండా సర్వత్రా నల్లపరెడ్డి ప్రసన్నకుమారరెడ్డి వ్యాఖ్యలపై ఖండనలు వెల్లువెత్తాయి. మహిళా నేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని సామాన్యజనం కూడా గర్హించారు. సరే ఈ వ్యాఖ్యల తరువాత ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంపై దాడి జరిగిందనుకోండి అది వేరే విషయం.  నెల్లూరు జిల్లాపై వేమిరెడ్డి కుటుంబానికి మంచి పట్టుంది. అన్నిటికీ మించి ఎమ్మెల్యేగా ప్రశాంతి రెడ్డి ప్రజలలో మమేకమై సమస్యల పరిష్కారంలో, నియోజకవర్గ అభివృద్ధిలో దూసుకుపోతున్నారు.   కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి మంచి పేరుంది. ఎమ్మెల్యేగా ఆమె ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ప్రభుత్వ సహకారం కోసం వేచి చూడకుండా నియోజకవర్గంలో తన సొంత ఫౌండేషన్ నిధుల ద్వారా నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడం ద్వారా ఆమె ప్రజలలో మరీ ముఖ్యంగా మహిళలకు బాగా చేరువయ్యారు.  ఈ పరిస్థితుల్లో ఆమెకు ప్రజలలో పెరుగుతున్న పలుకుబడిని జీర్ణించుకోలేక, ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని జనం కూడా నమ్ముతున్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం కూటమి పార్టీల నేతలంతా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి సంఘీభావం ప్రకటించారు. ఆమెకు బాసటగా నిలిచారు. ఇప్పుడు ఆమెను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. త్వరలో చంద్రబాబు తన కేబినెట్ ను విస్తరించనున్నారు. ఈ విస్తరణలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి కేబినెట్ లో చోటు కల్పించడం ద్వారా తెలుగుదేశం మహిళలకు అండగా, బాసటగా నిలుస్తుందన్న సందేశం ఇచ్చినట్లుగా ఉంటుందని తెలుగుదేశం అధినాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.  అలాగే వేమిరెడ్డి కుటుంబానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మంచి పట్టు ఉంది. ఆమె భర్త, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి కూడా బలమైన నేత. ప్రజలలో మంచి పట్టున్న నాయకుడు.   వాస్తవానికి గత ఏడాది ఎన్నికలలో తెలుగుదేశం కూటమి విజయం సాధించి చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన సమయంలోనే తన భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశించారు. అయితే అప్పుడు అది జరగలేదు.   అయితే ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని క్యాబినెట్ లోకి తీసుకోవడం ద్వారా వైసీపీకి గట్టి పట్టున్న కోవూరు నియోజరకవర్గంలో  తెలుగుదేశం పార్టీని పటిష్టం చేయడానికి దోహదం చేస్తుందని తెలుగుదేశం అధినాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.    రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం విజయం సాధించి అధికారంలోకి వచ్చినప్పటికీ నెల్లూరు జిల్లాలో మాత్రం మొత్తం పది స్థానాలలో సైకిల్ పార్టీ కేవలం మూడు స్థానాలలో మాత్రమే విజయం సాధించింది. ఇక 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో కనీసం ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలవ లేకపోయింది. అయితే 2024 ఎన్నికలలో వైసీపీని కూటమి హవా జీరో స్థానాలకు పరిమితం కావడంలో వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పాత్ర కీలకమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికలలో వైసీపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ,  ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థుల విషయంతో తనను జగన్ విశ్వాసంలోకి  తీసుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తికి గురైన వేమిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరారు. ఈ చేరిక జిల్లా రాజకీయాలపై ప్రభావం చూపిందనీ, జిల్లాలో జగన్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలడానికి కారణమైందని అంటున్నారు.  ఈ నేపథ్యంలోనే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని తెలుగుదేశం కూటమి కేబినెట్ లోకి తీసుకోవడం  జిల్లాలో వైసీపీ కోలుకోలేని విధంగా  దెబ్బకొట్టినట్లు అవుతుందని భావిస్తున్నారు. 
వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి క్యాబినెట్ బెర్త్? Publish Date: Jul 14, 2025 11:02AM

పెట్టుబడులు, ఉద్యోగ ఉఫాధి అవకాశాలే లక్ష్యంగా స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు!

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. వచ్చే ఐదేళ్ల కాలానికి కొత్త  అంతరిక్ష విధానాన్ని ప్రకటించిన చంద్రబాబు సర్కార్.. ఈ విధానం అమలుకు ఏపీ స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది.  స్పేస్ పాలసీ ద్వారా పెట్టుబడుల ఆకర్షణ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్, అలాగే స్టార్టప్ లను నిధులు వంటివి లక్ష్యాలుగా పెట్టుకుంది. ఇందు కోసం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లను భాగస్వాములుగా ఆహ్వానించనుంది. ఇక స్పేస్ సిటీ కార్పొరేషన్ ద్వారా అంతరిక్ష ప్రాజెక్టుల అమలు పర్యవేక్షించనుంది.  సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో  స్పేస్ సిటీలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించిన ప్రభుత్వం, ఇందు కోసం అవసరమైన భూకేటాయింపులపై దృష్టి సారించింది.  భూ కేటాయింపులు మరియు దరఖాస్తుల పరిశీలన వంటి ప్రక్రియల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది.  అంతరిక్ష రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడంతో పాటు పాతిక వేల కోట్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందించారు.  ఈ లక్ష్యం నెరవేరితో   ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి కలుగుతుందని అంచనా వేస్తున్నారు.  
పెట్టుబడులు, ఉద్యోగ ఉఫాధి అవకాశాలే లక్ష్యంగా స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు! Publish Date: Jul 14, 2025 9:51AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన.. ఎందుకు? ఎప్పుడు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ లో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ఈ నెల 26 నుంచి ఐదు రోజుల పాటు చంద్రబాబునాయుడు సింగపూర్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ కూడా ఉంటారు. ఉన్నతాధికారుల బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంటుంది.   ఈ పర్యటనలో చంద్రబాబు బృందం సింగపూర్ లో ప్రభుత్వ పెద్దలతో పాటు,  పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతుంది.  ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వారికి వివరిస్తుంది. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి ఏపీ సర్కార్ అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరిస్తుంది. ప్రధానంగా  ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెనెవబుల్ ఎనర్జీ రంగాలలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా చంద్రబాబు సింగపూర్ పర్యటన సాగనుంది.  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన.. ఎందుకు? ఎప్పుడు? Publish Date: Jul 14, 2025 9:32AM

వర్షాకాలంలో రాగి పాత్రలో నీరు తాగితే అద్భుతమే..!

  రుతుపవనాలు వచ్చాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అయితే, వర్షాకాలం వచ్చిన వెంటనే, ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. ఈ వర్షాకాలంలో ఆరోగ్య రక్షణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.  వాటిలో రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు తాగడం ఒకటని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  రాగి పాత్రలో ఉంచిన నీరు ఈ సీజన్‌లో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రాగి నీరు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, అనేక వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది. ఇది అమృతం లాంటిది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. వర్షాకాలంలో నీటి కాలుష్యం ప్రమాదం పెరుగుతుంది, ఇది ఇన్ఫెక్షన్ లకు దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితిలో, రాగి నీరు సురక్షితమైన ఆయుర్వేద నివారణ. రాగి యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నీటిలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది,  నీటిని శుద్ధి చేస్తుంది. రాగి పాత్రలోని నీరు స్వచ్ఛమైనది.  శరీరం నుండి విషాన్ని బయటకు పంపి, శరీరాన్ని ఆరోగ్యంగా,  మనస్సును ఉల్లాసంగా ఉంచడంలో సహాయపడుతుంది. రాగి పాత్రలో నీరు త్రాగడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. ఇది ఆహారాన్ని బాగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.  మలబద్ధకం, అపానవాయువు,  అజీర్ణం వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీనితో పాటు ఈ నీరు మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  మూత్రపిండాలు సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది. రాగి పాత్రలోని  నీరు రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. ఇది వర్షాకాలంలో వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. రాగి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మానికి కూడా మేలు జరుగుతుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది,  ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదం కూడా రాగి పాత్రలో నీరు త్రాగమని సిఫార్సు చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం రాగి నీరు శరీరంలోని త్రిదోషాలను (వాత, పిత్త, కఫ) సమతుల్యం చేస్తుంది. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రాగి పాత్రలో నీటిని రాత్రంతా ఉంచి ఉదయం ఖాళీ కడుపుతో త్రాగడం ఉత్తమం.  కానీ పాత్ర తుప్పు పట్టకుండా ఉండటానికి దానిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం అవసరం. ఈ చిన్న మార్పుతో వర్షాకాలంలో కూడా నీరు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..  
వర్షాకాలంలో రాగి పాత్రలో నీరు తాగితే అద్భుతమే..! Publish Date: Jul 14, 2025 9:30AM

పాలసీల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు!

ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇప్పుడు పాలసీ అనేది కామన్ అయిపోయింది. ఏ రోజు సంపాదన ఆరోజు సరిపోయి ఏదో జీవితం అట్లా సాగుతున్నవాళ్ళు తప్ప పేదల నుండి, మధ్యతరగతి, ధనవంతుల వరకు ఈ పాలసీలలో మునిగి తేలుతున్నారు. ఇంకా చెప్పాలంటే మధ్యతరగతి వారి మీదనే ఈ పాలసీ సంస్థలు కూడా నడుస్తున్నాయంటే కాస్త ఆశ్చర్యం వేస్తుంది. ధనవంతులకు ఈ పాలసీలు ఉన్నా లేకపోయినా ఏమి సమస్య లేదు. పెద్దలు వెనుకేసిన ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్సులు, వ్యాపార లాభాలు వంటివి సమృద్ధిగా ఉండటం వల్ల వారికి పాలసీల గురించి పెద్ద ఆసక్తి కూడా తక్కువే.  అయితే వ్యక్తి నుండి వాహనాలకు, వస్తువులకు, ఇళ్లకు, సంస్థలకు ఇన్సూరెన్స్ చేయించడం అనేది మొదలయ్యాక ఈ ధనవంతులు కూడా వీటితో బాగానే ప్రయోజనాలు పొందుతున్నారు. ఇకపోతే చాలా చోట్ల చాలా కుటుంబాలలో కనిపించే అతి సాధారణ సమస్య ఒకటుంది. శ్రీరామ్ చిట్స్ ఎల్.ఐ.సి హెచ్.డి.ఎఫ్.సి ఇంకా ఇంకా వివిధరకాల బోలెడు సంస్థలు ఎన్నో ఇన్సూరెన్స్ లు అందిస్తున్నాయి. వీటిలో పాలసీలు తీసుకుని వాటిని కడుతున్న వారిలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు అధికంగా ఉంటాయి. అయితే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య పాలసీ చెల్లింపు గడువు రాగానే పైసల కోసం వెతుక్కోవడం. నిజానికి ఈ పాలసీలు కట్టడం మొదలుపెట్టినప్పుడు తప్ప మిగిలిన సందర్భాలలో డబ్బు సమకూర్చుకోవడం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనిక్కారణం సరైన ప్లానింగ్ లేకపోవడమే అనేది చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. సగటు మధ్యతరగతి వ్యక్తి ఆరు నెలలకు ఒకసారి మూడువేల రూపాయల పాలసీ కట్టడానికి నిర్ణయించుకుంటే అతడి నెలవారీ సంపాదనలో ఐదువందల రూపాయలను పక్కన పెడుతుండాలి. ఆ ఆరు నెలల మొత్తం పాలసీ చెల్లింపును ఎలాంటి ఆందోళన లేకుండా చేస్తుంది. కానీ మధ్యతరగతి వాళ్ళు ఈ విషయం గూర్చి ఎక్కువ ఆలోచించరు. తీరా చెల్లింపు గడువు ముందుకొచ్చినప్పుడు అప్పు చేసో లేక వేరే చెల్లింపుల నుండి దీనికి డబ్బు మరల్చడమో చేస్తుంటారు. ఫలితంగానే ఒకవైపు ఇన్సూరెన్స్ లు కడుతూ మరోవైపు అప్పులు చేస్తూ ఉంటారు. ఇదీ సగటు మధ్యతరగతి పాలసీదారుని పితలాటకం. హెల్త్ ఇన్సూరెన్స్ లు వచ్చినప్పటి నుండి ఓ ఆలోచన పురుగులా మెదడును తొలిచేది. చావుకు అగ్రిమెంట్ రాసుకున్నట్టు చస్తే ఆ ఇన్సూరెన్స్ తాలూకూ డబ్బులు బోల్డు వస్తాయని కదా ఇవన్నీ అని. కానీ నిజానికి  పేద, మధ్యతరగతి వ్యక్తులు ఎప్పుడూ ఇంతే కదా కుటుంబచట్రంలో ఇరుక్కుపోయిన జీవులు కదా అనిపిస్తుంది. ఇకపోతే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇలాంటి ఆలోచనలు చేసే మధ్యతరగతి జీవుల వల్ల హాయిగా తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాయి.  సంవత్సరంలో ఈ పాలసీలు కట్టాలనే కోణంలో తమ సంతోషాలు కూడా వధులుకుంటున్న మధ్యతరగతి కుటుంబాలు కోకొల్లలు ఉన్నాయి. మనిషికోక పాలసీ, కానీ సంపాదన ఒకే ఒకరిది. ఇబ్బందులున్నా కట్టడానికే ముందుకు వెళ్తారు. కారణం భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉండటమే.  పాలసీలతో జాగ్రత్త! కొందరుంటారు. ఈ పాలసీ సంస్థలలో పనిచేసే ఎంజెంట్లు. వీళ్ళు పాలసీలు తీయించడం, డబ్బులు వసూలు చేయడం పనిగా చేస్తుంటారు. అదే వారి ఉద్యోగం కూడా. అయితే పాలసీ తీయించేటప్పుడు 90% మంది ఆ పాలసీ వల్ల లాభాలు మాత్రమే చెబుతారు. కానీ దాని వల్ల వచ్చే నష్టాలు ఎవరూ ఏమీ చెప్పరు. చివరకు దానివల్ల ఏదో ఒక నష్టం ఎదురయ్యే దాకా దాని గురించి పాలసీదారుడికి తెలియదు కూడ. ఇలాంటి సంఘటనలు బోలెడు జరుగుతూ ఉంటాయి. సగటు మధ్యతరగతి ఒక సంస్థమీద ఎంతకని పోరాడతాడు. కాబట్టి ఒకటికి బట్టి నాలుగైదు సార్లు తిరుగుతాడు, ఆ తరువాత మోసం చేసిన వాడి నాశనం వాడిదే  అనుకుని కొన్నిరోజులు బాధపడి తిరిగి జీవితమనే పోరాటంలో పడిపోతాడు. కానీ నిజానికి ఆ సంస్థవాడు హాయిగా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ ఉంటాడు. కాబట్టి పాలసీ తీసుకునేటప్పుడు అందులో ప్లస్ పాయింట్స్ మాత్రమే కాదు మైనస్ పాయింట్స్ ఏంటి అనేది మొదట అందరూ తెలుసుకోవాలి. పైన చెప్పుకున్న విషయమంతా చదివాక పాలసీ అంటే భరోసా ఇవ్వాలి కానీ అది చిరాకు పెట్టించేదిగా ఉండకూడదని అందరికీ ఆర్గమయ్యే ఉంటుందనుకుంటా! ◆ వెంకటేష్ పువ్వాడ  
పాలసీల విషయంలో తీసుకోవలసిన  జాగ్రత్తలు! Publish Date: Jul 14, 2025 9:30AM

సైనా, కాశ్యప్ వివాహబంధానికి ఎండ్ కార్ట్.. విడాకులు తీసుకోనున్న స్టార్ షట్లర్లు

బ్యాడ్మింట్ స్టార్ కపుల్ సైనా నెహ్వాల్,  పారుపల్లి కశ్యప్ తమ వివాహ బంధం నుంచి విడిపోవడానికి నిర్ణయించుకున్నారు. తాము విడాకులు తీసుకుంటున్న విషయాన్ని సైనా నెహ్వాల్ సామాజిక మాధ్యమ వేదికగా ప్రకటించారు. తాము విడిపోవాలన్న నిర్ణయం తీసుకున్నామనీ, అన్నీఆలోచాంచిన తరువాతే కాశ్యప్ తో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సైనా నెహ్వాల్ పేర్కొన్నారు.  ఇద్దరం కలిసి అన్ని చర్చించుకుని ఈ నిర్ణయం తీసుకున్నామనీ, జీవితంలో వేరువేరుగా ముందుకు సాగాలని భావించామని తెలిపిన సైనా.. ఈ విషయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరుతున్నామన్నారు.   సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ఇరువురూ కూడా  హైదరాబాద్ లోని గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందిన వారే. అక్కడే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. తమ ప్రేమ బంధాన్ని పెళ్లిబంధంగా మార్చుకున్నారు.   2018 డిసెంబర్ లో సైనా, కశ్యప్ ల వివాహం జరిగింది. ఇప్పుడు తాజాగా ఆదివారం (జులై 13) తమ ఏడేళ్ల వివాహబంధానికి ముగింపు పలుకుతున్నట్లుగా సైనా నెహ్వాల్ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటన క్రీడా వర్గాల్లో సంచలనం సృష్టించింది.   సైనా నెహ్వాల్ 2008 లో బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ జూనియర్ ఛాంపియన్ షిప్ విజయంతో  ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. అదే ఏడాది ఆమె ఒలింపిక్స్ లో ఆడింది. తొలి ప్రయత్నంలోనే క్వార్టర్ ఫైనల్ వరకూ వెళ్లి ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా షట్లర్ గా నిలిచింది.  ఆ తరువాత నాలుగేళ్లకు  తొలి ఒలింపిక్ పతకం సాధించింది.  2012 ఒలింపిక్స్ లో సైనా నెహ్వాల్ బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. సైనాకు 2009లో అర్జున, 2010లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాలు దక్కాయి. ఇక పారుపల్లి కశ్యప్ విషయానికి వస్తే 2014 కామన్వెల్త్ గేమ్స్ లో అతడు స్వర్ణపతకం సాధించాడు. 32 ఏళ్ల తరువాత కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించిన తొలి షట్లర్ గా రికార్డు సాధించాడు. అలాగే ఒలింపిక్స్ లో క్వార్టర్ పైనల్ కు చేరిన తొలి ఇండియన్ షట్లర్ గా నిలిచాడు. 2024లో షటిల్ బ్యాడ్మింటన్ నుంచి రిటైర్ అయిన కాశ్యమ్ ఇప్పుడు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.  
సైనా, కాశ్యప్ వివాహబంధానికి ఎండ్ కార్ట్.. విడాకులు తీసుకోనున్న స్టార్ షట్లర్లు Publish Date: Jul 14, 2025 9:19AM

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం..తొమ్మండుగురు మృతి

అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. జిల్లాలోని పుల్లంపేట మండలం రెడ్డి పల్లె కట్టపస మామిడికాయల లోడ్ తో వెడుతున్న లారీ బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలంలోనే ఆరుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని రాజంపేట, తిరుపతి ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన  వ్యక్తం అవుతోంది.  ప్రమాదం జరిగిన సమయంలో లారీలో 18 మంది ఉన్నారు.  మృతులూ, క్షతగాత్రులు కూడా మామాడి కోసే  ఈ ప్రమాదంతో కడప, తిరుపతి మార్గంలో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. బోల్తాపడిన లారీని క్రేన్ సాయంతో పక్కకు తీసి పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.  పుల్లంపేట పోలీసులు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం..తొమ్మండుగురు మృతి Publish Date: Jul 14, 2025 8:59AM

మోదీ @75.. వాట్ నెక్స్ట్?

సెప్టెంబర్ 17.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు.  దేశ విదేశీ ప్రముఖులు, అయన తమ కుటుంబంగా భావించే 140 కోట్ల మంది భారతీయులు శుభాకాంక్షలు చెపుతారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని, ప్రత్యేక  కార్యక్రమాలు నిర్వహిస్తే నిర్వహించవచ్చు.  ప్రత్యేక పథకాలు ప్రకటిస్తే ప్రకటించవచ్చు. అలాగే బీజేపీ రక్తదాన శిబిరాల వంటి  సేవా కార్యక్రమాలు నిర్వహించినా నిర్వహించవచ్చు. అంతేనా అంటే బీజేపీ ముఖ్యనాయకుల నుంచి అంతే అనే సమాధానం వస్తోంది.  నిజంగా అంతే పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.  కానీ..  మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ.. అంటే గత పదేళ్లుగా జరుగుతున్నది అంతే కావచ్చు. కానీ..  ప్రధానిగా మోదీ జరుపుకునే  11వ పుట్టిన రోజుకు అంతకు మించిన ప్రత్యేకత, ప్రాధాన్యతా ఉంది. 1950 సెప్టెంబర్ 17న జన్మించిన మోదీకి, 2025 సెప్టెంబర్ 17న 75 వంతాలు నిండుతాయి. ఆయన 76వ  వసంతంలోకి అడుగు పెడతారు. అంటేజజ  బీజేపీ అప్రకటిత  పదవీ విరమణ వయోపరిమితి  నియమం ప్రకారం అదే రోజున ప్రధాని మోదీ పదవీ విరమణ చేయవలసి ఉంటుంది.  అంటే రాజీనామా చేయవలసి ఉంటుంది.   అయితే.. బీజేపీ నాయకత్వం ఇప్పటికే  పార్టీ రాజ్యాంగంలో వయో పరిమితి నియమం ఏదీ లేదని ఒకటికి పది సార్లు స్పష్టం చేసింది. అలాగే.. మోదీ ఈ ఐదేళ్లే కాదు ఆ పై ఐదేళ్ళు (2029-2034) కూడా పదవిలో కొనసాగుతారని అమిత్ షా  సహా సీనియర్ నాయకులు వేర్వేరు సందర్భాలలో స్పష్టం చేస్తూనే ఉన్నారు. అయితే, పార్టీ అగ్ర నేతలు  అద్వానీ, మురళీ మనోహర్ జోషి, జస్వంత్ సింగ్, యశ్వంత్ సిన్హా.. వయోపరిమితి కారణంగానే క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారని.. నిజానికి, అప్పట్లో 75 ఏళ్ల వయోపరిమితిని నిర్ణయించింది కూడా  మోదీనే కదా అని కొందరు గుర్తు చేస్తున్నారు. స్వయంగా ఆయనే తీసుకువచ్చిన నియమాన్ని, నిబంధనను ఆయనే ఉల్లంగిస్తే ఎలా అనే ప్రశ్న కూడా   తెరపైకి వస్తూనే వుంది. అయినా..  పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ, ఇంత వరకు మోదీ రిటైర్మెంట్  గురించి సీరియస్  చర్చ జరిగిన సందర్భాలు లేవు. నిజానికి, ఇంతవరకు   ప్రధాని  మార్పు   సంకేతాలు రాజకీయ వాతావరణంలో  సంకేత మాత్రంగా అయినా కనిపించడం లేదు.  కానీ..  వారో వీరో ఇంకెవరో కాకుండా..  ఏకంగా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్  ఆర్ఎస్ఎస్  సర్ సంఘ చాలక్ మోహన్‌ భాగవత్‌’ వయోపరిమితి అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ నెల 9న  నాగాపూర్ లో సంఘ్ ప్రచారక్  మోరో పంత్ పింగ్లే  జీవిత చరిత్ర, పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ..  భాగవత్  రిటైర్మెంట్  ప్రస్తావన తెచ్చారు. ఎప్పుడో, మోరో పంత్ పింగ్లే  తన 75 వ పుట్టిన రోజు నాడు నాకు 75 సంవత్సరాలు నిండినందుకు గాను మీరంతా నన్ను సత్కరించారు. కానీ దాని అర్థం నాకు తెలుసు. 75 సంవత్సరాల వయసులో శాలువా కప్పారంటే.. ఇక నీకు వయసైపోయింది, కాస్త పక్కకు జరుగు, మమ్మల్ని చేయనివ్వు అనే దాని అర్థం  అంటూ చేసిన సరదా వ్యాఖ్యను, మోహన్‌ భాగవత్‌  తనదైన శైలిలో ప్రముఖంగా ప్రస్తావించారు.  75 ఏళ్లు ఒంటిమీదకు వచ్చి శాలువా కప్పించుకున్నామంటేనే.. వయసు మీరిందనీ,  బాధ్యతల నుంచి తప్పుకొని మరొకరికి అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలి  అని పింగ్లే అనేవారని చెప్పారు.  నిజానికి, మోదీ కంటే ఓ ఆరు రోజులు ముందే అంటే సెప్టెంబర్ 11న తన  75 పుట్టినరోజు జరుపుకుంటున్న మోహన్‌ భాగవత్‌ తన  రిటైర్మెంట్  గురించే వ్యాఖ్య చేశారో.. లేక మోదీకి రిటైర్మెంట్   సమయం దగ్గర పడిందని గుర్తు చేయడానికే ఆయన ఆ వ్యాఖ్య చేశారో తెలియదు కానీ ఆర్ఎస్ఎస్ అధినేత చేసిన వ్యాఖ్య  రాజకీయ, మీడియా వర్గాల్లో   సంచలనంగా మారింది.  ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు  ఆర్ఎస్ఎస్ అధినేత  ప్రధాని మోడీ పదవి నుంచి దిగిపోవలసిన సమయం వచ్చేసిందని పరోక్ష సంకేతం అందించారని వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో అద్వానీ, జోషీ, జస్వంత్‌ సింగ్‌లకు వర్తించిన నియమం  మోదీ కి ఎందుకు వర్తించదని ప్రశ్నిస్తున్నారు.  అయితే..  విపక్షాల విషయం ఎలా ఉన్నా మోదీ రిటైర్మెంట్  తీసుకునే అవకాశం ఉందా  అంటే..  అలాంటి ఆలోచనే లేదని, బీజేపీ  వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.  ప్రధానమంత్రి నరేంద్రమోదీకి 75 సంవత్సరాలు అనే నిబంధన వర్తించబోదని ఆర్‌ఎ్‌సఎస్‌  కీలక నేత దిలీప్‌ దేవధర్‌ కూడా అన్నారు. బీజేపీలోని మార్గదర్శక మండలి సభ్యులకు మాత్రమే 75 ఏళ్లు అనే నిబంధన వర్తిస్తుందని ఐదేళ్ల క్రితమే మోహన్‌ భాగవత్‌ వివరణ ఇచ్చారని దిలీప్‌ దేవధర్‌ గుర్తుచేశారు.  అయితే..  కొద్ది నెలల క్రితం ప్రధాని మోదీ, పదేళ్ళలో తొలిసారిగా నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాని కార్యాలయానికి వెళ్లి  మోహన్ భాగవత్ సహా సంఘ్ పెద్దలతో ఏకాంత సమావేశాలు నిర్వహించారు. అప్పట్లోనే మోదీ రిటైర్మెంట్ అంశం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపధ్యంలో, మోహన్ భాగవత్ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే..  సెప్టెంబర్ 17 తర్వాత, ఏమి జరుగుతుంది,అంటే.. సంఘ్ వర్గాలతో సన్నిహిత సంబంధాలున్న సీనియర్ జర్నలిస్ట్ మిత్రుడు ఒకరు  సెప్టెంబర్ 17 తర్వాత ఏమి జరుగుతుంది ..సెప్టెంబర్ 18 వస్తుంది.. అంతకు మించి మరో మార్పు ఉండదని సెటైర్ వేశారు.  అయినా, సెప్టెంబర్ 17 వచ్చి పోయేవరకు  ఈ సస్పెన్స్ కొనసాగేలానే వుందని అంటున్నారు.
మోదీ @75..  వాట్ నెక్స్ట్? Publish Date: Jul 14, 2025 6:41AM

కడప మునిసిపల్ పాఠశాలలో స్మార్ట్ కిచెన్.. పవన్ కల్యాణ్ సొంత నిధులతో ఏర్పాటు

కడపలో మధ్యాహ్న భోజన పథకం కోసం దేశంలో మొట్టమొదటి స్మార్ట్ కిచెన్ ఏర్పాటైంది. కడపమునిసిపల్(మెయిన్ )హైస్కూల్ ల్లో ఈ స్మార్ట్ కిచెన్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సొంత నిధులతో ఏర్పాటైంి.  డొక్కా మాణిక్యమ్మ మధ్యాహ్నా బడి  భోజనం పథకంలో భాగంగా ఈ స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేశారు.   ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుండి స్మార్ట్ కిచెన్  ద్వారా రుచికరమైన,శుబ్రమైన భోజనం విద్యార్థులకు అందించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతోంది.  మొదటి మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలలో భాగంగా కడప మునిసిపల్ హైస్కూలులో జరిగిన కార్యక్రమానికి వచ్చిన డిప్యూటీ సీఎం  పవన్ కళ్యాణ్   విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే  విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.  ఈ పాఠశాలలో కట్టెల పొయ్యి మీద భోజనాలు చేసి పిల్లలకు వడ్డించడాన్నిగమనించిన డిప్యూటీ సీఎం మధ్యాహ్న భోజనాన్ని  శుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణంలో వండించాలన్న ఉద్యేశంతో  తన సొంత నిధులు అందించారు.ఆ నిధులతో స్మార్ట్ కిచెన్ ఏర్పాటైంది.    ఈ ఆధునిక వంటశాల ద్వారా ప్రస్తుతం 12 పాఠశాల లోని దాదాపుగా 2,200 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. మధ్యాహ్న భోజన మెనూ ప్రకారం అత్యంత పరిశుభ్రం గా రుచికరంగా, నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు.   స్టార్ హోటల్ కిచెన్ తరహాలో  ఏర్పాటైన ఈ స్మార్ట్ కిచెన్ లో  పని చేస్తున్న వంట కార్మికులు, డ్రెస్ కోడ్ తో పాటు వంట వార్పులలో పరిశుభ్రతా చర్యలు పాటిస్తున్నారు. స్మార్ట్ కిచెన్ పరికరాలు, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్, ఆటోమేషన్ ద్వారా ఆధునిక పద్ధతిలో వంటకాల తయారీ చేపడుతున్నారు. ఆహార రవాణా వాహన ట్రాకింగ్ లను మొబైల్ ఫోన్ ద్వారా నియంత్రిస్తున్నారు.స్మార్ట్ కిచెన్ లో బల్క్ కుకింగ్ ఏరియా,స్టోరేజ్  రూమ్, గ్రైండింగ్ ఏరియా, వెజిటబుల్ కటింగ్ ఏరియా, ఫ్రూట్ ఆనియన్ స్టోర్ , పాట్ వాష్ స్టార్ హోటల్లో ఉండే సదుపాయాలతో పాటు స్మార్ట్ కిచెన్ భద్రత కట్టు దిట్టంగా ఏర్పాటు చేశారు. ప్రతి కిచెన్ కు నుండి 3 కిలో వాట్ల సోలార్ పవర్ జనరేషన్ యూనిట్లు ఏర్పాటు చేశారు.  .మిగిలిపోయిన భోజన పదార్థాలు మరియు కూరగాయల వ్యర్థాలను  బయో డిగ్రేషన్ ద్వారా మిథైన్ గ్యాస్ గా మార్చి వంటకు ఉపయోగిస్తున్నారు. వంట వండే సిబ్బందికి న్యూట్రిషనలిస్టు ద్వారా శిక్షణ ఇప్పిచ్చి వంట వండే విధానం లో న్యూట్రిషన్ విలువలు పోకుండా చర్యలు తీసుకుంటున్నారు విద్యార్థులకు ఒక్కోరోజు ఒక్కో రకమైన మెనూలో కూడిన బోజనాలు అందిస్తున్నారు.  సోమవారం తెల్లన్నం, కూరగాయల కూర, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కి అందిస్తున్నారు. మంగళవారం: పులగం,నిమ్మకాయల/ చింతపండు పులిహోర, పల్లి చట్నీ, గుడ్లు, రాగిజావ,   ఇక బుధవారం  తెల్లన్నం, కూరగాయల సాంబార్, ఉడకపెట్టిన గుడ్లు, చిక్కి అందిస్తున్నారు.  గురువారం  కూరగాయల అన్నం, గుడ్ల కూర, రాగిజావ, అలాగే శుక్రవారం  తెల్లన్నం ఆకుకూర పప్పు ఉడకపెట్టిన గుడ్లు, చిక్కిఅందిస్తున్నారు. ఇక శనివారం  తెల్లన్నం, కందిపప్పు చారు, బెల్లం పొంగలి రాగి జావ  అందిస్తున్నారు
కడప మునిసిపల్ పాఠశాలలో స్మార్ట్ కిచెన్.. పవన్ కల్యాణ్ సొంత నిధులతో ఏర్పాటు Publish Date: Jul 14, 2025 6:09AM

ముఖ్యమంత్రి నివాసానికి బాంబు బెదిరింపు

  కేరళ సీఎం పినరయి విజయన్ అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.  క్లిఫ్‌ హౌస్‌ వద్ద బాంబు పేలుళ్లు జరగబోతున్నాయంటూ ఇ-మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయన నివాసంలో విస్తృతంగా తనిఖీలు చేసి.. అది నకిలీ ఇ-మెయిల్‌గా తేల్చారు. బాంబు బెదిరింపు తర్వాత సీఎం నివాసాన్ని డాగ్‌ స్క్వాడ్‌, బాంబు స్క్వాడ్‌లతో క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించాం.   కానీ ఎక్కడా అనుమానాస్పదంగా కనబడలేదు’’ అని పోలీసులు వెల్లడించారు. తనిఖీల సమయంలో ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం విదేశాల్లో ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కీలక సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల వచ్చిన బాంబు బెదిరింపుల వ్యవహారంతో తాజాగా వచ్చిన ఇ-మెయిల్‌కు సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు  
 ముఖ్యమంత్రి నివాసానికి బాంబు బెదిరింపు Publish Date: Jul 13, 2025 6:16PM

పామ్ ఆయిల్ మంత్రి

  రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి, ఇరిగేషన్ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి వంటి శాఖల మంత్రులను మనం ఇప్పటి వరకు చూశాం.. కాని  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగా పామ్ ఆయిల్ మంత్రి వచ్చారు..జిల్లాలో ఆయన పామ్ ఆయిల్ సాగుపై దృష్టి సారించారు. ఏ కార్యక్రమాని హాజరైనా పామ్ ఆయిల్ సాగుపై అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. దీంతో ఆయనను జిల్లా రైతులు ముద్దుగా పామ్ ఆయిల్ మంత్రి గా పిలుచుకుంటున్నారు.. ఆయన ఎవరో కాదు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు… స్వతహాగా రైతు అయిన తుమ్మలకు వ్యవసాయ రంగంలో మంచి పట్టుంది. గతంలో కూడా ఆయన ఏ శాఖ మంత్రిగా పనిచేసినా జిల్లాలో నీటి వనరుల అభివృద్ధి, వ్యవసాయ విస్తరణ పైనే ఎక్కువగా శ్రద్ధ చూపేవారు.  తన స్వగ్రామం గండుగుల పల్లిలో వందల ఎకరాల్లో వాణిజ్య పంటలను సాగుచేస్తున్నారు. మిర్చి, పత్తి వంటి సాంప్రదాయక పంటలను వదిలేసి పామ్ ఆయిల్ , కొబ్బరి, వక్క, మిరియాలు, కోకో సాగు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రిగా ఎంత తీరికలేని పనులు ఉన్నా ఏ మాత్రం సమయం దొరికినా స్వగ్రామం వైపు పరుగులు తీస్తారు. అర్ధరాత్రి సమయంలో కూడా గ్రామానికి చేరుకుని ఉదయాన్నే పంట పొలాల్లో ప్రత్యక్షం అవుతారు. అక్కడ పొలం పనిచేసే కార్మికులకు సలహాలు సూచనలు ఇస్తారు. ఈ రకంగా వ్యవసాయం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇదే ఒరవడిని జిల్లాలో రైతాంగం కూడా అలవర్చుకోవాలని ఆయన తాపత్రయ పడుతున్నారు. జిల్లాలో పత్తి, మిర్చి పంటలు సాగుచేసే ఆరుగాలం కష్టపడినా పెట్టుబడి ఖర్చులు కూడా రాక రైతులు అప్పుల పాలు అవుతున్నారు.  ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి గా బాధ్యతలను స్వీకరించిన వెంటనే ఆయన పామ్ ఆయిల్ సాగుపై ప్రత్యేక దృష్టిసారించారు. జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా రైతులు పామ్ ఆయిల్ సాగుచేయాలని ప్రోత్సహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే సుమారు 40 వేల ఎకరాల్లో రైతులు పామ్ ఆయిల్ సాగుచేస్తున్నారు. ఈ జిల్లాలో మరో 7,500 ఎకరాల్లో సాగు లక్ష్యం నిర్దేశించారు. ఇప్పటికే 4,500 ఎకరాల్లో కొత్తగా సాగు చేస్తున్నారు.. మరో 3000 ఎకరాల్లో సాగు లక్ష్యంగా అధికార్లను పరుగులు పెట్టిస్తున్నారు. జిల్లాలో తాను పాల్గనే ఏ కార్యక్రమం అయినా ఓ ఐదు నిమిషాలు పామ్ ఆయిల్ సాగు గురించి మాట్లాడటం  ఆనవాయితీ మార్చుకున్నారు. దీంతో ఆయను ఇప్పటి వరకు ఇరిగేషన్ మంత్రిగా, ఆర్ అండ్ బీ మంత్రిగా పిలుచుకున్న అభిమానులు ఇప్పుడు పామ్ అయిల్ మంత్రిగా నామకరణం చేశారు
పామ్ ఆయిల్ మంత్రి Publish Date: Jul 13, 2025 5:24PM

విడాకులు మంజూరవ్వడంతో.. పాలతో స్నానం చేసిన యువకుడు

  ప్రియుడితో పారిపోయిన భార్యతో విడాకులు మంజూరవ్వడంతో పునర్జన్మ లభించిందని 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు భర్త. అస్సాం రాష్ట్రం నల్బాడీ జిల్లా ముకుల్మువా గ్రామంలో భార్యతో విడాకులు మంజూరైన ఆనందంలో భర్త మాణిక్ అలీ  వేడుక చేసుకున్నారు. భార్యతో విభేదాల నేపథ్యంలో కోర్టుకెక్కిన ఓ జంటకు విడాకులు మంజూరయ్యాయి. కోర్టు తీర్పు విన్నాక ఇంటికి చేరుకున్న భర్త.. 40 లీటర్ల పాలతో స్నానం చేసి తాను ఇక స్వేచ్ఛాజీవినని సంతోషం వ్యక్తం చేశాడు.   తన భార్య కు ఓ ప్రియుడు ఉన్నాడని మాణిక్ అలీ చెప్పాడు. తనతో పెళ్లియి ఓ బిడ్డ పుట్టినా ఆమె తన లవర్ తో బంధం కొనసాగించిందని ఆరోపించాడు. తనను, తన బిడ్డను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయిందని చెప్పాడు. ఒక్కసారి కాదు రెండుసార్లు అలాగే వెళ్లిపోయిందన్నాడు. మొదటిసారి తప్పు చేసినప్పుడు బిడ్డ కోసం తాను ఆమెను క్షమించానని చెప్పాడు. మళ్లీ మళ్లీ అదే తప్పు చేయడంతో భరించలేక విడాకులు తీసుకున్నానని వివరించాడు. విడాకులు పొందాక కొత్త జన్మ ఎత్తినట్లుగా ఉందని, కొత్త జీవితం ప్రారంభానికి గుర్తుగా పాలతో స్నానం చేశానని మాణిక్ అలీ చెప్పాడు.  
విడాకులు మంజూరవ్వడంతో.. పాలతో స్నానం చేసిన యువకుడు Publish Date: Jul 13, 2025 5:11PM

తీన్మార్‌ మల్లన్నను వెంటనే అరెస్టు చేయాలి : ఎమ్మెల్సీ కవిత

  తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ  తీన్మార్‌ మల్లన్నను అరెస్టు చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. తనపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేయడంపై స్పందించిన ఆమె.. మల్లన్న దారుణంగా మాట్లాడారని ఆక్షేపించారు. మల్లన్నను వెంటనే అరెస్ట్ చేయకతే సీఎం రేవంత్, మల్లన్నతో మట్లాడించినట్లేనని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై చర్యలు తీసుకోకపోతే తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిట్లేనని మండిపడ్డారు. తాను మాములు ఆడబిడ్డను కాదని..అగ్గిరవ్వనని కవిత అన్నారు. తనలాంటి వాళ్లను కోట్లలో తయారు చేస్తానన్నారు.  శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుగోబోమని ఈ సందర్భంగా కవిత స్పష్టం చేశారు. మహిళలు రాజకీయాల్లో మాట్లాడకూడదా అని కవిత ప్రశ్నించారు.ప్రజలపై కాల్పులు జరిపేంత క్రూరత్వం ఏంటి? అని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డను ఇష్టమొచ్చినట్లు మాట్లాడి.. మాండలికం అంటే ఎట్లా? అని కవిత అడిగారు. ఆడబిడ్డలను గౌరవించడం నేర్చుకోండన్న కవిత.. తీన్మార్‌ మల్లన్న నాపై దారుణంగా మాట్లాడారని చెప్పారు. వెంటనే తీన్మార్‌ మల్లన్నను అరెస్ట్‌ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి విచక్షణతో మాట్లాడాలని తీన్మార్ మల్లన్నకు కవిత సలహా ఇచ్చారు.
తీన్మార్‌ మల్లన్నను వెంటనే అరెస్టు చేయాలి : ఎమ్మెల్సీ కవిత Publish Date: Jul 13, 2025 4:13PM

వైరా బీఆర్ఎస్‌లో అయోమయం.. ఇంచార్జీ లేక క్యాడర్ గందరగోళం

  రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి జోరుగా పావులు కదుపుతున్న బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో మాత్రం అయోమయంలో పడింది. తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ సీపీఐ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి పోటీచేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన  మదన్ లాల్ గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీచేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలతోపాటు ఖమ్మం పార్లమెంట్ స్థానం గెలుచుకున్నారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో మదన్ లాల్ టీఆర్ఎస్ లో చేరారు. దీంతో తనను కాదని మదన్ లాల్ టీఆర్ఎస్ లో పొంగులేటికి నచ్చలేదు.. ఈ నేపథ్యంలో మదన్ లాల్ - శ్రీనివాస్ రెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయి.  ఆ తరువాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరారు. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి మళ్లీ మదన్ లాల్ కు టీఆర్ఎస్ టికెట్ దక్కింది. మరోవైపు మదన్ లాల్ ను ఎలాగైనా ఓడించాలని పట్టుదలగా పొంగులేటి రాములు నాయక్ ను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపి గెలిపించారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో వర్గపోరు కొనసాగుతోంది.. తిరిగి 2013 ఎన్నికల్లో మళ్లీ మదన్ లాల్ బీఆర్ఎస్ నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి రాందాస్ నాయక్ చేతిలో ఓడిపోయారు.. మదన్ లాల్ ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని బలమైన వర్గం డిమాండ్ చేస్తోంది.. ఈ నేపథ్యంలోనే మదన్ లాల్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఇప్పుడు మళ్లీ ఇంచార్జ్ పదవిపై వర్గపోరు ప్రారంభమైంది.  త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న తరుణంలో నియోజకవర్గ ఇంచార్జ్ లేకపోవడంతో క్యాడర్ గందరగోళానికి గురవుతోంది. అధిష్ఠానం కూడా వైరా నియోజకవర్గం పై పెద్దగా దృష్టి సారించడం లేదు. జిల్లా పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలు సహజంగా ఆ నియోజకవర్గంలో ప్రతిబింబించేలా ఉన్నాయి. మదన్ సతీమణి తోపాటు మరో ఇద్దరు నేతలు ఇంచార్జ్ పదవికి పోటీపడుతున్నారు.. ఎవరి లాబీయింగ్ వారు చేస్తున్నారు. అధిష్ఠానం మౌనంగా ఉండటంతో నియోజకవర్గంలో గందరగోళం నెలకొంది.
వైరా బీఆర్ఎస్‌లో అయోమయం.. ఇంచార్జీ లేక క్యాడర్ గందరగోళం Publish Date: Jul 13, 2025 3:38PM

కోటకు సీఎం చంద్రబాబు నివాళులు

  ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు పార్థివదేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. హైదరాబాద్‌లో ఫిల్మ్‌నగర్‌లోని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు చాలా బాధాకరమన్నారు. సినీపరిశ్రమకు ఎనలేని సేవలందించారని కొనియాడారు.  కోటకు నాకు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీయే కూటమి నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. నటన అంటే ఏవిధంగా ఉండాలో.. 40 ఏళ్ల పాటు నటించి చూపించారన్నారు. .   సినిమాలతో పాటు ప్రజాసేవలోనూ కృషి చేశారు. కోటాకు 9 నంది అవార్డులు వచ్చాయని అవార్డులు రావడానికి ఆయన కృషి, ప్రతిభే కారణం. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని చంద్రబాబు తెలిపారు.  
కోటకు సీఎం చంద్రబాబు నివాళులు Publish Date: Jul 13, 2025 2:07PM

మహాంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్

  లష్కర్ బోనాల సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు సీఎంకు తీర్థప్రసాదాలు వేదాశీర్వచనాలిచ్చారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌ ఉన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి జరగాలని అమ్మవారిని రేవంత్‌రెడ్డి ప్రార్థించారు. మహాకాళి బోనాల జాతర ఘనంగా సాగుతోంది. ఆలయం వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా 6 క్యూలైన్లు ఏర్పాటు చేశారు.అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. నేడు బోనాలు, ఫలహారబండ్ల ఊరేగింపు, 14న రంగం, పోతరాజుల గావు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు జరగనుంది.  భక్తుల కోసం ప్రత్యేకంగా రెండు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. శివసత్తులకు ప్రత్యేకంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఆర్పీరోడ్, బాట షో రూం నుంచి ప్రవేశం కల్పించారు. దేవాలయానికి భక్తులు వెళ్లేందుకు వివిధ మార్గాల్లో పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. లష్కర్ బోనాల జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఉజ్జయిని మహంకాళి బోనాలకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు.
మహాంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ Publish Date: Jul 13, 2025 1:36PM

జ‌గ‌న్‌కి ఇంత ప‌బ్లిక్..ఎలా వ‌స్తారో మీకు తెలుసా?

  జ‌గ‌న్ చుట్టూ ఇంత మంది జ‌నం.. రియ‌లా ఫేకా? అస‌లేంటీ పొలిటిక‌ల్ ప‌బ్లిక్ స్టోరీ? అన్న‌దిప్పుడు చ‌ర్చ‌నీయాంశం. బేసిగ్గా జ‌గ‌న్ కి బీసీ-ఎస్సీ-ఎస్టీ- ముస్లిం- క్రిష్టియ‌న్- మైనార్టీల్లో ఓటు బ్యాంకు ఉన్న మాట నిజం. ఆ సాలీడ్ ఓటు బ్యాంకే మొన్న‌టి ఎన్నిక‌ల్లో 39 శాతం ఓట్లు ప‌డేలా చేసింది. ఈ ఓటర్లు నిజానికైతే.. అంత ఫ్రీగా దొరికే వారు కాదు. ఎందుకంటే వీరు దైనంద‌ని జీవితాల్లో య‌మ బిజీగా ఉంటారు. కార‌ణ‌మేంటంటే వారు నిత్యం ఏదో ఒక ప‌నీ పాట చేసుకోకుంటే పూట గ‌డ‌వ‌దు. ఒక ర‌కంగా  చెబితే రెక్కాడితే గానీ డొక్కాడ‌దు. అలాంటి  జ‌నం జ‌గ‌న్ రావ‌డంతోటే ఇంత‌గా రోడ్డెక్క‌తారా? ఒక సినిమా న‌టుడికి మ‌ల్లే ఇంత‌గా పిచ్చెక్కి ఆయ‌నపై ఎగ‌బ‌డ‌తారా? అన్న‌దొక స‌స్పెన్స్. అయితే ఇక్క‌డే కొంద‌రికి ఒక‌ డౌట్ వ‌స్తోంది. కార‌ణ‌మేంటంటే.. ఇదంత ఒరిజిన‌ల్ ఫ్యాన్ బేస్ కాద‌న్న‌ది ఒక అంచ‌నా. కార‌ణం మ‌నం ఇందాకే మాట్లాడుకున్నాం. జ‌గ‌న్ కి ఉన్న ఓటు బ్యాంకు ఎలాంటిదో గుర్తు చేసుకున్నాం. వారంత తీరిగ్గా.. ఇలాంటి రాజ‌కీయ దండ‌యాత్ర‌ల‌కు రారు.   ఒక వేళ‌ వ‌స్తే.. ఇంట్లో పొయ్యిలో పిల్లి ఆ రోజంతా అలాగే నిద్ర పోయే ప‌రిస్థితి.మ‌రి వీరంతా ఎవ‌రు? ఎక్క‌డి నుంచి వ‌స్తున్నారు? వీరికేం ప‌నీ పాటా లేదా? అంటే ఇక్క‌డ కూడా మ‌నకొక ఉదాహ‌ర‌ణ దొరుకుతుంది. తాజాగా పేర్ని  నాని ఒక వీడియో లీక్ అయ్యింది. ఆయ‌న జ‌నాన్ని ఎలా పుర‌మాయిస్తారో అన్న విష‌యం పిచ్చ క్లారిటీతో ఈ వీడియోలో మ‌న‌కు క‌నిపిస్తుంది. అంతే కాదు గ‌తంలో జ‌గ‌న్ అధికారంలో ఉండ‌గా.. ఆయ‌న ప్రోగ్రామ్స్ కి ఏ టూ జెడ్ స‌ర్వీస్ అందించే వారున్నారు. ఈ బాధ్య‌త‌ల‌న్నిటినీ త‌ల‌శిల ర‌ఘురామ్ చూసుకునే వార‌ని చెబుతారు. ఇక స్క్రిప్టింగ్ కి ఒక టీమ్ ఇలా.. జ‌గ‌న్ త‌న పొలిటిక‌ల్ జ‌ర్నీలో ఇలాంటి వంధిమాగ‌ధులను పుష్క‌లంగా నియ‌మించుకున్న‌ట్టు తెలుస్తోంది. వీరంద‌రికీ అధినాయ‌క‌త్వం పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వ‌హించ‌గా.. ఆయ‌న కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి ప‌ర్య‌వేక్ష‌ణ‌ చేస్తుంటారట‌. జ‌గ‌న్ చుట్టూ ఇంత కోట‌రీ వ‌ర్క్ చేస్తూ ఉంటుంది. ఈ కోట‌రీ ప‌న‌ల్లా ఏంటంటే.. జ‌గ‌న్ ఎ క్క‌డికి వ‌స్తే అక్క‌డికి జ‌నాన్ని తోల‌డం. ఆయా ఏర్పాట్లు చేయ‌డం. మొన్న‌టికి మొన్న బంగారు పాళ్యం మామిడి కాయ‌ల వ్య‌వ‌హారం చూసే ఉంటాం. త‌న ప‌ల్నాడు ప‌ర్య‌ట‌న‌లో ఏ విధంగా.. త‌ల‌కాయ‌ను త‌న కారు టైర్ల కింద వేసి తొక్కించాడో స‌రిగ్గా అలాగే.. మామిడికాయ‌ల‌ను కూడా  ర‌ప్పా ర‌ప్పా వేసి తొక్కించిన దృశ్యాల‌ను చూసే ఉంటాం.ఇవేవీ యాధృచ్చికంగా జ‌రుగుతున్న‌వి కావంటారు. వీట‌న్నిటి వెన‌క అతి పెద్ద నెట్ వ‌ర్క్ ప‌ని చేస్తూ ఉంటుంది. జ‌గ‌న్ ప‌ని అయిపోయింది. ఈసారి ఆ ప‌ద‌కొండు సీట్లు కూడా రావు. ఇక ఆయ‌న్ను భారీ ఎత్తున లీడ‌ర్లు కూడా వ‌దిలేస్తున్నారు.. అన్న కామెంట్ వినిపించిన‌పుడ‌ల్లా.. ఈ నెట్ వ‌ర్క్ అమాంతం ఉలిక్కి ప‌డుతుంది. జ‌గ‌న్ ఇమేజీని పెద్ద ఎత్తున‌ జాకీలేసి లేప‌డానికి.. వీరంతా కూడ‌బ‌లుక్కుంటారు. జూమ్ మీట‌టింగులు చేసుకుంటారు. కాన్ఫ‌రెన్స్ కాల్స్ మాట్లాడుకుంటారు.. అంతే ఒక ప్ర‌ణాళిక సిద్ధం చేసి జ‌గ‌న్ కి అప్ డేట్ చేస్తారు. అన్నా అక్క‌డ మ‌న గంజాయ్ బ్యాచ్ అరెస్ట‌య్యింది. వాళ్లంతా మ‌నం స‌ర‌ఫ‌రా చేసిన గంజాయ్ తీస్కునే ఇలా త‌యార‌య్యారు. అలాంటి వాళ్లు అరెస్ట‌యితే ఓదార్చాల్సింది మ‌న‌మే అని అలెర్ట్ చేస్తారు. ఎప్పుడో గ‌త ఏడాది చ‌నిపోయిన నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు విగ్ర‌హం పెట్ట‌డానికి చందాలిచ్చాం. మీరొస్తే బాగుంటుంది.. అని గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు. అలా అలా ఈ నెట్ వ‌ర్క్ ఒక ప‌ద్ధ‌తి  ప్ర‌కారం న‌డుస్తుంది. దీంతో ఇదిగో ఇలాంటి క్రౌడీ సీన్లు మీకు బుల్లి(టీవీ చానెళ్లు) అతి బుల్లి తెర‌లపై( మొబైల్ స్క్రీన్లు) ద‌ర్శ‌న‌మివ్వ‌డానికి రెడీ అయిపోతాయ్. ఒక ర‌కంగా చెబితే.. వీరు ప్ర‌తి జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌నూ ఒక సినిమా షూటింగ్ స్థాయిలో ప్లాన్ చేస్తారంటే అతిశ‌యోక్తి కాదు. కార‌ణం అక్క‌డ హీరోల సినిమాలు గొప్ప‌గా ఆడాలి క‌లెక్ష‌న్ల వ‌ర్షం కుర‌వాల‌న్న‌ది టార్గెట్. అదే ఇక్క‌డ జ‌గ‌న‌న్న క్రేజ్ ఎంత మాత్రం త‌గ్గ‌లేదు. ఆయ‌న రోడ్డు మీద‌కొస్తే ఇస‌కేస్తే రాల‌నంత జ‌నం వ‌స్తున్నార‌న్న ప‌బ్లిసిటీ పీక్ లో ఉండాల‌ని ఫిక్స్ అవుతారు. త‌ద్వారా త‌మ సాలిడ్ ఓటు బ్యాంకును మ‌రింత యాక్టివ్ చేస్తుంటారు.ఎందుకంటే త‌మ‌కు ఓటు వేసే వారికి.. జ‌గ‌న్ కి క్రేజ్ ఉంద‌ని తెలియ‌డం కూడా ముఖ్య‌మే. కార‌ణం.. ఏ వార్త‌ల్లో లేని జ‌గ‌న్ కి వాళ్లు మాత్రం ఎందుకు ఓటు వేయాలి?   ఇదంతా ఒక ప్రీప్లాన్డ్ స్కెచ్. ఇందులో అవ‌స‌ర‌మైతే ఎంద‌రు ప్రాణాలు పోయినా ప‌ర్లేదు. కానీ.. తామ‌నుకున్న ప్ర‌చారం మాత్రం ఒక రేంజ్ లో సాగాల‌న్న‌ది.. వీరి ప్ర‌ధాన టార్గెట్ గా తెలుస్తోంది. జ‌గ‌న్ ప‌దే ప‌దే ఒక మాట అంటూ ఉంటారు. మ‌న‌కంటూ ప్ర‌త్యేకించి ఛానెళ్లు, ఇత‌ర మీడియా నెట్ వ‌ర్క్ తో ప‌ని లేదు.. మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు.. మ‌న ప‌ని అదే సులువు అవుతుంద‌ని ఆయ‌న అనేది ఇందుకే. ఎందుకంటే ఏ పొలం ప‌నులో, ఇత‌ర ప‌నీ పాట‌ల్లో ఉండే త‌న ఓట‌ర్ల చేతుల్లో అయితే ఫోన్లుంటాయి. వాటిల్లో ఈ విజువ‌ల్ క్లిప్పింగులు ప‌దే ప‌దే క‌నిపిస్తే చాలు.. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కూ మ‌న ఓటు బ్యాంకు అలాగే నిలిచ ఉంటుంద‌న్న ఆలోచ‌న ఇందులో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటారు కొంద‌రు విశ్లేష‌కులు.
జ‌గ‌న్‌కి  ఇంత ప‌బ్లిక్..ఎలా వ‌స్తారో మీకు తెలుసా? Publish Date: Jul 13, 2025 1:15PM

తీన్మార్ మల్లన్న ఆఫీస్‌పై దాడి ..గాల్లోకి కాల్పులు

  మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని పీర్జాదిగూడలో ఉన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు సంబంధించిన  క్యూ న్యూస్ కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఇవాళ ఉదయాన్నే కొందరు జాగృతి కార్యకర్తలు  కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నీచర్‌, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. వెంటనే అప్రమత్తమైన క్యూ న్యూస్ సిబ్బంది వారితో వాదించారు. అది కాస్త ముదరడంతో క్యూ న్యూస్ సిబ్బందిపైనా అటాక్ చేశారు. ఆ సమయంలో ఆఫీస్‌లోనే ఉన్న ఎమ్మెల్సీ మల్లన్న గన్‌మెన్‌లు.. గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం.  సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కార్యాలయాన్ని పరిశీలించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. ఎమ్మెల్సీ కవిత బీసీ ఉద్యమాన్ని మల్లన్న తప్పు పట్టినందుకే దాడి చేసినట్లు తెలుస్తోంది. జర్నలిస్ట్ సంఘాలు, ప్రజా సంఘాలు ఈ దాడిని తీవ్రంగా ఖండిచాయి. మీడియా సంస్థలపై దాడులు చేయడం సరికాదని తీన్మార్ మల్లన్న అన్నారు. రాష్ట్రంలో జాగృతి కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని తీన్మార్ మల్లన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తీన్మార్ మల్లన్న ఆఫీస్‌పై దాడి ..గాల్లోకి కాల్పులు Publish Date: Jul 13, 2025 12:54PM

నేను బ‌త‌కాలి త‌మ్మీ..అంటూ చ‌నిపోయావేంటి కోట‌?

  గ‌ణేశ్ సినిమాలో.. ఫేమ‌స్ డైలాగ్. నేను బ‌త‌కాలి త‌మ్మీ అంటూ ఆయ‌న చెప్పిన డైలాగుల‌కు అప్పట్లో య‌మ క్రేజుండేది. ఆపై గాయంలో ఆయ‌న ఖండిస్తున్న అనే డైలాగ్ కూడా చాలా చాలా ఫేమ‌స్ అయ్యింది. ఇక ఆమె సినిమాలో కోట న‌ట విశ్వ‌రూపం మామూలుది కాదు.ఇలా చెప్పుకుంటూ పోతే సీరియ‌స్ కామెడీ తేడా లేకుండా ఆయా పాత్ర‌ల‌ను అవ‌లీల‌లగా పోషించిన కొంద‌రంటే కొంద‌రు న‌టుల‌లో కోట న‌టన‌కు పెట్టిన‌ కోటే.. నిజంగా. సాధార‌ణంగా సినిమా రూట్ మ్యాప్ ఎలా ఉండేదంటే.. ఏదైనా ఎల్ఐసీ, జ‌ర్న‌లిజం, టీచింగ్, బ్యాంకు వంటి  రంగాల్లో జాబ్ చేస్తూ.. ఆపై నాట‌కాలు ఆడుతూ.. అటు నుంచి సినిమాల్లో అవ‌కాశాలు అంది పుచ్చుకుంటూ ఫైన‌ల్ గా ఇక్క‌డ సెటిల‌వ‌డం.  ఈ విష‌యంలో ఇప్ప‌టికీ చాలా మంది క‌ప్ప‌దాట్లు దాటుతూ ఉంటారు. వారికంటూ అంత తేలిగ్గా ఫీల్డ్ లో బిజీ కావ‌డం సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు. కానీ కోట అలాక్కాదు. బ్యాంకు జాబు అదీ ఇదీ మొత్తం క‌ట్ట‌క‌ట్టి.. అట‌క మీద ప‌డేసి.. ఎంచ‌క్కా సినిమా ఫీల్డ్ లో సెటిలై పోయారాయ‌న‌.ఒక స‌మ‌యంలో ఆయ‌న బాబూ మోహ‌న్ తో చేసిన మామ‌గారు త‌ర‌హా కామెడీకి అతి పెద్ద ఫ్యాన్ బేస్ ఉండేది. ఆ త‌ర్వాత ఆయ‌న సీరియ‌స్ యాక్టింగ్ స్కిల్స్ కి సౌత్ లో చాలా సినిమాల్లో యాక్టింగ్ ఛాన్సులు వ‌చ్చాయి.  ప్ర‌కాష్ రాజ్ లా ఆయ‌న జాతీయ ఉత్త‌మ న‌టుడు సాధించ‌లేక పోయాడు క‌నీ.. ఇంచు మించు అలాంటి వ‌ర్స‌టైల్ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉన్న న‌టుడు కోటా శ్రీనివాస‌రావు.ఎక్క‌డో బ్యాంకుల్లో ఉద్యోగం చేసుకుంటూ నాట‌కాలాడి.. ఆ నాట‌కాల ప్ర‌స్తానం కొద్దీ సినిమాల్లోకి అడుగు పెట్టి.. అంచెలంచెలుగా న‌టుడిగా ఎన్నో ఎత్తుల‌కు ఎదిగి  ఒక స‌మ‌యంలో.. బీజేపీ నుంచి ఎమ్మెల్యేగానూ గెలిచి.. రాజ‌కీయంగానూ త‌న ప్ర‌స్తానం కొన‌సాగించి.. చివ‌రికిదిగో ఇలా త‌న జీవితానికే టాటా చెప్పి వెళ్లిపోయారు కోట‌. ఆయ‌న త‌న న‌ట జీవితంలో అన్ని కోరిక‌లూ తీర్చుకుని వెళ్లారు.  కానీ.. త‌న కొడుకు అర్ధాంత‌ర మ‌ర‌ణంతో తీవ్ర నిరాశా నిస్పృహ‌ల‌కు లోన‌య్యారు. ఇటు త‌న‌తో పాటు ఎన్నో చిత్రాల్లో క‌ల‌సి న‌టించిన బాబూ మోహ‌న్ కి, త‌న‌కి ఇద్ద‌రీ ఒక‌టే త‌ర‌హా పుత్ర శోకం క‌ల‌డం అత్యంత విషాద క‌రం.ఏది ఏమైనా కోట మృతి టాలీవుడ్ కి తీర‌ని లోటు. కార‌ణ‌మేంటంటే.. ఆయ‌న‌లాంటి పాత్ర‌లు పోషించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి ఆయ‌నే మ‌రోమారు న‌ట‌కోటావ‌తారం ఎత్తాల్సిందే.  
నేను బ‌త‌కాలి త‌మ్మీ..అంటూ చ‌నిపోయావేంటి కోట‌? Publish Date: Jul 13, 2025 12:28PM

కోటకు నివాళులర్పించిన మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల భారత మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి కోట భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు సినీ రంగానికి సేవలు చిరస్మరణీయమని ఆయన తెలిపారు. ఈ తరుణంలో ఆయన విలక్షణ నటుడు, మానవతావది. శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజలకు సేవ చేశారు.  కుమారుడి అకాల మరణంతో కోట బాగా కుంగిపోయారు. మంచి సంస్కారం కలిగిన నటుడిని కోల్పోయాం. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అని వెంకయ్యనాయుడు తెలిపారు. కోట పార్థివదేహానికి  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కోట మృతి పై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు  
 కోటకు నివాళులర్పించిన మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు Publish Date: Jul 13, 2025 12:16PM

పాశమైలారంలో మరో అగ్ని ప్రమాదం

  సంగారెడ్డి జిల్లా  పాశమైలారంలో మరో ప్రమాదం జరిగింది. ఎన్విరోవేస్ట్‌ మేనేజ్‌మెంట్  పరిశ్రమలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. పరిశ్రమలో లారీ, జేసీబీకి మంటలు వ్యాపించాయి. సిగాచీ పరిశ్రమ మిగిల్చిన విషాదాన్ని మరవకముందే అదే పాశమైలారంలో అగ్నిప్రమాదం  జరగడంతో  స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాశమైలారం సిగాచి పరిశ్రమలో జూన్ 30న భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 44 మృతదేహాలు గుర్తించిన సంగతి తెలిసిందే. మృతిచెందిన ఒక్కొక్కరికి కంపెనీ యాజమాన్యం రూ. కోటి పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.10 లక్షల సాయం చేస్తామని చెప్పింది. ఈ ప్రమాద ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది.  
పాశమైలారంలో మరో అగ్ని ప్రమాదం Publish Date: Jul 13, 2025 11:39AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ఆదివారం (జులై 13) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లోని కంపార్తట్ మెంట్లన్నీ నిండియోయాయి. భక్తుల క్యూలైన్ ఆక్టోపస్ సర్కిల్ వరకూ సాగింది. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. క్యూలేన్లలో వేచి ఉన్న భక్తులకు టిటిడీ యాజమాన్యం అన్న, జల ప్రసాదాలు పంపిణీ చేస్తున్నది. భక్తులకు ఎటువంటి ఇబ్బందీ కలుగకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇక శనివారం ‘జులై 12’ శ్రీవారిని మొత్తం 92 వేల 221 మంది దర్శించుకున్నారు. వారిలో 42 వేల 260 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 51 లక్షల రూపాయలు వచ్చింది.  
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ Publish Date: Jul 13, 2025 10:56AM

ఇంధ‌న స్విచ్ ఆఫ్ చేసి టేకాఫ్ చేసే పైలెట్ ఎక్క‌డైనా ఉంటారా?

ఫ్ల‌యిట్ యాక్సిడెంట్ జ‌రిగిన రెండు మూడు రోజుల త‌ర్వాత వెలుగు చూసిన కోణాల్లో ఇదీ ఒక‌టి. అదేంటంటే.. ఇంధ‌న స్విచ్ ని ఆన్ చేయ‌కుండానే అహ్మ‌దాబాద్ టు లండ‌న్ ప్లయిట్ టేకాఫ్ అయ్యింది.  ఆ మాట‌కొస్తే ఫ్యూయ‌ల్ పాస్ కాకుండా ఫ్ల‌యిట్ ఎలా టేకాఫ్ అయ్యిందని కొంద‌రు అడిగిన ప్ర‌శ్న‌కు వీరు చెప్పిన స‌మాధానం ఏంటంటే..  పైపుల్లో మిగులు గా ఉన్న ఇంధ‌నంతో ఫ్ల‌యిట్ పైకి లేచింద‌నీ.. ఇంత‌లో ఫ్యూయ‌ల్ అంద‌క పోవ‌డం వ‌ల్లే.. ఫ్ల‌యిట్ టేకాఫ్ అయిన 32 సెక‌న్ల‌కే క్రాష్ ల్యాండ్ అయ్యింద‌ని చెప్పుకొచ్చారు. టేకాఫ్ టైంలో స్విచ్చుల‌తో ఆడుకునేంత‌ తెలివి త‌క్కువ పైలెట్ ఎక్క‌డా ఉండ‌డు. ఇదీ ఎయిర్ ఇండియా ఏఐ 171 క్రాష్ పై .. విడుద‌లైన  ఏఏఐబి ప్రాథమిక నివేదికపై   ఏవియేషన్ నిపుణుడు మార్క్ మార్టిన్ స్పందన. రెండు ఇంధన నియంత్రణ స్విచ్‌లు ఆపేశార‌ని, దీనివల్ల టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్లు ఆగిపోయాయని అంటోంది ఏఏఐబి రిపోర్ట్.  ఒక వేళ అదే నిజ‌మైతే.. 787 బోయింగ్ ఆప‌రేట‌ర్ల‌పై ప్ర‌పంచ వ్యాప్తంగా దీని ప్ర‌భావం ప‌డుతుంద‌ని అంటారు మార్టిన్.  దానికి తోడు.. కేంద్ర విమానయాన మంత్రి కూడా ఇదే ఫైన‌ల్ రిపోర్ట్ కాద‌ని అన్నారు. దీన్నిబ‌ట్టీ చూస్తే ఫ్యూయ‌ల్ స్విచ్ మాత్ర‌మే ఈ ప్ర‌మాదంలో కీల‌కం కాద‌న్న‌ది తెలుస్తూనే ఉంది. ఇక మార్టిన్ చెబుతున్నట్టు అలా జ‌రిగే అవ‌కాశ‌ముందా? అన్న‌ది కూడా అత్యంత ముఖ్య‌మైన విష‌య‌మే. ఎందుకంటే ఒక ఫ్లైట్ పైల‌ట్ సీట్ లో కూర్చున్నాక‌.. అన్ని స్విచ్ ల‌ను చెక్ చేసుకోవ‌డం ఒక అల‌వాటుగా మార్చుకుంటారు. అంతే కాదు.. ఇక్క‌డ ఒక‌రికి ఇద్ద‌రున్న‌పుడు.. అది మ‌రింత ఎక్కువ జాగరూక‌త‌తో సాగుతుంది.   ఫ్ల‌యిట్ ఇంధ‌న స్విచ్ ని ఆపుకుని ఒక ఫ్ల‌యిట్ టేకాఫ్ అయ్యిందంటే అది ప్ర‌పంచ ఏవియేష‌న్ చ‌రిత్ర‌లోనే ఒక చీక‌టి రోజు. ఎందుకంటే విమానం న‌డిచేదే ఇంధ‌నం మీద‌. అలాంటి ఇంధ‌నం స్విచ్ ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా? చూసుకోకుండా ఒక‌రికి ఇద్ద‌రు పైలెట్లు టేకాఫ్ చేశారంటే.. అది ఫ్ల‌యిట్ మేనేజ్మెంట్ కే కాదు పైలెట్ మేనేజ్మెంట్ కి కూడా అవ‌మాన‌క‌ర‌మే.  మాములుగా మ‌నం చిన్న కారు తోలితేనే.. అది ఫ్యూయ‌ల్ మార్క్ ద‌గ్గ‌ర ప‌దే ప‌దే చూపిస్తుంది. అలాంటిది ఒక ఫ్ల‌యిట్ ఇంకెంత ఇండికేట్ చేసి ఉండాలి. అది కూడా అల్ట్రా మోడ్ర‌న్ అయిన బోయింగ్ ఫ్ల‌యిట్ ఎంత‌గా  హెచ్చ‌రిస్తుంది? అన్న దగ్గ‌రే అంద‌రి ఆలోచ‌న‌లు ఆగిపోతున్నాయ్. మ‌రి చూడాలి కాక్ పిట్ లో ఆ ఇద్ద‌రు పైలెట్లు ఇంధ‌న స్విచ్ సంభాష‌ణే ఫైన‌ల్ అవుతుందా? లేక మ‌రేదైనా విష‌యం బ‌య‌ట ప‌డుతుందా తేలాల్సి ఉంది.
ఇంధ‌న స్విచ్ ఆఫ్  చేసి టేకాఫ్ చేసే పైలెట్  ఎక్క‌డైనా ఉంటారా? Publish Date: Jul 13, 2025 10:38AM

నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో  విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం (జులై 13) తెల్లవారు జామున కన్నుమూశారు. ఆయన వయస్సు 83 ఏళ్లు. నాలుగు దశాబ్దాలుగా వందలాది సినిమాలలో నటించి, అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్న సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గత కొంత కాలంగా అనారోగ్యంతో, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. దాదాపు 750కి పైగా చిత్రాలలో నటించిన కోట శ్రీనివాసరావు.. ఇటీవలి కాలంలో ఆయన సినిమాలలో నటించడం మానేసి పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమేడియన్ ఇలా విభిన్నపాత్రలలో తనదైన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల మనస్సులలో కోట శ్రీనివాసరావు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.  తెలుగుతో పాటు  మలయాళం, కన్నడ, హిందీ, తమిళ చిత్రాలలో కూడా నటించారు.   1978లో ప్రాణం ఖరీదు సినిమాతో ఇండస్ట్రీలోకి విచ్చిన కోట శ్రీనివాసరావుకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2015లో కోట శ్రీనివాసరావుకు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇక ఆయనకు తొమ్మిది సార్లు నంది పురస్కారాలు నమించాయి. కోట శ్రీనివాసరావు మృతి పట్ల ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.  
నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత Publish Date: Jul 13, 2025 6:52AM

అధ్యాపకుడి లైంగిక వేధింపులు... కాలేజీలో నిప్పంటించుకున్న విద్యార్థిని

  ఒడిశా బాలాసోర్‌లోని ఒక కళాశాలలో  ఘోర విషాదకర ఘటన జరిగింది. గురువు  లైంగిక వేధింపులకు భరించలేక ఓ విద్యార్థిని కాలేజిలోనే నిప్పంటించుకుంది. ఈ ఘటనలో ఆమె 95 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెను కాపాడబోయిన మరో విద్యార్థికి కూడా 70 శాతం కాలిన గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆ అధ్యాపకుడిని అరెస్టు చేశారు. ఉన్నత విద్యాశాఖ కళాశాల ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేసింది. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సూర్యబన్షి సూరజ్ హామీ ఇచ్చారు.  ఫకీర్ మోహన్ కాలేజీలో చదువుతున్న బాధిత విద్యార్థిని జులై 1న కళాశాల అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేసింది. తన విభాగాధిపతి సమీర్ కుమార్ తనను వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. వారం రోజుల్లో అతనిపై చర్యలు తీసుకుంటామని విద్యార్థినికి హామీ ఇచ్చినప్పటికీ, అది జరగలేదని తెలుస్తోంది. సదరు అధ్యాపకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మనస్తాపం చెందిన బాధిత విద్యార్థిని, ఇతర విద్యార్థులతో కలిసి కళాశాల గేటు వెలుపల నిరసనకు దిగింది. ఆ సమయంలో విద్యార్థిని ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ ప్రిన్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్లి, తనపై తాను పెట్రోలు పోసుకొని నిప్పంటించుకుంది.
అధ్యాపకుడి లైంగిక వేధింపులు... కాలేజీలో నిప్పంటించుకున్న విద్యార్థిని Publish Date: Jul 12, 2025 9:29PM