యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం...29 మంది దుర్మరణం

posted on: Jul 8, 2019 9:14AM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్ వే మీద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నో నుంచి 50 మంది ప్రయాణికులతో ఢిల్లీ వెళ్తున్న యూపీకి చెందిన యూపీ రోడ్‌వేస్‌(ఆర్టీసీ)‌ బస్సు ఆగ్రా సమీపంలో అదుపుతప్పి వంతెన పైనుంచి కిందికి జారి పడిపోయింది. ఈ ఘటనలో సుమారు 29 మంది ప్రాణాలు కోల్పోగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. బస్సు 15 అడుగుల లోతున్న కాల్వలో పడిందని, 20 మందిని సురక్షితంగా రక్షించామని పోలీసులు చెబుతున్నారు. 

క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంపై ఉత్తర్‌ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...