Top Stories

ఆగస్టు 6న జాగృతి జంబో కమిటీలు : ఎమ్మెల్సీ కవిత

  తెలంగాణ  జాగృతి సంస్థను రాజకీయంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆగస్టు 6న ప్రొ.జయశంకర్  జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జంబో కమిటీలు వేయబోతున్నామని వెల్లడించారు. ఇవాళ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్‌‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన 'లీడర్' శిక్షణా తరగతులకు హాజరైన కవిత ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జంబో కమిటీల ఏర్పాటు తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ప్రతిజిల్లాలో నిర్వహిస్తామని తెలిపారు.  ప్రతి ఒక్కరిలో నాయకుడు ఉంటారు. ఆ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని సమాజం మంచి కోసం ఉపయోగించుకోవడానికి తెలంగాణ జాగృతి ఒక వేదిక కావాలన్నారు. మన సంప్రదాయాలు, కట్టుబాట్లపై అవగాహన కల్పించుకోవడమే నాయకుడు లక్షణమని తెలిపారు.‘‘ఎప్పుడూ కొత్తగా ఉంటేనే  సంస్థలు బతుకుతాయి. తల్లి గర్భంలో నుంచి ఎవరూ నాయకత్వ లక్షణాలతో పుట్టరు. నేర్చుకుంటూ, మార్చుకుంటూ ముందుకెళ్లేవాడే నాయకుడవుతాడు తప్ప.. మూస పద్ధతిలో కొనసాగేవాడు నాయకుడు కాలేడని ఆమె అన్నారు. సామాజిక స్పృహ కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ 11 స్థానంలో ఉందని ఓ సర్వేలో తేలింది.  తోటివారి గోప్యతకు, మర్యాదకు భంగం వాటిల్లకుండా పదునైన విమర్శలు చేయడం నేర్చుకోండి. పక్కవాడిని తిడుతున్నారంటే కంటెంట్ లేనట్లు అర్థం. మహాత్మాగాంధీ ఎప్పుడూ ఎమ్మెల్యేగానో, ఎంపీగానో లేరు. కానీ, ఇప్పటికీ ఆయన్ని గుర్తు చేసుకుంటాం. తెలంగాణ జాగృతి నుంచి గాంధీగిరీకి కొత్త భాష్యం చెప్పాల్సిన అవసరం ఉంది. సాంస్కృతిక నేపథ్యం లేకుండా ఏ జాతీ మనుగడ సాధించలేదు. సాంస్కృతిక నేపథ్యం లేని జాతి.. పునాది లేకుండా కట్టిన బిల్డింగ్‌ లాంటిది.  తెలంగాణ జాతికి అద్భుతమైన నేపథ్యం ఉంది. దానిని పరిరక్షించేందుకే  ‘జాగృతి’ పని చేస్తుంది. నాడు పోలవరం ప్రాజెక్టు కడుతుంటే అడ్డుపడ్డాం, నేడు బనకచర్ల లింక్ ప్రాజెక్టు కడతామంటే చూస్తూ ఊరుకోబోమని కచ్చితంగా ఆపి తీరుతామన్నారు. తెలంగాణ వనరులు, సాంస్కృతి పరిరక్షించడమే ఆలోచనగా జాగృతి పనిచేస్తుందని కవిత వెల్లడించారు.
ఆగస్టు 6న జాగృతి జంబో కమిటీలు : ఎమ్మెల్సీ కవిత Publish Date: Jul 26, 2025 4:55PM

బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి భారీ వర్ష సూచన

  బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటింది. దీంతో ఏపీలోని కోస్తా జిల్లాలతో పాటు తెలంగాణకు వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులువీచే అవకాశం వుంది...వాయువ్య బంగాళాఖాతం దాని పరిసరాల్లోని పశ్చిమబెంగాల్ తీరం, బాంగ్లాదేశ్ ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి మహారాష్ట్ర మీదుగా ఉత్తర చత్తీస్గడ్ ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్రమట్టం నుంచి 5.8 కి మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. రాగల రెండు రోజులు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందంది. అలాగే ఈరోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు..ఈరోజు,రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.  అలాగే తెలంగాణలో ఇవాళ రోజంతా మేఘాలు, ముసురు వాతావరణం ఉంటుంది. చినుకులు రోజంతా పడతాయి. ఉత్తర తెలంగాణలో కంటిన్యూగా భారీ వర్షం పడే అవకాశముంది. మధ్య తెలంగాణలో మోస్తరు వర్షం రోజంతా కురుస్తుంది. హైదరాబాద్‌లో జల్లులు కురిసే ఛాన్స్ ఉంది.ఇక ఆంధ్రప్రదేశ్‌లో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో మాత్రం రోజంతా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం చాలా చోట్ల పడుతుంది. అయితే.. ఉత్తరాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షం పడొచ్చు. గంటకు 40-60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.  బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు కదులుతున్న నేపథ్యంలో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. హోంమంత్రి అనిత విపత్తు నిర్వహణ శాఖతో సమీక్ష నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. విజయవాడలో వరదలు వస్తున్నాయన్న వదంతులను నమ్మవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి.
బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి భారీ వర్ష సూచన Publish Date: Jul 26, 2025 4:11PM

కార్గిల్ విజయ్ దివస్ – భారత జెండా గర్వంగా ఎగిరిన రోజు..!

ప్రతి సంవత్సరం జూలై 26న మనం కార్గిల్ విజయ్ దివస్ ని ఘనంగా జరుపుకుంటాం. నిజానికి కార్గిల్ విజయ్ దివస్ ను ఒక పండుగలా జరుపుకుంటు ఉంటాం.  అయితే ఇది కేవలం ఒక పండుగ కాదు.. మన భారత సైనికుల  దేశభక్తికి, సాహసానికి, త్యాగానికి గుర్తుగా నిలిచే ఒక మహత్తరమైన రోజు. విజయ్ దివస్.. ఆవిర్భావం.. 1999లో భారత దేశానికి సంబంధించిన జమ్మూ మరియు కాశ్మీర్ ప్రాంతంలోని కార్గిల్ లోయలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సైనికులు,  ముష్కరులు, భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డారు. వారిని వెనక్కు తోసి భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో భారత సైన్యం అసాధారణమైన ధైర్యాన్ని, ఓర్పును ప్రదర్శించింది. ఈ యుద్ధాన్ని మనం కార్గిల్ యుద్ధం గా గుర్తించాము. సుమారు 60 రోజుల పాటు సాగిన ఈ యుద్ధం 1999 జూలై 26న భారత విజయం సాధించడంతో ముగిసింది. అందుకే ఆ రోజును “విజయ్ దివస్”గా ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో జరుపుకుంటున్నాం. కార్గిల్ యుద్దం.. ఒక సాహస గాథ.. కార్గిల్  యుద్ధంలో భారత సైనికులు ఎంతో కష్టసాధ్యమైన పర్వత ప్రాంతాల్లో పోరాడారు. కొండలపై దాక్కున్న శత్రువును తలకిందులు చేసి తామే పైచేయి సాధించడం అంటే సాహసానికి పరాకాష్ట.  ఈ యుద్ధంలో కెప్టెన్ విక్రమ్ బత్రా, లెఫ్టినెంట్ అనోజ్ థాపా, గ్రెనేడియర్ యోగేందర్ సింగ్ యాదవ్, నాయిక్ సాయి సానూ లాల్, వంటి ఎందరో వీరులు తమ ప్రాణాలను దేశం కోసం అర్పించారు. ఎందుకు జరుపుకోవాలి? కార్గిల్ విజయ్ దివస్‌ను మనం జరుపుకోవడానికి ముఖ్య కారణాలు ఇవే: దేశాన్ని రక్షించేందుకు తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరులకు నివాళులు అర్పించటం యువతలో దేశభక్తిని ప్రేరేపించటం సైనికుల ధైర్యాన్ని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుని గర్వించటం మనం ఏమి చేయగలం.. మౌనంగా రెండు నిమిషాలు నిలబడి వీరులకు నివాళులర్పించవచ్చు.  పిల్లలకి, స్నేహితులకు కార్గిల్ విజయ్ దివస్ గురించి వివరంగా చెప్పి వారిలో చైతన్యం కలిగించవచ్చు. దేశ భద్రతలో భాగమైన సైనికుల సేవలకు కృతజ్ఞతలు తెలపచ్చు. కార్గిల్ విజయ్ దివస్  అందరికీ ఇచ్చే సందేశం..  స్వేచ్ఛ విలువైనదని, అది ఎప్పటికీ తీసుకోలేనిదాని ఆ రోజు దేశ ప్రజలకు చెప్పకనే చెబుతుంది. మన దేశ సైనికుల ధైర్యం, పట్టుదల కారణంగానే మనం నేడు సురక్షితంగా జీవిస్తున్నాము. ఈరోజు వారిని గుర్తుంచుకోవడం మనందరి బాధ్యత.                                         *రూపశ్రీ.
కార్గిల్ విజయ్ దివస్ – భారత జెండా గర్వంగా ఎగిరిన రోజు..! Publish Date: Jul 26, 2025 3:40PM

అన్నవరం ఆలయంలో సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు

  అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ ఆలయ ఈవో సుబ్బారావు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా మరో ఐదుగురికి షోకాజు నోటీసులు ఇచ్చారు. పారిశుద్ధ్య సిబ్బందికి చెందిన ఫీఎఫ్ చెల్లింపుల వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఈవో ఈ మేరకు చర్యలు చేపట్టారు. గుంటూరుకు చెందిన కనకదుర్గ మ్యాన్ పవర్ సర్వీసెస్‌కు చెందిన పారిశుద్ధ్య సిబ్బంది ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే కనకదుర్గ మ్యాన్ పవర్ సర్వీసెస్‌ ఏజెన్సీ.. కార్మికుల ఈపీఎఫ్‌ ఖాతాల్లో నగదు జమ చేయకుండానే చేసినట్లుగా నకిలీ చలాన్లను సృష్టించి ఆలయ అధికారులకు చూపించింది.  అయితే ఆ రికార్డులు పరిశీలించకుండానే ఆలయ అధికారులు ఏజెన్సీకి బిల్లులు  పంపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఈ నేపథ్యంలోనే విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఆలయ పారిశుద్ధ్య పర్యవేక్షకుడు వెంకటేశ్వర రావు, జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణలపై ఈవో సస్పెన్షన్ వేటు వేశారు. అప్పటి పర్యవేక్షణ అధికారి సత్య శ్రీనివాస్‌కు ఛార్జిమెమో ఇచ్చారు. టోల్ రుసుం వసూలు చేసే గుత్తేదారు నుంచి రూ. 41 లక్షలు జీఎస్టీ వసూలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు సీ-సెక్షన్ అధికారులకు షోకాజ్ నోటీసులు పంపారు.
అన్నవరం ఆలయంలో సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు Publish Date: Jul 26, 2025 3:35PM

మీకు థైరాయిడ్ ఉందా? జాగ్రత్త ఈ కూరగాయలు తినకూడదు..!

మన మెడలోని థైరాయిడ్ గ్రంథి ఒక చిన్న అవయవం.  కానీ ఇది చాలా ముఖ్యమైన అవయవం. ఇది మన శరీర జీవక్రియ, శక్తి స్థాయిలు,  శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ సరిగ్గా పనిచేయనప్పుడు చాలా సమస్యలు మొదలవుతాయి.  ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అయ్యే హైపోథైరాయిడిజంలో సమస్యలు ఎక్కువ.  మందులతో పాటు, థైరాయిడ్ రోగులకు సరైన ఆహారం కూడా చాలా ముఖ్యం. సాధారణంగా ఆరోగ్యకరమైనవి అనుకునే కొన్ని  కూరగాయలు థైరాయిడ్ సమస్యలను పెంచుతాయి. థైరాయిడ్ రోగులు ఏ కూరగాయలను తినకూడదు ? తెలుసుకుంటే.. క్యాబైజీ కుటుంబానికి చెందిన కూరగాయలు.. థైరాయిడ్ రోగులు కొన్ని కూరగాయల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వీటిని గోయిట్రోజెనిక్ అంటారు. ఇవి థైరాయిడ్ గ్రంథి అయోడిన్‌ను గ్రహించే సామర్థ్యాన్ని అడ్డుకునే సమ్మేళనాలు. థైరాయిడ్ హార్మోన్లను తయారు చేయడానికి అయోడిన్ చాలా ముఖ్యమైనది. ఇందులో ప్రధానంగా క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ,  బ్రస్సెల్స్ మొలకలు వంటి క్రూసిఫెరస్ కూరగాయలు ఉంటాయి. ఈ కూరగాయలలో గ్లూకోసినోలేట్స్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరంలోని థైరాయిడ్ పనితీరుకు అంతరాయం కలిగిస్తాయి. పచ్చగా వద్దు.. పైన చెప్పుకున్న  కూరగాయలలో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, థైరాయిడ్ రోగులు వాటిని పచ్చిగా తినకూడదు. పచ్చిగా ఉన్నప్పుడు వాటికి అధిక గైట్రోజెనిక్ లక్షణాలు ఉంటాయి.  వాటిని ఉడికించి తినేటప్పుడు ఈ సమ్మేళనాల ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి  థైరాయిడ్  ఉన్నవారు ఈ కూరగాయలను తినాలనుకుంటే, వాటిని ఎల్లప్పుడూ బాగా ఉడికించి,  పరిమిత పరిమాణంలో తినాలి.  వాటిని రసం రూపంలో లేదా పెద్ద పరిమాణంలో పచ్చిగా తీసుకోవడం మానుకోవాలి.  ఎందుకంటే ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. నిపుణుల సలహా.. పైన పేర్కొన్న కూరగాయలతో పాటు, సోయా ఉత్పత్తులు కూడా గైట్రోజెనిక్ కావచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. కాబట్టి థైరాయిడ్ రోగులు వాటిని మితంగా తీసుకోవాలి. ముఖ్యంగా  ప్రాసెస్ చేసిన ఆహారాలు,  గ్లూటెన్ వినియోగం కూడా కొంతమంది థైరాయిడ్ రోగులకు, ముఖ్యంగా హషిమోటోస్ థైరాయిడిటిస్ ఉన్నవారికి సమస్యాత్మకంగా ఉంటుంది. ఆహారం మాత్రమే థైరాయిడ్‌ను నయం చేయదని, అది మందులతో పాటు మాత్రమే సహాయపడుతుందని అర్థం చేసుకోవడం ముఖ్యం.  థైరాయిడ్ ఉన్నవారు ఎల్లప్పుడు వైద్యుడిని లేదా డైటీషియన్ ను కలిసిన తరువాత మాత్రమే ఆహారం తీసుకునే విషయంలో నిర్ణయం తీసుకోవడం మంచిది.  ఏదైనా కూరగాయలను పూర్తిగా ఆపడం లేదా  స్వంతంగా ఏదైనా పెద్ద ఆహార మార్పులు చేయడం చేయకూడదు. ఎందుకంటే ఇది ఇతర పోషకాల లోపానికి దారితీస్తుంది.                                 *రూపశ్రీ.  
మీకు థైరాయిడ్ ఉందా? జాగ్రత్త ఈ కూరగాయలు తినకూడదు..! Publish Date: Jul 26, 2025 3:35PM

తెలంగాణలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ

  తెలంగాణలో పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అతి భారీ వర్ష సూచన చేసింది. ఇక, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది. అలాగే జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, నిర్మల్‌, నిజామాబాద్‌, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.  దీంతో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంట‌కు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవ‌కాశం ఉన్న‌ట్టు  తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.  
తెలంగాణలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ Publish Date: Jul 26, 2025 3:21PM

పార్టీల దయ ... బీసీల ప్రాప్తం!

ఈసారికి రిజర్వేషన్లు హుళుక్కేనా? ఓ వంక స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్దత కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర హై కోర్టు  ఆదేశించిన విధంగా సెప్టెంబర్ 30లోగా ఎన్నికల నిర్వహించడం సాధ్యమవుతుందా  లేదా అనేది ఒకటైతే.. ఈలోగా  42 శాతం రిజర్వేషన్ వివాదం అటో ఇటో తేలుతుందా లేదా అనేది మరో చిక్కుముడి. నిజానికి..  హై కోర్టు విధించిన గడవులోగా ఎన్నికలు నిర్వహించం ఒక్కటే సమస్య అనుకుంటే అదసలు సమస్యే కాదు. అంతకంటే ముందుగా అయినా నిర్వహించడం కూడా పెద్ద విషయం కాదు. అందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా వుంది. కానీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్  అమలు చేయడం విషయంలోనే అనేక చిక్కుముళ్లు ఎదురుతున్నాయి. అందుకే.. బీసీలకు చట్టబద్దంగా 42 శాతం రిజర్వేషన్  కల్పించి..  హై కోర్ట్ విధించిన గడువు లోగా ఎన్నికలు నిర్వహించడం ఇంచుమించుగా అయ్యే పని కాదని  రాజకీయ పార్టీలు ముఖ్యంగా  కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లుందని  పరిశీలకులు భావిస్తున్నారు.   నిజానికి రాష్ట్రంలోగ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్‌ 30లోగా నిర్వహించాలని ఆదేశించిన రాష్ట హై కోర్టు మొదటి 30 రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు చేయాలని, ఆ తర్వాతి 2 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. రిజర్వేషన్ల ఖరారుకు హై కోర్టు విధించిన గడువు శనివారం (జులై 26) ముగుస్తోంది.  అందుకే.. రాజకీయ పార్టీల స్వరం మెల్ల మెల్లగా మారుతోంది.  ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ.. అటు 42 శాతం బీసీ రిజర్వేషన్ కు చట్టబద్దత సాధించేందుకు  కేంద్ర ప్రభుత్వంతో పోరాటం కొనసాగిస్తూనే.. ఇటు రాష్ట్ర హై కోర్టు  ఆదేశాలను గౌరవిస్తూ.. ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన మాట మేరకు,పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్’ కలిపించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.అధికారికంగా, అలాంటి ప్రతిపాదన ఏదీ రాకున్నా’, ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ముఖ్యనాయకులు అందరూ  కేంద్రం మెడలు వచుతాం, చట్టం తెస్తామని చెపుతున్నా.. అది సాద్యం కాదని కాంగ్రెస్ నాయకులకు అర్థమైందని అంటున్నారు. అందుకే..  కేంద్ర ప్రభుతం అడ్డుకున్నా, కాంగ్రెస్ పార్టీ  పరంగా బీసీలకు 42 శాతం అమలుచేస్తామని, మీడియా చర్చల్లో కాంగ్రెస్ నాయకులు కొత్త రాగం అందుకున్నారు.  మరోవంక..  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయక పోయినా తాము మాత్రం పార్టీలో బీసీలకు 42 శాతం పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. మరో వంక బీఆర్ఎస్  మౌనంగా పరిస్థితిని గమనిస్తోందని, బీసీలకు ఇచ్చిన 42 రిజర్వేషన్ పక్కన పెట్టి ఎన్నికలకు పోతే..  ఇటు కాంగ్రెస్ పార్టీని, అటు బీజేపీని ప్రజాకోర్టులో దోహిగా నిలబెట్టవచ్చన్న ఆలోచనతో  బీఆర్ఎస్’ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏది ఏమైనా ఈసారికి 42 శాతం రిజర్వేషన్ మాత్రం హుళక్కే అంటున్నారు.
 పార్టీల దయ ... బీసీల ప్రాప్తం! Publish Date: Jul 26, 2025 3:16PM

ప్రపంచంలో అత్యం విశ్వసనీయ నేతగా నరేంద్రమోడీ మరోసారి

ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా భారత్ ప్రధాని నరేంద్రమోడీ  మరోసారి టాప్‌లో నిలిచారు. అమెరికా ప్రెసిడెంట్‌గా రెండో సారి ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ విశ్వసనీయత ప్రపంచంలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. మార్నింగ్‌ కన్సల్ట్‌ సంస్థ గ్లోబల్‌ లీడర్‌ సర్వేలో  మోడీ మరోసారి తన ఆధిక్యాన్ని నిలుపుకున్నారు. సర్వేలో ప్రధాని మోడీకి అత్యధిక శాతం మంది మద్దతు ప్రకటించడంలో అప్రూవల్ రేటింగ్స్ ఏకంగా 75 శాతానికి చేరాయి. ఈ ఏడాది జులై 4 నుంచి 10 తేదీల మధ్య సర్వేను నిర్వహించారు. ఈ సర్వేలో ప్రధాని నంబర్1గా నిలవడంపై బీజేపీ సీనియర్ నేత అమిత్ మాల్వీయ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా మిలియన్‌ల మంది ప్రజల గౌరవాభిమానాలు చూరగొన్న నేతగా ప్రధాని నిలిచారని అన్నారు. అత్యధిక అనుకూల రేటింగ్స్ కలిగిన నేతగా ఉన్నారంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. బలమైన నాయకత్వం, ప్రపంచవ్యాప్తంగా గౌరవాభిమానాలు పొందే నేత సారథ్యంలో భారత్ భద్రంగా ఉందని కామెంట్ చేశారు. మార్నింగ్ కన్సల్ట్ నిర్వహిస్తున్న సర్వేల్లో మోడీ 2021 నుంచి ప్రథమస్థానంలోనే కొనసాగుతున్నారు. సర్వేల్లో ప్రధానికి మద్దతుగా నిలుస్తున్న వారి సంఖ్య 70 శాతానికి పైగానే ఉంటోంది. 2022 సర్వేలో కూడా 13 ప్రపంచం నేతల్లో జనాదరణ పరంగా ప్రధాని టాప్‌లో నిలిచారు. ఇక 2023 నాటి సర్వేలో ఆయన అప్రూవల్ రేటింగ్స్ 76 శాతానికి ఎగబాకాయి. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సర్వేలో విశ్వసనీయత రేటింగ్స్ గరిష్ఠంగా 78 శాతాన్ని తాకాయి. తాజా సర్వేలో ప్రధాని తర్వాతి స్థానంలో దక్షిణ కొరియా నేత లీ జే మ్యూంగ్ ఉన్నారు. 59 శాతం అప్రూవల్ రేటింగ్స్‌తో  ఆయన రెండో స్థానంలో నిలిచారు. ఆ తరువాతి స్థానాల్లో అర్జెంటీనా నేత జేవియర్ మైలీ (57 శాతం), కెనడా అధినేత మార్క్ కార్నీ (56 శాతం) ఉన్నారు. ఇక ఈ జాబితాలో 44 శాతం అప్రూవల్ రేటింగ్స్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎనిమిదో స్థానంలో నిలిచారు.
ప్రపంచంలో అత్యం విశ్వసనీయ నేతగా నరేంద్రమోడీ మరోసారి Publish Date: Jul 26, 2025 2:58PM

కేటీఆర్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు : ఎంపీ సీఎం రమేశ్‌

  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎంపీ సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చేసిన ఆరోపణలకు అనకాపల్లిలో మీడియా సమావేశంలో సీఎం రమేష్ సమాధానం ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి రూ.1660 కోట్లతో నామిషన్ పనులు ఇచ్చారని కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎంపీ అన్నారు.  గత బీఆర్‌‌ఎస్ హయాంలో రిత్వి ప్రాజెక్టు రూ.2000 కోట్లతో చేపట్టారని వాటిని నామిషన్ కింద ఇచ్చార అని కేటీఆర్‌ను ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిపై బురద జల్లాలని నాపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ కవిత జైల్లో ఉన్నప్పుడు దిల్లీలో నా ఇంటికి వచ్చి కలిసిన విషయం కేటీఆర్‌ మర్చిపోయారా..? రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తాయన్న భయంతో కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నాపై చేసిన తప్పుడు ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధం’’ అని సీఎం రమేశ్‌ అన్నారు. 
కేటీఆర్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు : ఎంపీ సీఎం రమేశ్‌ Publish Date: Jul 26, 2025 2:56PM

పవన్ అమావాస్య సెంటిమెంట్ బెడిసికొట్టిందా?

2024 ఎన్నికల ముందు మంగళవారం, అమావాస్య నాడు రాజమండ్రి సెంట్రల్ జైల్ ముందు కూటమి పై కీలక ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. అప్పట్లో అమావాస్య నాడు పవన్ చేసిన ఈ కూటమి ప్రకటనపై పులువురి నుంచి అభ్యంతరాలొచ్చాయి. కానీ ఫలితాల తర్వాత తేలింది ఏంటంటే పవన్ అమావాస్య సెంటిమెంట్ సూపర్ డూపర్ బంపర్ హిట్ అని.  పవన్ ఏమీ సెంటిమెంట్లు తెలీని వాడేమీ కాడని.. ఆయనకు కూడా జ్యోతిష సలహా సూచనలు ఇచ్చేవారు ఉన్నారని అంటారు. ఎవరో ఒక మహిళా జ్యోతిష్కురాలి సూచనల మేరకే పవన్.. వారాహీ అమ్మవారి కొలుపులు మొదలు పెట్టారనీ చెప్పుకొస్తారు. అంతే కాదు ఆయన తన వాహనానికి వారాహీ అని పేరు పెట్టడం ఆపై ఎన్నో యజ్ఞ యాగాలు చేయడం.. ఆ తర్వాత వారాహీ దీక్ష, సనాతన ధర్మ పరిరక్షణ.. అందులో భాగంగా భారీ ఎత్తున తీర్ధయాత్రలు, ఆపై తమిళనాడు మురుగన్ మానాడు వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని చూస్తే పవన్ కి అమావాస్య పౌర్ణమి సెంటి మెంట్ల గురించి బాగా తెలుసనే చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మేటరేంటంటే జూలై 24న ఆషాడ అమావాస్య నాడు తన హరి హర వీరమల్లు రిలీజ్ ముహుర్తం ఫిక్స్ చేశారు పవన్. తాను గతంలో అమలు చేసిన అమావాస్య సెంటిమెంటు వర్కవుట్ అవుద్దని ఈ సారి కూడా ఫీలైనట్టు కనిపించింది. కానీ అదెందుకో ఎదురుకొట్టినట్టు కనిపిస్తోంది. రిలీజ్ వరకూ హైప్, పబ్లిసిటీ అంతా బాగానే ఉంది. ఎక్కడ తేడా కొట్టిందో అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారు కొందరు జన సైనికులు. బేసిగ్గా అమావాస్య తెలుగు వారికి కలసి రాక పోయినా.. తమిళ సంప్రదాయంలో అవి అతి పెద్ద శుభకరమైన రోజు. వీరి లెక్కల ప్రకారం పౌర్ణమి చంద్రుడు నానాటికీ కరిగిపోతూ వస్తాడు. అదే అమావాస్య చంద్రుడు అంతకంతకూ ఎదుగుతాడు కాబట్టి.. ఎదుగుదల ఆశించేవారు అమావాస్య నియమాన్ని ఆచరించడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుందని విశ్వసిస్తారు. తమిళనాట కూడా  అనుబంధం ఉన్న పవన్ ఈ దిశగా తన సెంటి మెంటు తొలి సారి విజయవంతం కావడంతో రెండో సారి కూడా ప్రయత్నించి చూశారు. అయితే ఇదేమంత  పని చేసినట్టు లేదు. దానికి తోడు పవన్ ఎంతో భక్తిగా కొలిచే వారాహీ అమ్మవారికి మరెంతో ఇష్టమైన నెల కూడా ఆషాడమే. అలాంటి ఆషాడ మాసంలోని పౌర్ణమిని   వదిలి అమావాస్య వెంట పడ్డారు పవన్. అందులో భాగంగా తన సినిమా హరిహరవీరమల్లు రిలీజ్ డేట్ ని ఆషాడ అమావాస్య రోజును మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయ్యారాయన. కట్ చేస్తే.. అది కూడా దారుణంగా దెబ్బ తీసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హరి హర వీరమల్లు పరిస్థితేంటంటే.. ఆ సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్లే వారే కరవయ్యారు. ఇక సినిమీలో ఆయన గుర్రం సీన్లు దారుణంగా ట్రోలవుతున్నాయి. ఇక హాళ్లలో జనం లేని క్లిప్పింగులెన్నో వైరలవుతున్నాయి. ఈ మొత్తం ఘోర పరాజయంతో ఒక ఫ్యామిలీ ప్యాక్ ఫ్లాప్ షో కంప్లీట్ అయినట్టు కొందరు దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఆచార్య- భోళా శంకర్- మట్కా- గేమ్ ఛేంజర్- హరిహర వీరమల్లు.. ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం వరుస డిజాస్టర్లు నమోదు చేయడంతో.. మెగా ఫ్యాన్స్ ఫుల్ డిజప్పాయింట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అత్తారింటికి దారేది తర్వాత సరైన హిట్టే లేని పవన్ కి.. తర్వాత వచ్చే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాలే ఊపిరి పోయాలన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
పవన్ అమావాస్య సెంటిమెంట్ బెడిసికొట్టిందా? Publish Date: Jul 26, 2025 2:47PM

సజ్జల వైఫల్యాల పరంపర.. వైసీపీలో ప్రతిష్ట పాతర!?

వైసీపీలో పెద్ద సంక్షోభంలో కూరుకుపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీలో పై నుంచి కింది దాకా సజ్జలపై తీవ్ర అసంతృప్తి పేరుకుపోతున్నది.తాడేపల్లి ప్యాలెస్ గుడ్ లుక్స్ లో ఉండటం వల్ల అది బహిర్గతం కావడం లేదని వైసీపీ నేతలే గుసగులాడుతున్నారు. అయితే మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి అరెస్టు తరువాత ఆ పరిస్థితి చాలా వరకూ మారిపోయిందంటున్నారు. ఇక తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులు కూడా సజ్జలపై పార్టీ నేతలలో వ్యతిరేకతను చల్లార్చగలిగే పరిస్థితి లుదంటున్నారు. మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి అరెస్టు తరువాత పార్టీ క్యాడర్ కు భరోసా కల్పించడంలో.. అరెస్టు కారణంగా పార్టీకి జరిగిన నష్టాన్ని నివారించడంలో సజ్జల వైఫల్యమే ఇందుకు కారణమంటున్నారు. అన్నిటికీ మించి సజ్జలపై జగన్ రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు.  మద్యం కుంభకోణం విషయంలో అరెస్టులు అన్ని రాజకీయ కక్ష సాధింపులో భాగమేనన్న విషయాన్ని బలంగా చెప్పడంలో సజ్జల వైఫల్యమే ఇందుకు కారణమని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.  ఒక వైపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మద్యం కుంభకోణం విషయంలో... దర్యాప్తు సాగుతున్న తీరును.. బయటపడుతున్న వైసీపీ నేతల ప్రమేయాన్ని క్షుణ్ణంగా, పూసగుచ్చినట్లు ప్రజలకు వివరిస్తుంటే.. అందుకు దీటుగా దర్యాప్తు నుంచి అరెస్టుల వరకూ అంతా తెలుగుదేశం కూటమి సర్కార్ కక్షసాధింపే నంటూ వైసీపీ వాదాన్ని బలంగా ప్రజలకు వివరించే విషయంలో సజ్జల ఘోరాతిఘోరంగా విఫలమయ్యారని పార్టీ నేతలే అంటున్నాయి.   ఈ వైఫల్యానికి తోడు సజ్జల ఇటీవల వరుస ఇంటర్వ్యూలలో జగన్ అరెస్టుకు సంబంధించిన సంకేతాలు ఇవ్వడం పార్టీ క్యాడర్ ను అయోమయంలో పడేయడమే కాకుండా వారి మనో ధైర్యాన్ని కూడా దెబ్బతీసిందంటున్నారు. సజ్జల చెప్పిన ప్రతిమాటా, ప్రతి కౌంటర్.. గతంలో అంటే జగన్ హయాంలో జరిగిన అడ్డగోలు అరెస్టులపై చర్చకు తెరలేపేవిగా ఉండటంతో సజ్జల తీరుపై జగన్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా జగన్ హయాంలోలా అర్ధరాత్రి గోడలు దూకి, తలుపులు బద్దలు కొట్టి ఇప్పుడు అరెస్టులు జరగడం లేదు. అరెస్టుకు ముందు నిందితులకు ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలూ వినియోగించుకునే అవకాశం దొరుకుతోంది. చివరకు సుప్రీం కోర్టు వరకూ వెళ్లి అరెస్టు నుంచి రక్షణ పొందడానికి చేసిన ప్రయత్నాలు కూడా విఫలమైన తరువాతనే అరెస్టులు జరుగుతున్నాయి. దీంతో వీటిని కక్ష సాధింపు అరెస్టులుగా సజ్జల ఎంత నెత్తీ నోరూ బాదుకుంటూ చెబుతున్నా జనం నమ్మడం లేదు.  సో సజ్జల వైఫల్యాల జాబితా ముందు ముందు మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. అంటే సజ్జలపై పార్టీలో మరింత వ్యతిరేకత ప్రోది అవుతుందనడంలో సందేహమే లేదు. 
సజ్జల వైఫల్యాల పరంపర.. వైసీపీలో ప్రతిష్ట పాతర!? Publish Date: Jul 26, 2025 2:32PM

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు

  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై  అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్  హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. బంజారాహిల్స్, రాజేంద్రనగర్. షాద్‌నగర్ పోలీసు స్టేషన్‌లో కాంగ్రెస్ శ్రేణుల ఫిర్యాదులతో బీఎన్ఎస్ 356(2),353(B)352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.  ‘రేవంత్ రెడ్డి నువ్వు ఇట్లనే నోటికొచ్చినట్టు మాట్లాడితే నువ్వు ఎవరెవరితో తిరిగావో ఆ 16 మంది పేర్లు బయట పెడతా.. నువ్వు జూబ్లీహిల్స్‌లో ఎక్కడ పడుకున్నావో, దుబాయిలో ఎక్కడ పడుకున్నావో, ఢిల్లీలో ఎక్కడ పడుకున్నావో నాకు అన్నీ తెలుసు.. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాను. నీ స్టోరీలు అన్నీ నాకు తెలుసు. మిస్ వరల్డ్ పోటీదారుల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తనవి ఆరోపణలు కాదు వాస్తవాలు కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు Publish Date: Jul 26, 2025 2:10PM

నష్టనివారణా.. జగన్ అరెస్టు ఖాయమన్న సంకేతమా?

జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ కుంభకోణం వైసీపీ పునాదులనే కదిల్చేస్తోందా? అంటే.. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత ఆ పార్టీలో కనిపిస్తున్న ఖంగారు చూస్తుంటూ ఔననే అనిపిస్తోంది. దాని కంటే ముఖ్యంగా మిథున్ రెడ్డి అరెస్టు తరువాత ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వరుసగా మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ భయాన్ని ఎత్తి చూపుతున్నాయి. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత వైసీపీ అంత వరకూ ప్రదర్శిస్తూ వస్తున్న గాంభీర్యం లేదా మేకపోతు గాంభీరం ఒక్కసారిగా పటాపంచలైపోయింది. పొంతన లేని ప్రకటనలతో పార్టీలో నెలకొన్న అయోమయాన్ని బహిర్గతం చేసుకుంటోంది. సరిగ్గా ఇదే సమయంలో సజ్జల బయటకు వచ్చి వైసీపీ అనుకూల మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వూల సారాంశం ఏమిటన్న దానిపైనే ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత నష్టనివారణ, క్యాడర్ లో ధైర్యాన్నినింపడం ఎజెండాగా సజ్జల మాట్లాడిన మాటలు క్యాడర్ లో ధైర్యం నింపడం సంగతి అటుంచి క్యాడర్ ను మరింత గందరగొళంలోకి నెట్టేశాయి. మొత్తంగా సజ్జల మద్యం కుంభకోణం కేసులో జగన్ అరెస్టు అనివార్యం అన్న సంకేతం ఇచ్చారు. జగన్ అరెస్టు కు క్యాడర్ ను సంసిద్ధం చేయడమే ఆయన ఇంటర్వూల సారాంశమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జగన్ ప్రభుత్వ హయాంలో సజ్జల సకలశాఖల మంత్రిగా చక్రం తిప్పారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఆయన నాడు అన్ని శాఖలపైనా తిరుగులేని పెత్తనం చెలాయించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత ఈ ఏడాది కాలంలో ఆయనకు పనేమీ లేకుండా పోయింది. అయితే మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్టు తరువాత ఆ అరెస్టును, ప్రభుత్వ తీరును ఖండిస్తూ పార్టీని సమర్ధించుకోవలసిన బాధ్యత ఆయనపై పడింది. ఆ పనిని ఆయన చేయగలిగినంత అస్తవ్యస్తం చేస్తున్నారని వైసీపీ శ్రేణులే అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్టుకే కంగారుపడితే ఎలా? ముందు ముందు జగన్ కూడా ఈ కేసులో కటకటాల వెనక్కు వెడతారు.. అంటే ఆయన పార్టీ క్యాడర్ కు సంకేతాలిస్తున్నారు. ఆధారాలు లేకుండా అరెస్టులు చేస్తున్నారంటూ ఆయన చేస్తున్న ఆరోపణలు కూడా చాలా బలహీనంగా ఉన్నాయి. ఇంతకీ ఆయనేం చెప్పారంటే.. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చి తొలి ఏడాది ఎవరినైనా అరెస్టు చేయడం సులువే.. చంద్రబాబు ఇప్పుడు అదే చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. అదే జగన్ అన్ని ఆధారాలూ సేకరించిన తరువాత తన అధికారం చివరి దశలో చంద్రబాబును అరెస్టు చేశారని గుర్తు చేశారు. అయితే ఇక్కడ సజ్జల ఉద్దేశపూర్వకంగా విస్మరించిన సంగతేంటంటే.. జగన్ ప్రభుత్వం అన్ని ఆధారాలూ సేకరించి చంద్రబాబునున అరెస్టు చేసినట్లైతే.. ఆ ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టడంలో విఫలం ఎందుకైంది? అన్న ప్రశ్నకు సమాధానం. మొత్తంగా నష్టనివారణ అంటూ మీడియా ముందుకు అదీ జగన్ అనుకూల మీడియా ముందుకు వచ్చి సజ్జల చెప్పిందేమిటంటే.. జగన్ మద్యం కేసులో అరెస్టు కాబోతున్నారు అనే.  
నష్టనివారణా.. జగన్ అరెస్టు ఖాయమన్న సంకేతమా? Publish Date: Jul 26, 2025 1:27PM

హెచ్ సీఏ కేసులో ముగ్గురికి బెయిలు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్ సీఏ కోశాధికారి శ్రీనివాస్, శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, కార్యదర్శి రాజేంద్రయాదవ్ లకు బెయిలు లభించింది. అదలా ఉంచితే.. ఈ కేసులో అరెస్టైన హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహనరావును కస్టడీని పొడిగించాలంటూ   సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఇలా ఉండగా హెసీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, సీఈవో సునీల్ లు మల్కాజ్ గిరి కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. వీరి బెయిలు పిటిషన్లపై కోర్టు సోమవారం (జులై 28) విచారించే అవకాశం ఉంది. అదలా ఉంచితే హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు, సీఈవో సునీల్, కోశాధికారి శ్రీనివాస్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్కు చెందిన కవిత, రాజేంద్రయాదవ్ లను వేర్వేరు కేసులలో పోలీసులు అరెస్టు చేశారు.  ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం తదితర అభియోగాలపై ఈ అరెస్టులు జరిగాయి. హెచ్ సీఏ జగన్ మోహనరావును అయితే ఫోర్జరీ ద్వారా 23 కోట్ల రూపాయలను దోచుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి.  అలాగే సన్ రైజర్స్ యాజమాన్యాన్ని ఐపీఎల్ 2025 టికెట్ల కోసం బెదరించారన్న ఆరోపణలకు కూడా ఉన్నాయి.   అది పక్కన పెడితే ఈ కేసులో హెచ్ సీఏ ప్రధాన కార్యదర్శి దేవరాజ్ ను పోలీసులు పుణెలో అదుపులోనికి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో సీఐడీ ఇంత వరకూ ఆరుగురిని అరెస్టు చేయగా, వారిలో ముగ్గురికి బెయిలు లభించింది.  
హెచ్ సీఏ కేసులో ముగ్గురికి బెయిలు Publish Date: Jul 26, 2025 12:49PM

ఉన్నత విద్యావంతుల్ని తెలివిగా వాడుకున్న లిక్కర్ స్కాం నిందితులు

ఉన్నత విద్యనభ్యసించి, మంచి భవిష్యత్తు  వెతుక్కుంటున్న అమాయకులను కూడా మాజీ సీఎం జగన్ సన్నిహితులు లిక్కర్ స్కాంలో బుక్ చేస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ -47 నిందితుడిగా ఉన్న బెహ్రూన్ షాజిల్ షేక్ పాపం అలాగే కేసులో ఇరుక్కున్నాడు. జగన్‌ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు అయిన ఏ1 రాజ్‌ కసిరెడ్డి ప్రణాళిక అమలు కోసం నియమించుకున్న విద్యావంతులైన యువకుల్లో షాజిల్‌ షేక్‌ ఒకడు. అతను తాజాగా సిట్ విచారణకు హాజరయ్యాడు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక తన దగ్గర పెట్టిన డబ్బులు రాజ్ కేసిరెడ్డి అనుచరులు తీసుకుని, తనను దుబాయ్‌కి వెళ్లిపొమ్మన్నారని, తాను అక్కడే ఉద్యోగం చేసుకుంటున్నానని,  తనకు లిక్కర్‌ స్కామ్‌తో సంబంధం లేదనీ..  రాజ్‌ కసిరెడ్డి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధం చేసిన ఎలట్రిక్ వాహన డిజైన్‌లో పనిచేసిన ఇంజనీర్‌ను మాత్రమేనని సిట్‌ అధికారులకు లిక్కర్‌ స్కామ్‌ నిందితుడు బెహ్రూన్‌ షాజిల్‌ షేక్‌చెప్పినట్టు తెలిసింది.  విశ్వసనీయ సమాచారం మేరకు.. నెల్లూరు జిల్లాకు చెందిన షాజిల్‌ ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉండగా రాజ్‌ కసిరెడ్డి గ్యాంగ్‌ కంట్లో పడ్డాడు. లిక్కర్‌ స్కామ్‌లో వసూలు చేసిన కమీషన్ల నుంచి రాజ్‌ కసిరెడ్డి కొంత నొక్కేశాడు. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులతో పాటు విదేశాల్లో వ్యాపారాలు ప్రారంభించాడు. మరోవైపు మనదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రికల్‌ ఆటో రంగంలోకి ప్రవేశిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఈవీ వాహనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఐప్యాక్‌ బృందంలోని కీలక వ్యక్తి భార్యను సీఈవోగా నియమించి ఈవీ బ్యాటరీ, వాహన డిజైన్‌తో పాటు కేంద్ర రవాణ మంత్రిత్వ శాఖ అనుమతులన్నీ పొందాడు. అందుకు భారీగా సొమ్ము ఖర్చు చేసిన రాజ్‌ కసిరెడ్డి లిక్కర్‌ ముడుపుల నుంచి నగదు రూపంలో ఎప్పటికప్పుడు ఈవీ వాహన ఆర్‌ అండ్‌ డీ కోసం వినియోగించాడు. డిజైన్‌ రూపకల్పనలో ఇంజనీర్‌గా పనిచేసిన బెహ్రూన్‌ షాజిల్‌ ఎన్నికల ముందు వరకూ హైదరాబాద్‌లో ఉన్నాడు. నమ్మకస్తుడిగా ఉండటంతో రాజ్‌ కసిరెడ్డి గ్యాంగ్‌ సభ్యులు లిక్కర్‌ ముడుపులను అప్పుడప్పుడు అట్ట పెట్టెల్లో తెచ్చి బెహ్రూన్‌ ఫ్లాట్‌లో పెట్టేవారు. ఈవీ అవసరాల కోసం కొంత ఇచ్చి, మిగతా సొమ్ము తీసుకెళ్లేవారు. సిట్‌ అధునాతన టెక్నాలజీ సాయం తో మొత్తం మూలాలు వెలికి తీస్తోంది. మద్యం ముడుపుల వసూలు నిందితులు పలుమార్లు హైదరాబాద్‌లోని బెహ్రూన్‌ ఫ్లాట్‌కు వెళ్లినట్లు విచారణలో గుర్తించింది. కూపీ లాగడంతో అక్కడ ముడుపుల సొమ్ము భద్రపరిచే వారని తేలింది. దీంతో బెహ్రూన్‌ షేక్‌ను లిక్కర్‌ స్కామ్‌లో నిందితుడిగా చేర్చింది. సిట్‌ అతని ఆచూకీ కోసం చేసిన ప్రయత్నం ఫలించింది. దుబాయ్‌లో ఉంటున్నట్లు తెలుసుకుని విచారణకు రమ్మని పిలవడంతో శుక్రవారం విజయవాడలోని సిట్‌ కార్యాలయానికి వచ్చాడు. లిక్కర్‌ స్కామ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, రాజ్‌ కసిరెడ్డి ఈవీ వాహనం కోసమే పని చేశానని చెప్పిన బెహ్రూన్‌ అందుకు సంబంధించిన ఆధారాలు కూడా సిట్‌ అధికారులకు అందజేసినట్లు తెలిసింది. స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకున్న సిట్‌ అధికారులు తమకు అందుబాటులో ఉండాలని చెప్పి పంపినట్లు సమాచారం. తన కుటుంబం దుబాయ్‌లో ఉంటోందని, ఈ స్కామ్‌లో తాను చిక్కుకుంటానని అనుకోలేదంటూ నిందితుడు వాపోయినట్లు తెలిసింది.
ఉన్నత విద్యావంతుల్ని తెలివిగా వాడుకున్న లిక్కర్ స్కాం నిందితులు Publish Date: Jul 26, 2025 12:14PM

ఏ కులమూ నీదన్నా.. రాహుల్ కు కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

ఏ కుల‌మూ నీదంటే గోకుల‌మూ మాదందీ.. అన్న పాట ఒక‌టుంది. ప్ర‌స్తుతం రాహుల్ గాంధీ విష‌యంలో కిష‌న్ రెడ్డి వేసిన ప్ర‌శ్న  స‌రిగ్గా అలాగే క‌నిపిస్తోంది. కుల గ‌ణ‌న విష‌యంలో కాంగ్రెస్, బీజేపీ మ‌ధ్య మాట‌ల మంట‌లు ర‌గులుతున్నాయ్. బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై ఇచ్చిన ప్రెజంటేష‌న్లో.. ప్ర‌ధాని మోడీని కన్వ‌ర్టెడ్ బీసీగా అభివ‌ర్ణించారు సీఎం రేవంత్ రెడ్డి.  సీఎం స్థాయిలోని వ్య‌క్తి మిడి మిడి జ్ఞానంతో అవాకులు చెవాకులు పేలుతున్నార‌ని తీవ్రంగా మండి ప‌డ్డారు కిష‌న్ రెడ్డి. అంతెందుకు మీ అధినేత రాహుల్ గాంధీ కుల‌మేదో చెప్పాల‌ని నిల‌దీశారు. నిజానికి రాహుల్ గాంధీకి మ‌త‌మే స‌రిగా ఉండ‌దు. కులం ఎక్క‌డి నుంచి వ‌స్తుంద‌న్న కామెంట్ వినిపిస్తోంది. రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ సెమీ హిందూ  అయినా.. ఆయ‌న వివాహ‌మాడిన సోనియా గాంధీ ఇట‌లీకి చెందిన  ఫ‌క్తు క్రిష్టియ‌న్. అందుకే ఆమె త‌న కుమార్తెను రాబ‌ర్ట్ వాద్రా అనే క్రిష్టియ‌న్ కి ఇచ్చి పెళ్లి చేశారు. ఇంకా డీప్ గా వెళ్తే.. రాహుల్ నాన‌మ్మ‌ ఇందిరాగాంధీ ఫిరోజ్ ఖాన్ అనే పార్శీని  పెళ్లాడిన‌ట్టు చెబుతారు. కొంద‌రైతే.. నెహ్రూలు కాశ్మీరీ పండిట్లు కార‌ని.. వారు కూడా ముస్లిములేన‌ని అంటారు. ప్ర‌స్తుతం క‌శ్మీర్ సీఎంగా ఉన్న ఒమ‌ర్ అబ్ధుల్లా హిందూ అనీ.. ఆ మాట‌కొస్తే ఎంఐఎం అధినేత‌లైన ఓవైసీలు కూడా తొలుత రాజ‌స్థాన్ కి చెందిన హిందువులేన‌ని అంటారు. ఇదిలా ఉంటే.. బీసీలు బీసీల‌ని అంతగా గొంతెచించుకుంటున్న కాంగ్రెస్ నాయ‌కులు.. ద‌మ్ముంటే రేవంత్ రెడ్డిని సీఎం ప‌ద‌వి నుంచి తొల‌గించి..  బీసీ అయిన పొన్నం ప్ర‌భాక‌ర్ ని గానీ ప్ర‌స్తుత పీసీసీ అధ్య‌క్షుడైన మ‌హేష్ కుమార్ గౌడ్ ని గానీ ముఖ్య‌మంత్రిని చేయాల‌ని డిమాండ్  చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామ‌చంద‌ర్ రావు. దీంతో కాంగ్రెస్ అన‌వ‌స‌రంగా ఈ గొడ‌వ‌లో చిక్కిన‌ట్ట‌య్యింది. మోడీ ఒక వేళ క‌న్వ‌ర్టెడ్ బీసీ అయినా అది  జ‌రిగింది కూడా కాంగ్రెస్ హ‌యాంలోనే... అంటారు కిష‌న్ రెడ్డి. 1994లో గుజ‌రాత్ లో కాంగ్రెస్ అధి కారంలో ఉన్న‌పుడు.. మండ‌ల్ క‌మిష‌న్  నివేదిక‌ల ప్ర‌కారం.. మోడీ కులాన్ని బీసీల్లో చేర్చార‌నీ.. ఆ టైం లో మోడీ క‌నీసం ఎమ్మెల్యే కూడా కార‌ని అంటారు కిష‌న్. ఆ త‌ర్వాత కూడా చాలా కులాల‌ను ఎస్సీ ఎస్టీల్లో చేర్చార‌నీ మ‌రి వారిని కూడా క‌న్వ‌ర్టెడ్ ఎస్సీ ఎస్టీల‌ని అంటారా? అని కూడా ప్ర‌శ్నించారు.  42 శాతం బీసీ రిజ‌ర్వేష‌న్ల‌తో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల జ‌ర‌గాల‌ని బీజేపీ కూడా కోరుకుంటోంద‌ని.. అయితే అస‌దుద్దీన్, అక్బ‌రుద్దీన్, అజ‌రుద్దీన్, ష‌బ్బీర్ అలీ వంటి వారికి కూడా బీసీ రిజ‌ర్వేష‌న్లు కాకుండా అచ్చ‌మైన బీసీ కులాల‌కు మాత్రమే ఆ ఫ‌లాలు ద‌క్కాల‌న్న‌ది  త‌మ అభిమ‌తంగా చెప్పారు కిష‌న్ రెడ్డి. మ‌రి చూడాలి ఈ బీసీల చిచ్చు ఏ కార్చిచ్చుగా మారుతుందో?
ఏ కులమూ నీదన్నా.. రాహుల్ కు కిషన్ రెడ్డి సూటి ప్రశ్న Publish Date: Jul 26, 2025 12:00PM

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం

గోవా గవర్నర్ గా అశోకగజపతి రాజు శనివారం (జులై 25) ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బంగ్లా దర్బార్ హాలులో   అశోక్ గజపతిరాజుతో బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయడు, ఏపీ మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. అంతకు ముందు శుక్రవారం గోవాకు చేరుకున్న అశోకగజపతి రాజు, ఆయన కుటుంబ సభ్యులకు గోవా ప్రభుత్వ ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు.   కాగా అశోకగజపతి రాజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులతో సన్నిహితులు, బంధువులు, పెద్ద సంఖ్యలో టీటీడీ శ్రేణులూ కూడా గోవా చేరుకున్నాయి.  
 గోవా గవర్నర్‌గా  అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం Publish Date: Jul 26, 2025 10:52AM

తీరం దాటిన వాయుగుండం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసరాల్లో తీరం దాటింది. దీని ప్రభావంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా, రాయలసీమల్లో భారీ  నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, మత్స్యకారులు సముద్రంపై చేపల వేటకు వెళ్లవద్దనీ సూచించింది.   తీరం వెంబడి 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.     ఇక పోతే తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.  అలాగే శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వర్షంతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.  
తీరం దాటిన వాయుగుండం Publish Date: Jul 26, 2025 10:12AM

హెచ్ సీఏ వ్యవహారాల పర్యవేక్షకుడిగా జస్టిస్ నవీన్ రావు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) వ్యవహారాల పర్యవేక్షణకు రిటైర్డ్ జస్టిస్ నవీన్ రావును తెలంగాణ హైకోర్టు నియమించింది. ఆయన అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేసింది. హెచ్ సీఏలో 2007 నుంచి జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని సఫిల్ గూడా క్రికెట్ క్లబ్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం (జులై 25) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై సోమవారం పూర్తి స్థాయి విచారణ జరపనుంది.   అలాగే అప్పటి వరకూ అంటే జులై 28 వరకూ  సెలక్షన్‌ కమిటీని ఎంపిక చేయవద్దని ఆ మధ్యంతర ఉత్తర్యులలో పేర్కొంది.  2024-26 సంవ త్సరాలకు లీగ్‌ మ్యాచ్‌ల నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతలను చూసేందుకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావుకు అప్పగిస్తూ, గతంలో జస్టిస్‌ లావు నాగేశ్వర్‌రావు పర్యవేక్షణలో జరిగినట్లుగానే ఈసారి జస్టిస్‌ పి.నవీన్‌రావు ఆధ్వర్యంలో లీగ్‌ మ్యాచ్‌లు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. 
హెచ్ సీఏ వ్యవహారాల పర్యవేక్షకుడిగా జస్టిస్ నవీన్ రావు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు Publish Date: Jul 26, 2025 9:52AM

తిరుపతిలో స్కూటరిస్టుపై చిరుత దాడియత్నం

తిరుపతి, తిరుమలలో చిరుతల సంచారం బెంబేలెత్తిస్తోంది. తిరుమల నడకదారిలో చిరుతల కలకలం తరచుగా భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో తిరపతిలో కూడా చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. తాజాగా తిరుపతిలో ఓ స్కూటరిస్టుపై చిరుత దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. తిరుపతి జూపార్క్ రోడ్డులో వెడుతున్న స్కూటరిస్టుపై చిరుత దాడికి ప్రయత్నించింది. స్కూటరిస్టు వేగంగా వెడుతుండటంతో తృటిలో తప్పించుకోగలిగాడు. ఈ దృశ్యాన్ని వెనుక కారులో వస్తున్న వారు వీడియో తీశారు. అది క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ ఘటనతో తిరుపతి వాసులు, భక్తులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు.  ఇటీవల తిరుపతి జూపార్క్ రోడ్డులో చిరుత సంచారాన్ని గుర్తించిన సంగతి తెలిసిందే. చిరుతను బంధించి అటవీ ప్రాంతంలో వదిలివేయడానికి అటవీశాఖ అధికారులు బోను కూడా ఏర్పాటు చేశారు. అంతలో అదే ప్రాంతంలో చిరుత స్కూటరిస్టుపై దాడికి పాల్పడటంతో జనం భయభ్రాంతులకు గురౌతున్నారు.
తిరుపతిలో స్కూటరిస్టుపై చిరుత దాడియత్నం Publish Date: Jul 26, 2025 9:34AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

  తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత కొన్ని రోజులుగా విపరీతమైన భక్తుల తాకిడితో కిటకిటలాడిన తిరుమలలో ఇప్పుడు తాకిడి స్వల్పంగా తగ్గింది.  శనివారం (జులై 26) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 12 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక శుక్రవారం (జులై 25) శ్రీవారిని 73 వేల 576 మంది దర్శించుకున్నారు. వారిలో పాతిక వేల 277 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 23 లక్షల రూపాయలు వచ్చింది. ఇక వారాంతం కావడంతో శని, ఆదివారాలలో భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది.   
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం Publish Date: Jul 26, 2025 9:19AM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీల దుర్మరణం

చౌటుప్పల్ వద్ద జాతీయ రహదారిపై ఈ తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మరణించారు.  ఈ దుర్ఘటన చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద చోటు చేసుకుంది.  ఇదే కారులో ప్రయాణిస్తున్న అడిషనల్ డీఎస్పీ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో  ఏపీ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో పని చేస్తున్న డీఎస్పీలు చక్రధరరావు,  శాంతారావులు సంఘటనా స్థలంలోనే మరణించారు. అడిషనల్ డీఎస్పీ ప్రసాద్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.   కాగా వీరు ఓ కేసు నిమిత్తం విజయవాడ నుంచి హైదరాబాద్ వెడుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని రోడ్డుకు అవతలి వైపుకు దూసుకువెళ్లింది. అదే సమయంలో అటుగా వస్తున్న లారీ ఢీకొంది. అతి వేగం లేదా, నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.  రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసు అధికారులు మరణించిన సంఘటన పట్ల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధుల్లో భాగంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన  గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసు అధికారులు మరణించిన ఘటనపై తీవ్రదిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. 
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీల దుర్మరణం Publish Date: Jul 26, 2025 9:07AM

పెద్దిరెడ్డి గన్ మ్యాన్ పై సస్పెన్షన్ వేటు

వైసీపీ నేత, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్ మ్యాన్ పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.  పుంగనూరు ఎమ్మెల్యేగా   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. అయితే సెక్యూరిటీ వ్యవహారాలు చూడాల్సిన గన్ మ్యాన్ పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో పెద్దిరెడ్డి గన్ మ్యాన్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ కాలేషాను సస్పెండ్ చేస్తూ చిత్తూరు ఎస్పీ శుక్రవారం (జులై 25) ఉత్తర్వులు జారీ చేశారు.  మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు,  రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.  కుమారుడిని పరామర్శించేందుకు బుధవారం (జులై23) పెద్దిరెడ్డి కుటుంబంతో సహా రాజమండ్రి వెళ్లారు. ఆ సమయంలో కోర్టు మిథున్ రెడ్డికి కల్పించిన ప్రత్యేక వసతులు దిండు, దుప్పటి, ఆహార పదార్థాలను తీసుకువెళ్లారు. వీటిని గన్ మ్యాన్ మోసుకుని జైలులోకి వెళ్లిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి భద్రత చూడాల్సిన ఉద్యోగి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన గన్ మ్యాన్ కాలేషా సస్పెన్షన్ కు ఆదేశాలిచ్చింది.  చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన కాలేషా పెద్దిరెడ్డి గన్ మ్యాన్ గా చాలా కాలంగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన సర్వీసు నిబంధనలు అతిక్రమించడంతో  ప్రభుత్వం  సస్పెండ్ చేసింది. అయితే పెద్దిరెడ్డి గన్ మ్యాన్ సస్పెన్షన్ పై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.  పెద్దిరెడ్డిపై అక్కసుతోనే గన్ మ్యాన్ ను సస్పెండ్ చేశారని వైసీపీ ఆరోపిస్తోంది.  
పెద్దిరెడ్డి గన్ మ్యాన్ పై సస్పెన్షన్ వేటు Publish Date: Jul 25, 2025 10:15PM

బద్వేలులో నకిలీ ముఠా గుట్టురట్టు

  కడప జిల్లాలో నకిలీ పట్టాల దందాకు పేరుగాంచిన బద్వేల్ లో మరోసారి నకిలీ భాగోతం బయట పడింది . మూడేళ్ల క్రితం ఇలాంటి ముఠాల గుట్టు రట్టు చేసి భారీ ఎత్తున నకిలీ పత్రాలు,సీల్లు స్వాధీనం చేసుకుని . సుమారు 20 మందిపై ప్పట్లో కేసులు  నమోదు చేశారు. తాజాగా ఇదే తంతు మరోసారి బద్వేల్లో కలకలం రేపింది. డికెటి పెట్టాలు, పాస్ బుక్ లు, అనుబంధ పత్రాలు సృష్టించే వారి బాగోతం బయట పడింది. పదిమంది కలిగిన ముఠాపై  పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ఒక మహిళతో పాటు తొమ్మిది మంది ని అరెస్ట్ చేసి ఆ వివరాలను  పోలీసులు  వెల్లడించారు.  బద్వేలు పట్టణంలో నకిలీ డాక్యుమెంట్లను తయారు చేస్తున్న ముఠా కార్యకలాపాలపై కొద్దిరోజులుగా పోలీసులు లోతుగా విచారిస్తూ వచ్చారు. తీగలాగితే డొంక కదిలినట్టు ఒక ఇంటి పట్టాకు సంబంధించి  విచారణ చేపట్టడంతో  బారీగా నకిలీ వ్యవహారం బయట పడింది. పట్టణంలో నకిలీ పట్టాల సృష్టి, దొంగ సీల్ల తయారీ వ్యవహారం చాలా కాలంగా సాగుతున్నట్లు అధికారులు దృష్టికి వచ్చింది. ఆ మేరకు సమగ్రంగా విచారించి వీటిని స్వాధీనం చేసుకొని పదిమందిపై  కేసు నమోదు చేశారు.  మొత్తం పది మందిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఇంకా కొంతమంది నిందితులు పరారీలో ఉన్నట్ల పేర్కొన్నారు . బద్వేలులో నకిలీ గుట్టు రట్టు చేసిన  పోలీసులు, నిందితుల నుంచి నకిలీ పట్టాలు, అనుబంధ ఫారాలు, పాసుబుక్కులు, రెవిన్యూ అధికారుల నకిలీ సీళ్లతో పాటు పలు కీలకమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.ఈ ముఠా ఎంతకాలంగా  నకిలీ పత్రాల ద్వారా ప్రజలను మోసం చేస్తుంది.ఇంకా ఎన్ని ఇలాంటి నకిలీ పత్రాలు సృష్టించారు అనే అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.  
బద్వేలులో నకిలీ ముఠా గుట్టురట్టు Publish Date: Jul 25, 2025 9:20PM

హెచ్‌సీఏ జనరల్ సెక్రటరీ దేవరాజ్ అరెస్టు

  హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌‌లో జరిగిన అవినీతి వ్యవహారాల కేసులో సంస్థ ప్రధాన కార్యదర్శి దేవరాజ్‌ను   పోలీసులు అరెస్టు చేశారు. సీఐడీ అధికారులు అతడిని పుణేలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో దేవరాజ్‌ ఏ2గా ఉన్నారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది. ఇప్పటికే హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావును పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.  ఫేక్ డ్యాక్‌మేంట్స్ సృష్టించి ఆయన అధ్యక్ష పదవిని పొందినట్లు ఆరోపణలు రావడంతో అరెస్టు చేసినట్లు సీఐడీ అధికారులు పదిహేను రోజుల క్రితం వెల్లడించారు. ఆయనతో పాటు మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మరొకరిని అరెస్టు చేశారు. మరోవైపు అక్రమాల కేసులో ముగ్గురు నిందితులకు మల్కాజ్‌గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  ఈ కేసులో నిందితులుగా ఉన్న ట్రెజరర్ శ్రీనివాస్, సెక్రటరీ రాజేంద్ర యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవితకు బెయిల్ ఇచ్చింది. మరోవైపు, జగన్మోహన్‌రావును మరోసారి కస్టడీకి ఇవ్వాలని వేసిన CID పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. జగన్మోహన్‌రావు, సునీల్ పిటిషన్‌పై సోమవారం వాదనలు వింటామని కోర్టు పేర్కొంది.
హెచ్‌సీఏ జనరల్ సెక్రటరీ దేవరాజ్ అరెస్టు Publish Date: Jul 25, 2025 9:02PM

పార్లమెంట్ సమావేశాలు... తొలి వారం వృధా

  గత సోమవారం (జూలై 21) పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. అయితే,తొలి వారం సమావేసాలు పూర్తిగా తుడిచి పెట్టుకు పోయాయి. ఐదు రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా సభ సజావుగా సాగింది లేదు. పహల్గాం ఉగ్రదాడి,ఆపరేషన్ సిందూర్’తో, ఆపరేషన్ సిందూర్ కాల్పుల విరమణకు సంబందించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న వివాదాస్పద మధ్యవర్తిత్వం వ్యాఖ్యలతో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘం బీహార్’లో చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ(ఎస్ఐఆర్‌)పై  చర్చ చేపట్టాలని విపక్షాలు పార్లమెంట్ ఉభయ సభలను స్తంబింప చేయడంతో, అర్థవంతమైన చర్చ ’ఏదీ జరగ కుండానే తొలివారం పార్లమెంట్ సమావేశాలు ముగిసి పోయింది.   ఈ నేపధ్యంలో శుక్రవారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో, వచ్చేవారం ప్రారంభంలో, (సోమ మంగళ వారాల్లో) ఆపరేషన్ సిందూర్' పై పార్లమెంటు ఉభయసభల్లో 32 గంటలపాటు ప్రత్యేక చర్చ చర్చ చేపట్ట్టాలని నిర్ణయించినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. సోమవారం లోక్‌సభలో చర్చ అనంతరం మంగళవారం రాజ్యసభలో చర్చ ఉంటుందని చెప్పారు. లోక్‌సభలో 16 గంటలు, రాజ్యసభలో 16 గంటల చొప్పున చర్చకు సమయం కేటాయించినట్టు వివరించారు. 'పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో సోమవారం ప్రత్యేక చర్చకు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ నిర్ణయించింది. విపక్షాలు పలు అంశాలు లేవెనెత్తాలని కోరుతున్నాయి. ఆపరేషన్ సిందూర్‌పై చర్చను చేపట్టేందుకు మేము అంగీకరించాం' అని రిజిజు తెలిపారు.చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్టు విపక్షాలకు చెప్పామని, అయితే మొదటి రోజు నుంచీ విపక్షాలు పార్లమెంటు లోపల, వెలుపల ఆందోళన చేపట్టాయని రిజిజు అన్నారు. మొదటి వారంలో కేవలం ఒకే బిల్లు ఆమోదించామని,సభను సజావుగా సాగేలా చూడాలని విపక్షాలను కోరినట్టు చెప్పారు.నిబంధనల ప్రకారం వారు ఏ అంశాన్నైనా లేవనెత్తొచ్చని, పార్లమెంటు పనిచేయకపోతే దేశానికి నష్టం జరుగుతుందని అన్నారు. అయితే, చర్చకు ప్రధానమంత్రి నరేంద మోదీ సమాధానం ఇవ్వాలన్న విపక్షాల, ముఖ్యమంగా ప్రతిపక్ష నేత రాహుల గాంధీ చేస్తున్న డిమాండ్’ను రిజిజు తిప్పికొట్టారు. ప్రభుత్వ పక్షాన ఎవరు మాట్లాడాలి, ఎవరు సమాధానం చెప్పాలి అనేది విపక్షాలు ఎలా నిర్ణయిస్తాయని ఆయన ప్రశ్నించారు. ఈసందర్భంగా రిజిజు, వితండ వాదంతో విపక్షాలు సభా సమయాన్ని , ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాయని విమర్శించారు.  అదలా ఉంటే, సబాహ కార్యక్రమాలను సజావుగా జరుపుకోవాలనే విషయంలో ఏకాభిప్రాయం కుదిరినా, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ(ఎస్ఐఆర్‌) వివాదం కొనసాగుతోంది. విపక్ష పార్టీలు , ఎస్ఐఆర్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తుంటే, ఎన్నికల సంగహం ససేమిరా అంటోంది.  మరోవంక రాజ్యాంగ సంస్థ కేంద్ర  ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమంపై పార్లమెంట్’లో చర్చించే ప్రశ్నే లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవంక, ఎస్ఐఆర్‌ను ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ గట్టిగా సమర్థించుకున్నారు. నకిలీ ఓటర్లు ఓటేయడానికి అనుమతించే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో అసలైన ఓటర్లను తీసివేస్తున్నామన్న విపక్షాల ఆరోపణలను ఖండించారు. ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నట్లు ఆయన తాజాగా ప్రకటించారు. ఈ నేపద్యంలో, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఎంతవరకు అమలవుతుందో చూడవలసిందే   
పార్లమెంట్ సమావేశాలు... తొలి వారం వృధా Publish Date: Jul 25, 2025 8:27PM

ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేక అధికారులు నియామకం

  తెలంగాణలో ఉమ్మడి పది జిల్లాలకు పదిమంది స్పెషల్ ఆఫీసర్‌లుగా సీనియర్  ఐఏఎస్‌లను ప్రభుత్వం నియమించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సి.హరికిరణ్, నల్గొండకు అనిత రామచంద్రన్, హైదరాబాద్ కు ఇలంబర్తి, ఖమ్మం జిల్లాకు కె.సురేంద్ర మోహన్, నిజామాబాద్‌కు  హనుమంతు, రంగారెడ్డికి దివ్య, కరీంనగర్‌కు సర్ఫరాజ్ అహ్మద్, మహబూబ్ నగర్ కు రవి, వరంగల్ కు కె. శశాంక, మెదక్ జిల్లాకు ఎ.శరత్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ పథకాల అమలు తీరు, వర్షాకాల పరిస్థితులపై వీరు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. 
ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేక అధికారులు నియామకం Publish Date: Jul 25, 2025 8:00PM

మిథున్‌రెడ్డికి ఇంటి భోజనం అనుమతించలేం : జైళ్ల శాఖ

    ఏపీ లిక్కర్ స్కాం కేసులో రిమాండ్ ఖైదీగా వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి కల్పించే సౌకర్యాలపై దాఖలైన పిటిషన్‌పై  జైళ్ల శాఖ తాజాగా స్పందించింది. ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. జైలులో ఆయనకు ఇంటి భోజనం అనుమతించలేమని.. అటెండర్‌ సౌకర్యం కల్పించలేమని జైళ్ల శాఖ పేర్కొంది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని మిథున్‌రెడ్డిని కోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. మిథున్‌రెడ్డి ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు.  జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని కోరుతూ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. జైలులో ప్రత్యేక వసతుల కల్పనకు కోర్టు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. వెస్ట్రన్ కమోడ్‌తో కూడిన ప్రత్యేక గదిని ఏర్పాటు చేయడంతో పాటు ఒక సహాయకుడు, అవసరమైన మందులు, మంచం, దుప్పటి, దిండు, వాటర్ బాటిల్స్, కూలర్, పేపర్, పెన్ను, టేబుల్, ప్రొవిజన్ ఉంటే టెలివిజన్‌ను అనుమతించాలని కోర్టు పేర్కొంది.
మిథున్‌రెడ్డికి ఇంటి భోజనం అనుమతించలేం : జైళ్ల శాఖ Publish Date: Jul 25, 2025 7:37PM

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. 250 కుటుంబాలు దత్తత

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన అసెంబ్లీ నియోజకవర్గం కుప్పంలో 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో జీరో పావర్టీ పీ4పై సమీక్షలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా #IAmAMaragadarsi క్యాప్షన్‌తో పీ4 లోగోను ఆయన ఆవిష్కరించారు. పేదరిక నిర్మూలనకు పేద కుటుంబాలను దత్తత తీసుకున్నాని సీఎం తెలిపారు.  అంతే కాకుండా పేదరిక నిర్మూలనలో తన కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. P4 కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతోందని అన్నారు. పేద కుటుంబాల సాధికారతే కూటమి సర్కార్ లక్ష్యం అని తెలిపారు. తెలుగు వారు ఎక్కడున్నా ఈ కార్యక్రమంలో భాగం కావాలని, కార్పొరేట్ సంస్థలు కలిసి వచ్చేలా కలెక్టర్లు దృష్టి పెట్టాలని  ముఖ్యమంత్రి ఆదేశించారు.  
సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. 250 కుటుంబాలు దత్తత Publish Date: Jul 25, 2025 6:44PM