బీహార్లో శవరాజకీయాలు
posted on Jul 18, 2013 3:37PM
చాప్రా జిల్లాలో మధ్యాహ్న భోజనం వికటించి 27 మంది చిన్నారులు చనిపోయిన ఘటనను కూడా రాజకీయం చేస్తున్నాయి ఆ రాష్ట్ర పార్టీలు..బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన బీహార్ విద్యాశాఖ మంత్రి పీకే షాహి ఘటనలో కుట్ర ఉందని ఆరోపించారు. సర్కారు మీద ఎలాంటి ఆరోపణలు రాకుండా తప్పంతా ప్రిన్స్ పాల్దే అని తేల్చేశారు.. వంటనూనె కల్తీవల్లే దుర్ఘటన జరిగిందని... వంట నూనెలో ఆర్గానిక్ పాస్ఫరస్ కలిసినట్లు వైద్యులు ధృవీకరించారని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ మీనాకుమారి దృష్టికి తీసుకెళ్లినా ఆమె నిర్లక్షం వహించింది అని చెప్పారు.
ఈ క్రమంలో మంత్రి ఆరోపణలను ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ ఖండించింది. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకే రాష్ట్ర సర్కారు ఇలాంటి ఆరోపణలు చేస్తుందని విమర్శించింది.. ప్రభుత్వ అసమర్థతే దుర్ఘటనకు కారణమని ఆరోపించింది. బాధితులు సైతం ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, పాఠశాల యాజమాన్యం సక్రమంగా పనిచేస్తే ఘోరం జరిగేది కాదని మండిపడ్డారు. ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం నితీశ్కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.చాప్రా కలెక్టర్ నివాసం ముందు ఆందోళనకు దిగారు.
అటు చాప్రా ఘటన నుంచి తేరుకోకముందే.. బీహార్లో అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. మధుబని జిల్లాలోని ఓ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిన్న 22 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. భోజనంలో బల్లి పడటంవల్లే ఘటన జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలింది.