గోడలో వెండి ఇటుక‌లు, నోట్ల కట్టలు.. సీక్రెట్ రూమ్‌లో 10 కోట్లు సీజ్‌..

posted on: Apr 27, 2022 3:28PM

అదో కంపెనీ. మూడేళ్ల‌లోనే.. 23 ల‌క్ష‌ల నుంచి 1,764 కోట్ల‌కు చేరింది. అదేంటి.. ఇంత త‌క్కువ టైమ్‌లో అంత భారీ సంప‌ద ఎలా వ‌చ్చింది? అనే అనుమానం వ‌చ్చింది జీఎస్టీ అధికారుల‌కు. ఎందుకైనా మంచిద‌ని ఆ కంపెనీ కార్యాల‌యంపై త‌నిఖీకి వెళ్లారు ఆఫీస‌ర్లు. ఎంత వెతికినా అక్క‌డ ఏమీ దొర‌క‌లేదు. తిరిగి వెళ్లిపోతుండ‌గా.. ఓ చిన్న డౌట్‌. అంతే. తీగ లాగ‌కుండానే భారీ డొంక క‌దిలింది. 10 కోట్ల సొత్తు దొరికింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే....

ముంబయిలోని ఓ వ్యాపార సంస్థ కార్యాలయ గోడలను, నేలను అధికారులు తవ్వి చూడగా కట్టల కొద్దీ నగదు, వెండి ఇటుకలు బయటపడ్డాయి. కల్బాదేవి ప్రాంతంలో 35 చదరపు అడుగుల కార్యాలయంలో సీక్రెట్‌గా దాచిన సుమారు రూ.10 కోట్ల విలువైన సొత్తును అధికారులు గుర్తించారు. చాముండా అనే వ్యాపారికి చెందిన ఆఫీస్‌ నేలలో, గోడలో సెట్ చేసిన సీక్రెట్‌ అరల నుంచి రూ.9.8 కోట్ల నగదు, రూ.13 లక్షల విలువైన 19 కేజీల వెండి ఇటుకలను స్వాధీనం చేసుకున్నారు. 

ఇటీవల అనుమానిత కంపెనీల లావాదేవీలను పరిశీలించిన మహారాష్ట్ర జీఎస్‌టీ అధికారులు ఆ క్రమంలో చాముండా బులియన్‌ టర్నోవర్‌ గత మూడేళ్లలో రూ.23 లక్షల నుంచి రూ.1,764 కోట్లకు పెరగడాన్ని గుర్తించారు. ముంబైలో మూడు ప్రాంతాల్లో ఉన్న ఆ సంస్థ కార్యాలయాలపై దాడులు చేశారు. కల్బాదేవిలో 35 ఎస్ఎఫ్‌టీ విస్తీర్ణంలో ఉన్న ఆఫీసులో ఏమీ లభించలేదు. అయితే, ఆ రూమ్ ఫ్లోరింగ్‌లో ఓ మూల‌న‌ ఉన్న ఒక టైల్స్‌పై అధికారుల‌కు అనుమానం వ‌చ్చింది. ఆ టైల్స్‌ తొలగించి చూడగా.. నగదు సంచులు బయటపడ్డాయి. ఆదాయపు పన్ను అధికారులకు సమాచారం అందించారు. ఐటీ సిబ్బంది వచ్చి గదిని మ‌రింత నిశితంగా పరిశీలించి.. గోడలో ఉన్న రహస్య అరను గుర్తించారు. అందులో నుంచీ ప్యాక్ చేసి ఉన్న‌ నగదు సంచులు బయటపడ్డాయి. సోదాల్లో రూ.13 లక్షల విలువైన 19 కేజీల వెండి ఇటుకలు లభించాయి. మొత్తం సొత్తుతో స‌హా ఆ గ‌ది సీజ్ చేశారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...