కదిరికి మారిన జగన్ యాత్ర.. హైటెన్షన్ వాతావరణం..

 

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో హైటెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న అనంతపురం జిల్లా యాడికిలో జగన్ యాత్రను టీడీపీ నేతలు అడ్డుకోగా.. ఈరోజు కదిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈరోజు జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్ర కదిరిలో జరగనుంది. దీంతో రంగంలోకి దిగిన కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జీ కందికుంట వెంకటప్రసాద్ తన అనుచరులతో కలిసి రోడ్డెక్కారు. చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు జగన్ క్షమాపణ చెబితేనే యాత్రను కొనసాగనిస్తామని కందికుంట కదిరిలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ను ముట్టడించే యత్నం చేశారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.