TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబు సవాల్.. జగన్ స్పందన ఎలా ఉంటుందో మరి!?

Published on: Sat Nov 16, 2024 9:15AM

అసెంబ్లీలో తెలుగుదేశం కూటమి సర్కార్ అవాస్తవాలు చెబుతోందనీ, తప్పుడు ప్రచారం చేస్తోందనీ జగన్ మీడియా సమావేశంలో  చెప్పుకున్నారు. అయితే చంద్రబాబు అలాంటి అనుమానాలేమైనా ఉంటే అసెంబ్లీకి వస్తే రికార్డులతో సహా వివరిస్తామని ప్రతి సవాల్ విసిరారు. దీంతో  విపక్ష హోదా మంకుపట్టు వదిలేసి జగన్ అసెంబ్లీకి రావడానికి దీనినో ఆహ్వానంగా భావించొచ్చు.

అసెంబ్లీ వేదికగా చంద్రబాబు గత ప్రభుత్వం పది లక్షల కోట్ల  రూపాయలు అప్పు చేసిందని లెక్కలతో సహా వివరించారు. తాను చెప్పింది అవాస్తవమని భావిస్తే జగన్ అసెంబ్లీకి వచచ్చి చెప్పాలని సవాల్ విసిరారు. నిజంగానే జగన్ తన హయాంలో  అప్పుల లెక్కలను చంద్రబాబు తప్పుగా ప్రచారం చేస్తున్నారని భావిస్తే ఆ విషయం అసెంబ్లీకి వచ్చి చెప్పడానికి ఇది మంచి అవకాశం.  ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా సవాల్ చేశారు కనుక జగన్ వస్తే ఆయనకు తప్పని సరిగా మైక్ ఇస్తారు. అప్పుడు జగన్ తన వాదనను గట్టిగా అసెంబ్లీ వేదికగా వినిపించే అవకాశం ఉంటుంది.

 అయితే జగన్ వాస్తవాలను చెప్పేందుకు కానీ, అంగీకరించేందుకు కానీ సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. అసెంబ్లీ బయట అవాస్తవాలు మాట్లాడి, తన సొంత మీడియా, సొంత సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం చేసుకున్నంత సులువు కాదు. అసెంబ్లీలో అవాస్తవాలు చెప్పి తప్పించుకోవడం. ఎందుకంటే  చంద్రబాబైనా, జగన్ అయినా అప్పులపై తప్పుడు లెక్కలు చెబితే.. అప్పటికప్పుడు నిజాలను నిగ్గుతీసి వాస్తవాలను వెల్లడించడానికి వీలుగా రికార్డులు అందుబాటులో ఉంటాయి. అందుకే ఎంతటి వారైనా అసెంబ్లీ వేదికగా అడ్డదిడ్డంగా లెక్కలు ఇవీ అంటూ చెప్పడానికి వీలు ఉండదు. ఏ పద్దు కింద ఎంత అప్పు చేశారు. ఏ అవసరం కోసం చేసిన అప్పు ఏ అవసరం కోసం వాడారు. నిధుల మల్లింపు ఎలా చేశారు. అడ్డగోలుగా ఆస్తలను తాకట్టు పెట్టి మరీ ఎక్కడెక్కడ నుంచి అప్పులు తెచ్చారు అన్న అన్ని విషయాలూ రికార్డులను ముందు పెట్టి మరీ కడిగేయడానికి అధికార పక్షానికి ఎంత అవకాశం ఉందో.. ప్రతిపక్ష హోదా లేకపోయినా.. విపక్ష వైసీపీకి కూడా అంతే అవకాశం ఉంటుంది.

అందుకే  జగన్ అసెంబ్లీకి ముఖం చాటేసి తన సొంత మీడియాలో ప్రకటనలకే పరిమితమౌతున్నారు. నిజంగా జగన్ తన హయాంలో అప్పుల విషయంలో అసెంబ్లీ వేదికగా చంద్రబాబు చెప్పిన విషయాలు  అవాస్తవాలు అయితే ఆ విషయాన్ని అసెంబ్లీకి వచ్చి చెప్పాల్సి ఉంటుంది. ఒక వేళ ఆయనకు మైక్ ఇవ్వకపోతే చంద్రబాబు చెప్పిన లెక్కలు కరెక్ట్ కాదని ప్రజలు భావించే అవకాశం ఉంటుంది. అదే విషయాన్ని బయటకు వచ్చి జగన్ చెప్పుకునే అవకాశం ఉంటుంది. అందుకే జగన్ చంద్రబాబు సవాల్ ను స్వీకరిస్తే జనంఆయన మాటల్లో నిజం ఉందని నమ్మే అవకాశం ఉంటుంది. అలా కాకుండా నాకు తోచింది నేను అసెంబ్లీ బయటే మాట్లాడతాను అని భీష్మించుకుంటే అంతంత మాత్రంగా ఉన్న విశ్వసనీయతను కూడా జగన్ కోల్పోక తప్పదు.