శోభానాగిరెడ్డి మృతి: తల్లడిల్లుతున్న ఆళ్ళగడ్డ ప్రజలు

 

 

 

తమ ప్రియతమ నాయకురాలు శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆళ్ళగడ్డ ప్రజానీకం తల్లడిల్లుతోంది. శోభ మరణవార్త వినగానే ఆళ్ళగడ్డలో విషాద ఛాయలు అలముకున్నాయి. శోభ ఏ పార్టీలో వున్న ఆళ్ళగడ్డ ప్రజలు ఎప్పుడూ ఆమెకు మద్దతుగానే వున్నారు. తమ ప్రాంతానికి చెందిన నాయకులు ఎస్వీ సుబ్బారెడ్డి కుమార్తెగా, భూమా నాగిరెడ్డి భార్యగా స్థానిక ప్రజలు ఆమెను ఎంతో గౌరవిస్తారు. ఎమ్మెల్యేగా ఆమె చేసిన సేవలను వారు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయంగా ఎంతో ఉజ్వల భవిష్యత్తు వుంటుందని భావిస్తున్న తరుణంలో ఆమె ఇలా దుర్మరణం పాలు కావడాన్ని అక్కడి ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. రాత్రి ఎన్నికల ప్రచారంలో ఎంతో చురుకుగా పాల్గొన్న ఆమె తెల్లవారేసరికి ఇలా అయిపోతుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఆమె ఏపార్టీలో ఉన్నా పార్టీలో సంబంధం లేకుండా ఆమెని గెలిపించుకునే ఆళ్ళగడ్డ ప్రజలు ఈసారి కూడా ఆమె మంచి మెజారిటీతో గెలవటం ఖాయమని అనుకుంటున్న తరుణంలో ఈ ఊహించని దుర్ఘటన వారి మధ్య నుంచి శోభా నాగిరెడ్డిని తీసుకెళ్ళిపోయింది. శోభానాగిరెడ్డి మృతికి సంతాపంగా ఆళ్ళగడ్డ పరిసరాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు.