ప్రధానిగా మోడీకే నా మద్దతు: ప్రీతీజింటా

 

 

 

బాలీవుడ్ అందాల భామ, ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ప్రాంచైజీ ప్రీతీజింటా ప్రధానమంత్రిగా నరేంద్రమోడీకే తన మద్దతు అని స్పష్టంగా ప్రకటించేసింది. నరేంద్రమోడీ ఎంపీగా పోటీ చేస్తున్న హిందువుల పరమ పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిని శుక్రవారం నాడు ప్రీతీజింటా సందర్శించింది. కాశీ విశ్వనాథుడిని దర్శించిన అనంతరం ప్రీతీజింటా మీడియాతో మాట్లాడింది. తాను నరేంద్రమోడీని ఎంతగానో అభిమానిస్తానని, మోడీ మన దేశానికి ప్రధానమంత్రి కావాలని మనసారా కోరుకుంటున్నానని చెప్పింది. దేశవ్యాప్తంగా ప్రజలు మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని, ఆయనకి ప్రజల్లో మంచి ఆదరణ వుందని ప్రీతీజింటా చెప్పింది. మోడీకి అనుకూలంగా మీరు ఎన్నికలలో ప్రచారం చేస్తారా అని అడిగిన ప్రశ్నకు ప్రీతీజింటా అవుననకుండా, కాదనకుండా చాలా తెలివిగా సమాధానం చెప్పింది. మోడీకి ఇప్పుడు ప్రచారం అవసరమే లేదని అంది.