‘నరసింహ’ డైలాగ్ కొట్టిన లోకేష్!
posted on May 5, 2014 3:26PM
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ సీమాంధ్రలో ప్రచారంలో తండ్రితో పోటీ పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రచారానికి రమ్మని ఎవర్నీ బొట్టుపెట్టి పిలిచేది లేదు అని జూనియర్ ఎన్టీఆర్ మీద మొదటిసారి సెటైర్ వేసిన లోకేష్, తెలుగుదేశం పార్టీ ప్రచార బాధ్యతని తన భుజాల మీదకు తీసుకున్నారు. ప్రచార గడువు సోమవారంతో ముగుస్తున్న తరుణంలో లోకేష్ తన ప్రసంగంలో మంచి మంచి సినిమా డైలాగులు కొడుతూ, వాటిని పాలిటిక్స్ కి అన్వయిస్తూ సభకు వచ్చినవాళ్ళని ఆకట్టుకుంటున్నారు. సోమవారం ఆయన ఒక బహిరంగ సభలో రజనీకాంత్ నటించిన ‘నరసింహ’ సినిమాలో రజనీకాంత్ చెప్పిన ఒక పాపులర్ డైలాగ్ కొట్టారు. ఆ సినిమాలో రజనీకాంత్ ‘‘అతిగా ఆశపడిన మగాడు.. అతిగా ఆవేశపడిన ఆడది బాగుపడినట్టు చరిత్రలో లేదు’’ అంటారు. అదే డైలాగ్ని లోకేష్ కూడా ఉపయోగించారు. ఆ తర్వాత దానికి పొలిటికల్ వివరణ కూడా ఇచ్చారు. జగన్ అతిగా ఆశపడే మగాడట.. షర్మిల అతిగా ఆవేశపడే ఆడదట. అంచేత వీళ్ళిద్దరూ బాగుపడరట. లోకేష్ ఈ డైలాగ్ చెప్పి వివరణ ఇచ్చినప్పుడు సభ చప్పట్లతో మార్మోగిపోయింది.