రాష్ట్ర అవతరణ వేడుకలపై లగడపాటి ధీమా
posted on Nov 1, 2013 12:12PM
.jpg)
రాష్ట్రంలో మళ్ళీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతాయని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు.కొంత మంది స్వార్థ ప్రయోజనాల కోసమే తెలుగు తల్లిని ముక్కలు చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. పాంత్రాల వారీగా పార్టీలు విడిపోవడం వల్లే మళ్లీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారని తెలిపారు. విభజనను అడ్డుకునేందుకు చివరి వరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీకి విభజన తీర్మానం వస్తుందని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఘనంగా జరిగాయి. పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. యనమల మాట్లాడుతూ కలిసి ఉండటం వల్లే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమన్నారు. విభజన నిర్ణయం మనస్తాపం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. చిన్న రాష్ట్రాల వల్ల అభివృద్ధి కుంటుబడుతుందన్నారు. విభజన సందిగ్దతకు త్వరగా తెరపడాలని ఆశిస్తున్నట్లు యనమల పేర్కొన్నారు.