జేడీ శీలం అనువాదం సూపర్

 

 

 

గతంలో ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా వస్తే వారి ప్రసంగాలను ఉండవల్లి అనువదించేవారు. ఇప్పుడు ఉండవల్లి జై సమైక్యాంధ్ర అనడంతో ఢిల్లీవాళ్ళ ప్రసంగాలు అనువదించేవారు లేకుండా పోయారు. మొన్నామధ్య తెలంగాణలో సోనియా, రాహుల్ సభలు జరిగినప్పుడు సరైన అనువాదకుడు లేక తల్లీకొడుకు ఇద్దరూ హిందీలోనే మాట్లాడారు.

 

ఇప్పుడు సీమాంధ్రలో సోనియా, రాహుల్ పర్యటిస్తున్నారు. గుంటూరు సోనియా సభలో ఆమెకి కేంద్ర మంత్రి జేడీ శీలం అనువాదకుడిగా వ్యవహరించారు. ఆయన సోనియా ప్రసంగాన్ని సూపర్‌గా అనువదించారు. సోనియాగాంధీ పావలా అంత మేటర్ చెబితే, శీలం ఆ మేటర్ని పది రూపాయలంత సాగదీసి అనువదించారు. సోనియా మాట్లాడని మాటలు కూడా శీలం జతచేసి చెప్పేశారు.



అసలే సీమాంధ్రలో ఓడిపోతామన్న భయంలో వున్న సోనియాగాంధీ చాలా ఎక్కువసేపు ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని జేడీ శీలం మరింత సాగదీసి అనువదించారు. సోనియాగాంధీ మాట్లాడుతూ వుండగానే ఉన్న కొద్దిమంది జనం కూడా సభలోంచి వెళ్ళిపోతున్నా కూడా సోనియాగాంధీ, జేడీ శీలం తమ ప్రసంగాలను ముగించకుండా మాట్లాడుతూనే వున్నారు. సభలో వున్న జనం సోనియాగాంధీ ప్రసంగం మహా బోర్ కొట్టేసిందని అనుకుంటూ వుంటే, కాంగ్రెస్ నాయకులు మాత్రం సోనియా సభ సూపర్ సక్సెస్ వాళ్ళ భుజాలను వాళ్ళే తట్టుకుంటూ సంబరపడిపోతున్నారు.