జగన్ ను చెప్పులతో కొట్టిస్తానన్న జేసీ ప్రభాకర్ రెడ్డి..
posted on Jun 3, 2016 11:32AM
అనంతపురం జిల్లా యాడికిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈరోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో రైతు భరోసా యాత్ర చేపట్టారు. జగన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో జగన్ రైతు భరోసా యాత్రను అడ్డుకునేందుకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి 50 కార్లతో బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను అనుకుంటే ఈ క్షణమే నిన్ను చెప్పులతో కొట్టించి తాడిపత్రి నుంచి తరిమేయగలనని, తాడిపత్రిలో రైతు భరోసా యాత్ర పేరిట పర్యటిస్తున్న నిన్ను పది నిమిషాల్లోనే ప్రజల చేత చెప్పులతో కొట్టిస్తే ఏం చేస్తావని, ముఖ్యమంత్రిని కాదు ప్రజలు నిన్ను చెప్పులతో కొట్టి ఊరేగించే కాలం ఆసన్నమైందని ధ్వజమెత్తారు. చంద్రబాబును విమర్శిస్తే ఊరుకునేది లేదని అన్నారు. దీంతో ఓ వైపు వైసీపీ కార్యకర్తలు... టీడీపీ శ్రేణులు... మధ్యలో భారీ సంఖ్యలో పోలీసులతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
కాగా వడుగూరులో నిన్న మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని చెప్పులతో కొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.