కాంగ్రెస్ ను వీడిన పెద్దిరెడ్డి
posted on Mar 12, 2013 9:29AM
కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి టాటా చెప్పారు. ఈ మేరకు సోనియాగాంధీ,గులాం నబీ అజాద్, బొత్స సత్యనారాయణలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజీనామా లేఖలను పంపించారు. ఈయన మూడు నెలల క్రితమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు సమర్పించారు. శాసనసభ సమావేశాలకు కూడా ఆయన హాజరు కావడం లేదు. తాజాగా ఆయన కాంగ్రెస్ వీడుతున్నట్లు ప్రకటించారు.
ముఖ్యమంత్రికి బద్ద వ్యతిరేకి అయిన పెద్దిరెడ్డి ఆయనను పదవి నుండి తొలగించాలని అధిష్టానం మీద వత్తిడి తెచ్చారు. పెద్దిరెడ్డి కుమారుడు మిధున్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి పనిచేస్తున్నారు. గతంలో చిత్తూరు జిల్లాలో జగన్ పార్టీ ఎమ్మెల్సీ గెలవడానికి పెద్దిరెడ్డి కారణమయ్యారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గెలవడానికి కూడా పెద్దిరెడ్డి మద్దతు ఉంది. జిల్లావ్యాప్తంగా ఆయనకు ప్రజల్లో మంచి పట్టు ఉంది. కాంగ్రెస్ రాజీనామా చేసిన ఆయన జగన్ పార్టీలోకి చేరడం ఖాయమని తెలుస్తోంది.