మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఘనవిజయం
posted on Dec 9, 2012 11:48AM
ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో ఇండియా ఘోర పరాజయం పాలైంది. ఇంగ్లాండ్ బాట్స్ మెన్లు సెంచరీలు మీద సెంచరీలు చేస్తున్న పిచ్ పై భారత బాట్స్ మెన్లు మాత్రం పరుగులు చేయలేక చతికలపడ్డారు. ఇంగ్లాండ్ ఇండియా పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్ లో ఇంగ్లాండ్ 2-1తో ముందంజలో ఉంది.
239/9 పరుగులతో ఐదో రోజు ఆటను ప్రాంభించిన ఇండియా మరో ఎనిమిది పరుగులు జోడించి పదో వికెట్ను కూడా కోల్పోయింది. అండర్సన్ బౌలింగులో ఓఝా(3) ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్ కోసం బ్యాటింగుకు దిగిన ఇంగ్లాండ్ తొలి ఓవర్ లోనే వికెట్ కోల్పోయింది. కుక్(1) అశ్విన్ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు. మూడో ఓవర్లో ట్రాట్(3) ఓఝా బొలింగులో ఎల్బీగా వెనుదిరిగాడు.
ఆ తరువాత క్రీజులోకి వచ్చిన పీటర్సన్ పరుగులేమీ చేయకుండానే ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరుకున్నాడు.మొదటి నాలుగు ఓవర్లలోనే మూడు ముఖ్యమైన వికెట్లు పోవడంతో భారత్ అభిమానులు ఏమైనా అద్భుతం జరుగుతుందేమోనని ఆశ పడ్డారు.బెల్ దూకుడుగా ఆడి 28 బంతుల్లో 28 పరుగులు చేసి ఇంగ్లాండుకు విజయం సాధించి పెట్టాడు. ఇండియా సిరీస్ పరాజయం నుంచి తప్పించుకోవాలంటే తరువాతి మ్యాచ్ గెలవడం తప్పనిసరి.