బరువు తగ్గడం కోసం పండ్ల రసాలు తాగేవారు ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోవాల్సిందే..!

అధికబరువు  ఇప్పట్లో చాలామందిని వేధిస్తున్న సమస్య. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఈ సమస్య ఎవ్వరినీ వదలడం లేదు. బరువు తగ్గడం కోసం ఒక్కొక్కరు ఒక్కో ప్రయోగం చేస్తుంటారు. కొందరు జిమ్ చేస్తారు, కొందరు ఆహారం దగ్గర జాగ్రత్తలు  పాటిస్తారు. మరికొందరు బరువు తగ్గించే డ్రింక్స్ తాగుతుంటారు. మొత్తానికి బరువు  తగ్గడం కోసం ఎక్కడ ఏ చిట్కాలు కనిపిస్తే అవి ఫాలో అయిపోయేవారున్నారు. అయితే మహిళలలో చాలామంది బరువు తగ్గడం కోసం ఫాలో అయ్యే అలవాటు పండ్లరసాలు తీసుకోవడం. పండ్లరసాలు బాగా తీసుకుంటే బరువు తగ్గడం చాలా ఈజీ అని అనుకుంటారు. ఈ కారణంగానే ఆహారాన్ని నియంత్రించి పండ్ల రసాలు ఎక్కువగా తాగుతుంటారు. అయినా సరే బరువు తగ్గడం జరగదు. ఇంత ఆరోగ్యకరమైన అలవాటు ఫాలో అయినా అసలెందుకు బరువు తగ్గడం లేదని తల పట్టుకుంటూ ఉంటారు. అయితే బరువు తగ్గడానికి పండ్లరసాలు తాగడం అనేది చాలా ప్రమాదకమైన చర్య అనే షాకింగ్ నిజం బయటపడింది.

బరువు తగ్గడానికి చాలామంది పండ్ల రసాలు తీసుకుంటారు. ఇలా పండ్ల రసాలు తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి బదులుగా బరువు పెరిగే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. ఎక్కువగా లిక్విడ్ డైట్ ఫాలో అయ్యేవారు చాలా తొందరగా ఊబకాయానికి గురవుతారు. అంటే పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవడం ఊబకాయానికి దారితీస్తుంది.

పండ్ల రసాలలో ఫ్రక్టోజ్ అనే సహజ చక్కెరలు ఉంటాయి. బరువు పెరగడంలో కారణమవుతాయి. అప్పుడప్పుడు పండ్లరసాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే.. కనీసం రోజుకు ఒకసారి అయినా పండ్లరసం తీసుకోవడం  ఫర్వాలేదు. కానీ ఆహారాన్ని స్కిప్ చేసి మరీ పండ్లరసం తీసుకోవడం శరీరంలో చక్కెరలు ఎక్కువగా చేరడానికి కారణం అవుతుంది. ఇలా చక్కెరలు ఎక్కువగా చేరితే శరీరంలో కేలరీలు కూడా పెరిగిపోతాయి. పండ్లరసాలు ఎక్కువగా తాగితే  పొట్ట చుట్టూ కొవ్వు పెరిగి చాలా సులువుగా పొట్ట పడుతుంది.

సాధారణంగా పండ్లలో ఫైబర్ ఉంటుంది. నేరుగా పండ్లను తింటే పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణాశయానికి మంచిది, అదే విధంగా ఫైబర్ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఆకలి నియంత్రణలో ఉంటుంది. అదే విధంగా  బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కానీ ఈ ఫైబర్ తప్పించి కేవలం పండ్ల రసాలు మాత్రమే తీసుకుంటే శరీరంలోకి కేవలం చక్కెరలు మాత్రమే ఎక్కవగా చేరతాయి. ఇది బరువు పెంచుతుంది.  

పండ్ల రసాలు తాగడాన్ని గమనిస్తే సాధారణంగా ఒక్కపండు తిన్నదానికంటే  ఒక గ్లాసు పండ్ల రసంకోసం ఉపయోగించే పండ్లు ఎక్కువ. ఒక గ్లాసు పండ్ల రసం కోసం కనీసం మూడు, నాలుగు పండ్లను వినియోగించాల్సి ఉంటుంది. ఫైబర్ ఏమీ లేకుండా కేవలం పండ్ల రసంతీసుకుంటే చక్కెరలు భారీగానే ఉంటాయి. ఇకపోతే కొందరు ఒకటి లేదా రెండు పండ్లనుండి రసం తీసి అందులో పంచదార, తేనె వంటివి జోడిస్తారు. ఇది కూడా శరీరంలో చక్కెరలు, కేలరీలు చేరడానికి కారణం అవుతుంది. కాబట్టి పండ్ల రసం ఎటు చూసినా బరువు పెరగడానికే తప్ప, బరువు తగ్గడానికి సహాయపడదు.

పండ్ల ద్వారా బరువు తగ్గాలని అనుకునేవారు నేరుగా పండ్లను తినడమే మంచిది. దీనివల్ల ఫైబర్ బాగా అందుతుంది. విటమిన్లు కూడా లభిస్తాయి. అదే విధంగా పండ్లరసంతో బరువు తగ్గాలని అనుకుంటే ముఖ్యంగా ప్రోటీన్లు శరీరానికి అందవు. ఎందుకంటే పండ్ల రసాలలో ప్రోటీన్లు ఏమీ ఉండవు. కాబట్టి బరువు తగ్గాలని అనుకునేవారు పండ్లను తీసుకోవచ్చు. అలాగే ప్రోటీన్లు బాగా ఉన్న ఆహారాన్ని తీసుకోవచ్చు. పండ్ల రసం మాత్రం  అవాయిడ్ చెయ్యాలి.

                                *నిశ్శబ్ద