Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


                                    

                               యస్య నిఃశ్వసితం వేదా యో వేదేభ్యో2ఖిలం జగత్|
                                నిర్మమే తమహం వన్డే విద్యాతీర్ధ మహేశ్వరమ్ ||
                                      శ్రీ మదాంధ్ర వచన అథర్వ వేద సంహిత
                                                   రెండవ కాండ
                                                 మొదటి అనువాకము
                                        మొదటి సూక్తము - 1

   
    వేనస్తత్ పశ్యత్ పరమం గుహాయద్ యత్ర విశ్వం భవత్యేకరూపం|
    ఇదం పృశ్నిరదుహజ్ఞాయమానాః స్వర్విదో అభ్య 2నూషత వ్రాః||


వినియోగము:-
   
      1. కార్య సిద్ది అగునా లేదా అని తెలిసికొనుటకు:-
    అయిదు గణుపుల వెదురు కర్రను సమతల ప్రదేశమున నిలుపవలెను. అది అనుకున్న వైపు కార్య సిద్ది     అగును.
   
      2. బాణమును ఎక్కుపెట్టి, ఈ సూక్తమున అభిమంత్రించి విడువవలెను. అది లక్ష్యము చేరిన కార్యసిద్ధి     అగును.
   
      3. నీరు నిండిన కుండ లేక కమండలములో పాలు పోసి మనసులో ప్రార్దించవలెను. అనుకున్న రీతి హెచ్చు     తగ్గులు కార్యసిద్దిని సూచించును.
   
      4. దర్భలకట్టను ఈ సూక్తముచే అభిమంత్రించి లెక్కించవలెను. సమసంఖ్య కార్యసిద్ధిని సూచించును.
   
      5. వంట చెరుకు ఈ సూక్తముచే అభిమంత్రించి అగ్నిలో వేయవలెను. ప్రదక్షణ పూర్తియగు వరకు మండిన     కార్యసిద్ధి కలుగును.
   
      6. పాచికలను అభిమంత్రించి వేయవలెను. అనుకున్న సంఖ్య పడిన కార్యసిద్ది.
   
      7. రెండు చేతుల వ్రేళ్ళను అభిమంత్రించి యోచించవలెను. అనుకున్న వేలు తాకిన కార్యసిద్ధి.
   
      8. 21 ఇసుక రేణువులను అభిమంత్రించి విభజించవలెను. లెక్కపెట్టగా అనుకున్న సరి/ బేసి సంఖ్యలు     కార్యసిద్ధిని సూచించును.
   
      9. పోయిన వస్తువు జాడ తెలుసుకొనుటకు నీరునిండిన కుండ లేక నాగలి లేక పాచికను గుడ్డచే కప్పవలెను.     రజస్వల కానట్టి ఇద్దరు బాలికలను వాటిని తీసికొని పొమ్మన వలెను. వారు వెళ్ళిన దిక్కున జాడ     తెలియును.
   
     10. పెళ్ళికి ముందు కుమారి సౌభాగ్యము తెలిసికొనుటకు పొలపు మట్టిగడ్డ, పుట్ట మట్టిగడ్డ, చౌరస్తా     మట్టిగడ్డ, శ్మశాన మట్టిగడ్డను తెచ్చి అభిమంత్రించి అమ్మాయిని తాకమనవలెను. పొలపు మట్టి, పుట్ట     మట్టిని తాకిన సౌభాగ్యవతి అగును. చౌరస్తామట్టిని తాకిన మరణము సంభవించును.
   
     11. కుమారి దోసిలిలో నీరు పోసి - అభిమంత్రించి - పారపోయమనవలెను. తూర్పు దిక్కుకు పోసిన     కళ్యాణమగును.
   
     12. మూడవ మంత్రము అగ్ని చయనమున పురోడాశ గృహీత ఉత్తరార్ధ ఘ్రుతముచే వైశ్వకర్మ హోమమున     వినియోగము.
   
1.    ఆదిత్యుడు  పరమగుహ్యమును దర్శించినాడు. విశ్వమంతయు ఏకరూపమగు ప్రదేశమును దర్శించినాడు. అప్రకటితమగు ఈ చరాచర జగత్తును సూర్యకిరణములు ప్రకటించినవి. జన్మించిన సమస్త ప్రజ అట్టి ఆదిత్యుని ఎరుంగును. అర్చించును.
   
                                                           మరొక అర్ధము.
   
    సమస్త విశ్వము జీవించుటకు జలమే ఏకమాత్ర కారణమై ఉన్నది. ఈ సమస్త విశ్వము జలమునందే ఐక్యమగుచున్నది. మధ్యస్థానమున ఉన్న పర్జన్యుడు దీనిని ఎరుంగును. ఆదిత్య మండలమున నిలిచి ఉన్న గుహ్య జలమును దర్శించినాడు. ఆ సూర్యుడు వర్షము కలిగించునని అది సకల ఉత్పత్తి కారకమని ప్రజలకు తెలియును. వారు సూర్యుని స్తుతింతురు.
   
2.    అమృతము తెలిసిన విద్వాంసులు సూర్యుని పరమగుహ్య స్థానమును ఉపదేశింతురు గాక. ఆ గుహ్యమందలి మూడు పదములను తెలిసినవాడు తండ్రులకు తండ్రి అగుచున్నాడు.
   
3.    అతడు నా పాలకుడు. నన్ను సృజించిన వాడు. అతడే బంధువు. అతడు విశ్వమందలి సకల ధామములను తెలిసినవాడు. అతడు ఒక్కడే సమస్త దేవతల పేర్లు గలవాడు. లోకములందలి సకల సంప్రశ్నలు అతనిని గురించినవే!
   
4.    (జ్ఞానోత్తర కాలం తత్త్వవిద్ బ్రూతే - జ్ఞానము కలిగిన తరువాత తత్త్వ విదుడు అనుచున్నాడు.)
    మాట్లాడు వాణి మాటను దగ్గర ఉండువారు వెంటనే స్పష్టముగా వినుచున్నారు. అట్లే నేను ద్యావాపృథ్వులను పొందినాను. నేనే తొలుత పుట్టిన అమృత స్వరూపుడను అగుచున్నాను.
   
5.    ఎచట దేవతలు అమృతము ఆరగించుచున్నారో ఎచట దేవతలు ఒకే మూలమును ఆశ్రయించినారో ఆ స్థలమును తెలిసికొన్నాను. సకల భువనములు ఏ పాప పుణ్యముల దారములతో కట్టబడి ఉన్నవో ఆ దారములు తెగుటను దర్శించినాను.
   
                                                  రెండవ సూక్తము - 2
   
వినియోగము :-
   
      1. గంధర్వ, రాక్షస, అప్సర, గ్రహాది శాంతులందు ఘ్రుతప్లుత సర్వోషధి హోమమున చతుష్పథమందు     గ్రహ గృహీశిరః స్థితమృణ్మయ కపాలాగ్ని హోమాదులందు.
   
      2. ఘ్రుత, మాంస, సువర్ణ, ధూళి మున్నగు భయంకర వర్షమందు కోతులు, కుక్కలు, నక్కలు,     కప్పలు విపరీతముగా ప్రవర్తించునపుడు ఈ సూక్తముచే ఘ్రుతాహుతులు ఇవ్వవలెను.
   
      3. గ్రహ యజ్ఞమున ప్రధాన హోమము తదుపరి శాంతి కొరకు ఘ్రుతాహుతులందు.
   
      4. మహా శాంత్యాదులందు మాతృనామ గణము వచ్చినపుడు దీనిని చదువవలెను.
   
      5. అశ్వమేధ యజ్ఞమున బ్రహ్మసమ్యత్సరాంతమున యుజ్యమాన అశ్వమును తొలిమంత్రమున అనుమంత్రితము     చేయవలెను.
   
1.    దివ్యసూర్యుడు, భువనపతి ఒక్కరే. అతడు నమస్కరించ దగినవాడు. స్తుతించదగినవాడు. నేను ఆ సూర్యుని, ఈ భువన పతిని బ్రహ్మగా భావించుచున్నాను. మీరు దివ్యులు. దేవతలు, స్వర్గవాసులు. మీకు నమస్కరించుచున్నాము.
   
2.    సూర్యుడు ఆకసమున ఉన్నవాడు. పూజ్యుడు. గంధర్వుడు. సూర్యుని వంటివాడు. దేవతల కోపము చల్లార్చగలవాడు. అతడు లోకములకు స్వామి. నమస్కరించ దగినవాడు. మంచి సుఖములు కలిగించ గలవాడు. అతడు మాకు సుఖములు ప్రసాదించును గాక.
   
3.    కిరణరూప అప్సరసలతో సూర్యరూప గంధర్వుడు కలిసిపోయినాడు. అప్సరసలతో కూడ సూర్య నామక గంధర్వుడు కలిసి పోయినాడు. ప్రాణులను ఆనందపరమ అప్సరల స్థానము సముద్రనామక సూర్యుడై ఉన్నాడు.
   
                                                      'మంత్ర ద్రష్ట వచనం ఏతత్'
   
    సూర్యోదయముతో కిరణములు వెడలును. అస్తమించినంత కిరణములు సూర్యునిలో లీనమగును.
   
    అప్సరసల, గంధర్వుల స్థానము అంతరిక్షమగును. అచటి నుండియే ప్రజలను పీడించుటకు వత్తురు. పిదప అంతర్ధానులగుదురు.
   
4.    ఆకసమందలి మబ్బున మెరయునట్టి నక్షత్రరూప అప్సరసలారా! మీలో విశ్వావసు గంధర్వునితో కూడిన వారికి, ప్రకాశవంతులకు నేను నమస్కరించుచున్నాను.
   
5.    గంధర్వ పత్నులగు అప్సరసలు నరులకు ఉపద్రవములు కలిగింతురు. వారిని ఏడిపింతురు. అవయవములకు హాని కలిగింతురు. ఉన్మాదము కలిగింతురు. అట్టి గంధర్వ పత్నులకు నమస్కరించుచున్నాను.

                        

                                             మూడవ సూక్తము -3
   
వినియోగము :- అతిసారము, అతిమూత్రము, నాడీ వ్రణపు శాంతికి, ముంజశిరోనిర్మిత రజ్జు బంధనం. చేను మట్టి         త్రాగించుట. సర్పిలేపనము. చర్మదృతి ముఖమున అపాన శిశ్ననాడీ వ్రణ ముఖముల ధమనము.
   
1.    ముంజవాన్ పర్వతము సర్వశ్రేష్ఠము ప్రసిద్దము. దాని మీద వ్యాధిని నివారించునట్టి "ముంజ" నేలమీద వ్యాపించి ఉండును.
   
    ముంజమా! నీ అగ్రభాగమును వ్యాధి నివారణ ఔషధముగా చేయుచున్నాను. నిన్ను వ్యాధి నివారక, సమర్ధ, పరమ వీర్యవంత ఔషధమును చేయుచున్నాను.
   
2.    ఔషధమా! నిన్ను వాడగనే వ్యాధిని దూరము చేయుము. మరల వచ్చు వ్యాధులను నష్టపరచుము. నీ జాతివారు అనేకులున్నారు. వారిలో నీవు శ్రేష్ఠమవు. నీవు రోగమును నివారించుట మాత్రము కాదు. నిర్మూలించు దానవు.
   
వ్యాఖ్య -    అత్యంత ఆధునిక వైద్యము సహితము నివారణను గురించి మాత్రమే ఆలోచించుచున్నది. ఒకసారి రోగి నిత్య రోగి అగుచున్నాడు. జీవితకాలము మందులు తప్పుట లేదు.
   
    ఆ కాలమున "అరోగిణమ్" రోగము లేని వాణి గురించి, రోగ నిర్మూలమును గురించి ఆలోచించినారు. అట్టి ఆలోచన నేటికిని కొనసాగుతున్నది.
   
    మనము మందుల వ్యాపారము పెంచుటను మించి సాగలేకున్నాము.
   
3.    ఈ వ్యాధులు అసురులు వంటివి. ప్రాణములు తీయును. దేహములను కూల్చును. ఇవి ప్రాణమును లోననుండి తొలుచును. అట్లయిన ఈ 'ముంజ' ఆ స్రావమునకు మహా ఔషధము అది వ్యాధులను సమూలముగ నాశము చేయుచున్నది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.