Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



    శునశ్షేఫుని ప్రాణం రక్షించబడింది. విశ్వామిత్రుడు నారా బలిని మాన్పించాడు. అతడు నరుని బదులు పశువుని బలి ఇవ్వలేదు. పశు బలినే మాన్పించినట్లున్నాడు!

    ఇది ఎంతటి మహత్కార్యం!!!
   
    వేదంలో ఆధ్వర యజ్ఞం గురించి చెప్పబడింది. ఆధ్వర యజ్ఞం అహింసాయజ్ఞం అవుతుంది. కొందరి వ్యాఖ్యాలో యజ్ఞమే అధ్వరం. అంటే యజ్ఞాలన్నీ అహింసములే. వేదంలే. వేదంలో కొన్ని  పశువుల పేర్లు - యజ్ఞ సంబంధంలో- చెప్పడం జరిగింది. వేదం పరోక్షవాది. దాని అంతరర్థాలు వేరు. ర్ర పశువుల పేర్లు సంకేతాలు మాత్రమే. అవి వాస్తవంగా కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు. వీటిని ఆత్మా జ్ఞానం అనే అగ్నిలో హవనం చేయాలని అర్థం. కర్మవాదులు ఈ అర్థాన్ని గ్రహించారు. గ్రహించినా వెల్లడించారు. స్వప్రయోజనం కోసం యజ్ఞాలు చేస్తారు. ఇది ఈ  కర్మకాండను, దంభాన్ని, స్వప్రయోజన పరాయణనుతో బుద్ధుని నుంచి రామానుజుని వరకు ఆచార్యులు, మహాత్ములు ఖండించాఋ. వారు వేదాలను నిరసించనూ లేదు, ఖండించనూ లేదు. పాశ్చాత్య పరిశోధకులు వారంతా వేదాలను ఖండించారని మన భారతీయ మేధావులచే వప్పించారు. మన  యూనివర్సిటీ మేధావులు ఇంకా వాస్తవం గ్రహించినట్లు కనిపించదు. వారింకా సాంస్కృతిక బానిసత్వం వదులుకోలేదు. కొన్ని తరాలను సాంస్కృతిక బానిసలుగా సిద్ధం చేస్తున్నారు. మన మేధావులు భారతీయంగా  ఆలోచించడం నేర్వాలి. వారు తాము ఉంటున్న, తింటున్న దేశానికి ద్రోహం చేయరాదు. ఆలోచనలు చంపటం నా ఉద్దేశ్యం కాదు. భారతీయతది నియంతృత్వ ధోరణి కాదు. అయితే కువ్యాఖ్యానాలు మన జీవన విధానాన్ని ఆలోచనను, తాత్వికతను అపఖ్యాతి పాలు చేస్తాయి. మన  మేధావులు తొలుత మనం భారతీయులం అని గుర్తించాలి. భారతీయ విధానంలో వ్యాఖ్యానించాలి. ఇది మనందరి కర్తవ్యం. ఈ దిశగా కొంత కృషి ప్రారంభం అయింది. అది ఇంకా మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లాలి.

    "హిరణ్మయేన పాత్రేణ సత్య స్యాపిహితం ముఖమ్"

    బంగారు పాత్ర - అధికార ధనాలతో - సత్యపు ముఖాన్ని కప్పేశారు, మసి పూశారు.

    మరి ఈ అంధకారాన్ని ఈ మసినీ ఎవరు తొలగించాలి? వేదానికి  మనిషి మీద అనంతమైన  విశ్వాసం. వేదం  అంటున్నది.

    య్కో సావాదిత్యే పురుషః స్కో సావహమ్
    సూర్యునిలో ఒకడున్నాడు. అట్టి వాడను నేనే
   
    అంటే మానవుడే ఈ అర్థ, అధికార హిరణ్మయ పాత్రను బద్దలు కొట్టాలి. అపిహితమైన సత్యాన్ని వెలికి తీయాలి.

    వేదం మానవుడు నిష్కల్మష, పవిత్ర జీవినం ఏర్పరచుకోవాలని అనేక చోట్ల ఆదేశించింది. ఒక పవిత్ర జీవి, ఒక ఆత్మార్పణం చేసిన మహానుభావుడు, ఒక లోక కళ్యాణం సాధించిన మన పురుషుడు భగవానుడు అగుచున్నాడు. ఇందుకు ఉదాహరణలు కొల్లలు. ఉదాహరించడం అప్రస్తుతం అవుతుంది కాని ఇరవయ్యో శతాబ్దంలోనే మహాత్ముడు, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, అరవిందులు, రమణ మహర్షి అవతరించారు.
   
    "సమిధాసి సూర్యస్త్వా పురస్తాత్ పాతు కస్యాశ్చిదభిశంస్తై| సవితృర్బాహూస్థ ఊర్ణమ్మ్రదసం త్వాస్తృణామి స్వాసస్థం దేవేభ్య ఆత్వా వసవోరుద్రా ఆదిత్యాః సదన్తు|| 2 - 5

    నీవు సమిధవు. నీకు శాపం ఉంటే సూర్యుడు నిన్ను ఎదుటినుంచి రక్షించాలి. నీవు సూర్యుని భుజమవు. నిన్ను దేవతలకు ఆసనం చేస్తాను. ఉన్ని వంటి నిన్ను పరుస్తాను. వసువులు, రుద్రులు, ఆదిత్యులు నీ మీద ఆసీనులు అగుదురు గాక.

    వ్యాఖ్య సుదీర్ఘం అవుతుంది. వేదం మనిషిని "సమిధాసి' అన్నది. మనిషి సమిధ వంటి పవిత్రుడు. సమిధ తాను జ్వలిస్తుంది. అన్యులకు కాంతినీ, వేడినీ ప్రసాదిస్తుంది. మానవుడు అలాంటి వాడు కావాలని వేదం ఆశిస్తుంది.

    "ఏషాతే ఆగ్నే సమిత్తయావర్ధస్వచాచప్యాయస్వ"

    అగ్నీ! ఇతడు నీకు సమిధ అవుతున్నాడు. అతనితో వర్థిల్లుము. మమ్ము వర్థిల్లచేయుము.

    ఇది జ్ఞానాగ్ని. జ్ఞానాగ్నిలో తపించినవాడు జ్ఞానాన్ని వర్ధిల్లచేస్తున్నాడు. అలాంటి జ్ఞానం అతనిని వర్ధిల్లచేస్తుంది.

    ఆత్మసమర్పణయే యజ్ఞ స్వరూపం. దానితోనే లోక కళ్యాణం. లోకహితం. లోకశాంతి, లోక కాంతి.

    హింస - అహింస

    హింస ఏది? అహింస ఏది? చంపడం హింస అవుతుందా? పీడించడం హింస అవుతుందా? వీటిని గురించి శ్రీమహా భారతంలోని ధర్మవ్యాధుని వృత్తాంతం వివరిస్తుంది. ధర్మవ్యాధుని కథ ఏమి? అవధరించండి:-

    కౌశికుడు బ్రాహ్మణుడు. అతనికి వేదం మీద ఆసక్తి ఎక్కువ. ఒకనాడు అతడు చెట్టు కింద కూర్చున్నాడు. వేదం గుణిస్తున్నాడు. అతని మీద కొంగ రెట్ట వేసింది. అతడు కొంగను చూచాడు. కొంగ చచ్చింది. నెల మీద పడింది.

    ఆనాడు మధ్యాహ్నం అయింది. భిక్షకు బయల్దేరాడు. ఒక ఇంటికి వెళ్లాడు. గృహిణి అతనిని ఆదరించింది. ఆసీనుని చేసింది. భిక్ష తెస్తానని లోనికి వెళ్లింది. చాలా ఆలస్యం చేసింది. కౌశికుడు విసిగాడు, వేసారాడు, అప్పుడు గృహిణి భిక్షతో వచ్చింది. కౌశికుడు ఆమెను చూచాడు, మండి పడ్డాడు. శపించేంత పని చేశాడు.  

    గృహిణి కోపగించలేదు. శాంతంగా అన్నది 'నీ కోసం భిక్ష తేవడానికి వెళ్లాను. నా భర్త ఆకలితో వచ్చాడు. అతని ఆకలి తీర్చడం నా తొలి ధర్మం. అతనికి అన్నం పెట్టి వచ్చాను. అందుకు ఆలస్యం అయింది. నీవు వేద విదుడవు. కోపమే నీ శత్రువు. అది తెలియకున్నావు. నీవు కోపంతో ఒక కొంగను చంపావు. నేను కొంగను కాను.

    కౌశికుడు అదిరిపోయాడు. తనకు ధర్మోపదేశం చేయమని అర్థించాడు.

    కౌశికా! నీకు ధర్మం తెలుసు. ధర్మ సూక్ష్మం తెలియదు. నీకు తెలియ చెప్పడానికి నాకు సమయంచాలదు. 'మిథిల' లో 'ధర్మవ్యాధుడు' అనే కటికవాడున్నాడు. అతడు సత్యవాది, జితేంద్రియుడు, మాతాపితృ భక్తియుతుడు. అతని దగ్గరకు వెళ్లు. అతడు ధర్మసూక్ష్మం వివరించ సమర్థుడు"

    ఈ చిన్న వృత్తాంతంలో వ్యాసమహర్షి వ్యాసమహర్షి ఎన్నో మహత్తర విషయాలను వెల్లడించాడు.

    1. కేవలం వేద పఠనం చాలదు. వేద జ్ఞానం -ఆచరణ అతిముఖ్యం.

    2. ప్రతి వారికి ప్రథమ కర్తవ్యాలుంటాయి. ముందు వాటిని నిర్వర్తించాలి. "స్వధర్మే నిధనం శ్రేయః" అన్నాడు గీతలో, 'ధర్మం' అంటే  మతంకాదు. ధర్మం అంటే కర్తవ్యం.

    3. వేదాధ్యయనం కన్నా లోక జ్ఞానం మిన్న. 'చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్థకమ్ము. అన్నాడు భాస్కర శతకకారుడు. ఆధునికం అనిపించుకునే నేటి చదువులన్నీ ఆర్జనకే గాని లోకజ్ఞానానికి నిష్ప్రయోజనాలు.

    4. భారత సమాజం స్త్రీని నికృష్టంగా చూచిందనీ, ఆమెను బానిసను చేసిందనీ పాశ్చాత్యులు బోధించారు. మూలాలు యూరోపు, అమెరికాలో గల మన మేధావులు ఆ బోధనలను త్రికరణ శుద్దిగా నమ్ముతున్నారు. స్త్రీ విమోచన ఉద్యమాలు నడిపే నాయకత్వం పాశ్చాత్వాన్ని ప్రతిబింబిస్తుంది. వారు భారత సాహిత్య, సంప్రదాయాలను అధ్యయనం చేయడం శ్రేయస్కరం.

    ఈ కథలో ఒక సామాన్య స్త్రీ  ధర్మ సూక్ష్మాన్ని గురించి వేదాధ్యాయునికి ఉపదేశించింది. వేదాధ్యాయిని తన లోపం గ్రహించేట్లు చేసింది. భారత ఋషులకు, కవులకు, విద్వాంసులకు స్త్రీ  స్థానం సమున్నతం. రామాయణం సీత కథ. మహా భరతం ద్రౌపది కథ. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం శకుంతల కథ.

    5. కౌశికుడు వేదవేత్తాయే. జ్ఞానియే కాడు. జ్ఞానం కర్మను మించింది. గృహిణి అతనికీ  జ్ఞానోదయం చేయించింది. అతడు అహంకారం త్యజించాడు. అతడు బ్రహ్మణుడు. 'ధర్మతపశ్శీలుండు. సంతతాధ్యాయన తత్పరుడు. అయినా జ్ఞానార్జన కోసం వ్యాధుడు, కటిక వాని దగ్గరకు వెళ్లాడు. అహం నశించిన్నాడు సమస్తము సమంగానే కనిపించి అతడు సమదర్శనుడు అవుతాడు.

    "అటకేగి ముందట నల్ప మృగమాంసఖండంబు లంగడి బచరించియమ్ముచున్నవాని ననవరత విక్రయాగత జన సమావృతు నక్కిరాతుంగని యతి జుగుప్సితంబయిన సూనాపణంబు సేర నొల్లక తొలంగి యొక్క యెడ నుండె"

    కౌశికుడు మాంసం అమ్ముతున్న కిరాతుణ్ణి చూచాడు. అసహ్యం అనిపించింది. అంగడిలోనికి ప్రవేశించ లేక పోయాడు. దూరంగా నుంచున్నాడు.

    ధర్మవ్యాధుడు తన పని ముగించుకున్నాడు. అంగడి మూసాడు. కౌశికుని దగ్గరకి వచ్చాడు. నమస్కరించాడు. "ఆ పవివ్రత నిన్ను పంపింది కదా అన్నాడు. బ్రహ్మణుణ్ణి తన ఇంటికి తీసికెళ్లాడు. ధర్మవ్యాధుడు కౌశికునికి అనేక ధర్మ సూక్ష్మాలు వివరించిన విషయం అంధ్రమహాభారతం పంచమాశ్వాసంలో 146 గద్య పద్యాల్లో చెప్పబడింది. అహింసణు గురించి మాత్రం ప్రస్తావిస్తాం:-

    నీవు హింసను గురించి మాట్లాడావు. హింస ఇది అని నిశ్చయంగా చెప్పడం అసాధ్యం. "సకల భూతములు పూర్వ జన్మకర్మముల వలన నశించుచున్నవి. ఆ భూతములను చంపువాడు నిమిత్తమాత్రుడగును. ఫలములు, ఓషధులు, కూరగాయలు, పశువులు, మృగములు ప్రాణులకు ఆహారము అగునట్లు బ్రహ్మదేవుడు ఏర్పరచినాడు. దీనిని కాదనుటకు ఎవరికిని శక్యము కాదు.

    "మరొక ముఖ్య విషయము ఆలోచింపుము. మానవులు భూమి మీద తిరుగుదురు. అప్పుడు వాని పాదముల క్రింద పది నలిగి అనేక ప్రాణులు చచ్చుచున్నవి. అది హింసకాదా? భూమి దున్నునపుడు నాగటి చాలున అనేక ప్రాణులు నశించుచున్నవి. అది హింసకాదా? మహాత్ములు మునులు అడవులందు ఉండి చెట్టును నరుకుదురు. కాయగసరులు త్రవ్వుదురు. అది హింసకాదా?

    ఈ జగత్తున హింస చేయనివాడు ఒక్కడును లేడు. అయినను సాధ్యమైనంత వరకు హింసకు దూరముగా ప్రవర్తించుట ధర్మము"

    ధర్మం వేరు, ధర్మసూక్ష్మం వేరు. ఇది వివరించడం ఈ వ్యాస పరిధి కాదు. వ్యాస మహర్షి లక్ష శ్లోకాల శ్రీమహాభరతం రచించారు. అది పంచమ వేదం అయింది. అంతటి మహా గ్రంథంలోనూ ఆ మహర్షి "ధర్మం" అనే పదానికి నిర్దిష్ట నిర్వచనం చెప్పలేక పోయారు. అసత్యమే ఎరుగని ధర్మరాజుతో అసత్యం పలికించాడు. 'అసత్యం, కొద్దిదై అందువలన సాధించే కార్యం విలక్షణం, విశిష్టం, ఉత్తమం, బహుజన హితాయ' అయినపుడు అది ధర్మం అవుతుంది. ఇది సామాన్య నేత్రానికి గోచరం కాదు. దీని విషయం చర్చోపచర్చలు, మానసిక మథన అవసరం అవుతుంది. అందుకే దీన్ని 'ధర్మసూక్ష్మం' అన్నారు. సూక్ష్మాన్ని అందరూ గాంచలేరు. అందుకు జ్ఞానం కావాలి. పరిజ్ఞానం కావాలి.

    వాల్మీకి మహర్షి సహితం 'ధర్మం' అనే పదానికి నిర్వచనం నిర్దిష్టంగా చెప్పలేకపోయారు. ద్వంద్వ  యుద్ధం చేస్తున్నవారు వాలి - సుగ్రీవులు అన్నదమ్ములు. రాముడు చెట్టు చాటున దాగి బాణం వేశాడు. వాలిని వధించాడు. ఇది ధర్మమా?

    తందృష్ట్వా రాఘవం వాలీ లక్ష్మణంచ మహాబలమ్
    అబ్రవీత్ప్రశ్రితం వాక్యం పరుషం ధర్మ సంహితమ్

    వాలి కూలాడు, రామలక్ష్మణులు చూడ్డానికి వచ్చారు. వాలి వారినిచూచాడు, ఆ దశలోనూ వినయంగా మాట్లాడాడు అంటున్నాడు వాల్మీకి. అతని మాటలు 'పరుషం' - కరకువి, 'ధర్మ సంహితం' ధర్మయుతములు.

    వాలి రాముణ్ణి అడుగుతున్నాడు.

    పరాఙ్ముఖవధం కృత్వా కోను ప్రాప్తస్త్వయాగుణం
   
    యదహం యుద్ధ సంరబ్ధశ్మరేణోరసితాడితః

    నీవు నా ఎదుట లేవు. నన్ను చంపావు. ఏం సాధించావు? నేను మరొకరితో యుద్ధం చేస్తున్నాను. నా రొమ్ములో బాణం గ్రుచ్చావు?

    వాల్మీకి, ధర్మ విగ్రహుడైన రాముడు - ఎన్ని చెప్పినా - సమర్ధించుకోలేకపోయాడు!

    ఇందులో ఒక ధర్మ సూక్ష్మం ఉంది. రావణుడు లోకం కంటకుడు. వాణ్ణి సంహరించాలి. ఇంతకన్న వివరించడానికి ఇది సందర్భం కాదు.

    'Equality' 'Humanrights'  కు ఇంతవరకు ఏ రాజ్యాంగమూ U.N.O.  సహితం నిర్దిష్ట నిర్వచనం ఇవ్వలేకపోయాయి. మరి మనం చాలా సాధించామనుకుంటున్నాం! చంద్రునిలాంటి గ్రహాలకి రహదారులు వేస్తున్నాం! అప్పుడే అక్కడి స్థలాలు అమ్ముతున్నాం!! హోటళ్లు నిర్మించబోతున్నాం!!! ఇదంతా అచ్చం వ్యాపారం!!! ఇందులో మానవ కళ్యాణం మచ్చుకు సహితంలేదు!

    ఇంతా ఎందుకు వివరించాల్సి వచ్చిందంటే వేదాన్ని వ్యాఖ్యానిస్తూ పశ్చిమ వేదాంతులు నా గుండెలో బాణం గ్రుచ్చారు. 'హింస' అహింస' వెనుక ఉన్న ఇంత కథ వారికి తెలియక  కాదు వారు మేధావులు కాదనలేం. వారి మేధస్సు మీదనే ఈనాడు లోకం సాంతం  నడుస్తున్నది. వారిది జాంత్యహంకారం. ఇతరులను ఇతర నాగరకతలను నీచంగా, దాస్యంగా భావించడం వారి స్వభావం.

    పాశ్చాత్య మేధావులు అన్నీ కాగలిగారు. మానవులు కాలేకపోయారు.

    ఖ్వాజా హఫీజ్  అనే పారశీక కవి ఏమన్నాడో పరికించండి.

    మైఖుద్ మునహఫ్ బసోజ్ ఆతిష్ అందర్ కాబజన్.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.