డాల్లాస్ లో "మిథునం" చిత్రం ఆడియో విడుదల: తనికెళ్ళ భరణికి "తానా" పురస్కారం!
ఏప్రిల్ 01, 2012:
డాల్లస్, టెక్సస్ మంచి భాష, మంచి భావం, మంచి భక్తి పునికి పుచ్చుకొన్న సకల కళా కోవిదుడు, ప్రముఖ రచయిత, దర్శకుడు, హాస్యనటుడు శ్రీ తనికెళ్ళ భరణి కి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో డాల్లస్ మహానగరంలో ఘనంగా సన్మానం జరిగింది. తానా సంస్థ అధ్యక్షతన ఏర్పాటు చేసి, దాదాపు 400 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగు సంస్థ ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX), జాతీయ తెలుగు సంస్థలైన NATA, ATA మరియు ఉత్తర టెక్సస్ భారతీయ సంఘం (IANT) సహాయ సహకారాలు అందించాయి. ఈ కార్యక్రమానికి శ్రీమతి రాజేశ్వరి చల్లా వ్యాఖ్యాతగా వ్యవరించారు. తానా ప్రాంతీయ ప్రతినిధి శ్రీమతి మంజుల కన్నెగంటి విచ్చేసిన అతిథులకు, డాల్లస్ ప్రాంత ప్రవాసాంధ్రులకు శ్రీరామనవమిని గుర్తుచేస్తూ స్వాగతం పలికారు. ప్రముఖ సంగీత దర్శకుడు, గేయరచయిత శ్రీ స్వర వీణాపాణి తమకు తనికెళ్ళ భరణి తో ఉన్న అనుబంధం మరియు "మిథునం" చిత్రం లో స్వరకల్పన చేస్తున్న పాటల గురించి సభకు పరిచయం వినూత్న రీతిలో చేస్తూ తమ స్వీయ రచనలతో అందరినీ ఆకట్టుకొన్నారు. శ్రీ స్వర వీణాపాణి గారిని ప్రత్యేక జ్ఞాపిక, దుశ్శాలువ, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.

తానా అధ్యక్షుడు శ్రీ తోటకూర ప్రసాద్ ఈ నాటి ముఖ్య అతిథి శ్రీ తనికెళ్ళ భరణి ని సభకు పరిచయం చేశారు. "తనికెళ్ళ ఒక మహా సముద్రం. వీరిని పరిచయం చేయడం అంత సులభం కాదు అంటూ తనికెళ్ళ భరణికి నంది పురస్కారాన్ని తెచ్చి పెట్టిన "సముద్రం"చిత్రాన్ని గుర్తు చేశారు. తన రెండున్నర దశాబ్దాల తెలుగు చలన చిత్ర జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ భరణిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానించారు.

మిథునం చిత్రం ఆడియో విడుదల
శ్రీ తనికెళ్ళ భరణి దర్శకత్వం వహిస్తున్న "మిథునం" చిత్రం గురించి సభకు హాజరైన తెలుగు వారితో ముచ్చటించారు. ఈ చిత్రం కథ ప్రతి ప్రవాసాంధ్రుడికి సంబంధించిన కథ అని, అందరు చూడ వలసిన చిత్రం అని అందుకే ఈ చిత్రం ఆడియో విడుదల అమెరికాలో చేస్తున్నామని శ్రీ భరణి అన్నారు. అనేక మంది అడిగిన ప్రవాసాంధ్రుల ప్రశ్నలకు సమయస్ఫూర్తితో చాక చక్యంగా తమదైన శైలి లో సమాధానమిచ్చి అందరిని కడుపుబ్బా నవ్వించారు.

తనికెళ్ళకు "తానా" పురస్కారం
ఇటీవలే తమ చలన చిత్ర జీవితంలో వెండి పండుగ జరుపుకొన్న శ్రీ తనికెళ్ళ భరణిని "బహుముఖ కళాబ్రహ్మ" బిరుదుతో ఘనంగా సన్మానించారు. TANA కార్య నిర్వాహక బృందం సభ్యులు శ్రీ తోటకూర ప్రసాద్, శ్రీ రామ్ యలమంచిలి, శ్రీమతి మంజుల కన్నెగంటి, శ్రీ మురళి వెన్నం, TANTEX అధ్యక్షులు శ్రీమతి గీత దమ్మన్న, ఉత్తరాధ్యక్షుడు శ్రీ సురేష్ మండువ, IANT అధ్యక్షుడు డా. శ్రీధర్ రెడ్డి కొర్శపాటి, ATA నాయకులు డా. సంధ్య గవ్వ, శ్రీ అరవింద్ ముప్పిడి, శ్రీ అనంత్ పజ్జూర్, శ్రీ సతీష్ రెడ్డి, NATA పాలకమండలి తరపున డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, శ్రీ రావు కల్వల ఆడియో విడుదల మరియు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

తనికెళ్ళ భరణి 2013 తానా సభలకు మళ్ళీ అమెరికా రానున్నారు
1977 తెలుగు వారి అవసరాలను తీర్చడానికి స్థాపించబడి గత మూడు దశాబ్దాలకు పైగా అత్యుత్తమ సేవలందిస్తున్న జాతీయ సంస్థ "తానా"వారి 19వ మహాసభలు 2013 జులై నెల 4 వ తేదీ నుండి 6 వరకు టెక్సస్ లోని డాల్లస్ మహానగరంలో జరుగా నున్నాయి. ఈ బృహత్తర కార్యక్రమానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయని అందులోనూ తనికెళ్ళ భరణి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా అంగీకరించినట్లు శ్రీ తోటకూర సభా ముఖంగా తెలియజేస్తూ సకుటుంబ సమేతంగా తెలుగు వారందరికీ 19వ తానా సభలకు తమ ఆత్మీయ ఆహ్వానాన్ని అందజేశారు.
కార్యక్రమ పోషకదాతలైన శ్రీకాంత్ పోలవరపు, శ్రీ సాంబ దొడ్డ, శ్రీ వినోద్ ఉప్పు, శ్రీ మురళి వెన్నం, శ్రీ చలపతి రావు కొండ్రకుంట మరియు యువ తెలుగు రేడియో, మైటాక్స్ ఫైలర్, టివి9, ఫునేషియా సంస్థలకు కృతజ్ఞతాపూర్వక జ్ఞాపికలతో సన్మానించారు.



