ప్రెగ్నెన్సీ సమయంలో ముందురోజు ఆహారం తినడం మంచిదేనా... వైద్యులేం చెప్పారంటే..!

 

గర్భధారణ స్త్రీకి మరొక కొత్త ప్రపంచాన్ని పరచయం చేస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య పరంగా స్త్రీలు గర్భధారణ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీలు తీసుకునే ఆహారం కూడా కీలకపాత్ర పోషిస్తుంది.  గర్భవతులైన స్త్రీలు సమతుల ఆహారాన్ని,  పోషకాలు సమృద్దిగా కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని చెబుతారు.  అయితే కొంతమంది మహిళలు ముందు రోజు మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్ లో ఉంచుకుని మరీ తింటూ ఉంటారు. రుచి కోసమో లేక మిగిలిపోతుందనో.. లేక ఖరీదైనదనో.. ఏదో ఒక కారణం తో ముందురోజు ఆహారం తింటూ ఉంటారు. అయితే ఇలా తినడం మంచిదేనా? దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారంటే..

గర్భధారణ సమయంలో మహిళలు ఆహారం విషయంలో చేసే తప్పులలో అతి పెద్ద తప్పు ముందురోజు ఆహారాన్ని తినడం. ఇలా పాతబడిన ఆహారం తినడం ఆరోగ్యానికి హాని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. గర్భవతులు తాజాగా వండిన పోషకమైన ఆహారాన్ని మాత్రమే తినాలని వారు చెబుతున్నారు.

ముందురోజు ఆహారం లేదా పాతబడిన ఆహారం తినడం వల్ల గర్భవతులలో చాలా ప్రభావం ఉంటుందట. ముఖ్యంగా కడుపులో పిండం అభివృద్ది మీద చెడు ప్రభావం పడుతుందని అంటున్నారు.  ముందురోజు మిగిలిన ఆహారం తినడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుందట. ఇలా గర్భవతులుగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ల బారిన పడితే అది అకాల ప్రసవాలకు,  గర్భస్రావాలకు, తక్కువ బరువు ఉన్న శిశువు జననానికి దారి తీస్తుందట.

ముందురోజు మిగిలిపోయిన ఆహారం ఎందుకు తినకూడదు అనే విషయాన్ని కూడా వైద్యులు వివరించారు.  ముందురోజు ఆహారంలో సాల్మోనెలోసిస్,  లిస్టెరియోసిస్ వంటి బ్యాక్టీరియా,  వైరస్ లు ఉంటాయి. ఇవన్నీ ఆహారం ద్వారా వచ్చే వ్యాధులకు అతిపెద్ద కారణాలు. గర్భం ధరించాలని అనుకునే మహిళలు, గర్భవతులు ముందురోజు మిగిలిన ఆహారాన్ని తినడం మానుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఒకసారి వండిన ఆహారాన్ని పదే పదే వేడి చేసి తినడం కూడా మంచిది కాదు. బయట నుండి తెచ్చిన ఆహారానికి వీలైనంత దూరం ఉండటం మంచిది. తప్పనిసరి పరిస్థితులలో తెచ్చినా దాన్ని వేడిగా ఉన్నట్టే తినాలి. బయట తెచ్చిన ఆహారాన్ని నిల్వ ఉంచడం మంచిది కాదు.


                                         *రూపశ్రీ.